పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం
నిన్న 50.8 లక్షలకు పైగా దేశీయ ఎల్పీజీ సిలిండర్లు, 73,000కు పైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల పంపిణీ
ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు రోజుకు 353 మెట్రిక్ టన్నులకు చేరుకున్న ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల సగటు ఆటో ఎల్పీజీ విక్రయాలు
2026 జనవరి నుంచి ఫిబ్రవరి నెలల్లో ఉన్న సుమారు 177 మెట్రిక్ టన్నుల సగటుతో పోలిస్తే ఇది సుమారు 100 శాతం పెరుగుదల
పెట్రోలు, డీజిలు రిటైల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. దేశంలోని అన్ని పెట్రోలు పంపుల వద్ద అందుబాటులో తగినంత నిల్వలు
సముద్ర కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూడటానికి, షిప్పింగ్ ద్వారా ఎగుమతి, దిగుమతులను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలపై ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సమీక్ష
ఇప్పటి వరకు భారతీయ పౌరులను భూమార్గాల ద్వారా ఇరాన్ నుంచి సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహకరించిన టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం
నాడు పోస్టు చేయడమైనది:
29 APR 2026 5:42PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని అందించే చర్యలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జాతీయ మీడియా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- విమానయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు.. ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతున్న సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడడానికి తీసుకుంటున్న చర్యలపై తాజా సమాచారాన్ని అందించారు.
ఇంధన సరఫరా, లభ్యత
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ.. ఇంధన సరఫరా విషయంలో ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాలు:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.
· వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.
· ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లవద్దని కోరారు.
· పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
· ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్పీజీ, గృహావసరాల పీఎన్జీ, రవాణా సీఎన్జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
· వాణిజ్య ఎల్పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.
· ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
· ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడానికి, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· పెట్రోలు, డీజిలు, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది.
· పౌరులకు తగినంత ఇంధన లభ్యత గురించి భరోసా ఇవ్వడానికి చురుకైన ప్రజా సమాచార ప్రసార ఆవశ్యకతను భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల నాటి లేఖల ద్వారా స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 02.04.2026న (ఎమ్వోపీఎన్జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (ఎమ్వోపీఎన్జీ కార్యదర్శి, సమాచార-ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శుల సంయుక్త అధ్యక్షతన) సమావేశాలు నిర్వహించారు. వాటిలో ఈ కింది విషయాలను స్పష్టం చేశారు:
· రోజువారీ పత్రికా సమావేశాలు నిర్వహించడం, ప్రజలకు నిరంతర సూచనలు జారీ చేయడం.
· సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించి, ఎదుర్కోవడం.
· జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు చర్యలను ముమ్మరం చేయడం, ఓఎమ్సీల సమన్వయంతో సోదాలు, తనిఖీలను కొనసాగించడం.
· తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం
· రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్కేవో కోసం ఎస్కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
· పీఎన్జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
· ముఖ్యంగా గృహావసరాల కోసం ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యమివ్వడం, సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి లక్ష్యానికి అనుగుణంగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల పంపిణీని చేపట్టడం.
· అక్రమ నిల్వలు, మార్కెటింగ్ను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్లను, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
· అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 22000 పైగా సోదాలు నిర్వహించారు.
· దేశవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలు బలోపేతం చేసి నిరంతరం వాటిని కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 325 ఎల్పీజీ పంపిణీదారులకు జరిమానా విధించగా, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 72 సంస్థలను సస్పెండ్ చేశారు.
· నిన్న ఒక్కరోజే 54 మంది ఎల్పీజీ పంపిణీదారులకు షో కాజ్ నోటీసులు జారీ చేయగా, 9 పంపిణీ సంస్థలకు జరిమానాలు విధించారు.
ఎల్పీజీ సరఫరా
· గృహాలకు ఎల్పీజీ సరఫరా స్థితి:
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరా ప్రభావితమవుతూనే ఉంది.
· గృహాలకు ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత కొనసాగుతోంది.
· ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో సరఫరా నిలిచిపోయినట్లు ఎటువంటి నివేదికలు లేవు.
· నిన్న పరిశ్రమ ప్రాతిపదికన ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 98 శాతానికి పెరిగాయి.
· సిలిండర్లు పక్కదారి పట్టకుండా అరికట్టడానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలు సుమారు 93 శాతానికి పెరిగాయి. వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు డీఏసీ అందుతోంది.
· 28.04.2026న 50.8 లక్షల కంటే ఎక్కువ దేశీయ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
· 10 శాతం సంస్కరణ-అనుసంధాన కేటాయింపులు సహా, మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును సంక్షోభానికి ముందు స్థాయిల్లో సుమారు 70 శాతానికి పెంచారు.
· 06.04.2026 తేదీ నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ఇలా తెలియజేసింది... 21.03.2026 తేదీ నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి, 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు చేసిన సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ఆధారంగా ప్రతి రాష్ట్రంలో వలస కార్మికులకు పంపిణీ చేయడానికి అందుబాటులో ఉన్న 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహాయంతో తమ రాష్ట్రంలోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయడానికి ఈ 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి.
· 2026 ఫిబ్రవరి నెలలో మొత్తం 21.7 లక్షల 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 21.05 లక్షల 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· నిన్న దేశవ్యాప్తంగా 73,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· 3 ఏప్రిల్ 2026 నుంచి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల కోసం 9,550 కంటే ఎక్కువ అవగాహన శిబిరాలను నిర్వహించాయి. వీటిలో 1,59,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· నిన్న, 175 శిబిరాల ద్వారా 2,759-5కేజీల ఎఫ్టీఎల్లు అమ్ముడయ్యాయి.
· రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్పీజీ పంపిణీకి ప్రణాళిక రూపొందించడం కోసం ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ రాష్ట్ర అధికారులు, పరిశ్రమ సంస్థలతో సమన్వయం చేస్తోంది.
· 2026 ఏప్రిల్లో (28.04.26 వరకు) మొత్తం 1,84,043 మెట్రిక్ టన్నులు (ఇది 96.86 లక్షలకు పైగా 19 కేజీల ఎల్పీజీ సిలిండర్లకు సమానం) వాణిజ్య ఎల్పీజీ అమ్ముడైంది.
· 28.04.2026 తేదీన 8838 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ (4.65 లక్షలకు పైగా 19 కిలోల సిలిండర్లకు సమానం) అమ్ముడైంది.
· ఏప్రిల్ నెలలో (28.04.2026 వరకు) ఆటో ఎల్పీజీ విక్రయాలు 9,880 మెట్రిక్ టన్నులకు పైగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2026 నెలలో జరిగిన సుమారు 5,000 మెట్రిక్ టన్నుల విక్రయాలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల.
· ప్రభుత్వ రంగ చమురు సంస్థల (పీఎస్యూ ఓఎంసీఎస్) ద్వారా ఏప్రిల్-26లో (28.04.26 వరకు) సగటు ఆటో ఎల్పీజీ విక్రయాలు రోజుకు సుమారు 353 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున రోజుకు ఉన్న 177 మెట్రిక్ టన్నులతో పోలిస్తే, ప్రభుత్వ రంగ సంస్థల ఆటో ఎల్పీజీ అమ్మకాల్లో ఇది సుమారు 100 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తోంది.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
డీ-పీఎన్జీ, సీఎన్జీ-రవాణాకు 100 శాతం సరఫరాలతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఎరువుల కర్మాగారాలకు కేటాయించే మొత్తం గ్యాస్ను, వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.
అదనంగా, సీజీడీ నెట్వర్క్ల ద్వారా జరిగే సరఫరాలు సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి సీజీడీ సంస్థలు తమ అన్ని జిఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.
ఐజీఎల్, ఎమ్జీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
సీజీడీ నెట్వర్క్ల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.
పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తేదీ 24.03.26 నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేయడానికి, 'తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధాన ప్రణాళిక'ను 3 నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తోంది.
24.03.2026 తేదీ గల గెజిట్ ద్వారా భారత ప్రభుత్వం... నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను జారీ చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్లైన్లను వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తుంది. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, స్వచ్ఛమైన ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.
పరిశుద్ధమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం, సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు, వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.
ఎమ్వోఈఎఫ్సీసీ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా... సీజీడీ నెట్వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్పీసీబీ, పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.
మార్చి 2026 నుంచి, సుమారు 5.69 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాసిఫికేషన్ పూర్తయింది. అదనంగా 2.65 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 8.34 లక్షలకు చేరింది. కొత్త కనెక్షన్ల కోసం సుమారు 6.37 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
28.04.2026 వరకు, 42,950 కంటే ఎక్కువ మంది పీఎన్జీ వినియోగదారులు MYPNGD.in వెబ్సైట్ ద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పనిచేస్తుండగా... పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా నిర్వహిస్తున్నారు.
గృహ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
దేశీయ మార్కెట్కు పెట్రోకెమికల్ ఫీడ్స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ధారించిన విధంగా కీలక రంగాలకు సీ3 & సీ4 స్ట్రీమ్ల నిర్దిష్ట కనీస పరిమాణాలను అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం 01.04.2026 తేదీ నాటి ఉత్తర్వు ద్వారా పెట్రోకెమికల్ కాంప్లెక్స్లతో సహా ఆయిల్ రిఫైనరీ కంపెనీలను అనుమతించింది.
ఫార్మాస్యూటికల్స్ విభాగం, రసాయనాలు-పెట్రో కెమికల్స్ విభాగం, పరిశ్రమలకు ప్రోత్సాహం-అంతర్గత వాణిజ్య విభాగం ద్వారా అందిన అభ్యర్థనల ఆధారంగా... ఫార్మా, రసాయన రంగ కంపెనీలకు ఎల్పీజీ పూల్ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల కేటాయింపు చేశారు.
9 ఏప్రిల్ 2026 నుంచి ముంబయి, కొచ్చి, వైజాగ్, చెన్నై, మధుర రిఫైనరీలు రసాయన, ఫార్మా, పెయింట్ పరిశ్రమలకు 8900 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలిన్, 950 మెట్రిక్ టన్నులకు పైగా బ్యూటైల్ అక్రిలేట్ను విక్రయించాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల సంబంధిత చర్యలు
దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్లెట్లు యధావిధిగా పనిచేస్తున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసింది. వినియోగదారులను అధిక ధరల నుంచి ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి, భారత ప్రభుత్వం 11.04.2026 తేదీ నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.50కు, ఏటీఎఫ్పై లీటరుకు రూ. 42కు పెంచింది.
వదంతుల కారణంగా కొన్ని రిటైల్ అవుట్లెట్లలో భయాందోళనతో కొనుగోళ్లు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పీఎస్యూ ఓఎంసీల రిటైల్ అవుట్లెట్లలోనూ ధరల పెంపు లేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించారు.
18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా... హిమాచల్ ప్రదేశ్, లదాఖ్లు దీని అవసరం లేదని తెలియజేశాయి.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న నౌకా వాణిజ్య పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో కింది విషయాలను పేర్కొన్నది:
సులభమైన నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడానికి, నౌకాయానం ద్వారా ఎగుమతి-దిగుమతులను సులభతరం చేయడం కోసం ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ... పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ... విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్... ఎరువుల శాఖ తీసుకున్న చర్యలను ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖా మంత్రి సమీక్షించారు.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన జరగలేదు.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారం: ప్రారంభమైనప్పటి నుంచి ఈ కంట్రోల్ రూమ్ 8034 కాల్లు, 17,114 కంటే ఎక్కువ ఈమెయిళ్లను నిర్వహించింది. గత 24 గంటల్లో, 114 కాల్లు, 276 ఈమెయిళ్లూ అందాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా, గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో స్వదేశానికి వచ్చిన 29 మందితో సహా, ఇప్పటివరకు 2,829 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి మంత్రిత్వ శాఖ సౌకర్యం కల్పించింది.
దేశవ్యాప్తంగా పోర్ట్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కింది విషయాలను తెలియజేసింది:
మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ భారత పౌరులు, వారి కుటుంబాల సందేహాలకు సమాధానమివ్వడానికి నిరంతరం పనిచేస్తోంది.
సమాచార మార్పిడి, కృషిని మరింత మెరుగ్గా సమన్వయం చేసుకోవడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు సకాలంలో సహాయం అందించడానికి ఇరవై నాలుగు గంటలూ పనిచేసే హెల్ప్లైన్లను నిర్వహిస్తున్నాయి. మన పౌరులకు చురుగ్గా సహాయం అందిస్తున్నాయి. అవి స్థానిక ప్రభుత్వాలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి.
స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారత పౌరుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచారం సహా తాజా సూచనలను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.
భారతీయ మిషన్లు స్థానిక భారతీయ పౌరులతో చురుగ్గా మమేకమై ఉన్నాయి. వారి సమస్యలను పరిష్కరించడం కోసం వారు భారతీయ పౌర సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన నిపుణుల బృందాలు, భారతీయ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. భారతీయ మిషన్లు స్థానిక అధికారులు, ఏజెన్సీలతో సమన్వయం చేయడం, కాన్సులర్ సహాయం అందించడం, స్వదేశానికి తిరిగి రావాలనే అభ్యర్థనలకు సహాయం చేయడం సహా వారికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నాయి.
ఈ ప్రాంతం నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తం విమానయాన పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది.
యూఏఈలోని విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా యూఏఈ-భారత్ మధ్య పరిమిత వాణిజ్య విమానాలను నడపడం కొనసాగిస్తున్నాయి. ఈ రోజు యూఏఈ-భారత్ మధ్య సుమారు 110 విమానాలు నడుస్తాయని అంచనా.
సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, ఖతార్ ఎయిర్వేస్ భారత్లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలూ త్వరలో ఖతార్ నుంచి భారత్కు విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నాయి.
కువైట్ గగనతలం తెరుచుకుంది. జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ సంస్థలు కువైట్ నుంచి భారత్కు పరిమిత విమాన కార్యకలాపాలను పునఃప్రారంభించాయి.
బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో సంస్థలూ త్వరలో బహ్రెయిన్ నుంచి భారత్కు విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నాయి.
ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలతో ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. దీనిని భారత్కు తిరిగి వచ్చే ప్రయాణం కోసం ఉపయోగించుకోవచ్చు.
ఇరాన్ గగనతలం సరుకు రవాణా, చార్టర్డ్ విమానాల కోసం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్కు ప్రయాణించకుండా ఉండాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారత రాయబార కార్యాలయం మద్దతుతో భూ సరిహద్దు మార్గాల ద్వారా తిరిగి వెళ్లాలని కోరడమైనది. ఇప్పటివరకు, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,464 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్ళడానికి సౌకర్యం కల్పించింది.
ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. వీటిని భారత్కు తిరిగి రావడం కోసం ఉపయోగించుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2256785)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7