పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమ ఆసియా పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా ఎంఎస్ఎంఈలకు తగిన సహాయం అందించేందుకు సమన్వయంతో కూడిన విధానపరమైన చర్యలకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం
ఫిబ్రవరి–మార్చిలో రూ. 92,000 కోట్ల విలువైన 5.27 లక్షలకు పైగా గ్యారంటీలకు లభించిన ఆమోదం.. ఈ రంగానికి ఉన్న బలమైన సంస్థాగత మద్దతును తెలియజేస్తోన్న గణాంకాలు
2026 ఏప్రిల్ నాటికి (ఏప్రిల్ 14 వరకు) రోజుకు 282 మెట్రిక్ టన్నులుగా నమోదైన పీఎస్యూ ఓఎంసీల సగటు ఆటో ఎల్పీజీ విక్రయాలు
2026 ఫిబ్రవరిలో రోజుకు 177 మెట్రిక్ టన్నులుగా నమోదైన పీఎస్యూ ఓఎంసీలు సగటు ఆటో ఎల్పీజీ విక్రయాలు
MYPNGD.in పోర్టల్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్న 34,200 మందికి పైగా పీఎన్జీ వినియోగదారులు
కొనసాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలు.. నిన్న దేశవ్యాప్తంగా 2,100 కి పైగా దాడులు నిర్వహించి సుమారు 450 సిలిండర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
ఇప్పటివరకు 6,449 కాల్స్ను నిర్వహించిన డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్.. ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 13,443లకు పైగా కాల్లకు స్పందించిన కంట్రోల్ రూమ్
కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు.. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడం, రాకపోకల కోసం తెరిచి ఉంచడం చాలా ముఖ్యమని పేర్కొన్న ప్రధానమంత్రి
భారతీయ నావికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోన్న ప్రభుత్వం.. దౌత్యపరమైన సహాయాన్ని అందించడం, వారి కుటుంబాలతో అనుసంధానించటం, వారు తిరిగి భారత్కు చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోన్న రాయబార కార్యాలయాలు
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 6:21PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే నిరంతర ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించింది. పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతోన్న సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకుంటున్న చర్యలపై తాజా వివరాలను అందించారు. దీనితో పాటు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆ రంగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలియజేసింది.
ఎంఎస్ఎంఈ రంగ తాజా సమాచారం:
ఎంఎస్ఎంఈ రంగ నిరంతర వృద్ధి, సవాళ్లను తట్టుకునే శక్తిని తెలియజేస్తూ ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో చేపట్టిన ఉపశమన చర్యలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ వివరించింది.
-
2026 ఫిబ్రవరి–మార్చి కాలంలో 'ఉద్యమ్' పోర్టల్లో 20 లక్షలకు పైగా కొత్త ఎంఎస్ఎంఈలు నమోదయ్యాయి. దీనితో మొత్తం నమోదిత సంస్థల సంఖ్య 8 కోట్లు దాటింది. ఇది దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పారిశ్రామిక ఉత్సాహాన్ని తెలియజేస్తోంది.
-
ఎంఎస్ఎంఈలకు మంజూరైన మొత్తం రుణాల విలువ రూ. 36.7 లక్షల కోట్లు దాటింది. ఇది త్రైమాసిక ప్రతిపాదికన 23.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్త అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగంలో రుణ ప్రవాహం మెరుగుపడిందన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది.
-
ఆర్థిక వెసులుబాటును పెంపొందించే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఇచ్చే 'హామీ లేని రుణాల' పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు రెట్టింపు చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ నిర్ణయం చిన్న పారిశ్రామికవేత్తలు, తొలిసారి రుణం తీసుకునే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
-
ఫిబ్రవరి–మార్చి నెలల్లో రూ. 92,000 కోట్ల విలువైన 5.27 లక్షలకు పైగా గ్యారంటీలకు ఆమోదం లభించింది. ఇది ఈ రంగానికి అందుతున్న బలమైన సంస్థాగత మద్దతుకు నిదర్శనంగా నిలుస్తోంది.
-
నగదు లభ్యత చర్యల్లో భాగంగా 'ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్' (టీఆర్ఈడీఎస్) ప్లాట్ఫామ్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ విలువ 2022లో రూ. 4,300 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ. 7 లక్షల కోట్లు దాటింది. కేవలం ఫిబ్రవరి-మార్చి నెలల్లోనే రూ. 85,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. డిజిటల్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను వినియోగించుకోవడం పెరుగుతోందన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
-
పశ్చిమాసియా పరిణామాలతో సహా మారుతున్న ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో సమన్వయంతో కూడిన విధానపరమైన చర్యల ద్వారా ఎంఎస్ఎంఈలకు తగిన మద్దతును అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
-
ఈ రంగం ఎదుగుదల, పోటీతత్వం, సవాళ్లను తట్టుకునే శక్తిని బలోపేతం చేయడానికి భాగస్వామ్య పక్షాలతో కలిసి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ నిరంతరం పని చేస్తోంది.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
-
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.
-
వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.
-
ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.
-
పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
-
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్పీజీ, గృహావసరాల పీఎన్జీ, రవాణా సీఎన్జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
-
వాణిజ్య ఎల్పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.
-
ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
-
ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
-
చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
-
గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
-
నిత్యావసరాల చట్టం- 1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
-
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.
-
27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
-
ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
-
సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
-
జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
-
సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
-
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
-
పీఎన్జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
-
ఎల్పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
-
అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
-
ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పత్రికా ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
-
ఎల్పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా అమలు చర్యలు కొనసాగుతున్నాయి. 14.04.2026 నాడు దేశవ్యాప్తంగా 2100 కంటే ఎక్కువ దాడులు నిర్వహించి 450 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
-
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. అవి నిన్నటివరకు 237 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు జరిమానాలు విధించటంతో పాటు 58 మంది డీలర్లను సస్పెండ్ చేశాయి.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాల ఎల్పీజీ
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
-
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
-
పరిశ్రమవ్యాప్తంగా ఆన్లైన్ ఎల్పీజీ బుకింగ్లు సుమారు 98 శాతానికి పెరిగాయి.
-
సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 93 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్కు డీఏసీ వస్తుంది.
-
గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
-
మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
-
కేంద్ర ప్రభుత్వం 08.04.2026 నాటి లేఖ ద్వారా.. ఫార్మా, ఆహార రంగం, పాలిమర్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్, యురేనియం, భార జలం, ఉక్కు, విత్తనాలు, లోహాలు, సిరామిక్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, గాజు, ఏరోసోల్ మొదలైన రంగాల్లోని పారిశ్రామిక విభాగాలు కూడా 2026 మార్చికి ముందు ఉన్న తమ బల్క్ గృహేతర ఎల్పీజీ వినియోగ స్థాయిలో 70 శాతాన్ని పొందుతాయని తెలియజేసింది. అయితే ఇది రోజుకు 0.2 టీఎంటీ అనే మొత్తం రంగాల పరిమితికి లోబడి ఉంటుంది.2
-
026 ఏప్రిల్ 3 వరకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్యూ ఓఎంసీ) 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లపై సుమారు 5000 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 57,800 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
నిన్న 583 శిబిరాల ద్వారా 8,575 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు 14.6 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
వాణిజ్య ఎల్పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
-
2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,34,226 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వాణిజ్య ఎల్పీజీ విక్రయమైంది. 70.64 లక్షలకు పైగా (19 కిలోల బరువు గల) వాణిజ్య సిలిండర్లతో సమానం ఇది. ఇందులో 8,000 మెట్రిక్ టన్నులకు పైగా ఆటో ఎల్పీజీ ఉంది.
-
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (పీఎస్యూ ఓఎంసీ) సగటు ఆటో ఎల్పీజీ విక్రయాలు 2026 ఏప్రిల్ నెలలో (ఏప్రిల్ 14 వరకు) రోజుకు సుమారు 282 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2026లో ఉన్న రోజువారీ సగటు 177 మెట్రిక్ టన్నులతో పోలిస్తే గణనీయమైన వృద్ధి కనిపించింది.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ చర్యలు
*గృహ ఆవసరాలకు పీఎన్జీ, రవాణా రంగానికి సీఎన్జీ 100% సరఫరాతో వినియోగదారులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు.
*ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ కేటాయింపులు పెంచారు. వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95% వరకు సరఫరా అందుతోంది.
*సీజీడీ నెట్వర్క్ ద్వారా సరఫరాలతో సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80% వరకు పెంచారు.
*వాణిజ్య ఎల్పిజి లభ్యత సమస్యలను పరిష్కరించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు అన్ని ప్రాంతాలలో ప్రాధాన్యతపై పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని సీజీడీ సంస్థలకు సూచించారు.
