ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభానికి సంబంధించిన ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 MAR 2026 6:51PM by PIB Hyderabad
ఢిల్లీలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభానికి సంబంధించిన ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వరుసగా కొన్ని సందేశాలను పొందుపరుస్తూ -
‘‘ఢిల్లీలోని సరోజినీ నగర్లో గల జీపీఆర్ఏ నివాస స్థలాల్లో మహిళా లబ్ధిదారులకు కొత్త ఇళ్ల తాళం చెవులను అందజేసినందుకు ఎంతో సంతోషం కలిగింది. ప్రభుత్వోద్యోగుల కోసం ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ ఇళ్లు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మా నిబద్ధతకు ఒక శక్తిమంతమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి.’’
‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జీపీఆర్ఏ క్వార్టర్స్ నిర్మాణంలో ముఖ్య తోడ్పాటును అందించిన మన మహిళా సిబ్బందితో మాటామంతీ జరపడంతో కొత్త శక్తిని సంతరించుకున్నానన్న అనుభూతిని ఇచ్చింది.’’
‘‘ఈ రోజు ఢిల్లీ మెట్రోకు సంబంధించిన ఒక ప్రదర్శనను చూసే సదవకాశం లభించింది. ఈ ప్రదర్శనను చూశాక, శరవేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు.. ఢిల్లీ ప్రజల జీవనాన్ని మరింత సుగమంగా, సౌకర్యవంతంగా ఎలా తీర్చిదిద్దుతోందో అర్థం చేసుకొనేందుకు అవకాశం లభించింది.’’
‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నా మాతృమూర్తులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెలు.. వీరందరితో చర్చించే చక్కని అవకాశం లభించింది. ఈ సందర్భంగా.. శక్తిస్వరూపిణులైన మహిళల్లో ఉట్టిపడుతున్న ఆత్మవిశ్వాసాన్ని గమనించినప్పుడు గర్వంగా అనిపించింది.’’
‘‘న్యూఢిల్లీలోని శక్తిమంతమైన మహిళా ప్రతినిధులకు ఆయుష్మాన్ కార్డులనీ, స్వనిధి క్రెడిట్ కార్డునీ అందజేసే సౌభాగ్యం ఈ రోజు దక్కింది. వారికి ఆరోగ్య భద్రతని అందించడంతో పాటు ఆర్థిక సాధికారితని కల్పించే దిశగా ఇదొక కీలక చర్య.’’
‘‘అభివృద్ధి సాధన విషయంలో ఢిల్లీలోని నా కుటుంబసభ్యుల్లో ఉరుముతున్న ఉత్సాహాన్నీ, ఉల్లాసాన్నీ చూస్తే హృదయం ఉప్పొంగిపోయింది.’’
‘‘ఢిల్లీ ప్రగతి ప్రస్థానం పూర్తి దేశంలో ప్రసరిస్తున్న ప్రభావంతో ముడిపడి ఉంది. ఈ కారణంగా ఇక్కడి మెట్రో సౌకర్యాలతో పాటు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన కూడా శరవేగంగా విస్తరిస్తుండడం చూసి నాకెంతో ఆనందం కలుగుతోంది.’’
‘‘ ‘ఆప్’దా వాళ్ల విధానం చూస్తే.. పని తక్కువ, సాకులు ఎక్కువన్నట్లు ఉంది. ఇవాళ ఢిల్లీలో అభివృద్ధి నమూనాను గమనిస్తే.. సాకులకు స్వస్తి, పనులకు నాందీప్రస్తావన అని స్పష్టమవుతోంది.’’
‘‘వీధుల్లో తిరుగుతూ వస్తువులను విక్రయించే సహచరులను దృష్టిలో పెట్టుకొని స్వనిధి క్రెడిట్ కార్డుల ఉద్యమాన్ని మా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్డులు పేదల ఆత్మాభిమానానికి కొత్త అండగా నిలుస్తున్నాయి.’’
‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఇవాళ ఎంతో గర్వంగా చెబుతున్నానీ మాటలు.. దేశం 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలు (లక్షాధికారి అక్కలూ, చెల్లెమ్మలు)గా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని చెప్పుకొని, ఆ సంకల్పాన్ని నెరవేర్చింది. ఈ రోజున మనం మరో సంకల్పాన్ని చెప్పుకొంటున్నాం.. మరో 3 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు కూడా లఖ్పతి దీదీలుగా మారుతారు అనేదే ఆ సంకల్పం.
‘‘ఈ రోజు దేశ ప్రజలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్నారు. నిన్న పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం దేశ రాష్ట్రపతి గౌరవ ద్రౌపదీ ముర్ము గారిని ఘోరంగా అవమానించింది. రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమంలో సముచిత ఏర్పాట్లను చేయలేదు. పశ్చిమ బెంగాల్లోని విజ్ఞత కలిగిన ప్రజలు.. ఒక మహిళను అవమానించిన, ఒక గిరిజన మహిళను అగౌరవపరిచిన, దేశ గౌరవ రాష్ట్రపతిని అనాదరణకు గురి చేసినందుకు టీఎంసీని ఎన్నటికీ క్షమించరు’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2236887)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam