రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రయాణికుల-కేంద్రిత రైల్వే ఆధునికీకరణ, మెరుగైన భద్రత, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేలా 2026-27 కేంద్ర బడ్జెట్
హై-స్పీడ్ రైలు కారిడార్లతో గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం
ఢిల్లీ-వారణాసి 3 గంటల 50 నిమిషాలు... వారణాసి-సిలిగురి 2 గంటల 55 నిమిషాలు...
చెన్నై-బెంగళూరు 1 గంట 13 నిమిషాలు... ముంబయి-పూణే 48 నిమిషాలు
యాత్రికులు, పర్యాటకుల ప్రయాణాలు, అన్ని వాతావరణ పరిస్థితుల్లో
అనుసంధానాన్ని మెరుగుపరచడానికి హిమాలయన్ రైలు విస్తరణ
మారుమూల ప్రాంతాలకూ యాక్సెస్ మెరుగుదల లక్ష్యంగా రిషికేశ్-కర్ణప్రయాగ్ లైన్, యురి విస్తరణలు
ఈశాన్య భారతంతో అన్ని ప్రాంతాల అనుసంధానానికి
40 కిలోమీటర్ల భూగర్భ రైలు కారిడార్ ప్రణాళిక
ప్రయాణికులు, సరుకుల నిరంతర రవాణాను నిర్ధారించేందుకు నాలుగు-లైన్ల విస్తరణ
నాడు పోస్టు చేయడమైనది:
03 FEB 2026 7:31PM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్ ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధికి అతిపెద్ద ఊతం లభించింది. కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, సరుకు రవాణా వ్యవస్థలను విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిగాయి. ఈ నిరంతర పెట్టుబడులు సమగ్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ... రైల్వేలను దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి, లాజిస్టిక్స్ సామర్థ్యానికి కీలకంగా మార్చుతున్నాయి.
2026–27 కేంద్ర బడ్జెట్లో రైల్వే మంత్రిత్వ శాఖ హై-స్పీడ్ కనెక్టివిటీ, బహుళ రవాణా పద్ధతులు, విద్యుదీకరణ, సురక్షిత రవాణా వంటి ప్రాధాన్యాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ సమైక్యత, ప్రయాణికుల సౌలభ్యం, ఆర్థిక అవకాశాల చోదకశక్తిగా రైల్వే పెట్టుబడుల స్థానాన్ని బలోపేతం చేసింది.
ఉత్తరప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రాలు ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మధ్య కొత్త బుల్లెట్-రైలు కారిడార్ల ద్వారా మార్పునకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని కీలకమైన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ఈ మార్గంలోని ద్వితీయ శ్రేణి నగరాలను అనుసంధానించడం లక్ష్యంగా రూపొందించారు. ప్రతిపాదిత వారణాసి-సిలిగురి కారిడార్ ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక, విద్యా, వైద్య కేంద్రాలను అనుసంధానిస్తుంది. ఢిల్లీ-వారణాసి హై-స్పీడ్ కారిడార్ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 3 గంటల 50 నిమిషాలకు తగ్గిస్తుంది. వారణాసి నుంచి పాట్నా మీదుగా పశ్చిమ బెంగాల్లోని సిలిగురి వరకు ఉన్న హై-స్పీడ్ రైలు కారిడార్ వారణాసి-సిలిగురి మధ్య ప్రయాణ సమాయాన్ని కేవలం 2 గంటల 55 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ కనెక్టివిటీ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లలో విస్తరించి ఉన్న బెల్ట్లో నూతన ఆర్థిక కారిడార్ను సృష్టిస్తుందనీ... ప్రాంతీయ అభివృద్ధిని, ఆర్థిక కార్యకలాపాలనూ గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
తూర్పు భారతంలో సిలిగురి నుంచి వారణాసిని అనుసంధానించే తొలి హై-స్పీడ్ రైలు సేవల ద్వారా పశ్చిమ బెంగాల్ సైతం ప్రయోజనం పొందనుంది. ఇది అంతర్-ప్రాంతీయ రవాణాను మెరుగుపరుస్తుంది. వాణిజ్య, సేవా అవకాశాలను విస్తరిస్తుంది. ఈశాన్య భారతంతో పాటు పరిసర ప్రాంతాలకు రికార్డు కేటాయింపులు కొత్త లైన్ నిర్మాణం, స్టేషన్ పునరాభివృద్ధి, భద్రతా మెరుగుదలకు వీలు కల్పించాయి. మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరిచాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలనూ బలోపేతం చేస్తున్నాయి. ఈ పనులు స్థానిక వ్యాపార సంస్థలకు మద్దతునిస్తూనే... విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, అధికారిక మార్కెట్లకూ అనుసంధానతను విస్తరిస్తున్నాయి.
