|
ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఈటీ నౌ’ అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2026 9:59PM by PIB Hyderabad
ఈ అంతర్జాతీయ వాణిజ్య సదస్సుకు హాజరైన మీకందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు” అనే ఇతివృత్తం ప్రాతిపదికగా మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. వినీత్ గారి ప్రసంగం విన్న తర్వాత, నా పని చాలా సులభమైందని భావిస్తున్నాను. అయితే, నాదొక చిన్న అభ్యర్థన- మీకు దీనిపై ఇప్పటికే అవగాహన ఉంది కాబట్టి, కొన్ని సందర్భాల్లో అది ‘ఈటీ’లోనూ ప్రతిబింబిస్తూంటుంది.
మిత్రులారా!
ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత దశాబ్దంలో అసాధారణ అవరోధాలు ఎదురయ్యాయి. వీటిలో మహమ్మారి కరోనా సహా ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం వంటివి ఓ పదేళ్ల వ్యవధిలో ప్రపంచ సమతౌల్యాన్ని అతలాకుతలం చేశాయి. అయితే, మిత్రులారా... ఇటువంటి సంక్షోభాలే ఒక దేశ వాస్తవ శక్తిసామర్థ్యాలను వెల్లడిస్తాయి. ఇలాంటి అవరోధాలెన్నో ఎదురైనా, ఒక దశాబ్ద కాలంలో బలమైన పనితీరు, ప్రజాస్వామ్య బలోపేతానికి సాగిన కృషి ఫలితంగా భారత్ అద్భుత ప్రగతిని నమోదు చేసిందని నేను సగర్వంగా ప్రకటించగలను. గత దశాబ్దారంభంలో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ 11వ స్థానంలో ఉంది. ఆనాటి గందరగోళ పరిస్థితుల నడుమ పతనం తప్పదేమోన్న ఆందోళన దోబూచులాడేది. కానీ, గడ్డు కాలాన్ని అధిగమిస్తూ నేడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా శరవేగంతో పురోగమిస్తోంది. మీరంతా ప్రస్తావిస్తున్న ఈ ‘పరిణమాశీల శతాబ్దం’ భారత్పై గణనీయంగా ఆధారపడి ఉందని నేను కర్తవ్య నిబద్ధతతో చెబుతున్నాను. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో 16 శాతం దాటిన భారత్ వాటా, ఏటికేడు స్థిరంగా పెరుగుతూనే ఉంటుందని దృఢ విశ్వాసంతో చెబుతున్నాను. ఓ జ్యోతిష్యుడిలా భవిష్య వాణి వినిపించడానికి నేనిక్కడికి రాలేదుగానీ, అంతర్జాతీయ వృద్ధికి సారథ్యం వహిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నవ్య చోదకంగా భారత్ ఆవిర్భవిస్తుందని మాత్రం నిక్కచ్చిగా చెప్పగలను.
మిత్రులారా!
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ కొత్త అంతర్జాతీయ క్రమం ఉద్భవించినా, 7 దశాబ్దాల తర్వాత ఆ కూర్పు విచ్ఛిన్నమవుతూ, ప్రపంచం సరికొత్త క్రమం వైపు పయనిస్తోంది. ఇందుకు కారణమేమిటంటారు? మునుపటి వ్యవస్థ ‘అన్నిటికీ ఒకే మూస’ విధానంలో ఏర్పాటు కావడమే! ఆ మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేంద్రకంగా బలమైన, విశ్వసనీయ సరఫరా వ్యవస్థల చట్రంలో ఆయా దేశాలను తమవంతు పాత్ర పోషించేవిగా మాత్రమే పరిగణించారు. అయితే, ఈ విధానానికి నేడు ఔచిత్యం కోల్పోయి, సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే, స్వీయ పునరుత్థాన సామర్థ్యం సంతరించుకోవడం అవసరమని ప్రతి దేశం గ్రహిస్తోంది.
మిత్రులారా!
