ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సైబర్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్స్ కోసం ఎన్ఎఫ్ఎస్యూతో ఒప్పందం కుదుర్చుకున్న యూఐడీఏఐ
సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు, ఫోరెన్సిక్ పరిశోధన, సామర్థ్య నిర్మాణంతో
సహా ఆరు కీలకమైన విభాగాల్లో కుదిరిన భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
05 MAY 2026 4:41PM by PIB Hyderabad
డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ భద్రత, అధునాతన టెక్నాలజీ పరిశోధన విభాగాల్లో అయిదేళ్ల కాలానికి నిర్మాణాత్మక సహకారాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ (ఎన్ఎఫ్ఎస్యూ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
సహకారానికి ఒక సమగ్ర విధానాన్ని అందించడంతో పాటు భారత దేశ డిజిటల్ గుర్తింపు వ్యవస్థకు ఆధారమైన యూఐడీఏఐ డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం రెండు జాతీయ సంస్థలను ఒక్క చోట చేర్చింది.
యూఐడీఏఐ సీఈవో శ్రీ వివేక్ చంద్ర వర్మ, ఎన్ఎఫ్ఎస్యూ గుజరాత్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) ఎస్వో జునారే ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ అభిషేక్ కుమార్ సింగ్, రెండు సంస్థలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆరు వ్యూహాత్మక విభాగాలపై ఈ ఒప్పందం దృష్టి సారిస్తుంది. అవి విద్య-వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి, సమాచార భద్రత-వ్యవస్థ సమగ్రత, ఫోరెన్సిక్ మౌలిక వసతులు-ప్రయోగశాల సామర్థ్యం, సైబర్ భద్రత కార్యకలాపాలకు సాంకేతిక తోడ్పాటు, సాంకేతిక ఏఐ, బ్లాక్ చెయిన్, డీప్ ఫేక్ గుర్తింపు, క్రిప్టోగ్రాఫిక్ టెక్నాలజీ తదితర ఆధునిక రంగాల్లో సాంకేతిక సూచనలు-పరిశోధన, ఎన్ఎఫ్ఎస్యూ విద్యార్థులకు ఉద్యోగాలు, ఇతర అవకాశాలతో సహా వ్యూహాత్మక మార్గదర్శకత్వం.
‘‘భారత దేశ డిజిటల్ మౌలిక వసతులకు తోడ్పాటును అందించడంలో, భారత డిజిటల్ గుర్తింపు వ్యవస్థలను పరిరక్షించడంలో భద్రతను, స్థిరత్వాన్ని, ఫోరెన్సిక్ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా దీనిని భావించవచ్చు’’ అని యూఐడీఏఐ సీఈవో శ్రీ వివేక్ చంద్ర వర్మ అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2258168)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7