ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయిలో ‘ఇండియా మారిటైమ్ వీక్-2025’లో భాగంగా నౌకా వాణిజ్య రంగ అగ్రగాముల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
“భారత నౌకా వాణిజ్య రంగం శరవేగంతో.. అమిత సామర్థ్యంతో ముందడుగు వేస్తోంది”
“శతాబ్దాల నాటి వలస పాలన షిప్పింగ్ చట్టాల స్థానంలో
21వ శతాబ్దానుగుణ ఆధునిక.. భావితరం చట్టాలు తెచ్చాం”
“నేటి పురోగామి ప్రపంచంలో భారత ఓడరేవులు అత్యంత సమర్ధమైనవిగా పరిగణనలో ఉండటం సహా అనేక అంశాల్లో అభివృద్ధి చెందిన దేశాలకన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి”
“నౌకా నిర్మాణంలో అత్యున్నత స్థాయికి చేరేలా భారత్ ముమ్మర కృషి చేస్తున్న నేపథ్యంలో భారీ నౌకలకు మేం మౌలిక సదుపాయ ఆస్తుల హోదా ఇచ్చాం”
“షిప్పింగ్ రంగంలో ముందడుగుతోపాటు విస్తరణకు ఇదే సరైన సమయం”
“సముద్రాలు అల్లకల్లోలమైతే ప్రపంచం నిశ్చిత దీపస్తంభం కోసం అన్వేషిస్తుంది.. భారత్ ఇప్పుడు మరింత బలం.. స్థిరత్వంతో ఆ పాత్ర పోషణకు సిద్ధంగా ఉంది”
“అంతర్జాతీయ ఉద్రిక్తతలు.. వాణిజ్య అంతరాయాలు.. మారిపోతున్న సరఫరా వ్యవస్థల నడుమ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి.. శాంతి.. సమ్మిళిత వృద్ధికి భారత్ చిహ్నంగా నిలుస్తోంది”
प्रविष्टि तिथि:
29 OCT 2025 5:58PM by PIB Hyderabad
మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో నిర్వహిస్తున్న ‘ఇండియా మారిటైమ్ వీక్-2025’లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నౌకా వాణిజ్య రంగ అగ్రగాముల సమావేశంలో ప్రసంగించారు. దీంతోపాటు అంతర్జాతీయ నౌకా వాణిజ్య సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారుల చర్చాగోష్ఠికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా- సమావేశానికి హాజరైన వారందరికీ ఆయన సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం 2016లో ముంబయిలోనే ప్రారంభం కాగా, ఇప్పుడు ప్రపంచ శిఖరాగ్ర సదస్సుగా రూపుదాల్చడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు 85కుపైగా దేశాల ఈ భాగస్వామ్యం ప్రపంచానికి బలమైన సందేశం పంపుతున్నదని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. షిప్పింగ్ రంగంలో కీలక దిగ్గజాలు, అంకుర సంస్థలు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు ఇందులో పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. ముఖ్యంగా చిన్న ద్వీపదేశాల ప్రతినిధుల ప్రాతినిధ్యం హర్షణీయమని వ్యాఖ్యానిస్తూ- వారి సమష్టి దృక్కోణం ఈ శిఖరాగ్ర సమావేశ సమన్వయాన్ని, బలాన్ని గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు.
ఈ శిఖరాగ్ర సదస్సులో భాగంగా షిప్పింగ్ రంగ సంబంధిత అనేక ప్రాజెక్టులు శ్రీకారం చుట్టుకున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు రూ.లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కూడా కుదిరాయని శ్రీ మోదీ ప్రస్తావించారు. భారత సముద్ర రంగ సామర్థ్యంపై ఇనుమడిస్తున్న ప్రపంచ విశ్వాసానికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ఇందరు ప్రతినిధులు హాజరు కావడం సమష్టి నిబద్ధతకు చిహ్నమని పేర్కొన్నారు.
“ఈ 21వ శతాబ్దంలో భారత సముద్ర రంగం శరవేగంగానే కాకుండా అమిత సామర్థ్యంతో ముందడుగు వేస్తోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. ఎన్నో కీలక విజయాలు సాధించిన నేపథ్యంలో ఈ రంగానికి 2025 ఎంతో కీలక సంవత్సరమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దేశంలో తొలి ‘డీప్-వాటర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్-షిప్మెంట్ హబ్’గా రూపొందిన విఝింజం రేవు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభించిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక ఇటీవలే ఈ రేవుకు రావడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని ఆయన అభివర్ణించారు. దేశంలోని ప్రధాన ఓడరేవులు 2024–25లో ఇప్పటిదాకా అత్యధిక సరకు రవాణా పరిమాణాన్ని నమోదు చేయడం ద్వారా కొత్త రికార్డును సృష్టించాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. అలాగే మన కాండ్లా ఓడరేవుకు తొలి మెగావాట్ల స్థాయి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదన వ్యవస్థను ప్రారంభించిన ఘనత దక్కిందని ఆయన ప్రకటించారు. మరోవైపు ముంబయి కంటైనర్ టెర్మినల్ 2వ దశ ప్రారంభం ద్వారా ‘జేఎన్పీటీ’ మరో కీలక ఘట్టాన్ని భారత్ ఆవిష్కరించిందని పేర్కొన్నారు. “దీంతో టెర్మినల్ సరకు నిర్వహణ సామర్థ్యం రెట్టింపైంది. తద్వారా దేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టుగా రూపొందింది” అని ప్రధానమంత్రి వివరించారు. భారత ఓడరేవు మౌలిక సదుపాయాలలో అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వల్లనే ఈ ఘనత సాకారమైందని చెప్పారు. ఈ మేరకు ఇందులో భాగస్వాములైన సింగపూర్ పెట్టుబడిదారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
నౌకా వాణిజ్య రంగంలో భావితరం సంస్కరణల దిశగా భారత్ ఈ ఏడాది కీలక చర్యలు తీసుకున్నదని ప్రధానమంత్రి చెప్పారు. “శతాబ్దాల నాటి వలస పాలన షిప్పింగ్ చట్టాల స్థానంలో 21వ శతాబ్దానుగుణ ఆధునిక, భవిష్యత్తరపు చట్టాలు తెచ్చాం” అన్నారు. ఈ కొత్త చట్టాలతో రాష్ట్ర సముద్ర బోర్డులకు అధికారం లభించడంతోపాటు వాటి భద్రత, స్థిరత్వం బలోపేతం కావడమేగాక రేవుల నిర్వహణలో డిజిటలీకరణ విస్తరిస్తుందని చెప్పారు.
వాణిజ్య నౌకా చట్టం కింద భారత చట్టాలు అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా ఉన్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇది భద్రత ప్రమాణాలపై నమ్మకాన్ని పెంచి, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుదలతోపాటు ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడంలో దోహదం చేసిందని తెలిపారు. వాటాదారులు, పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని ఈ కృషి మరింత ఇనుమడింపజేయగలదని ఆశాభావం వెలిబుచ్చారు.
దేశంలో వాణిజ్య సరళీకరణ, సరఫరా వ్యవస్థ భద్రత బలోపేతం లక్ష్యంగా ‘కోస్టల్ షిప్పింగ్ చట్టం’ రూపొందిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విశాల భారత తీరప్రాంతంలో సమతుల ప్రగతికి ఈ చట్టం తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. పోర్టు సంబంధిత విధానాల ప్రామాణీకరణ సహా డాక్యుమెంటేషన్ అవసరాలను గణనీయంగా తగ్గించే ‘ఒన్ నేషన్-ఒన్ పోర్ట్’ ప్రక్రియను ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్లో దశాబ్దం నుంచీ కొనసాగుతున్న సంస్కరణలలో షిప్పింగ్ రంగ సంస్కరణలు ఒక భాగమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు గత 10-11 సంవత్సరాల ప్రగతిని ప్రతిబింబిస్తూ, భారత నౌకా వాణిజ్య రంగంలో చారిత్రక ప్రగతిశీల మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘మారిటైమ్ ఇండియా విజన్’ కింద 150కి పైగా కొత్త కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీంతో ప్రధాన ఓడరేవుల సామర్థ్యం దాదాపు రెట్టింపు కావడమేగాక నౌకలు తిరిగి వెళ్లే సమయం గణనీయంగా తగ్గిందని, విహార నౌకా పర్యాటకంలో కొత్త ఉత్తేజం వచ్చిందని చెప్పారు. అలాగే అంతర్గత జలమార్గాలపై రవాణా 700 శాతానికిపైగా పెరిగిందని, కార్యకలాపాలు సాగే జలమార్గాల సంఖ్య 3 నుంచి 32కు పెరిగిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. మొత్తంమీద గడచిన దశాబ్ద కాలంలో భారత ఓడరేవుల నికర వార్షిక మిగులు 9 రెట్లు పెరిగిందని ఆయన వివరించారు.
