ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
28 APR 2026 7:34PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులోని నా సహచరులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు, ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యులు, యూపీ బీజేపీ అధ్యక్షులు శ్రీ పంకజ్ చౌదరి గారు, జిల్లా పంచాయత్ చైర్పర్సన్ సోదరి పూనం మౌర్య గారు, వేదికపై ఉన్న కాశీ నగర మహిళా కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసిన నా తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలు అందరికీ నమస్కారం.
మిత్రులారా,
మన కాశీ నగరం... మాతా శృంగార గౌరీ, మాతా అన్నపూర్ణ, మాతా విశాలాక్షి, మాతా సంకట, మాతా గంగా వంటి దివ్య శక్తుల నిలయం. ఈ పవిత్ర ప్రదేశంలోని సోదరీమణులారా, ఆడబిడ్డలారా... మీ అందరితో ఈ సమావేశం ఈ సందర్భాన్ని అత్యంత దివ్యంగా మార్చింది. కాశీ నేల మీద నుంచి... తల్లులకు, సోదరీమణులకు, ఆడబిడ్డలకు అందరికీ నేను నమస్కరిస్తున్నాను.
మిత్రులారా,
ఈనాటి సందర్భం నిజంగా మహిళా శక్తిని గౌరవించి, అభివృద్ధి చేసే ఒక వేడుక. కొద్దిసేపటి కిందటే ఇక్కడ వేల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశాం. వీటిలో కాశీ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సంబంధించిన ప్రాజెక్టులూ ఉన్నాయి. దీంతో పాటుగా కాశీ-అయోధ్యల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచే పనులూ జరుగుతున్నాయి. కొద్దిసేపటి కిందటే రెండు అమృత్ భారత్ రైళ్లనూ ప్రారంభించాం. కాశీ నుంచి పూణేకు, అయోధ్య నుంచి ముంబయికి నడిచే ఈ రెండు అమృత్ భారత్ రైళ్లు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇప్పుడు ముంబయి-పూణే ప్రజలకు, యావత్ మహారాష్ట్ర ప్రజలకూ అయోధ్య ధామ్, కాశీ విశ్వనాథ ధామ్లను చేరుకోవడానికి మరో ఆధునిక మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు నా అభినందనలు.
మిత్రులారా,
దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే యాత్ర నిరంతరం కొనసాగుతూనే ఉంది. నేను అభివృద్ధి చెందిన భారత్ గురించి మాట్లాడినప్పుడు, దానికి అత్యంత బలమైన మూలస్తంభం భారత మహిళా శక్తి. ఈ నాటి ఈ కార్యక్రమంలో, ఒక గొప్ప యజ్ఞం ప్రారంభం కోసం మన సోదరీమణులు, ఆడబిడ్డలందరి ఆశీస్సులు కోరడానికి నేను ఇక్కడకు వచ్చాను. కాశీ పార్లమెంట్ సభ్యునిగా, దేశ ప్రధానమంత్రిగా ఒక పెద్ద జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి మీ ఆశీస్సులు కావాలి. ఆ పెద్ద లక్ష్యమేంటంటే - లోక్సభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయడం. కొద్ది రోజుల కిందటే ఎస్పీ, కాంగ్రెస్ వంటి పార్టీల కారణంగా పార్లమెంటులో మన ప్రయత్నం విజయవంతం కాలేదు. కానీ సోదరీమణులారా... మీ రిజర్వేషన్ హక్కు అమలయ్యేలా చూడటానికి నేను నా శాయశక్తులా కృషి చేస్తానని మీకు మరోసారి హామీ ఇస్తున్నాను.
మిత్రులారా,
ఇంట్లో స్త్రీకి సాధికారత లభించినప్పుడు, కుటుంబం మొత్తం బలపడుతుంది. సమాజం బలపడుతుంది. దేశం బలపడుతుంది. గతంలో అక్కాచెల్లెళ్లు, కుమార్తెలూ అనుకున్నది చేయడం కోసం ఎంతో పోరాడవలసి వచ్చింది. కాశీ సోదరీమణులైన మీరూ ఎన్నో కష్టాలను చూశారు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మన ఆడబిడ్డలు తరచుగా ఇలాంటి ఎన్నో ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చేది. ఇది చేసి నువ్వేం చేస్తావ్? నీకేం అవసరం? నువ్వేం చేస్తావ్, నీకేం అవసరం, నోరుమూయ్, ఈ పని నువ్వు చేయలేవు. ఇలా చాలాసార్లు కనీసం ఎలాంటి ప్రశ్నలు కూడా అడగకుండానే, ఇది నీ పని కాదు అని నేరుగా ఆజ్ఞలు జారీ చేసేవారు.
మిత్రులారా,
ఇలాంటి పరిస్థితులు కేవలం కాశీ సోదరీమణులకే పరిమితం కాలేదు. దేశంలోని చాలా మంది సోదరీమణులు, ఆడబిడ్డలు ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నారు. దీనిని సహజమైనదిగా భావించేవారు. అందుకే 25 సంవత్సరాల కిందటే నేను గుజరాత్ ముఖ్యమంత్రిని అయినప్పుడు... అలాంటి భావనలను దూరం చేయడం కోసం మొదటగా ప్రయత్నించాను. ఆ సమయంలో ఆడబిడ్డల కోసం రెండు పెద్ద పథకాలను ప్రారంభించాం. ఒకటి - 'శాల ప్రవేశోత్సవ్'... అంటే బాలికలను పాఠశాలల్లో చేర్పించడం, తద్వారా ఆడబిడ్డలు ఎక్కువ సంఖ్యలో పాఠశాలలో చేరేలా, మధ్యలో చదువు మానేయకుండా చూడటం. రెండోది - 'ముఖ్యమంత్రి కన్యా కేలవాణి నిధి'... ఆడబిడ్డలకు చదువు కోసం ఫీజుల విషయంలో సహాయం చేయడం.
మిత్రులారా,
అప్పటి నుంచి నేటి వరకూ, మా ప్రభుత్వ విధానాల్లో మహిళా సంక్షేమానికి నిరంతరం అత్యధిక ప్రాధాన్యం కొనసాగిస్తూనే ఉన్నాం. 2014లో మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు మీరు ఇచ్చినప్పుడు... దేశంలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు అంటే “ఇజ్జత్ ఘర్లు” నిర్మించాం. 30 కోట్లకు పైగా సోదరీమణులకు బ్యాంకు ఖాతాలు అందించాం. 2.5 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లూ అందించాం. 12 కోట్లకు పైగా ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందింది. అంటే, అనేక పెద్ద పథకాల్లో సోదరీమణులను, ఆడబిడ్డలను ప్రధాన లబ్దిదారులుగా ఉంచాం.
మిత్రులారా,
రెండు సంవత్సరాల కిందట ఇక్కడే బనారస్లో సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఒక భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఆ సమయంలో కేవలం ఒక నెలలోనే ఇక్కడ కాశీలో 27 వేల మంది ఆడబిడ్డలకు సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిచారు. ప్రతి ఆడబిడ్డ బ్యాంకు ఖాతాలోకి 300 రూపాయలు బదిలీ చేశాం. ఆడబిడ్డల చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పథకం ఆడబిడ్డల చదువులను బలోపేతం చేయగా, ముద్రా యోజన వారి సంపాదనకు భరోసా కల్పించింది. మాతృ వందన యోజన, ఆయుష్మాన్ భారత్ యోజనలు సోదరీమణులు, ఆడబిడ్డల వైద్య అవసరాలను తీర్చాయి.
మిత్రులారా,
విద్య, సంపాదన, సరసమైన ధరలకు మందులతో పాటు... తొలిసారిగా కోట్లాది మంది సోదరీమణులు తమ పేర్ల మీద ఆస్తులను నమోదు చేయించుకున్నారు. పీఎం ఆవాస్ యోజన కింద చాలా ఇళ్లు సోదరీమణుల పేర్ల మీదే ఉన్నాయి. ఈ రోజు మన తల్లులు, సోదరీమణులు నిజంగా తమ సొంత ఇళ్లకు యజమానులయ్యారు.
మిత్రులారా,
మా ప్రభుత్వం పూర్తి దృష్టి సోదరీమణుల సౌకర్యం, భద్రతపైనే ఉంది. ఈ రెండే సాధికారతకు పునాదిని బలోపేతం చేస్తాయి. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు ఎలా మారాయో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట, ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు... ఆడపిల్లలు కనీసం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం హాయాంలో ఆడపిల్లల పట్ల దురభిప్రాయాలు ఉన్నవారికి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో బాగా తెలిసివచ్చింది.
మిత్రులారా,
సోదరీమణులు, ఆడబిడ్డల భద్రతకు భారతీయ న్యాయ సంహిత కొత్త భరోసాను కల్పించింది. దీని కింద, మహిళలపై జరిగే తీవ్రమైన నేరాల విషయంలో తీర్పులు వేగంగా వెలువడుతున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్లు, కౌన్సెలింగ్ కేంద్రాల నెట్వర్క్ నిరంతరం విస్తరిస్తోంది. ఈ రోజు ఇక్కడ మహిళా పోలీస్ అవుట్పోస్ట్, కౌన్సెలింగ్ కేంద్రం కోసం భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇటువంటి చర్యలు ఆడబిడ్డల భద్రతకు భరోసానిస్తాయి.
మిత్రులారా,
మహిళలు ఆర్థికంగా శక్తిమంతమైనప్పుడు, ఇంట్లో వారి మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది. అందుకే వారికి సౌకర్యం, భద్రత కల్పించడంతో పాటు... సోదరీమణుల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడంపైనా మేం దృష్టి సారించాం. గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది సోదరీమణులను స్వయం సహాయక బృందాలతో అనుసంధానించాం. కాశీలోనే సుమారు 1.25 లక్షల మంది సోదరీమణులు ఇటువంటి బృందాలతో అనుసంధానమై ఉన్నారు. ఈ బృందాలు లక్షల రూపాయల సహాయాన్ని అందుకుంటున్నాయి. దీని ద్వారా సోదరీమణులు తమ పనులను చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఇప్పటికే 3 కోట్ల మంది సోదరీమణులు “లక్పతి దీదీలు”గా మారారు. వీరిలో బనారస్కు చెందిన వేలాది మంది సోదరీమణులూ ఉన్నారు.
మిత్రులారా,
లక్పతి దీదీ ఉద్యమానికి ఊపునివ్వడంలో మన పాడి రంగం పాత్ర కీలకమైనది. ఇక్కడ, బనస్కాంత డెయిరీతో అనుబంధం ఉన్న లక్షలాది మంది సోదరీమణులు అద్భుతమైన కృషి చేస్తున్నారు. ఈ రోజు ఈ సోదరీమణులు నేరుగా 106 కోట్ల రూపాయల బోనస్ను అందుకున్నారు. ఈ సోదరీమణులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కాశీలోని పాడి రంగంతో అనుబంధం ఉన్న మహిళలకు నేను చెప్పేది ఏంటంటే - ఇది ఆరంభం మాత్రమే, బనారస్ ఎదుగుతోంది, బనస్కాంత డెయిరీ ఎదుగుతోంది, ఈ బోనస్ కూడా పెరుగుతూనే ఉంటుంది.
మిత్రులారా,
బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం సోదరీమణులను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తూనే, అభివృద్ధి చెందిన భారత్ సాధన ప్రయాణానికి నాయకత్వం వహించే అవకాశాలను వారికి కల్పిస్తోంది. డిజిటల్ చెల్లింపుల పురోగతిలో వేలాది మంది 'బ్యాంక్ సఖీలు' కీలక పాత్ర పోషిస్తున్నారు. భీమా సంబంధిత పనుల్లో 'బీమా సఖీలు' ముందున్నారు. ప్రకృతి వ్యవసాయ పురోగతిలో 'కృషి సఖీలు' కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వ్యవసాయ రంగంలో వస్తున్న డ్రోన్ విప్లవంలో మన 'నమో డ్రోన్ దీదీలు' ముందున్నారు. గత దశాబ్ద కాలంలో సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ మన ఆడబిడ్డలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. తొలిసారిగా సైనిక్ పాఠశాలలు, రక్షణ అకాడమీల్లోనూ ఆడబిడ్డలకు ప్రవేశం లభిస్తోంది. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం మహిళా సాధికారత, మహిళల అభ్యున్నతి, మహిళల జీవితాలను సులభతరం చేయడం.
మిత్రులారా,
నేడు ప్రతి రంగంలోనూ మన ఆడబిడ్డలు అద్భుతంగా రాణిస్తున్నారు. కాబట్టి సహజంగానే, దేశ భవిష్యత్తుకు సంబంధించిన విధాన రూపకల్పన, నిర్ణయాల్లో సోదరీమణులు, ఆడబిడ్డల పాత్ర మరింత పెరగాలి. ఈ రోజు దేశానికి ఇది చాలా అవసరం. దీని కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. కొత్త పార్లమెంటును నిర్మించడం వెనక ఉన్న ఒక పెద్ద కారణం... మహిళల భాగస్వామ్యం పెంచే ఆలోచనే. కొత్త పార్లమెంటును నిర్మించినప్పుడు, మేం చేసిన మొదటి పని మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం. 40 సంవత్సరాలుగా మన సోదరీమణుల ఈ హక్కు అక్కడే నిలిచిపోయి, అటకెక్కింది. అందువల్ల, 2023లో మేం పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియమ్ను ఆమోదింపజేశాం.
మిత్రులారా,
ఒక చట్టం చేసిన తర్వాత దానిని అమలు చేయడం అవసరం. ఇప్పుడు ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవలే పార్లమెంటులో దీనిపై చర్చ జరిగింది. మేం రాజ్యాంగ సవరణ కోసం ఒక చట్టాన్ని తీసుకువచ్చాం. ఈ సవరణ వల్ల మరింత మంది మహిళలు శాసనసభలకు, పార్లమెంటుకూ చేరేవారు.
