సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గత 5 ఏళ్లలో 70 వేలకు పైగా చిత్రాలకు ధ్రువీకరణ జారీ చేసిన సీబీఎఫ్సీ.. చట్టపరమైన ఉల్లంఘనలు ఉన్న సందర్భాల్లో మాత్రమే కత్తిరింపులు
प्रविष्टि तिथि:
04 FEB 2026 4:25PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ (కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి).. సినిమాటోగ్రాఫీ చట్టం 1952, సినిమాటోగ్రాఫీ సర్టిఫికేషన్ నియమాలు 2024, సంబంధిత మార్గదర్శకాల ప్రకారం సినిమాల ప్రదర్శన కోసం వాటికి ముందుగా ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తుంది.
దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత, శాంతిభద్రతలు, సభ్యత, నైతికత, పరువు నష్టం, కోర్టు ధిక్కరణ లేదా నేరానికి ప్రేరేపించడం వంటి చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే చిత్రాల్లో కోతలు, మార్పులు సిఫార్సు చేస్తుంది.
గత ఐదేళ్లలో (2020–21 నుంచి 2024–25 వరకు) మొత్తం 71,963 సినిమాలకు సీబీఎఫ్సీ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది.
సినిమాటోగ్రాఫీ చట్టం ప్రకారం బోర్డు ఇచ్చే ఉత్తర్వులకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అటువంటి కేసులను న్యాయపరమైన విచారణ ఫలితాల ఆధారంగా పరిష్కరిస్తారు.
సృజనాత్మక స్వేచ్ఛను కాపాడుతూనే, సినిమాటోగ్రాఫీ చట్టం కింద తన విధులను నిర్వర్తిస్తూ.. పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన ధ్రువీకరణ ప్రక్రియను కొనసాగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
శ్రీ మనీష్ తివారీ, శ్రీ టి.ఆర్. బాలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్సభలో ఈ సమాచారాన్ని అందించారు.
(रिलीज़ आईडी: 2223253)
आगंतुक पटल : 73