*ఐజీఎల్, ఎమ్జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి నగర గ్యాస్ పంపిణీ సంస్థలు ఇళ్లు, వ్యాపార అవసరాలకు ఇచ్చే పీఎన్జీ కనెక్షన్ల కోసం రాయితీలు ప్రకటిస్తున్నాయి.
*సీజీడీ గ్యాస్ పంపిణీ వ్యవస్థల విస్తరణకు కావలసిన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
*వంటగ్యాస్ నుంచి పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువుకు మారే దీర్ఘకాలిక ప్రక్రియలో సహకరించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య వంటగ్యాస్ కేటాయిస్తామని భారత ప్రభుత్వం 2026 మార్చి 18 నాటి లేఖ ద్వారా ప్రకటించింది.
*పైపుల ద్వారా సహజ వాయువు విస్తరణ సంస్కరణలతో అనుసంధానమైన 21 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య వంటగ్యాస్ కేటాయింపులను పొందుతున్నాయి.
*కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2026 మార్చి 24 నాటి లేఖ ద్వారా నగర గ్యాస్ పంపిణీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు, మూడు నెలల కాలపరిమితితో 'తక్కువ సమయంలో వేగవంతమైన అనుమతులు ఇచ్చే విధానాన్ని' అమలులోకి తెచ్చింది.
*భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ గెజిట్ లో 1955 నిత్యావసర వస్తువుల చట్టం కింద పైప్లైన్ల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరణతో పాటు ఇతర సదుపాయాల ద్వారా సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ ఉత్తర్వు 2026 ను ప్రకటించింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్లైన్ల ఏర్పాటు, విస్తరణకు క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధానాన్ని అందిస్తుంది. అనుమతులలో జాప్యం, భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తూ, నివాస ప్రాంతాలతో సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఇది పైపుల ద్వారా సహజ వాయువు నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, చివరి మైలు వరకు అనుసంధానాన్ని మెరుగు పరుస్తుందని, స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్లడానికి తోడ్పడుతుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేస్తూ, భారత వాయు ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతుందని భావిస్తున్నారు.
*గృహాలకు ఇచ్చే సహజ వాయువు కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ పంపిణీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. అలాగే, ఈ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి 'జాతీయ పీఎన్జీ డ్రైవ్ 2.0' గడువును 2026 జూన్ 30 వరకు పొడిగించారు.
*స్వచ్ఛమైన, సురక్షితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడానికి, భారత ప్రభుత్వం ఒక నమూనా రాష్ట్ర సీబీజీ విధాన ముసాయిదాను రూపొందించింది. రాష్ట్రాలు కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) అభివృద్ధి కోసం పెట్టుబడిదారులకు అనుకూలమైన,ఆచరణాత్మకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి, ఈ నమూనా విధానం ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక ప్రణాళికగా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలకు, తదుపరి విడతలో అదనపు వాణిజ్య వంటగ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యత లభిస్తుంది.
*2026 మార్చి నుంచి సుమారు 4.5 లక్షల పైపుల ద్వారా సహజ వాయువు కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. సుమారు 5 లక్షల మంది అదనపు వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
*ఈ రోజు వరకు , 34,200 మంది పైగా వినియోగదారులు తమ వంటగ్యాస్ కనెక్షన్లను మై పీఎన్జీడీ.ఇన్ వెబ్సైట్ ద్వారా స్వచ్ఛందంగా వదులుకున్నారు.
ముడి చమురు పరిస్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
అన్ని రిఫైనరీలూ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వాటి వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ నిల్వలను కూడా తగిన స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నారు.
*గృహ అవసరాల వినియోగానికి రిఫైనరీల నుంచి వంటగ్యాస్ ఉత్పత్తిని పెంచారు.
*దేశీయ మార్కెట్లో పెట్రో రసాయన ముడి పదార్థాల లభ్యత కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన సంయుక్త అధ్యయన బృందం ఏర్పాటైంది. భారత ప్రభుత్వం 2026 ఏప్రిల్ 01 నాటి ఉత్తర్వు ద్వారా 'సెంటర్ ఫర్ హై టెక్నాలజీ' (సీహెచ్టీ) నిర్ణయించిన ప్రకారం, కీలక రంగాలకు అవసరమైన కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్స్ను ఆయిల్ రిఫైనరీ కంపెనీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్లకు అందుబాటులో ఉంచేందుకు అనుమతి ఇచ్చింది.