మిత్రులారా,
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు దేశ మహిళలకు మరోసారి ద్రోహం చేశాయి. ఇలాంటి పార్టీలు 40 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ను అడ్డుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ మరోసారి దీనికి అడ్డుపడింది.
మిత్రులారా,
అసలు విషయం ఏమిటంటే... ఈ కుటుంబ ఆధారిత, బుజ్జగింపు ధోరణి గల పార్టీలన్నీ మహిళా శక్తికి, మీ అందరికీ భయపడుతున్నాయి. కళాశాల ప్రాంగణాల నుంచి పంచాయతీలు, స్థానిక సంస్థల వరకూ ప్రతిచోటా తమ సొంత శక్తితో నాయకత్వం వహిస్తున్న దేశపు ఆడబిడ్డలు శాసనసభలకు, పార్లమెంటుకు చేరుకోవడం ఈ కుటుంబ ఆధారిత పార్టీలకు ఇష్టం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆడబిడ్డలు గనుక తిరగబడితే... తమ నియంత్రణ అంతమవుతుందని, తమ అధికారంపై ప్రశ్నలు తలెత్తుతాయని వారికి తెలుసు. అందుకే ఈ కుటుంబ ఆధారిత పార్టీలు పార్లమెంటులో ప్రతిపక్షంలో ముందు వరుసలో ఉన్నాయి.
మిత్రులారా,
దేశంలోని సోదరీమణులు, ఆడబిడ్డలంతా అలాంటి వారి చర్యలతో వారి కుటిల ఉద్దేశాలను గుర్తించడం నాకు సంతృప్తి కలిగించింది. మీరు చూస్తున్నారుగా... అస్సాం, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్, తమిళనాడులలో సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేశారు. సోదరీమణుల ఈ ఓటు... ఈ మహిళా వ్యతిరేక పార్టీలను శిక్షించడానికేనని మహిళా రిజర్వేషన్ను వ్యతిరేకించే పార్టీలు గ్రహించడం లేదు.
మిత్రులారా,
బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకే ఒక మంత్రం ఉంది - నాగరిక్ దేవో భవ. దేశ పౌరుల విద్య, సంపాదన, వైద్యం, నీటిపారుదల, వారు చెప్పేది వినడం మా ప్రాధాన్యాలు. ఈ స్ఫూర్తితోనే నేడు కాశీ అభివృద్ధినీ విస్తరిస్తున్నాం. గంగానదిపై ప్రతిష్ఠాత్మక వంతెన నిర్మాణంతో పూర్వాంచల్ అనుసంధానం మరింత బలోపేతమవుతుంది.
మిత్రులారా,
గత దశాబ్దంలో ఉత్తర, తూర్పు భారత్కు ఒక ప్రధాన ఆరోగ్య కేంద్రంగా కాశీ అభివృద్ధి చెందింది. 500 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాశీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. దీనికి అదనంగా, 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కూ శంకుస్థాపన జరిగింది. ఇది కాశీలో తీవ్రమైన వ్యాధుల చికిత్స కోసం ఒక అతిపెద్ద సదుపాయాన్ని అందిస్తుంది.
మిత్రులారా,
గంగానది ప్రక్షాళన... ఘాట్ల అభివృద్ధి... పరిపాలన, నిర్వహణ సంబంధిత భవనాల నిర్మాణాలు... హర్హువా, భవానీపూర్లలో రైతుల కోసం నిల్వ సౌకర్యాలు... వృద్ధాశ్రమాలు... మహిళా వసతి గృహాలు... ఇవన్నీ కాశీ అభివృద్ధికి నిదర్శనాలు. ఈ అభివృద్ధి పనులతో బనారస్ ప్రజలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు.
మిత్రులారా,
కాశీ వారసత్వాన్ని, సంస్కృతినీ బలోపేతం చేసే ప్రచారం నిరంతరం కొనసాగుతోంది. సంత్ కబీర్ పవిత్ర స్థల అభివృద్ధి, నాగ్వాలోని సంత్ రవిదాస్ ఉద్యానవన పునరుద్ధరణ ఈ ప్రచారంలో భాగమే.
మిత్రులారా,
మన కాశీ శాశ్వతమైనది. అది నిరంతరం కొనసాగే నగరం. అదే విధంగా, ఈ అభివృద్ధి ఉద్యమం నిరంతరం ముందుకు సాగుతుంది. మహిళా శక్తిని గౌరవిస్తూ, మాకు ఆశీస్సులు అందించినందుకు మీకు మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధి పనుల సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాతో పాటు మీరంతా చెప్పండి-
భారత్ మాతా కీ జై.
భారత్ మాతా కీ జై.
భారత్ మాతా కీ జై.
వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం.
హర-హర మహాదేవ్.
***
(రిలీజ్ ఐడి: 2256417)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8