సహకార మంత్రిత్వ శాఖ
నేడు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారశాఖ మంత్రులతో మంతన్ సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
దేశ సహకార రంగాన్ని మోదీ ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తోంది…
సానుకూల ఫలితాలు వస్తున్నాయి…
2047 నాటికి దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో
సహకార సంస్థల పాత్రను మరింత పెంచడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం
కేవలం ఆర్థిక గణాంకాలు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్వచించవు. 140 కోట్ల ప్రజలు గౌరవంగా జీవించగలిగే వ్యవస్థను సృష్టించడమే పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్కు అసలైన అర్థం
రాష్ట్రాలు ఆహార ధాన్యాల నిల్వ, సర్క్యులారిటీ, సహకార సంస్థల మధ్య సహకారంపై దృష్టి పెట్టాలి
ఉత్పత్తితో పోలిస్తే దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని రాబోయే రోజుల్లో మూడు రెట్లు పెంచాలి..
ఇందులో రెండు వంతుల విస్తరణ సహకార రంగం ద్వారానే జరగాలి
దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే నిల్వ వ్యవస్థను కేవలం సహకార రంగం మాత్రమే ఏర్పాటు చేయగలదు
మూతపడిన చక్కెర మిల్లులను పునఃప్రారంభించడానికి అన్ని రాష్ట్రాలూ కృషి చేయాలి
సహకార సంఘాల మధ్య సహకారం (సహకారిత మే సహకార్) పిలుపులో భాగంగా అన్ని సహకార సంస్థలు
జిల్లా బ్యాంకులతో తమ బ్యాంకు ఖాతాలను నిర్వహించాలి
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో సహకార బ్యాంకుల భాగస్వామ్యాన్ని తప్పనిసరిగా నిర్ధారించాలి
ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ నగరానికి అతి తక్కువ సమయంలోనే భారత్ టాక్సీ సేవలు
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 11:48PM by PIB Hyderabad
నేడు గుజరాత్లోని గాంధీనగర్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకార మంత్రులతో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మంతన్ సమావేశం నిర్వహించారు.‘సహకార్ సే సమృద్ధి’ (సహకారం ద్వారా సమృద్ధి) అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇథనాల్, ఇంధనం, సేంద్రీయ పొటాష్, గిడ్డంగులు, ప్రోటీన్ పౌడర్ ప్లాంట్లకు సంబంధించి రూ.265 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీ అమిత్ షా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఒక ప్రదర్శనను సందర్శించి, సహకార రంగంలోని ఉత్తమ విధానాలు, అంతర్జాతీయ సహకార సంవత్సరంపై రూపొందించిన నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రులు శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్, శ్రీ మురళీధర్ మోహోల్, సహకార శాఖ కార్యదర్శి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రతి రంగంలోనూ పురోగమిస్తోందని కేంద్రమంత్రి అన్నారు. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్దేశించే రంగాల్లో భారత్ నేడు అగ్రగామిగా పనిచేస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ మంతన్ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ అంటే కేవలం గణాంకాలు మాత్రమే కాదని, 140 కోట్ల మంది ప్రజలు గౌరవంగా జీవించగలిగే వ్యవస్థను సృష్టించడమేనని ఆయన వివరించారు.దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించడానికి సహకార రంగం మాత్రమే సరైన మాధ్యమంగా మారుతుందని స్పష్టం చేశారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక రంగాలను బలోపేతం చేయకపోతే సమగ్ర జాతీయ అభివృద్ధిని సాధించలేమని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి మనమందరం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గత నాలుగేళ్లుగా సహకార రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించిన శాస్త్రీయ దృక్పథం వల్ల ఇప్పుడు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
సహకార రరంగాల ప్రాముఖ్యతను పెంపొందించడానికి ఆహార ధాన్యాల నిల్వపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో నిల్వ సామర్థ్యాన్ని దాదాపు మూడు రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని, ఇందులో రెండు వంతుల విస్తరణ సహకార రంగం ద్వారానే జరగాలని సూచించారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. నిల్వ సామర్థ్యాన్ని పెంచే బాధ్యతను కేవలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకే వదిలేయకూడదని సూచించారు. మండల స్థాయి సహకార డెయిరీలు, రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ సమాఖ్యలు, ఆర్ధిక సహాయం ద్వారాజిల్లా సహకార బ్యాంకులు, జిల్లా కొనుగోలు-విక్రయ సంఘాలు కలిసి పెద్ద ఎత్తున గిడ్డంగులను నిర్మించాలని కోరారు. దేశంలోని 70 శాతం ఆహార ధాన్యాలు ఉత్తర భారత్ (పంజాబ్, హర్యానా) నుంచి సేకరిస్తున్నారని తెలిపారు. సేకరణ, నిల్వ, పంపిణీని ప్రాంతాల వారీగా సమన్వయం చేస్తే రవాణా ఖర్చులను కనీసం 30 నుంచి 40 శాతం తగ్గించవచ్చని వివరించారు. దేశవ్యాప్తంగా నిల్వ వ్యవస్థ ఒకే పద్ధతిలో ఉండాలని మరియు అది అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని తెలిపారు.
మూతపడిన చక్కెర మిల్లులను తిరిగి ప్రారంభించేందుకు అన్ని రాష్ట్రాలు కృషి చేయాలని శ్రీ అమిత్ షా కోరారు. ఇందుకోసం జాతీయ స్థాయి సహకార సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న చక్కెర మిల్లులు కేవలం చక్కెరకే పరిమితం కాకుండా ఎరువులు, గ్యాస్ ఉత్పత్తిని కూడా చేపట్టవచ్చని సూచించారు. చక్కెర మిల్లుల ద్వారా దాదాపు 11 రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చని నిరూపితమైందని పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో దీనికి సంబంధించిన కార్యాచరణను ఖరారు చేస్తామని, చక్కెరను మాత్రమే ఉత్పత్తి చేసే మిల్లుల్లో అవసరమైన అన్ని భాగాలను చేర్చడంలో జాతీయ స్థాయి సహకార సంస్థ సహాయపడుతుందని తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరళమైన విధానాలను అవలంబించాల్సి ఉంటందన్నారు.
ప్రతి రాష్ట్రం తమ పాడి పరిశ్రమ, సహకార విభాగాల బృందాలను బనాస్ డెయిరీని సందర్శించడానికి పంపాలని కేంద్ర హోం, సహకార మంత్రి సూచించారు. బనాస్ డెయిరీ వివిధ కార్యక్రమాలను చేపట్టిందని, వాటి నుంచి అన్ని రాష్ట్రాలు ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు.
అన్ని సహకార సంస్థలు తమ బ్యాంకు ఖాతాలను జిల్లా సహకార బ్యాంకుల్లోనే నిర్వహించాలని ఆయన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. భారత ప్రభుత్వ పథకాలన్నింటికీ సహకార బ్యాంకులను సమన్వయ సంస్థలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. పీఎం కిసాన్, వృద్ధాప్య పెన్షన్లు వంటి పథకాల నిధులను ఈ సహకార బ్యాంకుల ద్వారానే పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
రిటైల్ కార్మికులు, వడ్రంగులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి శ్రమ దోపిడీకి గురవుతున్న వర్గాల కోసం రాబోయే రోజుల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. దీంతో వారు గౌరవప్రదమైన వేతనాన్ని పొందగలుగుతారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో దేశ జనాభాలో 40 శాతానికి పైగా ప్రజలు సహకార రంగంతో అనుసంధానమవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వచ్చే సంవత్సరాల్లో భారత్ టాక్సీ సేవలు ప్రతి మున్సిపల్ కార్పొరేషన్కు చేరుకుంటాయని కేంద్ర హోం, సహకార మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 3 లక్షల మందికి పైగా డ్రైవర్లు దీనిలో చేరారని, దీనివల్ల డ్రైవర్లకు, ప్రయాణికులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
అంతకముందు వివిధ ప్రదర్శనల ద్వారా సహకార రంగానికి సంబంధించిన పురోగతి, విజయాలు, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసేందుకు 2 లక్షల కొత్త బహుళార్థసాధక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్యకార సహకార సంఘాల ఏర్పాటులో పురోగతిని చర్చించారు. రైతులకు మెరుగైన నిల్వ సదుపాయం, ధరల స్థిరత్వం, మార్కెట్ అందుబాటును కల్పించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యపు నిల్వ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునిక గిడ్డంగుల వ్యవస్థను విస్తరించడంపై ప్రత్యేకంగా చర్చించారు.
సహకార సంస్థల ద్వారా ఎగుమతులు, సేంద్రియ సాగు, నాణ్యమైన విత్తన సరఫరాను ప్రోత్సహించడానికి కొత్తగా ఏర్పడిన జాతీయ సహకార సంస్థలు..నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్), నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్సీఓఎల్), భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ (బీబీఎస్ఎస్ఎల్) చురుగ్గా పాల్గొన్నాయి. 97వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా మోడల్ చట్టాన్ని స్వీకరించడం, రాష్ట్ర సహకార చట్టాలలో కాలానికి అనుగుణంగా మార్పులు చేయడంపై చర్చించారు. సహకార చక్కెర మిల్లుల ఆర్థిక లాభదాయకతను పెంచడం, పాడి రంగంలో స్థిరత్వాన్ని పెంపొందించడం, అముల్, ఎన్డీడీబీ సహకారంతో కొత్త పాడి సంఘాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు.
ఈ సమావేశంలో పప్పుధాన్యాలు, మొక్కజొన్న ఉత్పత్తిని ప్రోత్సహించడం, సహకార బ్యాంకులకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంపై వివరణాత్మక ప్రదర్శనలు ఇచ్చారు. సహకార రంగంలో ప్రధాన వ్యవస్థను బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదును పెంచడం, సమర్థవంతమైన మీడియా, కమ్యూనికేషన్ వ్యూహాలను అభివృద్ధి చేయడంపై చర్చలు జరిగాయి. సహకార రంగాన్ని ఆధునీకరించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేశారు. అవి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, సహకార సంఘాల రిజిస్ట్రార్ కార్యాలయాలను పూర్తిగా కంప్యూటరీకరించాలి. జాతీయ సహకార డేటాబేస్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. మానవ వనరుల అభివృద్ధి, శిక్షణపై శ్రద్ధ వహించాలి. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ పథకాలను క్షేత్రస్థాయిలో మెరుగ్గా అమలు చేయాలి.
***
(రిలీజ్ ఐడి: 2230006)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8