ఈశాన్య ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించే 40 కిలోమీటర్ల భూగర్భ రైలు కారిడార్ ఒక కీలకమైన వ్యూహాత్మక ప్రాధాన్యం గల ప్రాజెక్ట్. భూగర్భ రైల్వే ట్రాక్లను వేయడం, ఇప్పటికే ఉన్న ట్రాక్లను నాలుగు లైన్లుగా విస్తరించడం... అదనపు సామర్థ్యాన్ని కల్పించడం... ప్రయాణికుల, సరుకుల రవాణాకు ఈ కీలక రవాణా జోన్ ద్వారా నిరంతరాయంగా, సమర్థమైన రైల్వే రవాణాను నిర్ధారించడం కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 100 శాతం విద్యుదీకరణ పూర్తయింది. ఈ రాష్ట్రాలు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అప్గ్రేడ్ చేస్తున్నాయి. రైలు భద్రత, సుస్థిరత, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తున్నాయి. ఖనిజ, పారిశ్రామిక బెల్ట్లలో, జార్ఖండ్లోని ప్రాజెక్టులు, ఛత్తీస్గఢ్లోని రౌఘాట్-జగ్దల్పూర్ లైన్... సరుకు రవాణా సంబంధాలను, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేస్తున్నాయి.
దక్షిణ భారతంలో రాష్ట్రాల వారీగా రైల్వే కేటాయింపులు స్పష్టంగా అధిక-ప్రభావం గల ప్రయాణికుల కనెక్టివిటీ దిశగా దృష్టి సారించాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పరిసర పట్టణ కేంద్రాలను అనుసంధానిస్తూ వర్ధమాన హై-స్పీడ్ రైలు మార్గం "డైమండ్" ప్రాజెక్టును రూపొందించారు. ఈ నెట్వర్క్ దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక ఇంజిన్ల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఐటీ, తయారీ, సేవల కారిడార్లలో సౌకర్యవంతమైన రవాణానూ అనుమతిస్తుంది. వ్యాపార సంబంధ ప్రయాణాలు, ప్రతిభ సంబంధ ప్రయాణాలు, అంతర్-రాష్ట్ర ప్రయాణాలు మరింత అందుబాటులోకి రానున్న క్రమంలో భారత ప్రధాన సాంకేతిక కేంద్రంగా బెంగళూరు అత్యధికంగా లాభపడనుంది..
హై స్పీడ్ కారిడార్ పూర్తయిన తర్వాత ప్రయాణ సమయాలు... చెన్నై-బెంగళూరు కోసం సుమారు 1 గంట 13 నిమిషాలు, బెంగళూరు-హైదరాబాద్ కోసం సుమారు 2 గంటలు, చెన్నై-హైదరాబాద్ కోసం సుమారు 2 గంటల 55 నిమిషాలకు తగ్గుతాయి. ఈ నెట్వర్క్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు శక్తిమంతమైన వృద్ధిని అనేక రెట్లు పెంచడంతో పాటుగా ప్రాంతీయ అభివృద్ధినీ గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
మహారాష్ట్రకు కేటాయింపుల్లో ప్రధాన వాటా... అధిక-ప్రభావాన్ని కలిగించే, సామర్థ్యాన్ని పెంపొందించే ప్రాజెక్టులపై, ముఖ్యంగా ముంబయి-పూణే హై-స్పీడ్ రైలు కారిడార్, రద్దీగా ఉండే ట్రంక్ మార్గాల విస్తరణ, కీలక స్టేషన్ల ఆధునికీకరణ, పునరాభివృద్ధి, రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న ప్రయాణికుల, సరుకు రవాణా డిమాండ్కు మద్దతుగా సబర్బన్, ఇంటర్-సిటీ రైలు సేవలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
పశ్చిమ, మధ్య భారతంలో రాబోయే ముంబయి-పూణే హై-స్పీడ్ కారిడార్ ప్రయాణ సమయాన్ని దాదాపు 48 నిమిషాలకు తగ్గించడంతో పాటు రెండు ప్రధాన పట్టణ కేంద్రాలను సమర్థంగా అనుసంధానిస్తుంది. పూణే నుంచి హైదరాబాద్కు దాదాపు 1 గంట 55 నిమిషాల్లో చేరుకోగల వేగవంతమైన కనెక్టివిటీ, అక్కడ నుంచి దక్షిణ భారత నగరాలకు అనుసంధానం వల్ల ఈ ప్రాంతాల అంతటా నిరంతరాయంగా హై-స్పీడ్ స్పైన్ ఏర్పడుతుంది. ప్రయాణికులకు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకూ ప్రయోజనం చేకూరుతుంది.
