పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
కూనో నేషనల్ పార్కులో అయిదు కూనలకు జన్మనిచ్చిన ‘జ్వాల’.. భారత్లో 53కు పెరిగిన చిరుతలు.. భారత్లో పుట్టిన కూనల సంఖ్య 33కు చేరిక
భారత్ గడ్డ మీద చిరుత కూనల జననం ఇది పదోసారి.. పశువైద్యులు, క్షేత్ర సిబ్బంది కనబరిచిన చిత్తశుద్ధి, నేర్పరితనం, నిబద్ధతల ఫలితమన్న శ్రీ భూపేందర్ యాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
09 MAR 2026 2:12PM by PIB Hyderabad
నమీబియా నుంచి రప్పించిన చీతా ‘జ్వాల’ మధ్యప్రదేశ్లోని కూనో అభయారణ్యంలో అయిదు కూనలకు జన్మనిచ్చిందనీ, ఇది ‘జ్వాల’ విజయవంతంగా మూడోసారి తల్లి అయిన సందర్భమనీ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ సోమవారం ప్రకటించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ప్రస్తుతం భారత్లో పుట్టి పెరుగుతున్న చిరుతల కూనల సంఖ్య 33కు పెరిగినట్లు పేర్కొన్నారు. భారత్ గడ్డ మీద ఇప్పటి వరకు 10 చిరుత కూనలు పుట్టాయనీ, ఇది భారత్ చిరుతల సంరక్షణ ప్రస్థానంలో కీలక పురోగతిని సూచిస్తోందనీ ఆయన తెలిపారు.
‘ప్రాజెక్ట్ చీతా’లో ఇది ఓ గర్వకారణ ఘట్టమని శ్రీ యాదవ్ వర్ణించారు. పశువైద్యులు, క్షేత్ర ఉద్యోగులతో పాటు అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఇతర సిబ్బంది ఎంతో అంకిత భావంతో చేస్తున్న కృషికీ, వారి నేర్పరితనానికీ, నిబద్ధతకీ ఇది అద్దం పడుతోందని ఆయన అన్నారు. ఈ కూనలతో, భారత్లో మొత్తం చిరుతల సంతతి 53కు చేరుకొందని మంత్రి వివరించారు.
వన్యప్రాణి సంరక్షణలో ఇది చరిత్రాత్మక క్షణమే కాక ఆనందదాయక క్షణం కూడా అని మంత్రి వర్ణించారు. తల్లి చిరుతతో పాటు కూనలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయనీ, సంతతిని వృద్ధి చేసుకుంటాయనీ, భారత్ చిరుత గాథలో మరిన్ని విజయాలకు బాట వేయగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దక్షిణాఫ్రికా చిరుత ‘గామిని’ ఇటీవల రెండోసారి కాన్పులో నాలుగు కూనలకు జన్మనిచ్చింది. 2026 ఫిబ్రవరి 28న, బోట్స్వానా నుంచి అందుకున్న తొమ్మిది చిరుతలను కూనో నేషనల్ పార్కులో కంచెలున్న ఆవరణాల్లోకి విడిచిపెట్టారు. వాటిలో ఆడ చిరుతలు 6, మగ చిరుతలు 3 ఉన్నాయి. అవి మారిన పరిస్థితులకు మెల్ల మెల్లగా అలవాటు పడుతున్నాయి. వాటి స్వస్థతను పర్యవేక్షించే దశ సమాప్తమైన తరువాత క్రమంగా ప్రాకృతిక వాతావరణంలోకి వదలిపెడతారు.
***
(రిలీజ్ ఐడి: 2236948)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13