అయితే, ప్రపంచం దీనిపై చర్చించుకుంటున్న నేపథ్యంలో 2015లోనే భారత్ తన విధానంలో దీన్నొక భాగం చేసింది. ఆ మేరకు దశాబ్దం కిందట ‘నీతి ఆయోగ్’ ఏర్పాటైన సందర్భంగా దాని వ్యవస్థాపక పత్రం భారత్ దార్శనికతను విశదం చేసింది. తదనుగుణంగా విదేశీ అభివృద్ధి నమూనాలలో ఏ ఒక్కదాన్నీ భారత్ అనుసరించబోదు... సరికదా, తనదైన ప్రగతి పద్ధతులను రూపొందించుకుంటోంది. స్వీయ అవసరాలు, ప్రయోజనాలకు తగిన నిర్ణయాలు తీసుకోగల విశ్వాసాన్ని ఈ విధానం దేశానికిచ్చింది. కాబట్టే, గత దశాబ్దంలో అడ్డంకులెన్నో ఎదురైనా భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడకుండా, మరింత బలంతో ముందడుగు వేసింది.
మిత్రులారా!
ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత దశాబ్దంలో భారత్ సంస్కరణల ఎక్స్ ప్రెస్లో దూసుకెళ్తోంది. దేశంలో సంస్కరణలు తప్పనిసరి తద్దినంలా కాకుండా.. విశ్వాసం, నిబద్ధతతో అమలు కావడమే వాటి వాస్తవిక బలం. ఈ సదస్సుకు హాజరైన వారిలో అనేక మంది విశిష్ట నిపుణులు, ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. మీరంతా 2014కు ముందునాటి పరిస్థితులను ఆకళింపు చేసుకునే ఉంటారు. ఆనాడు 1991లో దేశం దివాలా తీసి, ఏ దిక్కూలేని దుర్భర స్థితిలో బంగారం నిల్వలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అలాంటి దుస్థితి ఏర్పడినపుడు మాత్రమే సంస్కరణలు చేపట్టారు. ఇదీ మునుపటి ప్రభుత్వాలు అనుసరించిన విధానం... గత్యంతరం కానరాని పరిస్థితుల్లోనే సంస్కరణలు తెచ్చాయి. ముంబైలో 26/11 నాటి ఉగ్రవాద దాడి తర్వాత ‘ఎన్ఐఏ (NIA) ఏర్పాటైంది. గ్రిడ్ వైఫల్యం వల్లనే విద్యుత్ రంగంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఏర్పడింది.
మిత్రులారా!
బలవంతపు బ్రాహ్మణార్థంగా సంస్కరణలు తెస్తే సరైన లేదా ఆశించిన జాతీయ ఫలితాలు సాధించడం అసాధ్యమని మనకు తేటతెల్లం చేసే ఇలాంటి ఉదాహరణల జాబితా చాలా పొడవైనది.
మిత్రులారా!
అయితే, గత 11 సంవత్సరాలుగా విధానం-ప్రక్రియ-అమలు సహా ప్రవర్తన పూర్వక సంస్కరణలు కృతనిశ్చయంతో అమలయ్యాయని నేను సగర్వంగా ప్రకటించగలను. విధానాలు మారినా, మానసిక ధోరణిలో మార్పు రాకపోతే, పనితీరు మెరుగుపడకపోతే సంస్కరణలు కాగితాలకే పరిమితం కాగలవు. కాబట్టి, వ్యవస్థను ఆమూలాగ్రం మార్చేందుకు మేమెంతో కృషి చేశాం.
మిత్రులారా!
ఇప్పుడు మనం ప్రక్రియల గురించి మాట్లడుకుందాం... మంత్రిమండలికి సమాచారం (కేబినెట్ నోట్స్) ఇచ్చే ప్రక్రియ సరళమైనదే అయినా, ఎంతో కీలకమైనది. కానీ, ఈ సమాచారం సిద్ధం చేయడానికి లోగడ వారాలు లేదా నెలలు పట్టేది. మరి దేశం వేగంగా ఎలా పురోగమించగలదు? అందుకే, మేం పద్ధతులను మార్చాం... నిర్ణయాల అమలుకు సాంకేతికతను వినియోగిస్తూ నిర్దిష్ట గడువును నిర్దేశించాం. ఏ అధికారి బల్ల మీదనైనా కేబినెట్ నోట్ గంటల తరబడి ఉండిపోకుండా శ్రద్ధ వహించాం. దాన్ని ఆమోదించడం లేదా తిరస్కరించడంపై సత్వర నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించాం. ఈ ప్రక్రియ ఫలితాలను దేశం నేడు ప్రత్యక్షంగా గమనిస్తోంది.