“భారత ఓడరేవులు నేడు ప్రపంచమంతటా అత్యంత సమర్థ్యమైనవిగా పరిగణనలో ఉండటం సహా అనేక అంశాల్లో అభివృద్ధి చెందిన దేశాలకన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశంలోని రేవులలో కంటైనర్లు నిలిచే సగటు సమయం 3 రోజులకన్నా దిగువకు తగ్గిందని, అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ అంశంలో ఎంతో మెరుగుదల కనిపిస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా పలు అంశాల్లో కీలక పనితీరు గణాంకాలను ఆయన వెల్లడించారు. ఈ మేరకు నౌకల సగటు సమయం 96 గంటల నుంచి కేవలం 48 గంటలకు తగ్గిందన్నారు. దీనివల్ల ప్రపంచ షిప్పింగ్ సంస్థల నడుమ భారత్ సంస్థలు మరింత పోటీతత్వం సహా ఆకర్షణీయ ఎంపికగా మారాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే రవాణా సదుపాయాల అంశంలో ప్రపంచ బ్యాంకు పనితీరు సూచిక రీత్యా భారత్ స్థాయి గణనీయంగా మెరుగుపడిందని శ్రీ మోదీ తెలిపారు. గత దశాబ్దంలో భారత నావికుల సంఖ్య 1.25 లక్షల నుంచి 3 లక్షలకు పెరిగిందని, సముద్ర మానవ వనరులలో భారత్ బలం పెరుగుతున్నదని ఆయన చెప్పారు. ఆ మేరకు నావికుల సంఖ్య పరంగా భారత్ నేడు ప్రపంచంలోని తొలి మూడు దేశాలలో ఒకటిగా ఉందన్నారు.
21వ శతాబ్దంలో పావు వంతు కాలం ఇప్పటికే గడిచిపోయిందన్న ప్రధానమంత్రి రాబోయే 25 సంవత్సరాలు మరింత కీలకమైనవని వ్యాఖ్యానించారు. బ్లూ ఎకానమీతో పాటు సుస్థిర తీరప్రాంత అభివృద్ధిపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. గ్రీన్ లాజిస్టిక్స్, ఓడరేవుల అనుసంధానం, తీరప్రాంత పారిశ్రామిక సమూహాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.
"ప్రస్తుతం భారత్ అగ్ర ప్రాధాన్యాల్లో నౌకా నిర్మాణం ఒకటి" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. నౌకా నిర్మాణంలో భారత్ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ... ఈ రంగంలో ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే ప్రధాన కేంద్రంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. ఈ వేదికకు కొద్ది దూరంలోనే అజంతా గుహలు ఉన్నాయనీ, అక్కడ ఉన్న ఆరో శతాబ్దపు ఒక పెయింటింగ్ మూడు స్తంభాల ఓడ రూపకల్పనను వర్ణిస్తుందని ఆయన తెలిపారు. పురాతన భారతీయ కళలో కనిపించే ఈ డిజైన్ను శతాబ్దాల తర్వాత ఇతర దేశాలూ స్వీకరించాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మన దేశంలో నిర్మించిన నౌకలు ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యంలో కీలక భాగంగా ఉండేవన్న శ్రీ మోదీ... తరువాతి కాలంలో భారత్ షిప్-బ్రేకింగ్ రంగంలో ముందుకు సాగిందని తెలిపారు. ఇప్పుడు నౌకా తయారీలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి ప్రయత్నాలను వేగవంతం చేస్తోందని ఆయన వివరించారు. భారత్ పెద్ద నౌకలకు మౌలిక సదుపాయాల ఆస్తి హోదాను మంజూరు చేసిందనీ, ఈ విధానపరమైన నిర్ణయం ఈ కార్యక్రమానికి హాజరైన నౌకా నిర్మాణదారులందరికీ కొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది కొత్త ఫైనాన్సింగ్ ఎంపికలను అందిస్తుంది... వడ్డీ ఖర్చులను తగ్గిస్తుంది... క్రెడిట్ పొందుటను సులభతరం చేస్తుంది అని ప్రధానమంత్రి వివరించారు. ఈ సంస్కరణను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం దాదాపు రూ. 70,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఆయన ప్రకటించారు. ఈ పెట్టుబడులు దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటుగా దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ను ప్రోత్సహిస్తాయనీ... గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ షిప్యార్డుల అభివృద్ధికి ఊతమిస్తాయనీ... అధునాతన నౌకా వాణిజ్య నైపుణ్యాలను అందిస్తాయనీ... యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాయని శ్రీ మోదీ వివరించారు. ఈ కార్యక్రమం సంబంధిత వాటాదారులందరి కోసం కొత్త పెట్టుబడి అవకాశాలను అందుబాటులోకి తెస్తుందన్నారు.
ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న భూమి... ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలించిన భూమి అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆయన సముద్ర భద్రతకు పునాది వేయడమే కాకుండా అరేబియా సముద్ర వాణిజ్య మార్గాల్లో భారత బలాన్నీ చాటారని తెలిపారు. సముద్రాలు సరిహద్దులు కావు... అవకాశాలకు ద్వారాలు అనే శివాజీ మహారాజ్ దార్శనికతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అదే ఆలోచనతో ముందుకు సాగుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రపంచ సరుకు రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం పట్ల భారత్ నిబద్ధతను శ్రీ మోదీ స్పష్టం చేశారు. దేశం ప్రపంచ స్థాయి మెగా ఓడరేవులను చురుగ్గా నిర్మిస్తోందని పేర్కొన్న ప్రధానమంత్రి... మహారాష్ట్రలోని వధావన్లో రూ. 76,000 కోట్ల వ్యయంతో కొత్త ఓడరేవును నిర్మిస్తున్నట్లు తెలిపారు. భారత్ తన ప్రధాన ఓడరేవుల సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచుకోవడానికి... కంటైనర్ కార్గోలో తన వాటాను పెంచుకునేందుకు కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంబంధిత వాటాదారులంతా ఈ లక్ష్యాలను సాధించడంలో కీలక భాగస్వాములని ప్రధానమంత్రి ధ్రువీకరించారు. వారి ఆలోచనలు, ఆవిష్కరణలు, పెట్టుబడులను స్వాగతించారు. ఓడరేవులు, నౌకా యానం వంటి రంగాల్లో 100 శాతం ఎఫ్డీఐని భారత్ అనుమతిస్తోందనీ... ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలూ వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. “మేక్ ఇన్ ఇండియా-మేక్ ఫర్ ది వరల్డ్” దార్శనికత కింద ప్రోత్సాహకాలు అందిస్తూ... పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. భారత నౌకాయాన రంగంలో భాగస్వాములై, ఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు వివిధ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని శ్రీ మోదీ కోరారు. ఇందుకు ఇదే వారికి సరైన సమయమన్నారు.
శక్తిమంతమైన ప్రజాస్వామ్యం, విశ్వసనీయతల బలం భారత్ సొంతమన్న ప్రధానమంత్రి... "ప్రపంచ సముద్రాలు అల్లకల్లోలంగా ఉన్న ప్రస్తుత సమయంలో ప్రపంచం సుస్థిర మార్గదర్శనం కోసం చూస్తోంది... భారత్ తన బలం, సుస్థిరతతో ఆ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉంది" అని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన ఇబ్బందులు, మారుతున్న సరుకు రవాణా పరిస్థితుల నడుమ భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, శాంతి, సమ్మిళిత వృద్ధికి చిహ్నంగా నిలుస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. భారత నౌకావాణిజ్యం, వాణిజ్య కార్యకలాపాలు ఈ విస్తృత దృక్పథంలో అంతర్భాగంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్థిక కారిడార్ ఉదాహరణను ఉటంకిస్తూ... ఇది వాణిజ్య మార్గాలను పునర్నిర్వచించగలదనీ... పరిశుద్ధ ఇంధనాలు, ఆధునిక సరఫరా వ్యవస్థలనూ ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు.
సమ్మిళిత నౌకా వాణిజ్య అభివృద్ధిపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి... చిన్న ద్వీప దేశాలూ, తక్కువగా అభివృద్ధి చెందిన దేశాలను సాంకేతికత, శిక్షణ, మౌలిక సదుపాయాలతో శక్తిమంతం చేయడం ద్వారా మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. వాతావరణ మార్పులు, సరుకు రవాణాలో అంతరాయాలు, ఆర్థిక అనిశ్చితి, నౌకా వాణిజ్య భద్రత వంటి సమస్యల పరిష్కారం కోసం సమష్టి చర్యల అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారంతా సుస్థిర భవిష్యత్తు నిర్మాణం కోసం శాంతి, పురోగతి, శ్రేయస్సుల దిశగా కలిసి ముందుకు సాగాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి... వారందరినీ ప్రశంసిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ శంతను ఠాకూర్, శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఇండియా మారిటైమ్ వీక్-2025లో భాగంగా నిర్వహించిన ఈ ప్రపంచ నౌకా వాణిజ్య కంపెనీల సీఈవోల సదస్సు ప్రపంచ నౌకా వాణిజ్య రంగ భవిష్యత్తు గురించి వివరంగా చర్చించడం కోసం ప్రపంచ నౌకా వాణిజ్య కంపెనీల సీఈవోలు, ప్రధాన పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, అంతర్జాతీయ భాగస్వాములను ఒకచోటకు చేర్చింది. సుస్థిర నౌకా వాణిజ్య వృద్ధి, సమర్థమైన సరుకు రవాణా వ్యవస్థ, గ్రీన్ షిప్పింగ్, సమ్మిళిత సముద్ర ఆర్థిక వ్యూహాల గురించిన చర్చకు ఈ సదస్సు కీలక వేదికగా మారింది.
ప్రధానమంత్రి ఈ సదస్సులో పాల్గొనడం... నౌకా వాణిజ్య అమృత్ కాల్ విజన్ 2047తో అనుసంధానమైన ప్రతిష్టాత్మక, భవిష్యత్తు-ఆధారిత నౌకావాణిజ్య పరివర్తన పట్ల ఆయన నిబద్ధతను ప్రతిబింబించింది. ఓడరేవు- ఆధారిత అభివృద్ధి, నౌకా యానం-నౌకా నిర్మాణం, సజావుగా సరుకు రవాణా, నౌకా వాణిజ్య నైపుణ్యాలను పెంపొందించుట అనే నాలుగు వ్యూహాత్మక స్తంభాల ఆధారితమైన ఈ దీర్ఘకాలిక దార్శనికత... దేశాన్ని ప్రపంచంలోని ప్రముఖ నౌకా వాణిజ్య శక్తుల్లో ఒకటిగా నిలబెట్టే లక్ష్యం గలది. ఈ దార్శనికత కార్యరూపం దాల్చేలా చేయడం కోసం నౌకా యానం, ఓడరేవులు, నౌకా నిర్మాణం, క్రూయిజ్ టూరిజం, బ్లూ ఎకానమీ ఫైనాన్స్ సంబంధిత ప్రముఖ వాటాదారులందరినీ ఒకచోట చేర్చిన ఇండియా మారిటైమ్ వీక్-2025... భారత ప్రభుత్వ ప్రధాన ప్రపంచస్థాయి వేదికగా నిలిచింది.
(रिलीज़ आईडी: 2254278)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam