ప్రధాన మంత్రి కార్యాలయం
మలేషియాలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో ప్రధాని భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
08 FEB 2026 2:50PM by PIB Hyderabad
మలేషియాకు చెందిన నలుగురు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. పెట్రోనాస్ అధినేత, ఆ గ్రూప్ సీఈవో తాన్ శ్రీ తెంగ్కు మహమ్మద్ తౌఫిక్, బెర్జాయా కార్పొరేషన్ బెర్హాద్ వ్యవస్థాపకుడు తాన్ శ్రీ దాతో సేరి విన్సెంట్ తాన్ చీ యియున్, ఖజానా నేషనల్ బెర్హాద్ మేనేజింగ్ డైరెక్టర్ దాతో అమీరుల్ ఫైసల్ వాన్ జహీర్, ఫైసన్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థాపకుడు దాతో పువా ఖైన్ సెంగ్తో ఆయన భేటీ అయ్యారు.
భారత్, మలేషియా మధ్య పెరుగుతున్న వ్యాపార సంబంధాలనూ, భారత ఆర్థిక వృద్ధి గమనంపై మలేషియా కంపెనీలు చూపుతున్న అమితాసక్తిని ప్రధానమంత్రి అభినందించారు. వాణిజ్య నిర్వహణను సులభతరం చేయడానికీ, అలాగే స్థిరమైన, సమర్థమైన, పారదర్శకమైన వ్యాపార, విధానపరమైన వాతావరణాన్ని ఏర్పరిచేలా.. కొన్నేళ్లుగా భారత్లో చేపట్టిన సంస్కరణలు, కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సాంకేతికత, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ, ఆరోగ్య రక్షణ వంటి రంగాలలో భారత్ అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని మలేషియా వ్యాపార సంస్థలను ఆయన ప్రోత్సహించారు. ఈ దిశగా 2026 ఫిబ్రవరి 07న కౌలాలంపూర్లో నిర్వహించిన పదో ‘భారత్-మలేషియా సీఈవో ఫోరమ్’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. భారత్ - మలేషియా వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను ఈ ఫోరంలో జరిగిన చర్చలు మరింత బలోపేతం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వికసిత భారత్ నిర్మాణం దిశగా భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను పారిశ్రామిక ప్రముఖులు ప్రశంసించారు. వికాసం దిశగా భారత్ గమనంపై విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్టుబడి పోర్ట్ఫోలియోలను విస్తరించడం ద్వారా, భారతీయ భాగస్వాములతో కలిసి ఉమ్మడి వ్యాపారాల్లో పాలుపంచుకోవడం ద్వారా.. భారత్లో తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు అమితాసక్తిని వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2225158)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5