మిత్రులారా!
ఇప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ఆమోదం విషయానికొద్దాం... గతంలో ఒక్క డిజైన్ ఆమోదానికి ఏళ్లూపూళ్లూ పట్టేది. దీనికితోడు అనేకానేక అనుమతులు-ఆమోదాలు కావాల్సి వచ్చేవి. వివిధ స్థాయులలో ఉత్తర-ప్రత్యుత్తరాలతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయేది. ఇదంతా ప్రైవేట్ రంగం చెబుతున్నది కాదు... సాక్షాత్తూ ప్రభుత్వ నిర్వాకం గురించే! ఈ దుస్సంప్రదాయానికి కూడా మేం స్వస్తి పలికాం. ఇప్పుడిక రహదారులు, రైల్వే రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఎంత వేగంగా సాగుతున్నదో మీరే గమనించండి. ఈ విషయాన్ని వినీత్ గారు విస్తృతంగా విశదీకరించారు.
మిత్రులారా!
జాతీయ భద్రతతో ప్రత్యక్షంగా ముడిపడిన సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పన దీనికి మరొక ఆసక్తికర ఉదాహరణ. లోగడ సాదాసీదా రహదారి నిర్మాణానికైనా స్థానికంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు సరికదా, కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాల్సి వచ్చేది. చివరకు జిల్లా స్థాయిలోనైనా నిర్ణయం తీసుకునే ఆచరణాత్మక అధికారం ఉండేది కాదు. ఒకదాని మీద మరొకటిగా ఉండే అధికార దొంతరలో ఏ ఒక్కరూ బాధ్యత తీసుకునే పరిస్థితి లేదు. అందుకే, దశాబ్దాల తర్వాత కూడా దేశ సరిహద్దులో మౌలిక సదుపాయాల దుస్థితి కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు 2014 తర్వాత ఈ ప్రక్రియను మేం సంస్కరించి, స్థానిక పాలన సంస్థలకు అధికారం దఖలు పరచడంతో సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పన వేగం పుంజుకుంది.
మిత్రులారా!
గడచిన దశాబ్దంలో తెచ్చిన సంస్కరణలలో ఒకటైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ‘యూపీఐ’ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇది కేవలం ఒక అనువర్తనం కాదు... విధానం-ప్రక్రియ-పనితీరు సమ్మేళనానికి ఓ తిరుగులేని నిదర్శనం. బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక ప్రయోజనాలు పొందగలమని ఎన్నడూ ఊహించని పౌరులకు ‘యూపీఐ’ వాటిని చేరువ చేసింది. డిజిటల్ ఇండియా, డిజిటల్ చెల్లింపు వ్యవస్థ, జన్ధన్-ఆధార్-మొబైల్ త్రయం వంటి సంస్కరణలు అనివార్య పరిస్థితుల వల్ల కాకుండా నిబద్ధత నుంచి ఉద్భవించాయి. లోగడ నిర్లక్ష్యానికి గురైన పౌరులందరికీ ఆ సేవలు అందించాలనే మా దృక్పథానికి ఇదొక ఉదాహరణ. ఎవరూ పట్టించుకోని వర్గాలను గౌరవిస్తూ, వారికి సాధికారత కల్పించాలన్నదే మోదీ తపన. ఇదే స్ఫూర్తితో మా ప్రభుత్వం సదా ముందడుగు వేస్తుంది.
మిత్రులారా!
