ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్యసభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా మూడోసారి ఎన్నికైన శ్రీ హరివంశ్కు ప్రధాని శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 2:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగించారు. వరుసగా మూడోసారి రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికై చరిత్ర సృష్టించిన శ్రీ హరివంశ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది శ్రీ హరివంశ్పై సభకున్న విశ్వాసాన్ని, ఈ సభకు ఆయన తీసుకొచ్చిన విలువైన అనుభవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ‘‘వరుసగా మూడోసారి ఎన్నిక కావడం.. ఆయన అనుభవానికి, సమ్మిళిత దృక్పథానికి, ఆయన పనితీరుకు సభ వేసిన ఆమోద ముద్ర’’ అని శ్రీ మోదీ తెలిపారు.
మాజీ ప్రధాని శ్రీ చంద్రశేఖర్ జయంతి అయిన ఏప్రిల్ 17నే ఇది జరగడం వల్ల ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుందని ప్రధానమంత్రి అన్నారు. శ్రీ చంద్ర శేఖర్ రాజకీయ ప్రయాణంలో డిప్యూటీ ఛైర్మన్ శ్రీ హరివంశ్ సహచరుడిగా ఉన్నారని, ఆయన జీవితంపై పుస్తకాలు కూడా రాశారని.. వారి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను శ్రీ మోదీ గుర్తు చేశారు. ‘‘శ్రీ చంద్రశేఖర్ జయంతి రోజునే మీరు మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఈ సందర్భాన్ని మరింత అర్థవంతంగా మారింది’’ అని ప్రధాని స్పష్టం చేశారు.
పాత్రికేయ రంగానికి శ్రీ హరివంశ్ అందించిన విశిష్ట సేవలను ప్రధానమంత్రి గుర్తు చేస్తూ... ఉన్నత ప్రమాణాల పట్ల, ప్రభావవంతమైన రచనల పట్ల ఆయనుకున్న నిబద్ధతను ప్రధానమంత్రి ప్రశంసించారు. గుజరాత్లో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు.. శ్రీ హరివంశ్ రాసిన కథనాలను క్రమం తప్పకుండా చదివినట్లు తెలియజేశారు. అవి లోతైన అధ్యయనాన్ని, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించేవని తెలిపారు. ‘‘ఆయన రచన సూటిగా ఉన్నప్పటికీ.. మాటతీరు, ప్రవర్తన ఎల్లప్పుడూ సౌమ్యంగా, మర్యాదపూర్వకంగా ఉండేవి’’ అని శ్రీ మోదీ అన్నారు.
శ్రీ హరివంశ్ పాత్రికేయునిగా పనిచేసిన కాలంలో.. ‘హమారా సంసద్ కైసా హో’ (మన పార్లమెంటు సభ్యుడు ఎలా ఉండాలి) అనే శీర్షికతో రాసిన కథనాలను ఉదహరించి ఆయన చేసిన మార్గదర్శక కృషిని ప్రధానమంత్రి వివరించారు. అలాగే అనుభవానికి ఉన్న ప్రాధాన్యం గురించి వివరించారు. పార్లమెంటులో ప్రవర్తించాల్సిన విధానం, గౌరవం, బాధ్యతల విషయంలో శ్రీ హరివంశ్ ఆలోచనల నుంచి చాలా నేర్చుకోవచ్చని ఇరు సభల్లోని కొత్త సభ్యులకు సూచించారు. ‘‘ఏదో ఒక రోజు తాను ఈ పీఠాన్ని అధిష్టించబోతున్నానని బహుశా ఆయన ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఆయన రచనలు ఈ అంశాన్ని చాలా లోతుగా వివరించాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.
శ్రీ హరివంశ్ వ్యక్తిత్వానికి సార్వత్రిక ఆమోదం రావడానికి ప్రధాన కారణం.. సమయపాలన, క్రమశిక్షణతో కూడిన జీవితం, విధుల పట్ల నిబద్ధతేనని ప్రధానమంత్రి ప్రశంసించారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనప్పటి నుంచి శ్రీ హరివంశ్ సభకు పూర్తి స్థాయిలో హాజరవుతున్నారని, అధ్యక్షత వహించని సందర్భాల్లో కూడా సమావేశాలకు హాజరవుతున్నారని ప్రధాని గుర్తించారు. ‘‘ఇది బాధ్యతల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. మనందరికీ ఉదాహరణగా నిలుస్తుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
పార్లమెంటు బాధ్యతలతో పాటుగా ప్రజలతో మమేకమవడానికి, ముఖ్యంగా యువతతో కలసి పనిచేసేందుకు శ్రీ హరివంశ్ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2018లో డిప్యూటీ ఛైర్మన్గా శ్రీ హరివంశ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 350కి పైగా కార్యక్రమాలను శ్రీ హరివంశ్ నిర్వహించారని ప్రధాని వెల్లడించారు. ‘‘యువతతో అనుసంధానమవడం, అంశాలను సిద్ధం చేయడం, వికసిత్ భారత్ దార్శనికత స్ఫూర్తిని వారిలో నింపడంలో ఆయనకున్న అసాధారణ అంకితభావాన్ని ఇది సూచిస్తుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో డిప్యూటీ ఛైర్మన్ను కనబరుస్తున్న శ్రద్ధను ప్రధానమంత్రి అభినందించారు. గతంలో ఆశించినంత వేగంతో భారత్ ఎందుకు వృద్ధి సాధించలేకపోయిందో, దేశం ముందడుగు వేయడానికి ఇప్పుడు ఉన్న అవకాశాల గురించి చారిత్రక ఉదాహరణలతో వివరిస్తారని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో జరిగే సాహిత్య ఉత్సవాల్లో శ్రీ హరివంశ్ చురుగ్గా పాల్గొంటారని, వివిధ వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తూ.. స్ఫూర్తి నింపుతారని పీఎం మోదీ తెలియజేశారు.
