వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల్లో
రైతు ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
రైతుల ప్రయోజనాలే అత్యంత కీలకం; ప్రధాన ధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు లేదా
డెయిరీ రంగానికి ఎలాంటి ముప్పు లేదు - శ్రీ చౌహాన్
తక్కువ పన్నులతో బియ్యం, మసాలా దినుసులు, వస్త్రాల ఎగుమతులకు ఊతం;
పత్తి రైతులకు లబ్ధి - శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 5:32PM by PIB Hyderabad
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం భారత వ్యవసాయ ప్రయోజనాలను, ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలను పూర్తిగా రక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో జరిగిన ఈ ఒప్పందం దౌత్యనీతి, అభివృద్ధి, ఆత్మగౌరవానికి సరికొత్త నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో ప్రధానమంత్రి మొదటి నుంచీ రాజీ లేని వైఖరితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీ చౌహాన్, భారత ప్రధాన ధాన్యాలు, పండ్లు, ముఖ్యమైన పంటలు, చిరుధాన్యాలు, పాడి ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమని, వీటికి ఎటువంటి ముప్పు లేదని పునరుద్ఘాటించారు. చిన్న, పెద్ద రైతుల ప్రయోజనాలను సంపూర్ణంగా కాపాడారని, ఈ ఒప్పందం భారత వ్యవసాయ రంగానికి నష్టాలు కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
చిన్న రైతుల ప్రయోజనాలు, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల పట్ల వ్యక్తమవుతున్న ఆందోళనలపై వివరణ
భారతదేశంలో సగానికి పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నందున, చిన్న రైతులు ఇబ్బంది పడతారనే ఆందోళనలను మంత్రి శ్రీ చౌహాన్ తోసిపుచ్చారు. విదేశీ వస్తువులు భారత మార్కెట్లోకి అకస్మాత్తుగా ప్రవేశించి అలజడి సృష్టించే అవకాశం లేదని ఆయన హామీ ఇచ్చారు. భారతీయ రైతులకు నష్టం కలిగించే విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అన్ని ప్రధాన పంటలు, ఆహార ధాన్యాలు, పండ్లు, డెయిరీ ఉత్పత్తులకు రక్షణ కల్పించామని ఆయన వివరించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్లో ప్రవేశం పెరుగుతుందంటూ ఆ దేశ ఆర్థిక మంత్రి చేసిన ట్వీట్ వల్ల కలిగిన గందరగోళంపై శ్రీ చౌహాన్ స్పందించారు. దీనికి సంబంధించి వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇప్పటికే పార్లమెంటులో వాస్తవాలను వివరించారని ఆయన గుర్తు చేశారు. స్వదేశీ రైతులపై ఒత్తిడి పడేలా భారత్ తన మార్కెట్లను ఏమాత్రం తెరవలేదని, కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులకు రక్షణ కవచం అలాగే ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
బియ్యం, మసాలా దినుసులు, వస్త్ర ఎగుమతులకు ఊతం
ఈ ఒప్పందం ద్వారా లభించే ఎగుమతి అవకాశాలను ప్రస్తావిస్తూ, భారత్ ఇప్పటికే అమెరికాతో సహా అనేక దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని, ఇటీవల దాదాపు రూ. 63,000 కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. పన్నుల తగ్గింపు వల్ల భారత బియ్యం, మసాలా దినుసులు, వస్త్ర ఎగుమతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని, వస్త్ర ఎగుమతుల వృద్ధి లక్షలాది మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారంలో పెడుతున్నాయనీ, ఈ ఒప్పందం కచ్చితంగా భారతీయ రైతుల ప్రయోజనం కోసమేనని, ఇది కొత్త ఎగుమతి మార్గాలను తెరుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
వాణిజ్య ఒప్పందం వివరాలను పార్లమెంటులో వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ, ఒప్పందానికి సంబంధించిన అన్ని అంశాలను నిర్ణీత సమయంలో తెలియజేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. భారతీయ రైతుల ప్రయోజనాలను సంపూర్ణంగా కాపాడాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, అందులో ఎలాంటి రాజీ ప్రసక్తి లేదని ఆయన చెప్పారు.
“రైతులు అన్నదాతలు: వారికి సేవ చేయడం భగవంతుడిని పూజించడంతో సమానం”
వ్యవసాయ రంగం చాలా పెద్దది కావడంతో, రైతుల మధ్య గందరగోళం లేదా భయం కలగకుండా స్పష్టమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందని శ్రీ చౌహాన్ అన్నారు. “రైతులు మన అన్నదాతలు, జీవన ప్రదాతలు. వారి సంక్షేమమే దేశ సంక్షేమం.వారి ప్రయోజనాలు కచ్చితంగా సురక్షితం” అని పేర్కొన్నారు. మరింత భావోద్వేగంతో మాట్లాడుతూ, రైతులకు సేవ చేయడం దేవుని పూజతో సమానమని, మోదీ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ రైతులకు అండగా నిలుస్తుందని శ్రీ చౌహాన్ తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2224195)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13