ఈ నవ్య భారత్ దృక్పథం ప్రస్తుత బడ్జెట్లోనూ ప్రతిబింబించింది. బడ్జెట్ విషయంలో లోగడ వ్యయం గురించి మాత్రమే చర్చ సాగేది తప్ప ఫలితాల మాట ప్రస్తావనకు వచ్చేది కాదు. దేనికెన్ని నిధులు కేటాయించారు.. ఏది చౌక లేదా ఖరీదైనదిగా మారింది.. వంటి అంశాలకు బడ్జెట్ చర్చ పరిమితం. అలాగే, టీవీ చర్చావేదికలలో బడ్జెట్పై దాదాపు చర్చ మొత్తం దేశంలో అంతకుమించి మరేమీ లేదన్నట్లు వ్యక్తిగత ఆదాయపు పన్ను పెరిగిందా లేక తగ్గిందా అనే అంశంపైనే కేంద్రీకృతమయ్యేది. అలాగే, బడ్జెట్లో ప్రకటించిన కొత్త రైళ్ల సంఖ్య వార్తల పతాక శీర్షికలలో కనిపించేది. కానీ, సదరు ప్రతిపాదనలు ఏమయ్యాయో పట్టించుకునే నాథుడెవరూ ఉండేవారు కారు. అందుకే, బడ్జెట్ను కేవలం వ్యయ-కేంద్రకంగా కాకుండా ఫలితాల-కేంద్రకంగా మార్చాం.
మిత్రులారా!
బడ్జెట్ చర్చలో మరో కీలక మార్పు ఏమిటంటే- 2014కు ముందు బడ్జెట్తో నిమిత్తం లేకుండా రుణ సమీకరణపై విస్తృత చర్చ సాగేది. అయితే, ఇప్పుడు బడ్జెట్తో నిమిత్తం లేని సంస్కరణలపై చర్చ ఊపందుకుంది. బడ్జెట్ చట్రానికి మించి... భావితరం జీఎస్టీ, ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు, ఆర్టికల్ 370 రద్దు, ముమ్మారు తలాక్ నిషేధ చట్టం, నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని ఆమోదించాం.
మిత్రులారా!
బడ్జెట్లో ప్రకటించినా... దానితో నిమిత్తం లేకుండా చేపట్టినా, సంస్కరణల ఎక్స్ ప్రెస్ వేగం సదా పెరుగుతూనే ఉంటుంది. కేవలం గడచిన ఏడాది కాలంలోనే ఓడరేవులు, సముద్ర రంగంలో సంస్కరణలను అమలు చేశాం. నౌకానిర్మాణ పరిశ్రమ కోసం చర్యలు తీసుకున్నాం.. జన్ విశ్వాస్ చట్టం కింద సంస్కరణలు అమలు ఊపందుకుంది. ఇంధన భద్రత కోసం ‘శాంతి’ చట్టం ప్రవేశపెట్టాం.. కార్మిక చట్ట సంస్కరణల అమలు, భారతీయ న్యాయ సంహిత, వక్ఫ్ చట్టంలో సంస్కరణలు, గ్రామీణ ఉపాధి కల్పన కోసం కొత్త వికసిత భారత్ జీ రామ్ జీ చట్టానికి ఆమోదం.. వంటి అనేక సంస్కరణలను ఏడాది పొడవునా స్థిరంగా అమలు చేశాం.
మిత్రులారా!
ఈ ఏడాది బడ్జెట్ సంస్కరణల ఎక్స్ ప్రెస్ వేగాన్ని మరింత పెంచింది. బడ్జెట్ విభిన్న కోణాల్లో విశిష్టమైనదే అయినప్పటికీ, నేను ఓ రెండు కీలకాంశాలైన మూలధన వ్యయం, సాంకేతికతలను ప్రస్తావిస్తాను. మునుపటి బడ్జెట్ల తరహాలోనే మౌలిక సదుపాయాల వ్యయాన్ని దాదాపు రూ.17 లక్షల కోట్లకు పెంచాం. బహుళ రంగాల్లో సామర్థ్యం, ఉత్పాదకత, ఉపాధి సృష్టి పెంపులో మూలధన వ్యయం బహుగుణ ప్రభావం చూపగలదనే వాస్తవం మీకు తెలిసిందే. ఇక దేశంలో 5 విశ్వవిద్యాలయ టౌన్షిప్పుల నిర్మాణం సహా 2, 3 అంచెల్లోని నగరాల కోసం నగర ఆర్థిక ప్రాంతాల ఏర్పాటు, 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణంపై బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇటువంటి ప్రకటలనన్నీ దేశ పురోగమనంతోపాటు యువతరం ఉజ్వల భవితకు నిజమైన పెట్టుబడులు.
మిత్రులారా!
గత దశాబ్దంలో అంకుర, హ్యాకథాన్ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా సాంకేతికత-ఆవిష్కరణలను వృద్ధికి ప్రధాన చోదకాలుగా గుర్తించాం. దేశంలో ఇప్పుడు 2 లక్షలకుపైగా అంకుర సంస్థలు విభిన్న రంగాలలో పనిచేస్తున్నాయి. వ్యవస్థాపనలో చొరవను ప్రభుత్వం ప్రోత్సహించింది.. ప్రత్యక్ష ఫలితాల ఆధారిత ఆవిష్కరణలకు గుర్తింపునిచ్చింది. ఈ ప్రాథమ్యాలన్నిటినీ ప్రస్తుత బడ్జెట్ మరింత బలోపేతం చేసింది. ఇందులో ముఖ్యంగా బయోఫార్మా, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ వంటి రంగాలకు కేటాయింపులు గణనీయ స్థాయిలో ఉన్నాయి.
మిత్రులారా!
ఇనుమడిస్తున్న దేశ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా రాష్ట్రాలకూ సాధికారత కల్పిస్తున్నాం. ఈ అంశాన్ని గణాంక సహితంగా వివరిస్తాను... 2004-2014 మధ్య పన్నుల పంపిణీ కింద రాష్ట్రాలకు దాదాపు రూ.18 లక్షల కోట్లు లభించాయి. అయితే, 2014-2025 మధ్య ఇప్పటికే రూ.84 లక్షల కోట్లు పంపిణీ అయ్యాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన దాదాపు రూ.14 లక్షల కోట్లతో రాష్ట్రాలకు అందే పన్నుల వాటా రమారమి రూ.100 లక్షల కోట్లకు చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో అభివృద్ధి పనులను నిరాఘాటంగా పూర్తిచేయడం కోసం ఈ నిధులను ఇప్పటికే బదిలీ చేశాం.
మిత్రులారా!
భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విస్తృత చర్చ సాగుతోంది. వాస్తవానికి నేనిక్కడికి వచ్చే ముందే, దీనిపై సంభాషణ మొదలు కాగా, ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణ జరుగుతోంది. అయితే, ఈ రోజు నేను మరొక ఆసక్తికర దృక్కోణాన్ని మీ ముందుంచుతాను... ఇది మీడియా కోరుకునేది కాదుగానీ, ఉపయోగకరమైనదేనని భావిస్తున్నాను. నేనిప్పుడు చెప్పబోయే అంశంపై ఆలోచన మీ మదిలో కూడా మెదలి ఉండకపోవచ్చునని గట్టిగా నమ్ముతున్నాను. ఇంతకూ అదేమిటంటే- అభివృద్ధి చెందిన దేశాలతో ఇంత విస్తృత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు 2014కు ముందు ఎందుకు కార్యరూపం దాల్చలేదని మీరెప్పుడైనా యోచించారా? దేశంలో ఇదే తరహా ప్రభుత్వ వ్యవస్థ, యువశక్తి ఆనాడు కూడా ఉన్నాయి. మరిప్పుడు మారిందేమిటి? అది ప్రభుత్వ దృక్పథం, దాని విధానాలు, సంకల్పం సహా దేశ సామర్థ్యంలో వచ్చిన ప్రగతిశీల మార్పు.
మిత్రులారా!
‘బలహీన పంచకం’లో ఒకటిగా మన ఆర్థిక వ్యవస్థపై ముద్ర పడటం గురించి ఒక్క క్షణం ఆలోచించండి. అలాంటి పరిస్థితిలో మనతో సంబంధాలు నెరపడానికి ఏ దేశం ముందుకొస్తుంది? ఓ గ్రామంలోని సంపన్న కుటుంబం తమ బిడ్డను పేదింటికి కోడలుగా పంపడానికి అంగీకరిస్తుందా? కచ్చితంగా చిన్నచూపు చూస్తుంది... ఆనాడు ప్రపంచంలో మన దేశం పరిస్థితీ ఇదే. విధాన స్తంభన, కుంభకోణాల నేపథ్యంలో భారత్ను ఏ దేశం విశ్వసించగలదు? తయారీ రంగంలో పరిస్థితుల రీత్యా 2014కు ముందు, భారత్ బలహీన దేశంగా ఉండేది. ఏదో ఒక సందర్భంలో... ఏదైనా దేశం ముందుకొచ్చినా, అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల వల్ల అవి మన మార్కెట్ను గుప్పిట పట్టి, తమ ఉత్పత్తులతో దేశాన్ని ముంచెత్తుతాయనే భయం మునుపటి ప్రభుత్వాలలో ఉండేది. అటువంటి నిస్పృహ నిండిన ఆనాటి వాతావరణం నడుమ 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం కేవలం 4 సమగ్ర వాణిజ్య ఒప్పందాలు మాత్రమే కుదుర్చుకోగలిగింది. తద్విరుద్ధంగా గత దశాబ్దంలో భారత్ విభిన్న రంగాల్లో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. నేటి భారత్ ఆత్మవిశ్వాసంతో, ప్రపంచ పోటీతత్వంతో ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంది. గత 11 ఏళ్లుగా బలమైన తయారీ వ్యవస్థను భారత్ రూపొందించుకుంది. ఈ సామర్థ్యం, సాధికారతలతోనే భారత్ నేడు ప్రపంచ విశ్వాసాన్ని చూరగొంది. ‘వికసిత భారత్’ దిశగా ప్రస్థానానికి కీలక స్తంభమైన వాణిజ్య విధానంలో వినూత్న పరిణామానికి ప్రాతిపదిక ఏర్పడింది.
మిత్రులారా!
ప్రగతి పయనంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యానికి ప్రభుత్వం పూర్తి అవగాహనతో కృషి చేస్తోంది. ప్రగతి పరుగులో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇక దివ్యాంగుల సంక్షేమంపై మునుపటి ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మేమూ అదే బాటలో పయనించి ఉండవచ్చు... కానీ, వారి సమస్యలపై ప్రభుత్వ వాస్తవిక అవగాహన అందుకు భిన్నం. నేనిప్పుడు చెప్పే ఉదాహరణ స్వల్పమైనదిగా మీకు అనిపించవచ్చు. భాషా వైవిధ్యానికి భారత్ నిలయం.. అదే తరహాలో సంకేత భాష కూడా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అస్సాం సహా రాష్ట్రానికో రకంగా ఉంటుంది. కాబట్టి, వైకల్యం ఉన్నవారు ఆయా రాష్ట్రాలకు వెళ్లినపుడు సంభాషణ కష్టతరం అవుతుంది. దీన్ని ఏకీకృతం చేయడం సవాలుగా అనిపించవచ్చు... కానీ, అవగాహన గల ప్రభుత్వం దాన్నొక అల్ప విషయంగా పరిగణించదు. అందుకే, దేశంలో తొలిసారి సంకేత భాషను సంస్థాగతీకరించి, ప్రామాణికంగా రూపొందించాం. అదేవిధంగా తటస్థ లింగ సమాజం చాలా కాలంపాటు హక్కుల కోసం పోరాడిన నేపథ్యంలో వారికి గౌరవం, రక్షణ కల్పిస్తూ చట్టం తెచ్చాం. ఇక గత దశాబ్దంలో లక్షలాది మహిళలు ముమ్మారు తలాక్ దుస్సంప్రదాయం నుంచి విముక్తులయ్యారు. అంతేకాకుండా లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
మిత్రులారా!
