ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండియా-కెనడా సీఈఓ ఫోరమ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2026 7:19PM by PIB Hyderabad

గౌరవ ప్రధానమంత్రి మార్క్ కార్నీ, ఇరుదేశాల వ్యాపార దిగ్గజాలు, మహిళలు, మహాశయులారా, అందరికీ నమస్కారాలు!

ఇండియా-కెనడా సీఈఓ ఫోరమ్‌లో మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి కార్నీ సానుకూల ఆలోచనలను పంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

భారత్-కెనడా సంబంధాల్లో నేడు మనం నూతన అధ్యయాన్ని లిఖిస్తున్నాం. ప్రధానమంత్రి కార్నీ బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా గడవకపోయినా,  మన సంబంధాలు కాంతి సంవత్సరమంత ముందుకు సాగాయి. కొద్దినెలలుగా మన మధ్య విశ్వాసం పెరిగింది. స్పష్టత వచ్చింది. నూతనోత్తేజం నెలకొంది. ప్రపంచం ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొంటున్న తరుణంలోనూ, అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉన్న సమయంలోనూ ఇది సాధ్యమవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్, కెనడా వ్యాపార దిగ్గజాల మధ్య జరుగుతున్న ఈ చర్చలు మన భాగస్వామ్యాన్ని నూతన ప్రణాళికను సిద్ధం చేస్తాయి. మీ దార్శనికతను, నిబద్ధతను నేను అభినందిస్తున్నా.

మిత్రులారా,

భారత్, కెనడా శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలు. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు. ఉమ్మడి విలువలపై ఏర్పడిన సమాజాలు. సహజ భాగస్వాములుగా మమ్మల్ని ముందుకు నడిపేందుకు ప్రజాస్వామ్యం, వైవిధ్యం, అభివృద్ధి వంటివి ఉత్సాహపరుస్తాయి. ప్రధానమంత్రి కార్నీ, నేను కలిసి ఉమ్మడి దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ఇవాళ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు చేర్చందుకు స్థిరంగా ముందుకు సాగుతున్నాం. వీలైనంత త్వరగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తాం.

మిత్రులారా,

ప్రభుత్వాలు విధివిధానాలను రూపొందించి, దిశానిర్దేశం చేస్తాయి. కానీ, లక్ష్యాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది.

మిత్రులారా,

నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంది. ఈ విప్లవాత్మక మార్పు వెనక బలమైన స్వదేశీ డిమాండ్, యువ జనాభా, భారీ పెట్టుబడులు, డిజిటల్ సాంకేతికత శక్తి ఉన్నాయి. దీని ఫలితంగానే సంస్కరణల వేగం నిరంతరాయంగా కొనసాగుతుంది. విధానాల సరళీకరణ నుంచి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, రవాణా వ్యవస్థ మెరుగుపరచటం నుంచి పన్నులు, దివాలా సంస్కరణల ద్వారా ప్రతి రంగంలోనూ సులభతర వాణిజ్యాన్ని మేం మరింత బలపరుస్తున్నాం.

మిత్రులారా,

భారత్, కెనడా కలిసి కేవలం రెండు ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించటమే కాక, పెట్టుబడి, సామర్థ్యంతో శక్తిమంతమైన ఆర్థిక బలాన్ని సృష్టిస్తాం. మన ఉమ్మడి జీడీపీ 6 ట్రిలియన్ డాలర్లకు పైనే. కానీ మన అసలు బలం ఆశయాల్లోనే ఉంది. ఈ ఉమ్మడి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లటానికి నేను కొన్ని సూచనలు చెప్పాలనుకుంటున్నా. మొదటిది స్వచ్ఛ ఇంధనం. రెండు దేశాలకు ఇది ప్రాధాన్యత గల అంశం. యురేనియం దీర్ఘకాలిక సరఫరాకు ఈరోజు మనం ఒప్పందం కుదుర్చుకున్నాం. అణు రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవటానికి అంగీకరించాం. కాసేపటి కిందట, కోమికో సంస్థ సీఈఓల సానుకూల దృక్పథాన్ని విన్నాం. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లు, అణు ఇంధన సరఫరా వ్యవస్థల వంటి రంగాల్లో కలిసి ముందుకు సాగాలి. కీలక ఖనిజాల విషయంలో పటిష్ఠమైన సరఫరా వ్యవస్థల ఏర్పాటుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాం. కెనడా ఆవిష్కరణలను, భారతదేశ భారీస్థాయి అమలు సామర్థ్యంతో జోడించటం ద్వారా బ్యాటరీలు, ఇంధన నిల్వ రంగాల్లో పురోగతి సాధించవచ్చు. రెండో అంశం.. మౌలిక సదుపాయాలు, పెట్టుబడి భాగస్వామ్యం.

ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రికార్డు స్థాయిలో 130 బిలియన్ డాలర్లను కేటాయించాం. జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్‌కు 1.3 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. భారతదేశంలో 100 బిలియన్ డాలర్లను కెనడియన్ పెన్షన్ ఫండ్స్ పెట్టుబడిగా పెట్టాయి. ఇది మనదేశంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశ మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా.

మూడోది ఏఐ. మనం ఉమ్మడి ఏఐ కంప్యూట్ కారిడార్లను నిర్మించవచ్చు. అంకుర సంస్థల కోసం ఏఐ ఇన్నోవేషన్ శాండ్‌బాక్సులను ఏర్పాటు చేయవచ్చు. నాలుగోది ఉత్పత్తి, సాంకేతికత. కెనడా అత్యాధునిక సాంకేతికతను ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో భారత ఉత్పత్తి, సామర్థ్యంతో జోడించటం ద్వారా ప్రపంచ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. అయిదవది ఆహార శుద్ధి. ప్రస్తుతం భారతదేశంలో మెగా ఫుడ్ పార్కులు, శీతలీకరణ గిడ్డంగుల వ్యవస్థ, ఆహారాన్ని పరీక్షించే ల్యాబ్స్ వేగంగా నిర్మితమవుతున్నాయి. ఇది మన పరస్పర సహకార ప్రయోజనానికి బలమైన ఉదాహరణ.

మిత్రులారా,

మన భాగస్వామ్యం కేవలం రాజధానులకే పరిమితం కాకూడదు. దీన్ని రాష్ట్రాలకు, ప్రాదేశిక ప్రాంతాలకు విస్తరించాలి. అల్బెర్టాలోని సహజ వనరులను గుజరాత్, రాజస్థాన్‌లోని పునరుత్పాదక ఇంధన లక్ష్యాలతో అనుసంధానించాలి. అంటారియాలోని ఉత్పతి రంగ శక్తిని తమిళనాడు, మహారాష్ట్రలోని పారిశ్రామిక క్లస్టర్లతో జోడించాలి. మాంట్రియల్ సాంకేతిక వ్యవస్థను బెంగళూరు, హైదరాబాద్‌లోని ఆవిష్కరణల కేంద్రాలతో ఏకీకృతం చేయాలి. ఇలా మన భాగస్వామ్యాన్ని విధానాల నుంచి సుసంపన్నత దిశగా మార్చవచ్చు.

మిత్రులారా,

మీలో చాలామంది క్రికెట్ చూస్తుంటారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న టీ-20 ప్రపంచ కప్‌లో కెనడా జట్టు ఆడటం మనందరికీ ఎంతో సంతోషకరం. "టీ-20 క్రికెట్ లాగే వేగవంతమైన నిర్ణయాలు, నిర్భయమైన చర్యలు, అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్, కెనడా కలిసి భవిష్యత్తును నిర్మిస్తాయి". ఈ సంకల్పంతో భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నా.

ధన్యవాదాలు.

 

***


(రిలీజ్ ఐడి: 2234914) సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam