వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో ఆసియా ఉత్పాదకత సంస్థ పాలక మండలి 68వ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
మే 21న జరిగే సమావేశ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఉత్పాదకత పెంపునకు కృషి చేసే వారితోపాటు సాంకేతిక నిపుణులకూ ఈ సమావేశంలో ఏపీఓ జాతీయ అవార్డుల ప్రదానం
प्रविष्टि तिथि:
20 MAY 2026 12:00PM by PIB Hyderabad
ఆసియా ఉత్పాదకత సంస్థ (ఏపీఓ) పాలక మండలి 68వ సమావేశానికి అధ్యక్ష హోదాలో భారత ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026 మే 20 నుంచి 22 వరకు ఈ సమావేశం జరగనుంది. 20 ఏపీఓ సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహించే 60 మందికి పైగా సీనియర్ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
2026 మే 21న జరిగే ప్రారంభ కార్యక్రమానికి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ హాజరుకానున్నారు. ఏపీఓ డైరెక్టర్లు, సలహాదారులు, సభ్య దేశాల దౌత్య కార్యాలయాల ప్రతినిధులు, ప్రముఖ అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భూటాన్ ప్రభుత్వాల పరిశీలకులతో పాటు గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇనిస్టిట్యూట్ (ప్రపంచ హరిత వృద్ధి సంస్థ) ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఏపీఓ దార్శనికత 2030 విధానాలు, 2027-28 రెండేళ్ల కాలానికి సంబంధించిన ఏపీఓ ప్రాథమిక బడ్జెట్, ఏపీఓ సెక్రటరీ జనరల్ ఎన్నికల విధానాల సమీక్షపై ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి.
68వ పాలక మండలి సమావేశం ప్రధాన అజెండా అంశాల్లో.. సమావేశ అధికారిక ప్రారంభోత్సవం, 2026–27 సంవత్సరానికి ఏపీఓ చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక, ఏపీఓ వార్షిక, ఆర్థిక నివేదిక పరిశీలన- ఆమోదం, బడ్జెట్ ప్రతిపాదనలు, సంస్థాగత సంస్కరణలపై చర్చలు, ఏపీఓ దార్శనికత 2030 ద్వారా సాధించిన పురోగతి, సచివాలయ పనితీరుపై సమీక్ష, కీలక విధాన, కార్యాచరణ సిఫార్సుల ఆమోదం వంటివి ఉన్నాయి.
ఏపీఓ జాతీయ అవార్డుల కార్యక్రమం కింద ప్రారంభ సమావేశంలో రెండు విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉత్పాదకత పెంపునకు కృషి వారితోపాటు సాంకేతిక నిపుణులకూ ఏపీఓ జాతీయ అవార్డులను అందజేయనున్నారు.
ప్రభావవంతమైన కార్యక్రమాల ద్వారా ఉత్పాదకతను పెంపొందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించడంలోనూ, వారిని ప్రోత్సహించడంలోనూ జాతీయ ఉత్పాదకత సంస్థల (ఎన్పీఓఎస్) పాత్రను బలోపేతం చేయడం, ఏపీఓ సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థల్లో స్పష్టమైన ప్రగతిని సాధించేలా ఒక ఉత్పాదకత సంస్కృతిని పెంపొందించడం ఈ అవార్డుల ముఖ్య లక్ష్యం.
ఏపీఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థగా పాలక మండలి వ్యవహరిస్తుంది. పరిపాలన, వ్యూహాత్మక పర్యవేక్షణ, సంస్థాగత నిర్ణయాల కోసం అత్యున్నత వేదికగా పనిచేస్తుంది. సంస్థ వ్యూహాత్మక దిశానిర్దేశం, వార్షిక కార్యక్రమల ప్రాధాన్యతలు, పాలనా విధానలు, సంస్థాగత పనితీరు, ఆర్థిక ప్రణాళికపై చర్చించడానికి అన్ని ఏపీఓ సభ్య దేశాల అధికారిక ప్రతినిధులను ఈ పాలక మండలి సమావేశం ఒకచోట చేర్చుతుంది.
మే 2025లో జరిగిన ఏపీఓ పాలక మండలి 67వ సమావేశానికి అధ్యక్ష బాధ్యతలను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి శ్రీ అమరదీప్ సింగ్ భాటియా చేపట్టారు. ఏపీఓ పాలకమండలి 68వ సమావేశానికి తామే ఆతిథ్యం ఇవ్వనున్నట్లు భారత్ ప్రకటించింది.
1961లో స్థాపించిన ఆసియా ఉత్పాదకతా సంస్థ ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందిన 21 సభ్య దేశాలతో కూడిన ఓ అంతర్ ప్రభుత్వ సంస్థ. పరస్పర సహకారం, సాంకేతిక విజ్ఞానాన్ని ఇచ్చుపుచ్చుకోవడం ద్వారా సుస్థిర సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం ఉత్పాదకతను పెంపొందించడానికి ఏపీఓ కట్టుబడి ఉంది. గత ఆరు దశాబ్దాలుగా ఈ సంస్థ విధానపరమైన చర్చలు, సాంకేతిక సహకారం, సంస్థాగత సామర్థ్య పెంపు, విజ్ఞాన భాగస్వామ్యం, ఉత్పాదకత పెంపుదలలో అత్యుత్తమ పద్ధతులను విస్తృతం చేయడం ద్వారా సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ కార్యక్రమం ద్వైపాక్షిక, బహుపాక్షిక సంప్రదింపులకు అవకాశాలను కల్పించడంతో పాటు సభ్య దేశాల మధ్య విజ్ఞాన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.
ఏపీఓ పాలక మండలి 68వ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా జాతీయ ప్రాధాన్యతలు, ప్రపంచ ఆర్థిక ధోరణులకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఉత్పాదకత ఆధారిత వృద్ధిని, ఆవిష్కరణలను, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో భారత్ నిబద్దతను ప్రతిబింబిస్తుంది.
*****
(रिलीज़ आईडी: 2263293)
आगंतुक पटल : 57