ప్రభుత్వ యంత్రాంగం ధోరణిలోనూ ఇప్పుడెంతో మార్పు రావడంతో మరింత అవగాహనతో పనిచేస్తోంది. ఉచిత రేషన్ పంపిణీ వంటి పథకాల అమలులో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని అపహాస్యం చేస్తుండగా, కొన్ని వార్తాపత్రికలు దాన్ని మరికాస్త పెంచి పోషిస్తుంటాయి. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరిక విముక్తులైతే, ఇంకా ఉచిత రేషన్ ఎందుకని వారు విమర్శించవచ్చు. కానీ, అదొక వింత ప్రశ్న... ఒక రోగిని ఆస్పత్రినుంచి ఇంటికి పంపే సమయంలో ఇంటికెళ్లాక చాలా రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తారా.. లేదా? అదేవిధంగా వీరంతా నవ్య మధ్యతరగతిలోకి చేరారు కాబట్టి, వారి పేదరికం పూర్తిగా సమసినట్టేనా? పేదరికం నుంచి బయటపడటం ఒక్కటే సరిపోదని సంకుచిత దృక్పథం ఉన్నవారికి అర్థం కావడం లేదు. నవ్య మధ్యతరగతిలోకి ప్రవేశించిన వారు తిరిగి పేదరికంలోకి జారిపోకుండా చూసుకోవాలి. అందుకే ఉచిత ఆహార ధాన్యాల రూపంలో నిరంతర మద్దతు అవసరం. గత సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.లక్షల కోట్లు ఖర్చు చేసింది. తద్వారా పేదలకు, నవ్య-మధ్యతరగతికి ఎనలేని చేయూతనిచ్చింది.
మిత్రులారా!
ఆలోచన దృక్పథంలో మరొక వ్యత్యాసాన్ని కూడా మనం గమనించవచ్చు. నేను తరచూ 2047 నాటికి వికసిత భారత్ గురించి ప్రస్తావించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తుంటారు. నిజంగానే 2047 నాటికి దేశం వికసిత భారత్గా రూపొందుతుందా.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మనస్తత్వం కూడా గట్టిగా వినిపిస్తూంటుంది.
మిత్రులారా!
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారు లాఠీ దెబ్బలు తిన్నారు... సెల్యులార్ జైలులో మగ్గారు.. చివరకు ఉరి కొయ్యలకు వేలాడారు. అయితే, తమ జీవితకాలంలో స్వాతంత్ర్యం వచ్చే అవకాశం లేదు కాబట్టి, దానికోసం తామెందుకు త్యాగాలు చేయాలని వారు ఆలోచించి ఉంటే, భారత్ పరాయి పాలన నుంచి అసలు విముక్తం కాగలిగేదా? దేశమే ప్రధానమైనప్పుడు ప్రతి నిర్ణయం, ప్రతి విధానం దేశం కోసమే తీసుకోగలం. దేశ ప్రగతి కోసం నిర్విరామ కృషిపై ప్రభుత్వ దార్శనికత స్పష్టంగా ఉంది. నేటి తరం 2047 వరకు ఉంటుందా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా దేశం, భవిష్యత్తరాలు కొనసాగుతాయి. అందుకే, దేశ భవిష్యత్తు ఉజ్వలమై సురక్షితంగా కొనసాగేలా వర్తమానం తననుతాను అంకితం చేసుకోవడం నేటి ప్రథమ కర్తవ్యం. కాబట్టే, రేపటి తరం ఫలం అనుభవించేలా నేనివాళే మొక్క నాటుతున్నాను.
మిత్రులారా!
మొత్తం మీద ప్రపంచం అవరోధాలతో సహజీవనానికి సిద్ధం కావాలి. వాటి స్వభావం మరింత ముదురుతూనే ఉంటుంది.. కానీ, వ్యవస్థలు వేగంగా పరిణామం చెందడం అనివార్యం. కృత్రిమ మేధ (ఏఐ) ఫలితంగా ఇప్పటికే వస్తున్న మార్పులను మనం చూస్తున్నాం. భవిష్యత్తులో ఏఐ మరిన్ని విప్లవాత్మక మార్పులు తేవడం తథ్యమైనా, భారత్ అందుకు సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రపంచ దేశాలు, సాంకేతిక అగ్రగాముల భాగస్వామ్యంతో ‘అంతర్జాతీయ ఏఐ ప్రభావ శిఖరాగ్ర సదస్సు’ను భారత్ నిర్వహించనుంది. మెరుగైన ప్రపంచాన్ని రూపుదిద్దడం కోసం మేం సంయుక్తంగా కృషి చేస్తాం. ఈ ఆత్మవిశ్వాసంతో ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని మీకందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
అనేకానేక ధన్యవాదాలు..
వందేమాతరం!
***
(రిలీజ్ ఐడి: 2228210)
|