కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
10 ఏళ్లు పూర్తి చేసుకున్న దివాలా, రుణ విమోచన నిబంధనావళి
ఐబీసీ పరిష్కార ప్రక్రియ ద్వారా రుణదాతలకు సులభతరమైన రూ. 4 లక్షల కోట్లకు పైగా బకాయిల వసూలు
నాడు పోస్టు చేయడమైనది:
28 MAY 2026 6:35PM by PIB Hyderabad
2016లో అమల్లోకి వచ్చిన దివాలా, రుణ విమోచన చట్టం నేటితో విజయవంతంగా 10 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చి దశాబ్ద కాలం పూర్తయిన నేపథ్యంలో ఇది కేవలం ఒక సాధారణ చట్టపరమైన సంస్కరణగా మాత్రమే కాకుండా.. రుణ మార్కెట్లు, కార్పొరేట్ ప్రవర్తన, పెట్టుబడిదారుల నమ్మకం, ఆర్థిక సామర్థ్యంపై దీర్ఘకాల ప్రభావాలను చూపిన ఒక వ్యవస్థాగత మార్పుగా అవతరించింది.
చారిత్రాత్మక సంస్కరణగా కొనియాడుతున్న ఈ చట్టాన్ని.. అప్పటి వరకు దేశంలో విచ్ఛిన్నంగా ఉన్న దివాలా పరిష్కార వ్యవస్థలను ఏకీకృతం చేసి, ఆధునికీకరించాలనే లక్ష్యంతో రూపొందించారు. ఈ చట్టం అమలుతో బకాయిలను వసూలు చేసే యంత్రాంగాలు మెరుగయ్యాయి. బాధ్యతాయుతంగా అప్పులు తీసుకునే, ఇచ్చే పద్ధతులు పెరిగాయి. దేశ ఆర్థిక, న్యాయ వ్యవస్థలపై నమ్మకం మరింత బలోపేతమైంది.
మార్చి 2026 నాటికి 1,419 కేసులు విజయవంతంగా పరిష్కారం పొందడం ఈ చట్టం అమలుకు స్పష్టమైన నిదర్శనం. ఈ పరిష్కార ప్రక్రియ ద్వారా రుణదాతలకు రూ. 4 లక్షల కోట్లకు పైగా బకాయిలు వసూలయ్యాయి. రుణదాతలకు లభించిన ఈ బకాయిల వసూలు మొత్తం సంస్థల విలువ, విక్రయ విలువలతో పోలిస్తే వరుసగా 95 శాతం, 167 శాతంగా ఉంది.
నేడు ఈ దివాలా చట్టం ఆధారంగా వస్తున్న కోర్టు తీర్పులు ఒక బలమైన, వేగవంతమైన వ్యవస్థ ఏర్పడటానికి సహాయపడ్డాయి. ఈ వ్యవస్థ మారుతున్న ఆర్థిక పరిస్థితులకు, అలాగే వ్యాపారుల నమ్మకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ముందుకు సాగుతోంది.
మార్చి 2026 వరకు మొత్తం 8,987 కేసులు విచారణకు స్వీకరించగా వాటిలో 7,102 కేసులు ముగింపు దశకు చేరుకున్నాయి. ముగిసిన కేసుల్లో దాదాపు 58 శాతానికి సమానమైన 4,099 కంపెనీలు దివాలా తీయకుండా రక్షణ పొందాయి. మరో 3,003 కేసులు కంపెనీ ఆస్తుల విక్రయంతో ముగిశాయి.
దివాలా తీయకుండా రక్షించిన సంస్థల్లో 1,388 కేసులు అప్పీల్, సమీక్ష, రాజీ కారణంగా ముగిశాయి. మరో 1,292 కేసులు ఉపసంహరించుకున్నారు.
ముఖ్యంగా పరిష్కార ప్రణాళికలతో ముగిసిన కేసుల్లో దాదాపు 42 శాతం కేసులు గతంలో పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డు పరిధిలో ఉన్నవి లేదా పూర్తిగా మూసివేసినవి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల పునరుద్ధరణకు ఈ చట్టం ఎంతగానో దోహదపడిందనే విషయానికి ఇదొక నిదర్శనం.
అప్పులు తీసుకునే వారిలో రుణ క్రమశిక్షణను పెంచడంలో, సకాలంలో అప్పులు తిరిగి చెల్లించే విధానాన్ని బలోపేతం చేయడంలో కూడా ఈ చట్టం కీలక పాత్ర పోషించింది.
జాతీయ కంపెనీల న్యాయ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దాఖలైన 30,000 కంటే ఎక్కువ కేసులు కోర్టు ద్వారా అధికారికంగా స్వీకరించక ముందే ఉపసంహరణల ద్వారా పరిష్కారమయ్యాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 14 లక్షల కోట్లుగా అంచనా. అధికారిక దివాలా ప్రక్రియల దాకా వెళ్లకుండానే ముందే ఆర్థిక ఒత్తిడిని సకాలంలో పరిష్కరించుకునేలా అప్పు తీసుకున్న వారికి, అప్పు ఇచ్చిన వారికి మధ్య ఉన్న సంబంధాలను ఈ చట్టం ఎంతవరకు మార్చివేసిందో ఈ పరిష్కారాలు తెలియజేస్తున్నాయి.
ఒకవేళ ఇటువంటి ముందస్తు పరిష్కారాలు, ఉపసంహరణలు జరగకపోయి ఉంటే బ్యాంకింగ్ రంగం స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి సెప్టెంబర్ 2025 నాటికి నమోదైన 2.1 శాతం స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉండేది. 2017లో ఈ రేటు దాదాపు 11.8 శాతంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ‘రిపోర్ట్ ఆన్ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా’ పేర్కొంది.
మెరుగైన బకాయిల వసూలు ఫలితాలు, వేగవంతమైన పరిష్కార కాలపరిమితులు, రుణదాతల అధిక అధికారాల ద్వారా దేశ దివాలా పరిష్కార విధానం మరింత బలోపేతమైంది. దేశీయ పరిష్కార, వసూళ్ల వ్యవస్థ సామర్థ్యంలో వచ్చిన మెరుగుదలలను గుర్తిస్తూ.. ప్రముఖ రేటింగ్ సంస్థ ‘ఎస్ అండ్ పీ గ్లోబర్ రేటింగ్స్’ దేశ దివాలా పరిష్కార నియమాలను ‘గ్రూప్ సి’ నుంచి ‘గ్రూప్ బి’ కి ఆధునీకరించింది.
ఐబీసీకి ముందు సగటు బకాయిల వసూలు రేటు కేవలం 15-20 శాతంగా ఉండగా.. ఐబీసీ అమలులోకి వచ్చిన తర్వాత అది దాదాపు 30 శాతానికిపెరిగింది. గతంలో కేసుల పరిష్కారానికి దాదాపు 6 నుంచి 8 సంవత్సరాల సమయం పట్టగా, ఈ చట్టం కింద ఆ కాలపరిమితి దాదాపు 2 సంవత్సరాలకు తగ్గింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘దేశంలో బ్యాంకింగ్ దోరణులు, పురోగతి 2024-25’ నివేదికలో కూడా ఈ చట్టం సమర్థత స్పష్టంగా వ్యక్తమైంది. మొండి బాకీల వసూలుకు ఈ చట్టమే అత్యంత సమర్ధవంతమైన యంత్రాంగమని ఈ నివేదిక గుర్తించింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు వివిధ మార్గాల ద్వారా వసూలు చేసిన మొత్తం రూ. 1.04 లక్షల కోట్ల బకాయిల్లో దాదాపు 52.4 శాతానికి సమానమైన రూ. 0.54 లక్షల కోట్లు కేవలం ఈ ఐబీసీ ప్రక్రియ ద్వారానే వసూలు అయ్యాయి.
ఐబీసీ చట్టం ద్వారా బకాయిల వసూలు రేట్లు అంతకుముందు సంవత్సరంలో ఉన్న 28.3 శాతం నుంచి 2024-25 నాటికి 36.6 శాతానికి మెరుగయ్యాయని నివేదిక పేర్కొంది. ఇది మొండి బాకీల పరిష్కారంలో, స్థూల నిరర్థక ఆస్తుల తగ్గింపునకు దోహదపడటంలో ఈ దివాలా పరిష్కార చట్టం సమర్థతను తెలియజేస్తుంది
ఐబీసీ అమలు తర్వాత రుణ ప్రవర్తనలో గణనీయమైన మెరుగుదల కనిపించినట్లు ఐబీసీ ప్రవర్తనా ప్రభావంపై ఐఐఎం బెంగళూరు చేసిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా 2018, 2024 మధ్య గడువు దాటిన బకాయిల వర్గం నుంచి సాధారణ వర్గానికి మారే రుణ ఖాతాల నిష్పత్తి క్రమంగా పెరిగింది. ఇది అప్పు తీసుకునే వారిలో క్రమశిక్షణ మెరుగుపడటాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రవర్తనా మార్పు ఒక ఖాతా గడువు మించి ఉన్న సగటు రోజుల సంఖ్య కూడా భారీగా తగ్గడంలో ప్రతిబింబించింది. గతంలో ఈ సంఖ్య 248–344 రోజులు ఉండగా...అది కాస్తా 30–87 రోజులకు తగ్గింది.
ఐబీసీ చట్టం కింద సమస్యలు పరిష్కారం అయిన కంపెనీలపై ఐఐఎమ్ అహ్మదాబాద్ (2025) ఒక అధ్యయనం చేసింది. ఆ కంపెనీల సమస్య తీరిపోయిన తర్వాత అయిదేళ్ల కాలంలో వాటి వ్యాపారాలు ఎలా మళ్లీ పుంజుకున్నాయో ఇది వివరించింది. ముఖ్యంగా కంపెనీల రోజువారీ పనితీరులో, వాటి ఆర్థిక పరిస్థితిలో భారీ మార్పు, మెరుగుదల వచ్చినట్లు పేర్కొంది.
సమస్యలు పరిష్కారమైన కంపెనీల సగటు అమ్మకాలు దాదాపు 89 శాతం పెరిగాయి. వాటి ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి కూడా సుమారు 131 శాతం మెరుగైంది. ఇది ఆ కంపెనీల రోజువారీ పనితీరు సామర్థ్యాన్ని, వ్యాపార పునరుద్ధరణను సూచిస్తుంది. సమస్య తీరిన అయిదేళ్ల కాలంలో సగటు మూలధన వ్యయం దాదాపు 106 శాతం పెరిగింది. ఇది ఆ సంస్థల్లో కొత్త పెట్టుబడుల పెరుగుదలను, ఆర్థికంగా నిలదొక్కుకున్నాయనే విషయాన్ని ప్రతిబింబిస్తుంది.
సమస్యలు పరిష్కారమైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ అయిదేళ్ల కాలంలో దాదాపు రూ. 2.8 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 9 లక్షల కోట్లకు పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది. విజయవంతమైన పరిష్కారం తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని, ఆయా కంపెనీల దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు మెరుగయ్యాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
2016లో ఐబీసీ చట్టం ప్రారంభమైనప్పుడు ఒక పాత కాలపు పద్ధతికి ముగింపు పలుకుతామని హామీ ఇచ్చింది. గతంలో కేసులు ఏళ్ల తరబడి సాగడం వల్ల కంపెనీల విలువ పూర్తిగా పడిపోయేది. చివరికి ఆ కంపెనీల ఆస్తులను విడివిడిగా విక్రయించాల్సి వచ్చేది. సంస్థను స్థాపించడానికి పెట్టిన పెట్టుబడికి అసలు విలువే దక్కేది కాదు. దీనివల్ల అప్పులు ఇచ్చిన వారికి రూపాయికి కేవలం కొన్ని పైసలు మాత్రమే తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది. ఐబీసీ చట్టం ఆ నష్టకరమైన కాలానికి ముగింపు పలికింది.
దీనికి సమాధానంగా ఆర్థిక ఇబ్బందులు, దివాలా సమస్యల పరిష్కారం కోసం ఈ చట్టం ఒక స్పష్టమైన, రుణదాతల ఆధ్వర్యంలో నడిచే, నిర్ణీత కాలపరిమితితో కూడిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. ఇది ప్రధానంగా పనితీరు సామర్థ్యానికి, కార్పొరేట్ కంపెనీల పునరుద్ధరణకు, కంపెనీల విలువను గరిష్ఠం చేయడానికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ ప్రక్రియ భారత ఆర్థిక వ్యవస్థలో అప్పు, వ్యాపార సంస్థ, జవాబుదారీతనం మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా ఒక కొత్త మలుపు తిప్పింది.
ఐబీసీ సాధించిన ఈ పదేళ్ల మైలురాయి గడిచిన ప్రస్థానాన్ని ఆలోచించడానికి, అంచనా వేయడానికి, భవిష్యత్తును కొత్తగా ఊహించుకోవడానికి కీలక అవకాశాన్ని అందిస్తుంది. దేశ ఆర్థిక, వ్యవస్థాగత రంగంపై ఈ దివాలా పరిష్కార చట్టం చూపిన మార్పుల ప్రభావాన్ని మరింత లోతుగా పరిశీలించేలా ఆహ్వానిస్తోంది. ఒక చట్టం మరింత బలపడుతున్న సమయంలో దానితో పాటు వచ్చే సవాళ్లను కూడా నిర్మాణాత్మకంగా ఎదుర్కొనేలా ప్రోత్సహిస్తుంది.
‘వికసిత్ భారత్ 2047’ సాధనే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో.. దేశంలో వ్యవస్థాపకతను నిలబెట్టడానికి, ఉత్పాదక మూలధనాన్ని కాపాడటానికి, ఆర్థిక స్థిరత్వాన్ని మరింత పటిష్టం చేయడానికి, బాధ్యతాయుతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఒక సమర్థవంతమైన, బలమైన దివాలా పరిష్కార వ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందడం చాలా అవసరం.
***
(రిలీజ్ ఐడి: 2266499)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16