ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా నేటి నుంచి 10వ తేదీ (4 -10 మే 2026) వరకూ
అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
‘‘ఆరోగ్య కేంద్రాల్లో మంటల నుంచి సురక్ష’’... దేశవ్యాప్త ప్రతిజ్ఞా కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ సారథ్యం
‘ఆరోగ్య కేంద్రాల్లో అగ్ని, జీవన సురక్షల జాతీయ మార్గదర్శకాలు-2026’ ను ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ..
ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో సమగ్ర సురక్షా ప్రణాళికలు బలోపేతం
ఐసీయూలు, ఎన్ఐసీయూలు, పీఐసీయులతో పాటు ఆపరేషన్ థియేటర్ల వంటి అపాయం అధికంగా ఉండే చోట్ల మరిన్ని రక్షణ చర్యలతో కొత్త మార్గదర్శక సూత్రాలు
అగ్ని సురక్ష వారోత్సవంలో భాగంగా దేశవ్యాప్త పరిశీలన, ప్రయోగాత్మక అభ్యాసాలు, రక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు, ప్రదర్శనలతో పాటు సన్నద్ధతనీ, అవగాహననీ బలోపేతం చేసేందుకు వెబినార్లు
నాడు పోస్టు చేయడమైనది:
04 MAY 2026 12:56PM by PIB Hyderabad
దేశమంతటా అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాన్ని ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పాటిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమన్వమంతో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
‘‘ఆరోగ్య కేంద్రాల్లో అగ్ని ప్రమాదాల నివారణ’’ అంశంపై ప్రతిజ్ఞను స్వీకరించే కార్యక్రమాన్ని దేశం నలు మూలలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ నాయకత్వం వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా నివారణ చర్యలు అమలు చేయడం, ఒకవేళ ప్రమాదాలు జరిగితే ఆ సమయంలో వాటిని ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉండడం, తగిన ప్రణాళికలను అమలు పరచడం వంటి ఆలోచనలకు ఆచరణ రూపాన్ని ఇవ్వడంలో ఆస్పత్రులతోపాటు ఆసక్తిదారు వర్గాలు ఉమ్మడిగా కట్టుబడి ఉంటాయని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఈ సంవత్సరంలో అగ్ని ప్రమాద నివారణ వారోత్సవానికి ‘‘సేఫ్ స్కూల్స్, సేఫ్ హాస్పిటల్స్, అండ్ ఎ ఫైర్ సేఫ్టీ అవేర్ సొసైటీ: టుగెదర్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్’’ (సురక్షిత పాఠశాలలు, సురక్షిత ఆసుపత్రులతో పాటు సురక్ష జాగృతి కలిగిన సమాజం: అగ్ని ప్రమాదాల నివారణ బాటలో కలిసి నడుద్దాం)ను ఇతివృత్తంగా ఎంపిక చేసినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ తన ప్రసంగంలో వెల్లడించారు. ఈ ఇతివృత్తం మన సంస్థల్లో భద్రతను ఉమ్మడి, సామూహిక బాధ్యతగా చాటిచెబుతుందని ఆమె అన్నారు. ప్రస్తుత మౌలిక సదుపాయాలను పునస్సమీక్షించుకొనేందుకు, ఇప్పటి కేంద్రాల్లో రక్షణ ఉందా అని మదింపు చేసేందుకు, భర్తీ చేయాల్సిన లోపాలను, లోటుపాట్లను గుర్తించేందుకు ఒక అవకాశాన్ని ఫైర్ సేఫ్టీ వీక్ అందిస్తోందని శ్రీమతి శ్రీవాస్తవ తెలిపారు. సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తూ, అగ్ని ప్రమాదాల సమయంలో దీటుగా ప్రతిస్పందించడానికి ఆరోగ్య సంరక్షణ వృత్తి నిపుణులకు తగినంత శిక్షణనీ, జాగరూకతనీ అందించాలని ఆమె సూచించారు. అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు చేపడుతున్న చర్యల ఆడిట్ వివరాలను క్రమం తప్పకుండా ఐహెచ్ఐపీ పోర్టల్లో నిరంతరం పొందుపరుస్తూ ఉండాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలు సంబంధిత ప్రణాళికలను పాటించడాన్ని సంస్థాగతీకరిస్తాయనీ, భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటాయనీ ఆమె అన్నారు.
అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి రూపొందించిన ఐజీఓటీ పాఠ్యక్రమాన్ని ఇప్పటికే ప్రభుత్వ సంస్థలతో పాటు 50,000 కన్న ఎక్కువ మంది పూర్తి చేయడం సంతోషంగా ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్నారు. ఈ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతటా అగ్ని ముప్పు నుంచి తప్పించుకొనే ప్రణాళికలను పటిష్ఠపరచడంలో ప్రజలను భాగస్వాములను చేసినప్పుడు అర్థవంతమైన, నిరంతర ప్రభావాన్ని ప్రసరింప చేయగలమని చెబుతూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.
జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎమ్ఏ) సభ్యుడు, ప్రధానాధికారి శ్రీ కృష్ణ ఎస్. వత్స మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ప్రమాదం జరగడానికి ముందే అలాంటి వాటికి ఆస్కారాన్ని ఇవ్వకుండా తగిన జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సిన, కొన్ని పటిష్ఠ వ్యవస్థలను నెలకొల్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన అన్నారు. ఈ దిశగా అయిదు ప్రాంతీయ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఎన్డీఎమ్ఏ ఆలోచిస్తోందని, ఇదే రకం కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ చేపట్టి సామర్థ్యంతో పాటు సన్నద్ధతను పెంచుతారని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు ఆడిట్ల నిర్వహణ కోసం స్వీయ ప్రమాణీకరణ యంత్రాంగాలను ఏర్పాటు చేయడం ముఖ్యమనీ, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిరంతర జాగృతి కార్యక్రమాలను అమలు చేస్తుండాలనీ ఆయన అన్నారు. ఆసుపత్రి స్థాయిలో సన్నాహక చర్యలను రూపొందించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన సూచించారు. మంటలు చెలరేగిన సమయాల్లో ప్రతిస్పందించగలిగే సుశిక్షితులైన ఆరోగ్య సంరక్షణ వృత్తినిపుణులు ప్రతి ఆసుపత్రిలో ఉండాలనీ, ఒకవేళ మంటలు వ్యాపిస్తే అక్కడి నుంచి రోగులను, వారి బంధువులను ఆసుపత్రి నుంచి బయటకు పంపించే పద్ధతులను స్పష్టంగా పేర్కొనడంతో పాటు ఆ పద్ధతులను తరచు ప్రయోగపూర్వకంగా అమలు చేయడం మరీ మంచిదనీ ఆయన అన్నారు.
ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అగ్ని నుంచి రక్షణ దిశగా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలతో పాటు నిర్దిష్ట విధానాన్నంటూ కలిగివుండడం అత్యంత ప్రధాన అంశమని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ శ్రీ సునీల్ కుమార్ ఝా తెలిపారు. ఆసుపత్రుల పరిసరాలు ఎంతో కీలకమైనవీ, జటిలమైనవీ అని ఆయన చెబుతూ, అక్కడ జరిగే చిన్న చిన్న లోపాలు కూడా తీవ్ర పర్యవసానాలకు దారితీయవచ్చంటూ హెచ్చరిక చేశారు. భద్రత నియమావళి, క్రమం తప్పక ఆడిట్లు, సామర్థ్యాన్ని పెంపొందించుకొనే విధానాలు.. వీటిని తూచా తప్పక పాటించాల్సిన అవసరం ఉందనీ, అగ్ని ప్రమాదాలను నివారించాలన్నా, అత్యవసర స్థితిలో దీటుగా ప్రతిస్పందించాలన్నా సన్నద్ధత, సమన్వయం, నిరంతర నిఘా కీలకమనీ ఆయన వివరించారు.
ఈ సందర్బంగా, ‘ఆరోగ్య కేంద్రాల్లో అగ్ని, జీవన సురక్షల జాతీయ మార్గదర్శకాలు-2026’ ను మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ మార్గదర్శకాల్ని ఆసుపత్రుల్లో మంటల నుంచి రక్షణ కోసం దృఢతర, సమగ్ర ప్రణాళికను నిర్ధారించడానికి అనేక ప్రధాన సంస్థలకు, ఆసుపత్రులకు చెందిన నిపుణులతో విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపిన తరువాత రూపొందించారు.
ఈ మార్గదర్శక సూత్రాల్లో పరిపాలన ప్రణాళికలు, రిస్క్ అంచనా, నివారణ, మౌలిక సదుపాయాల కల్పన, అత్యవసర స్థితిలో అనుసరించదగ్గ ప్రతిస్పందన వ్యవస్థలు, ఆరోగ్యసంరక్షణ సిబ్బందికి శిక్షణ, వారి సామర్థ్యాల పెంపుదల, నియమ పాలన యంత్రాంగాల ఏర్పాటు, అవగాహన కలిగించడం సహా అనేక కీలక కోణాలను పొందుపరిచారు. వీటిలో అతి కఠినమైన సురక్ష ప్రోటోకాల్స్ను పాటించడం తప్పనిసరైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూలు), అప్పుడే పుట్టిన శిశువులకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఎన్ఐసీయూలు), పిల్లల కోసం ఉద్దేశించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (పీఐసీయూలు), ఆపరేషన్ థియేటర్లు (ఓటీ) వంటి అధిక రిస్కుతో కూడిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన తాజా నిబంధనలు కూడా ఉన్నాయి.
ఆరోగ్య సంరక్షణ సదుపాయాల్లో అగ్నికి సంబంధించిన ప్రమాదాలను అడ్డుకోవడానికీ, నివారణకీ అవగాహనను పెంచడంతో పాటు సంస్థాగత సన్నాహకాలను బలోపేతం చేసే ఉద్దేశంతో అగ్ని సురక్ష వారోత్సవం కాలంలో దేశమంతటా అనేక విధాలైన కార్యకలాపాలకు పథక రచన చేశారు. జాతీయ స్థాయిలో ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమానికి అదనంగా, సువ్యవస్థిత అగ్ని సురక్ష ఆడిట్, మాక్ డ్రిల్, అగ్ని ప్రమాద గుర్తింపు, మంటలను ఆర్పేందుకు ప్రణాళికలను ప్రత్యక్షంగా ప్రదర్శించడం, రోగులను ఆసుపత్రి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలించడం, అత్యుత్తమ కార్యప్రణాళికలు, సాంకేతిక జ్ఞాన వ్యాప్తికి ఉద్దేశించిన టెక్నికల్ వెబినార్లను ఏర్పాటు చేయడం కూడా ప్రతిపాదిత కార్యకలాపాల్లో కలిసి ఉన్నాయి.
ప్రభావవంతమైన కార్యాచరణకు పూచీ పడడం కోసం ఒక అత్యంత తాజా, విస్తృత చెక్ లిస్టును కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించింది. ఆ చెక్లిస్టులో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలూ కఠోర అగ్ని, విద్యుత్తు సురక్ష సంబంధిత ఆడిట్లను పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లక్షిత వర్గాలను ఉద్దేశించి చైతన్య ప్రచార ఉద్యమాన్ని.. విశేషించి, వైద్య కళాశాలలు, పెద్ద మూడో శ్రేణి సంరక్షణ సంస్థల్లో నిర్వహించేటట్లు ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాల్లో పోస్టర్ రూపకల్పన, ప్రశ్న-జవాబుల పోటీల నిర్వహణ, అగ్ని ప్రమాదాల జాడ కనిపెట్టడం, అగ్నిమాపక పరికరాలు, ప్రణాళికలను అత్యుత్తమంగా ఉపయోగించడమెలాగో ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా తెలియజెప్పడం వంటి చర్యలు భాగంగా ఉన్నాయి. సురక్షకు సంబంధించిన విషయాలపై చైతన్యాన్ని ఆరోగ్య సంరక్షణ రంగ నిపుణులతో పాటు విద్యార్థులు కూడా అలవరుచుకొనే సంస్కృతిని ఈ కార్యక్రమాలతో పెంపొందించవచ్చు.
వారం రోజుల పాటు ఈ ఉత్సవంలో చురుకుగా పాలుపంచుకొని, నిర్దేశిత మార్గదర్శకాలను వాటి సరైన అర్థంలో అనుసరించాల్సిందిగా ఆసక్తిదారులందరికీ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా రోగులు, సంరక్షకులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని ఒక సురక్షితన, ధీర, ప్రతిస్పందనపూర్వక స్వాస్థ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను ఏర్పరచాలన్నది ఈ మార్గదర్శకాల అంతిమ లక్ష్యం.
‘ఆరోగ్య కేంద్రాల్లో అగ్నిప్రమాదాలు- జాతీయ మార్గదర్శకాలు-2026’ ను ఈ కింది వెబ్ చిరునామాలోకి వెళ్లి, తెలుసుకోవచ్చు:
https://www.mohfw-dohfw.gov.in/static/uploads/2026/05/62dc36c7ac9aeedefb0e969de50686d1.pdf
***
(రిలీజ్ ఐడి: 2257861)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11