శ్రీ హరివంశ్ 1994లో మొదటిసారి అమెరికా సందర్శించినప్పుడు జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటనను ప్రధానమంత్రి పంచుకున్నారు. పీఎం మోదీ చెప్పిన ప్రకారం... ‘అభివృద్ధి చెందిన ఈ దేశంలో ఏం చూడాలనుకుంటున్నార’ని అడిగినప్పుడు, విశ్వవిద్యాలయాలను సందర్శించి.. ఇలాంటి పురోగతికి ఏ తరహా విద్య, సంస్కృతి దోహదపడుతున్నాయో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు శ్రీ హరివంశ్ చెప్పారు. ‘‘ఆ పర్యటనలో తన ఖాళీ సమయాన్నంతా అమెరికాలోని విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేయడానికే ఉపయోగించారు. ఇది అభివృద్ధి చెందిన భారత్ కోసం అత్యుత్తమ విద్యను అందించడంలో ఆయనకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
ఎంపీ ల్యాడ్స్ (పార్లమెంటు సభ్యుల స్థానిక అభివృద్ధి పథకం) నిధులను శ్రీ హరివంశ్ ఉపయోగిస్తున్న తీరు ఇతర పార్లమెంటేరియన్లకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వివిధ అధ్యయన, పరిశోధనా కేంద్రాలను డిప్యూటీ ఛైర్మన్ ఏర్పాటు చేశారని తెలిపారు. వాటిలో ఐఐటీ పట్నాలో అంతరించిపోతున్న భారతీయ భాషల కేంద్రం, బీహార్ ప్రాంతాల భూకంప ముప్పును దృష్టి లో పెట్టుకొని భూకంప ఇంజినీరింగ్ కేంద్రం, కోత సమస్యలను పరిష్కరించేందుకు పట్నాలోని ఆర్యభట్ట విజ్ఞాన విశ్వవిద్యాలయంలో నదీ అధ్యయన కేంద్రం ఉన్నాయి. ‘‘దీర్ఘకాల ప్రభావం చూపేలా నిర్దిష్ట దిశలో ఎంపీ ల్యాడ్స్ నిధులను ఎలా ఉపయోగించుకోవాలో ఆయన చూపించారు’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.
శ్రీ హరివంశ్ నిధులు అందించిన ఇతర కార్యక్రమాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. వాటిలో చంద్రగుప్త ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్, మగధ విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కేంద్రం ఉన్నాయి. నగరంలో నివసిస్తున్నప్పటికీ డిప్యూటీ ఛైర్మన్ తన స్వగ్రామంతో కొనసాగిస్తున్న ఆత్మీయ సంబంధాల గురించి శ్రీ మోదీ వివరించారు. ‘‘తన స్వగ్రామంతో శ్రీ హరివంశ్కు గొప్ప అనుబంధం ఉంది. ఆ ఊరి కష్టసుఖాల్లో నిత్యం పాలు పంచుకుంటూనే ఉంటారు’’ అని చెప్పారు.
కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ సమయంలో శ్రీ హరివంశ్తో తనకెదురైన వ్యక్తిగత అనుభవాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు. ఆయన సహకారం ఎంత విలువైనదో వివరించారు. పేర్లు పెట్టడం, ఛాంబర్లను గుర్తించడం, ఆర్ట్ గ్యాలరీలు, వివిధ ద్వారాలకు సంబంధించిన కచ్చితమైన ఆలోచనలను చర్చించిన రెండు రోజుల్లోనే హరివంశ్ ఎలా పూర్తి చేసేవారో వివరించారు. ‘‘పార్లమెంట్ నిర్మాణ సమయంలో ఆయనతో కలసి పనిచేయడం ఉత్సాహవంతమైన, ఫలవంతమైన అనుభవం’’ అని శ్రీ మోదీ చెప్పారు.
శిక్షణ, సామర్థ్య నిర్మాణం ద్వారా రాష్ట్రాల శాసనసభలు, శాసనమండళ్లు, వాటి ప్రిసైడింగ్ అధికారులకు సహాయపడటంలో శ్రీ హరివంశ్ చేసిన ప్రయత్నాలను ప్రధానమంత్రి గుర్తించారు. అలాగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై అంతర్జాతీయంగా బలమైన ముద్రను వేయడంలో ఆయన పోషించిన చురుకైన పాత్రను ప్రశంసించారు. 21వ శతాబ్ధపు రెండో భాగంలో సభ కీలకపాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రిసైడింగ్ అధికారుల బాధ్యతను స్పష్టం చేస్తూ.. తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2254234)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam