ప్రధాన మంత్రి కార్యాలయం
జూన్ 5న సూరత్, దమన్లలో ప్రధానమంత్రి పర్యటన
దాదాపు రూ.18,800 కోట్ల ఖర్చుతో సూరత్లో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేయడంతో పాటు కొన్నిటికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని
8 వరుసల యాక్సెస్-కంట్రోల్డ్ వడోదరా-ముంబయి ఎక్స్ప్రెస్వేను దేశ ప్రజలకు అంకితమివ్వనున్న ప్రధానమంత్రి
ఎన్హెచ్-56లో కీలక భాగాల్ని నాలుగు వరుసలుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని..
గిరిజన ప్రాంతాల్లో సంధానాన్ని పెంచడంతో పాటు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకూ చేరుకోవడం సులభతరం
దాదాపు రూ.2,970 కోట్ల ఖర్చుతో దమన్లో పూర్తి చేసిన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేయడంతో పాటు కొన్నిటికి శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధానమంత్రి
దమన్లో నమో విమానాశ్రయ టెర్మినల్ నూతన భవనాన్ని దేశ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధాని
రూ.885 కోట్ల ఖర్చుతో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో ఓడరేవు సంబంధిత ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
04 JUN 2026 10:03AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 26న గుజరాత్, దమన్లలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు, ప్రధానమంత్రి సూరత్ జిల్లా హజీరాలో పర్యటించి, అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు, సూరత్లో సుమారు రూ.18,800 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితమివ్వడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్బంగా జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
ఆ తరువాత ప్రధాని దమన్కు వెళ్తారు. అక్కడ సాయంత్రం సుమారు 6 గంటల 15 నిమిషాలకు, నమో విమానాశ్రయ టర్మినల్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. తదనంతరం, దమన్లోనే నమో ఆసుపత్రిని దేశ ప్రజలకు అంకితం చేస్తారు. రాత్రి ఇంచుమించు 7 గంటల 15 నిమిషాల వేళకు, రూ.2,970 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన వేర్వేరు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితమిస్తారు. కొన్ని ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. కేంద్రపాలిత లక్షద్వీప్ ప్రాంతంలో సుమారు రూ.885 కోట్ల ఖర్చుతో చేపట్టే నాలుగు ప్రధాన ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్బంగా జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
సూరత్లో ప్రధానమంత్రి
సూరత్లో రోడ్లు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాల్లో రూ.18,800 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో పూర్తి చేసిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేస్తారు. కొన్ని ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
వడోదరా-ముంబయి ఎక్స్ప్రెస్వేకు సంబంధించిన నాలుగో, ఆరో ప్యాకేజీలను ప్రధాని దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఈ ప్యాకేజీలతో గుజరాత్కీ, మహారాష్ట్రకీ మధ్య అధిక వేగంతో కూడిన రవాణా, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ సామర్థ్య పెరగడంతో పాటు ఆర్థిక సంధానం మెరుగుపడుతుంది. ప్రధాని కీలక మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో.. గిరిజన ప్రాంతాల్లో సంధానాన్ని పెంచడంతో పాటు, ఏకతా మూర్తి విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వరకూ చేరుకోవడాన్ని సులభతరం చేసేందుకు ఎన్హెచ్-56లో కీలక భాగాల్ని నాలుగు వరుసలు కలిగివుండేవిగా తీర్చిదిద్దే ప్రాజెక్టు కూడా ఒకటిగా ఉంది.
సూరత్లో 220 పడకలతో కూడిన ఈఎస్ఐసీ ఆసుపత్రిని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ఆసుపత్రి ఆధునిక మాధ్యమిక ఆరోగ్యసంరక్షణ సేవలను అందించనుంది. దీనిలో ఒక కేంద్ర ప్రయోగశాలతో పాటు అత్యవసర సహాయక సేవలను కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. వృత్తి పరంగా అయ్యే గాయాలకు చికిత్స చేయడానికీ, అత్యవసర చికిత్సను అందించాల్సిన స్థితుల్లో సకాలంలో స్పందించడానికీ తగినట్లు వారంలో 24 గంటలూ లభ్యమయ్యే అత్యవసర, ట్రామా కేర్ సౌకర్యాలను కూడా ఇక్కడ సమకూర్చారు. గుజరాత్ ప్రభుత్వం చేపట్టే అనేక ముఖ్య కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వాటిలో.. వల్సాడ్లో రీవ్యాంప్డ్ రిఫార్మ్స్-బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీములో భాగంగా చేపట్టే ఆధునిక విద్యుత్తు సరఫరా పథకాల స్థాయి పెంపుదలకు సంబంధించిన కార్యక్రమాలు, దహేజ్ పెట్రోలియమ్, పీసీపీఐఆర్ (కెమిక్సల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్), జీఐడీసీలోని సారిగామ్ గుజరాత్ పారిశ్రామిక అభివీద్ధి సంస్థ (జీఐడీసీ)లలో ఆధునిక కాలుష్య నివారక, శుద్ధి ప్లాంటులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సహా జంబుసార్ బల్క్ డ్రగ్ పార్కులో అత్యవసర లేఅవుట్ యుటిలిటీస్ ఉన్నాయి.