*ఫార్మాస్యూటికల్స్ విభాగం, కెమికల్స్, పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఫార్మా, రసాయన రంగ కంపెనీల కోసం ఎల్పీజీ నిల్వ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల ను కేటాయించారు.
*2026 ఏప్రిల్ 9 నుంచి ఇప్పటివరకు సుమారు 1800 మెట్రిక్ టన్నుల ప్రొపిలీన్ అమ్మకాలు జరిగాయి.
రిటైల్ ఇంధనం లభ్యత, ధరలు
దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయ కేంద్రాలు (పెట్రోల్ బంకులు) యథావిధిగా పనిచేస్తున్నాయి.
*పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది.
*భారత ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.55.50కి, ఏటీఎఫ్ (పై రూ.42కి పెంచింది. దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
*పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి ధరల పెంపూ లేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
*రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులతో పాటు అదనంగా 48,000 లీటర్ల కిరోసిన్ అందించారు..
*18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి, కాగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ఎటువంటి అవసరం లేదని సూచించాయి.
సముద్ర భద్రత, షిప్పింగ్ కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో ప్రస్తుత సముద్ర స్థితిగతులు, అలాగే భారతీయ నౌకలు, సిబ్బందిని రక్షించడానికి తీసుకుంటున్న చర్యల గురించి కూడా వివరించారు. ఈ సందర్భంగా ఈ క్రింది అంశాలను పేర్కొన్నారు:
-
సముద్రయాన సిబ్బంది సంక్షేమం, అంతరాయం లేకుండా సముద్ర కార్యకలాపాలు సాగేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగానికి చెందిన భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయంతో వ్యవహరిస్తోంది.
-
ఈ ప్రాంతంలోని భారతీయ సముద్ర యానికులందరూ క్షేమంగా ఉన్నారు. గత 24 గంటలలో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదవ్వలేదు.
-
డిజి షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 6,449 కాల్లను 13,443 పైగా కమ్యూనికేషన్లను స్వీకరించింది. గత 24 గంటల్లో 157 కాల్స్, 215 ఈమెయిల్స్ అందాయి.
-
డిజి షిప్పింగ్ ఇప్పటివరకు 2,337 పైగా భారతీయ సముద్ర యానికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి సహకరించింది, వీరిలో గత 24 గంటల్లో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది కూడా ఉన్నారు.
-
భారతదేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎక్కడా రద్దీ ఉన్నట్లు సమాచారం లేదు.
భారత పౌరుల భద్రత
భారత రాయబార కార్యాలయాల ద్వారా అందుతున్న సహాయంతో సహా, ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా ఈ క్రింద సమాచారాన్ని తెలియజేశారు
-
పశ్చిమ ఆసియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ క్రియాశీలకంగా దౌత్యపరమైన చర్చలను కొనసాగిస్తోంది.
-
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ ద్వారా వివిధ రంగాలలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించారు. అన్ని రంగాలలో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి.
-
ఇరువురు నేతలు పశ్చిమ ఆసియాలోని పరిస్థితిని కూడా చర్చించారు. హార్ముజ్ జలసంధిని స్వేచ్చగా, సురక్షితంగా ఉంచడం ప్రాముఖ్యతను స్పష్టం చేశారు.
-
భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణకు సంబంధించిన వివిధ అంశాలపై ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రితో చర్చించారు.
-
ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల మంత్రితో కూడా ఆయన మాట్లాడారు; ఈ సందర్భంగా ఇరువురు నేతలు పశ్చిమ ఆసియాలోని సంఘర్షణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
-
విదేశీ వ్యవహారాల మంత్రి ఈరోజు, ఇంధన మార్కెట్లలో సరఫరా అంతరాయాలపై చర్చించేందుకు జపాన్ ఏర్పాటు చేసిన ‘ ఏజడ్ఈసీ ప్లస్’ సమావేశంలో పాల్గొన్నారు. సముద్ర రవాణా సురక్షితంగా, ఆటంకం లేకుండా సాగాలనే విషయంలో భారత్ దృఢ నిశ్చయాన్ని ఆయన స్పష్టం చేశారు. వాణిజ్య నౌకలపై దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ వృద్ధికి ఇంధన మార్కెట్లు కుంచించుకుపోకుండా ఉండటం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రధాన ఇంధన వినియోగదారుగా, సరఫరా శ్రేణిని పటిష్టం చేసేందుకు ( సమాన ఆలోచనలు కలిగిన భాగస్వాములతో కలిసి భారతదేశం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
-
ప్రధానమంత్రి ఆదేశాల మేరకు గల్ఫ్ దేశాలతో మన దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అంతకుముందు, విదేశీ వ్యవహారాల మంత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించగా, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ఖతార్ను సందర్శించారు. కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించిన పరిణామాలను అంచనా వేయడం, భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడం, ప్రవాస భారతీయుల సంక్షేమాన్ని నిర్ధారించడం ఈ పర్యటనల్లో కీలక అంశాలుగా ఉన్నాయి.
-
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు పనిచేస్తున్నాయి. ఇవి భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ సేవలందిస్తున్నాయి.
-
సమాచారాన్ని మెరుగ్గా పంచుకోవడం, సమన్వయం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరుపుతోంది.
-
భారతీయ రాయబార కార్యాలయాలు, కేంద్రాలు నిరంతరం హెల్ప్లైన్లను నిర్వహిస్తూ, భారతీయ పౌరులకు చురుకుగా సహాయం అందిస్తున్నాయి. వారు స్థానిక ప్రభుత్వాలతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
-
స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమానయాన, ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారతీయ సమాజానికి మద్దతుగా చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యల గురించిన సమాచారంతో తాజా సలహాలను క్రమం తప్పకుండా జారీ జారీ చేస్తున్నారు.
-
భారతీయ రాయబార కార్యాలయాలు ఆ ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్లు, వృత్తిపరమైన బృందాలు, భారతీయ కంపెనీలు,ఇతర భాగస్వాములతో చురుగ్గా సంప్రదింపులు జరుపుతున్నాయి.
-
ఆ ప్రాంతంలోని భారతీయ సముద్ర యానికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. స్థానిక అధికారులతో, ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ సహాయాన్ని అందించడం, భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేలా సౌకర్యాలు కల్పించడం, భారతదేశానికి తిరిగి రావాలనుకునే వారి అభ్యర్థనలను సులభతరం చేయడంతో సహా అక్కడి నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందికి మన రాయబార కార్యాలయాలు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నాయి.
-
గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు సుమారు 9,84,000 మంది ప్రయాణికులు ఈ ప్రాంతం నుంచి భారతదేశానికి ప్రయాణించారు.
-
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, నిర్వహణ, భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని యూఏఈ, భారత్ మధ్య పరిమిత సంఖ్యలో నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలు నడుస్తున్నాయి; ఈరోజు దాదాపు 100 విమానాలు నడుస్తాయని అంచనా.
-
సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారతదేశంలోని గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
-
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉన్నందున, ఖతార్ ఎయిర్వేస్ ఈరోజు భారత్ కు దాదాపు 10 విమానాలను నడపవచ్చని భావిస్తున్నారు.
-
కువైట్ గగనతలం ఇంకా మూసివేసే ఉంది. జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారతదేశానికి నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. గగనతలం మూసివేత కారణంగా, కువైట్లోని భారతీయ పౌరులు సౌదీ అరేబియా మీదుగా భారతదేశానికి వెళ్లేలా నిరంతరం ఏర్పాట్లు చేస్తున్నారు.
-
బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుంచి భారతదేశానికి పరిమిత విమాన సర్వీసులను ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారతదేశానికి నాన్-షెడ్యూల్డ్ విమానాలను నడుపుతోంది. బహ్రెయిన్ నుంచి భారతీయ పౌరులు సౌదీ అరేబియా మీదుగా భారతదేశానికి చేరుకునేలా నిరంతరం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
-
ఇరాక్ గగనతలం పరిమిత విమాన సర్వీసులతో తెరిచి ఉంది. భారతీయ పౌరులు జోర్డాన్ ,సౌదీ అరేబియా మీదుగా భారతదేశానికి వెళ్లేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
-
టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 1,028 మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులతో సహా మొత్తం 2,323 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ మీదుగా భారత్ కు వెళ్లేలా ఏర్పాట్లు చేసింది.
-
ఇజ్రాయెల్ గగనతలం పరిమిత విమాన సర్వీసులతో పాక్షికంగా తెరిచి ఉంది. భారతీయ పౌరులు జోర్డాన్, ఈజిప్ట్ మీదుగా భారత్ కు చేరుకునేలా నిరంతరం సౌకర్యాలు కల్పిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2252437)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam