మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.. ‘‘పొగాకు రహిత భవిష్యత్తు కోసం: పాఠశాలల పోటీ 2025’’ విజేతలకు సత్కారం
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 2:32PM by PIB Hyderabad
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో మే 29న (శుక్రవారం) న్యూఢిల్లీలో అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉపాధ్యాయ ప్రతినిధులు, ఎన్ సీఈఆర్ టీ, ఎన్ వీఎస్, కేవీఎస్ అధికారులతో జాతీయ సదస్సును నిర్వహించింది. మై గవర్న్ మెంట్ ఆవిష్కరణల ప్రచారంలో భాగంగా ‘‘పొగాకు రహిత భవిష్యత్తు కోసం: పాఠశాలల పోటీ 2025’’ పోటీలో విజేతలుగా నిలిచిన పాఠశాలలను అభినందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. పాఠశాలల్లో ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత విద్యా వాతావరణాన్ని పెంపొందించేందుకు పాఠశాలలు చేపడుతున్న చర్యలను, వారి కృషిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆర్థిక సలహాదారు శ్రీమతి ఏ శ్రీజ, జాయింట్ డైరెక్టర్ శ్రీ రామ్ సింగ్, ఎన్ సీఈఆర్ టీ డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లానీ, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అవార్డులు గెలుచుకున్న పాఠశాలలను శ్రీ సంజయ్ కుమార్ అభినందించారు. దేశవ్యాప్తంగా 17,000కు పైగా పాఠశాలలు ఈ పోటీల్లో పాల్గొనడాన్ని ఆయన ప్రశంసించారు. విద్యా సంస్థలన్నీ పొగాకు రహితంగా మారేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొగాకు నియంత్రణ ప్రయత్నాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లలో నిరంతర అవగాహన, చైతన్యం, ప్రవర్తనా మార్పు వంటి కార్యక్రమాల ద్వారా పొగాకు వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
విద్యార్థుల ప్రవర్తనలో ప్రారంభ దశలోనే కనిపించే మార్పులను గుర్తించడంలో, వారి మానసిక, భావోద్వేగ సమతుల్యతను కాపాడటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని శ్రీ కుమార్ తెలిపారు. ఆరోగ్యకరమైన ప్రవర్తనలను ప్రోత్సహించడంలో, శ్రేయస్సును పెంపొందించడంలో, ముందస్తు నివారణ చర్యలకు మద్దతు ఇవ్వడంలోనూ పాఠశాలలు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు.
సమాజంలో గొప్ప మార్పును తీసుకువచ్చే శక్తి పాఠశాల విద్యా వ్యవస్థకు ఉందని తెలిపారు. పాఠశాలలు దాదాపు 24.69 కోట్ల మంది పిల్లలతో అనుసంధానమై ఉన్నాయని, 15 నుంచి 20 కోట్ల వరకు కుటుంబాలను ప్రభావితం చేయగలవని పేర్కొన్నారు. తద్వారా పొగాకు రహిత ఉద్యమం దేశవ్యాప్తంగా సామాజిక ప్రచారంగా మారే అవకాశం ఉందని చెప్పారు. విద్యాసంస్థల చుట్టుపక్కల పొగాకు రహిత వాతావరణాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మరింత ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించే దార్శనికతకు అనుగుణంగా ఉన్న ఈ ప్రచారం.. దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికకు పాఠశాలలు, కుటుంబాలు మద్దతు ఇవ్వాలని సూచించారు.
ఈ సదస్సులో నషా ముక్త్ భారత్ కార్యక్రమం కింద పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి చెందిన మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక (2026–2029)తోపాటు నషా ముక్త్ విద్యాలయ వేదికను (https://tofei.education.gov.in/) కూడా ప్రారంభించారు. నషా ముక్త్ విద్యాలయ అభియాన్ అమలులో విద్యా సంస్థల పురోగతిని పర్యవేక్షించడానికి, నమోదు చేయడానికి ఈ పోర్టల్ కీలక వేదికగా పనిచేస్తుంది.
ఈ పోటీల్లో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ వంటి నాలుగు విభాగాల్లో మొత్తం12 పాఠశాలలను సత్కరించారు. ప్రతి విభాగం నుంచి మూడు పాఠశాలలను ఎంపిక చేశారు. విజేతగా నిలిచిన పాఠశాలలకు ట్రోఫీలతో పాటు మొదటి స్థానానికి రూ. 50,000, రెండో స్థానానికి రూ.25,000, మూడో స్థానానికి రూ. 15,000 నగదు బహుమతులను అందేశారు. వీటితోపాటు ఈ ప్రచారంలో ప్రశంసనీయమైన కృషి చేసినందుకు గానూ మరో 41 పాఠశాలలకు ప్రశంసా పూర్వక బహుమతులను అందజేశారు.
మూడేళ్ల ప్రణాళికను ప్రధానంగా నాలుగు కీలక అంశాల ఆధారంగా రూపొందించారు. అవి (i) యూడీఐఎస్ఈ ద్వారా తాము వ్యసన రహితంగా మారినట్లు పాఠశాలలు స్వయంగా ప్రకటించుకోవడానికి, నిబంధనల అమలును పర్యవేక్షించడానికి నషా ముక్త్ విద్యాలయ పోర్టల్... (ii) విద్యాసంస్థల చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మత్తుపదార్థాలు లభించకుండా నిరోధించడం... (iii) ఎన్ సీఈఆర్ టీ, సీబీఎస్ఈ, ఎస్ఎస్ సీ సిలబస్లలో విద్యార్థుల వయసుకు తగినట్లుగా మత్తుపదార్థాల నివారణ, ఆరోగ్య విద్యను చేర్చడం...
ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచడం కోసం భాషల్లో పోస్టర్లు, కరపత్రాలు, సమాచార పుస్తకాలను తయారు చేయడం. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులకు ముందస్తు, ఉద్యోగ సమయంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వ్యసనాల బారిన పడే ప్రమాదం ఉన్న విద్యార్థులను ముందే గుర్తించి, వారికి తగిన సహాయం అందించడం, మనోదర్పణ్ ద్వారా (జాతీయ సహాయక నెంబర్-844 844 0632) మానసిక ఆరోగ్యానికి సహాయం అందించడం, సమర్థవంతమైన అమలు, జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పటిష్టమైన పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తుంది.
ఈ సదస్సులో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆర్థిక సలహాదారు శ్రీమతి ఎ. శ్రీజ మాట్లాడుతూ... దేశంలో పొగాకు వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిరంతర విధానపరమైన, వ్యవస్థాగత ప్రయత్నాలను ప్రస్తావించారు. పొగాకు వాడకాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన చట్టపరమైన, ఆర్థికపరమైన చర్యలను వివరించారు. వీటిలో 2003లో కోట్పా (సీఓటీపీఏ) చట్టాన్ని తీసుకురావడం, 2019లో ఈ-సిగరెట్లపై పూర్తిగా నిషేధం విధించడం, పొగాకు ఉత్పత్తులపై అత్యధిక జీఎస్టీ రేట్లు, సెస్సులను విధించడం వంటివి ఉన్నాయని తెలిపారు.
పొగాకు నియంత్రణ, ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన గ్లోబల్ యూత్ టొబాకో సర్వేను (ప్రపంచ యువజన పొగాకు వినియోగ సర్వే) ప్రస్తావిస్తూ.. పిల్లలు, టీనేజర్లలో చిన్న వయస్సు నుంచే అవగాహన కల్పించడం, ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరమని తెలిపారు. పొగాకు, ఇతర మత్తుపదార్థాల వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచడం చాలా ముఖ్యమని, చిన్న వయస్సులోనే చేసే ఇలాంటి మంచి ప్రయత్నాలు వారి జీవితకాలంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.
పాఠశాలలు, రాష్ట్రాల్లో అవగాహన, నిబంధనల అమలును మరింత బలోపేతం చేయడం కోసం 2024లోనే పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఒక ప్రత్యేక మార్గదర్శకాల నియమావళిని రూపొందించిందని శ్రీమతి శ్రీజ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొగాకు, మత్తుపదార్థాల నివారణ, మానసిక శ్రేయస్సు, ప్రవర్తనా మార్పులపై నిపుణులతో చర్చలు నిర్వహించారు. నషా ముక్త్ భారత్ను సాధించడంలో పాఠశాలలు, కుటుంబాలు, సమాజం, ప్రభుత్వ సంస్థలు కలిసికట్టుగా పనిచేయడం అత్యంత ముఖ్యమని ఈ చర్చల ద్వారా నిపుణులు వివరించారు.
***
(రిలీజ్ ఐడి: 2267600)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27