దమన్లో ప్రధానమంత్రి
సుమారు రూ.2,970 కోట్ల ఖర్చుతో దమన్లో పూర్తి చేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభింంచి, దేశ ప్రజలకు అంకితం చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులలో ఆరోగ్యసంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సధానం, ప్రజా సంక్షేమ రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా, నగర్ హవేలీతో పాటు దమన్, దీవ్ల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఊతాన్ని అందిస్తాయని భావిస్తున్నారు.
దాదాపు రూ.1,340 కోట్ల ఖర్చుతో దమన్లో పూర్తి చేసిన అనేక ప్రాజెక్టుల్ని ప్రధానమంత్రి ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేస్తారు. వాటిలో.. నమో విమానాశ్రయ టర్మినల్ నూతన భవనం, నమో ఆసుపత్రి, ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. విమానాశ్రయ నూతన టర్మినల్ ప్రాంతీయ వాయు సంధానాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో పటిష్ట పరుస్తుంది. ఇది ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి పథంలో పురోగమించడానికి తోడ్పడుతుంది. దమన్ జిల్లాలో రోజూ సుమారు 1,500 మంది ఓపీడీ రోగులకు సేవలను అందించే లక్ష్యంతో నమో ఆసుపత్రిని తీర్చిదిద్దారు. ఇది జిల్లా ఆసుపత్రి. ప్రజలకు నాణ్యతతో కూడిన ఆరోగ్యసంరక్షణ సేవలను ఈ ఆసుపత్రి అందిస్తుంది.
దాదాపు రూ.1,630 కోట్ల ఖర్చుతో చేపట్టే ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ప్రధాన ప్రాజెక్టుల్లో ఐకానిక్ బ్రిడ్జి, దమన్ కన్వెన్షన్ సెంటరు, దమన్లోని ఎన్ఐఎఫ్టీ క్యాంపస్ ప్రాజక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు సిద్ధం అయిన తరువాత, పర్యటన రంగానికి దన్ను లభిస్తుందనీ, పెట్టుబడులకు ప్రోత్సాహం అందుతుందనీ, ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రజల జీవన నాణ్యత కూడా మెరుగుపడుతుందనీ భావిస్తున్నారు.
కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో రూ.885 కోట్ల ఖర్చుతో చేపట్టే ప్రధాన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో.. కల్పేనీ దీవిలోనూ, కద్మత్ దీవిలోనూ తూర్పు, పశ్చిమ తీరాల్లో ఓడరేవు సదుపాయాల అభివృద్ధి ఒక ప్రాజెక్టుగా ఉంది. బహుళోపయోగ రేవు కట్ట (జెట్టీ)లను తీర్చిదిద్దడం పూర్తి చేస్తే, 300 మీటర్ల వరకూ పొడవైన క్రూజ్ నౌకలు సహా పెద్దవైన ప్రయాణికుల పడవలకు ఏడాది పొడవునా లంగరు వేసుకొనే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టులు ప్రయాణికులతో పాటు సరకుల రవాణాను కూడా సురక్షితంగా చేసి, రాకపోకలు సాఫీగా సాగేందుకు దోహదపడతాయి. చేపల నిర్వహణ, ఇంధన పంపిణీ, మంచుగడ్డల సరఫరా, పడవల మరమ్మతు కోసం ఏకీకృత సదుపాయాల్ని ఈ ప్రాజెక్టులు సమకూరుస్తాయి. ఈ అభివృద్ధి ప్రధాన కార్యక్రమాలన్నీ నౌకావాణిజ్య సంబంధిత సంధానాన్ని బలోపేతం చేస్తాయి. స్థానిక మత్స్యకారుల ఉపాధికి ఊతాన్నిస్తాయి. పర్యటన రంగానికి దన్నుగా నిలుస్తాయి. దీవులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా తోడ్పడుతాయి.
***
(रिलीज़ आईडी: 2268886)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam