వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ అధ్యక్షతన ముంబయిలో కింబర్లీ ప్రాసెస్ వార్షిక మధ్యంతర సమావేశం- 2026
పర్యవేక్షణ, నిబంధనల అమలు, సుస్థిర వజ్రాల వాణిజ్యంపై కింబర్లీ ప్రాసెస్ సమావేశం దృష్టి
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 11:19AM by PIB Hyderabad
కింబర్లీ ప్రాసెస్ (కేపీ) వార్షిక మధ్యంతర సమావేశం - 2026 భారత్ అధ్యక్షతన ముంబయిలో ప్రారంభమైంది. మే 11 నుంచి 14 వరకు జరగనున్న ఈ సమావేశం.. సహజ వజ్రాల అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కింబర్లీ ప్రాసెస్ భాగస్వాములు, పరిశీలకులు, సంబంధిత పారిశ్రామిక వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చింది.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి కింబర్లీ ప్రాసెస్ అధ్యక్షుడు శ్రీ సుచింద్ర మిశ్రా ప్రసంగిస్తూ.. వజ్రాల ఉత్పత్తి చేసే దేశాల్లో శాంతిని నెలకొల్పడంలో, జీవనోపాధిని రక్షించడంలో, చట్టబద్ధమైన వజ్రాల వాణిజ్యాన్ని బలోపేతం చేయడంలో కింబర్లీ ప్రాసెస్ కీలక పాత్ర పోషించిందన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పటిష్టం చేయాలని, భాగస్వామ్య దేశాల మధ్య సహకారాన్ని పెంచాలని, కింబర్లీ ప్రాసెస్ ఎల్లప్పుడూ సముచితంగానూ సమర్థంగానూ నిలిచేలా చూడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే సహజ వజ్రాలు ఒక సుస్థిర ఉత్పత్తి అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత పురోగామి ధ్రువీకరణ వ్యవస్థల్లో ఒకటిగా కింబర్లీ ప్రాసెస్ కొనసాగుతోందని ఆయన వివరించారు.
రాబోయే కొద్ది రోజుల్లో వివిధ కార్యాచరణ బృందాలు, కమిటీల సమావేశాలు, చర్చలతో ఈ వార్షిక మధ్యంతర సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా కింబర్లీ ప్రాసెస్ ధ్రువీకరణ పథకం అమలు, పర్యవేక్షణ, నిబంధనల అమలు యంత్రాంగాలు, సంప్రదాయ పద్ధతుల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాల వెలికితీత, గణాంకాలు, సహజ వజ్రాలకు సంబంధించి ప్రతి దశలోనూ విశ్వాసాన్ని బలోపేతం చేయడానికుద్దేశించిన చర్యలపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. ఈ వార్షిక మధ్యంతర సమావేశం 2026 మే 14 వరకు కొనసాగుతుంది.
సహజ వజ్రాల రంగంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లపై అభిప్రాయాలను పంచుకోవడానికి, నైతిక పద్ధతుల్లో సేకరించిన వజ్రాల పట్ల వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు అవసరమైన సమష్టి విధానాలపై చర్చించడానికి ఈ సమావేశం ఒక మంచి వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు.
కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు, కింబర్లీ ప్రాసెస్ భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ వజ్రాల మండలి సభ్యులు, పౌర సమాజ కూటమి సభ్యులు, సంబంధిత ఇతర వర్గాలు ఈ వార్షిక మధ్యంతర సమావేశంలో పాల్గొంటున్నారు.
2026 సంవత్సరానికి గాను భారత్ అధ్యక్షతన సాగుతున్న ఈ సమావేశాల ప్రధాన ఇతివృత్తం ‘3 సీ’ కేంద్రంగా సాగుతోంది. అవి విశ్వసనీయత (క్రెడిబిలిటీ), నిబంధనల అమలు (కాంప్లయెన్స్), వినియోగదారుల నమ్మకం (కన్స్యూమర్ కాన్ఫిడెన్స్). నిర్మాణాత్మక చర్చలు, అంతర్జాతీయ సహకారం ద్వారా.. బాధ్యతాయుత పద్ధతుల్లో సేకరించిన సహజ వజ్రాల వ్యాపార భవిష్యత్తును మరింత పటిష్టం చేయడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం 55/56 (2000)కు అనుగుణంగా కింబర్లీ ప్రాసెస్ ధ్రువీకరణ పథకాన్ని (కేపీసీఎస్) నెలకొల్పారు. సంఘర్షణలు లేదా అక్రమ మార్గాల్లో వెలికితీసిన వజ్రాలను చట్టబద్ధమైన వజ్ర వాణిజ్యంలోకి ప్రవేశించకుండా నిరోధించే లక్ష్యంతో ప్రారంభమైన అంతర్జాతీయ కార్యక్రమమిది. ప్రస్తుతం కింబర్లీ ప్రాసెస్లో 86 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 60 మంది భాగస్వాములున్నారు. ఇందులో ఐరోపా సమాఖ్య, దాని సభ్య దేశాలన్నీ కలిసి ఒకే కూటమిగా పాల్గొంటున్నాయి.
ప్రపంచ వజ్ర వ్యాపార రంగంలో బాధ్యతాయుత సేకరణ, పారదర్శకత, సుస్థిరతను బలోపేతం చేయడంలో నిబద్ధతను చాటుకుంటూ.. 2026 జనవరి 1న కింబర్లీ ప్రాసెస్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. వజ్రాల కటింగ్, వాటిని మెరుగుపెట్టడంలో ప్రపంచ అగ్రగామి కేంద్రాల్లో ఒకటిగా ఉన్న భారత్.. కింబర్లీ ప్రాసెస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పటికప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2260526)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3