రైల్వే మంత్రిత్వ శాఖ
రూ.993 కోట్ల ఖర్చుతో అరక్కోణమ్-చెంగల్పట్టు డబ్లింగ్ ప్రాజెక్టుకు భారతీయ రైల్వేల ఆమోద ముద్ర
ఈ ప్రాజెక్టుతో చెన్నై సబర్బన్ రైల్ నెట్వర్కుకు ఊతం
రద్దీని తగ్గించి, ప్రయాణికుల రాకపోకలను సుగమం చేయడంతో పాటు సిమెంటు, ఆటోమొబైల్స్, ఆహారధాన్యాల రవాణాకు దన్నుగా అరక్కోణమ్-చెంగల్పట్టు డబ్లింగ్ ప్రాజెక్టు: శ్రీ అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 11:05AM by PIB Hyderabad
రూ.993 కోట్ల ఖర్చుతో అరక్కోణం-చెంగల్పట్టు రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టు (దీని పొడవు 68 కిలోమీటర్లు)కు భారతీయ రైల్వేలు ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుతో దేశమంతటా సురక్షిత, వేగవంత, సమర్థవంతమైన రైలు రవాణా సౌకర్యాన్ని అందిస్తానన్న భారతీయ రైల్వేల వాగ్దానం మరింత బలాన్ని పుంజుకోనుంది. చెన్నై బీచ్, తాంబరమ్, అరక్కోణమ్లను కలిపే ప్రధానమైన చెన్నై సబర్బన్ సర్క్యులర్ రైల్ నెట్వర్కులో ఓ భాగం ఈ అరక్కోణం-చెంగల్పట్టు సెక్షన్.
ఒత్తిడి ఎక్కువగా ఉండే చెన్నై సబర్బన్ రైల్ నెట్వర్కులో రద్దీని తగ్గించడంతో పాటు సమయపాలననీ, కార్యకలాపాల నిర్వహణలో సమర్ధతనీ మెరుగుపరచడంలో అరక్కోణం-చెంగల్పట్టు రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టు ఒక ముఖ్య పాత్రను పోషించనుందని రైల్వే శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు.. ఈ ప్రాంతంలో ప్రయాణికుల రాకపోకలతో పాటు సరకు రవాణానూ పటిష్ఠపరుస్తుందనీ, ఫలితంగా సిమెంటు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాలు, ఇనుము, ఉక్కు వంటి కీలక సరకుల రవాణాకు కూడా ప్రయోజనం కలుగుతుందనీ ఆయన వివరించారు.
ఇప్పటికే ఉన్న డబల్ లైనును పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. రాబోయే సంవత్సరాల్లో రాకపోకలు మరింత ఎక్కువ అవుతాయన్న అంచనా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని, అదనపు మౌలిక సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. డబ్లింగ్ పనులు పూర్తి చేసిన తరువాత రైళ్లు నిలిచి ఉండాల్సిన సమయం తగ్గి, సమయపాలనలో మెరుగుదల చోటుచేసుకొంటుంది. శివారు ప్రాంతాలకు అందుతున్న సేవలు ఇప్పటితో పోలిస్తే, మరింత పెరుగుతాయి.
ఈ మార్గం మహీంద్రా వరల్డ్ సిటీ, శ్రీపెరుంబుదూర్, ఒరగడమ్, ఇరుంగట్టుకోట్టై సహా అనేక ప్రధాన ఆర్థిక, పారిశ్రామిక కూడళ్లతో పాటు ముఖ్య ఆటోమొబైల్, సిమెంట్, తయారీ పరిశ్రమలకు సేవలను అందిస్తోంది. కాంచీపురం సమీపంలో ప్రతిపాదించిన పరండూర్ విమానాశ్రయ ప్రాజెక్టు ఇదే మార్గానికి దగ్గరగా ఏర్పడటం ఈ మార్గానికి వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది.
దేశంలో రైల్వే రంగంలో మౌలిక సదుపాయాల్ని ఆధునికీకరించే, నెట్వర్క్ సామర్థ్యాల్ని పెంపొందింపచేసే, కీలక కారిడార్లలో కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా భారతీయ రైల్వేలు చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో అరక్కోణం-చెంగల్పట్టు రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం కూడా ఒకటి. ఈ ప్రాజెక్టు.. శివారు ప్రాంతాలకు రాకపోకల్ని పటిష్ఠపరచడం, సరకు రవాణాకు సంబంధించిన అనుసంధానాన్ని ఇప్పటి కన్న బలోపేతం చేయడం, ప్రాంతీయ పారిశ్రామికాభివృద్ధికి ఇతోధిక ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు శీఘ్ర, సురక్షిత, మరింత ఎక్కువ విశ్వసనీయ రవాణా సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2262672)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5