హిమాలయాలు, ఉత్తర ప్రాంతాల్లో ఆర్థిక అనుసంధానత, పర్యాటకం సహా అన్ని వాతావరణాలకు అనువైన రవాణాను పెంపొందించేలా బడ్జెట్ రూపొందించారు. సంక్లిష్టమైన సొరంగాలను కలిగి ఉన్న ఉత్తరాఖండ్లోని రిషికేశ్-కర్ణప్రయాగ్ లైన్ మారుమూల ప్రాంతాలకు యాక్సెస్ను మెరుగుపరుస్తుంది. ప్రయాణ సమయాన్నీ తగ్గిస్తుంది. విద్యుదీకరణ, భద్రతా నవీకరణల్లో విస్తృత పెట్టుబడులతో పాటు యాత్రికులు, పర్యాటకుల ప్రయాణాలకు మద్దతునిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నెట్వర్క్ విస్తరణ, ఆధునికీకరణ, విద్యుదీకరణకు కేంద్రీకృత మద్దతు లభిస్తుంది. కొండ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచుతుంది. జమ్మూ కాశ్మీర్లోని యురి మార్గంలో విస్తరణతో సహా బలోపేతం చేసిన రైలు లింకులు... శీతాకాల అంతరాయాలు ఉన్నప్పటికీ ఏడాది పొడవునా కనెక్టివిటీని నిర్ధారిస్తాయి. ఇది ప్రయాణికులకు, స్థానిక ఆర్థిక వ్యవస్థలకూ ప్రయోజనం చేకూరుస్తుంది.
జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రల మీదుగా వెళుతున్న డంకుని (పశ్చిమ బెంగాల్) నుంచి సూరత్ (గుజరాత్) వరకు తూర్పు-పశ్చిమ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ద్వారా సరుకు రవాణా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్నారు. ఈ కారిడార్ వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన సరుకు రవాణాకు వీలు కల్పిస్తుంది. ప్రయాణికుల మార్గాల్లో రద్దీని తగ్గిస్తుంది. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుంది. ఈ కీలక ఆర్థిక రాష్ట్రాల్లో పారిశ్రామిక, వాణిజ్య వృద్ధికి తోడ్పడుతుంది.
ప్రయాణికుల కోసం ఈ కార్యక్రమాలు తక్కువ ప్రయాణ సమయంతో పాటు సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన రైళ్లు, ఆధునికీకరించిన స్టేషన్లు, తగ్గిన రద్దీ, చివరి ప్రాంతాలకూ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. అదే సమయంలో భారతీయ రైల్వేల దీర్ఘకాలిక లక్ష్యమైన 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా కోసం ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ఆధునిక రైలింజిన్లు, అప్గ్రేడ్ చేసిన ట్రాక్లు, అధునాతన సిగ్నలింగ్ ద్వారా మద్దతు లభిస్తుంది. ఇది ప్రయాణికుల సేవలకు అంతరాయం కలిగించకుండా సరుకులను వేగంగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. రాష్ట్రాల్లో అధిక మూలధన పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రాంతీయ అభివృద్ధిని పెంచుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలనూ బలోపేతం చేస్తుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన సమన్వయంతో వికసిత్ భారత్ దార్శనికతనూ సాకారం చేసుకోవచ్చు. విధాన ప్రకటన తర్వాత, వివరణాత్మక ప్రణాళిక, అమలుతో ఇప్పుడు ఈ దార్శనికత సాకారమవడం ప్రారంభమవుతుంది.
రాష్ట్రాల వారీగా రైల్వే బడ్జెట్ కేటాయింపు వివరాలు
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయ మార్పు నమోదైంది. ఈ రాష్ట్రంతో పాటు తెలంగాణ వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ. 886 కోట్లు ఉండగా 2026–27లో రూ. 10,134 కోట్లకు చేరడం ద్వారా పదకొండు రెట్లు పెరిగింది. ఈ గణనీయ పెట్టుబడి రూ.92,649 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చింది.
అస్సాం - ఈశాన్య ప్రాంతం: అస్సాం, ఈశాన్య ప్రాంతాలు గణనీయమైన రైల్వే అభివృద్ధిని సాధించాయి. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.2,122 కోట్లు ఉండగా 2026–27లో రూ.11,486 కోట్లకు చేరి ఐదు రెట్లు పెరిగింది. ఈ నిధులు మొత్తం రూ.72,468 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిస్తున్నాయి.
బీహార్: బీహార్ రైల్వే మౌలిక సదుపాయాల్లో పరివర్తనాత్మక విస్తరణ నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.1,132 కోట్ల నుంచి 2026–27లో రూ.10,379 కోట్లకు చేరి తొమ్మిది రెట్లు పెరిగింది. ఈ అపూర్వ పెట్టుబడులు రూ.1,09,158 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చాయి.
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయ పరివర్తనను నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.311 కోట్ల నుంచి 2026–27లో రూ.7,470 కోట్లకు చేరి ఏకంగా 24 రెట్లు పెరిగింది. ఈ గణనీయ పెట్టుబడులు మొత్తం రూ.51,080 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చాయి.
ఢిల్లీ: ఢిల్లీ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయ పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.96 కోట్ల నుంచి 2026–27లో రూ.2,711 కోట్లకు చేరి ఏకంగా 28 రెట్లు పెరిగింది. ఈ పెట్టుబడులు మొత్తం రూ.8,976 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చాయి.
గోవా: గోవా రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందాయి. 2026–27లో రూ.515 కోట్ల కేటాయింపులతో మొత్తం రూ.4,344 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతు లభించింది.
గుజరాత్: గుజరాత్ రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయమైన పరివర్తనను సాధించాయి. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.589 కోట్ల నుంచి 2026–27లో రూ.17,366 కోట్లకు చేరి 29 రెట్లు పెరిగింది. ఈ చరిత్రాత్మక పెట్టుబడితో రూ.1,28,748 కోట్ల విలువైన పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
హర్యానా: హర్యానా తన రైల్వే మౌలిక సదుపాయాల్లో పరివర్తనాత్మక విస్తరణ నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.315 కోట్ల నుంచి 2026–27లో రూ.3,566 కోట్లకు చేరి 11 రెట్లు పెరిగింది. ఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.12,091 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.108 కోట్ల నుంచి 2026–27లో రూ.2,911 కోట్లకు చేరి 27 రెట్లు పెరిగింది. ఈ పెట్టుబడి మొత్తం రూ.17,711 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ రైల్వే మౌలిక సదుపాయాల్లో సుస్థిర అభివృద్ధిని సాధించింది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.1,044 కోట్ల నుంచి 2026–27లో రూ.1,086 కోట్లకు పెరిగింది. ఈ పెట్టుబడి మొత్తం రూ.522 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిస్తుంది.
జార్ఖండ్: జార్ఖండ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో పరివర్తనాత్మక ప్రోత్సాహాన్ని పొందింది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.457 కోట్ల నుంచి 2026–27లో రూ.7,536 కోట్లకు చేరి ఏకంగా 16 రెట్లు పెరిగింది. ఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.63,470 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
కర్నాటక: కర్నాటక రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.835 కోట్ల నుంచి 2026–27లో రూ.7,748 కోట్లకు చేరి తొమ్మిది రెట్లు పెరిగింది. ఈ పెట్టుబడి మొత్తం రూ.52,950 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
కేరళ: కేరళ తన రైల్వే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, అభివృద్ధిలో అపూర్వ పెరుగుదల నమోదైంది. రాష్ట్ర వార్షిక సగటు రైల్వే బడ్జెట్ కేటాయింపు 2009–14లో రూ.372 కోట్ల నుంచి 2026–27లో రూ.3,795 కోట్లకు చేరి దాదాపు పది రెట్లు పెరిగింది. ఈ చరిత్రాత్మక నిధుల ప్రోత్సాహం రూ. 18,041 కోట్ల విలువైన కొనసాగుతున్న పనులకు మద్దతునిచ్చింది.
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రైల్వే పెట్టుబడిలో పరివర్తనాత్మక మెరుగుదల నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.632 కోట్ల నుంచి 2026–27లో రూ.15,188 కోట్లకు చేరి 24 రెట్లు పెరిగింది. ఈ చరిత్రాత్మక కేటాయింపు మొత్తం రూ.1,18,379 కోట్లతో కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
మహారాష్ట్ర: మహారాష్ట్ర రైల్వే మౌలిక సదుపాయాల్లో చరిత్రాత్మక పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.1,171 కోట్ల నుంచి 2026–27లో రూ.23,926 కోట్లకు చేరి 20 రెట్లు పెరిగింది. ఈ అపూర్వమైన పెట్టుబడి మొత్తం రూ.1,70,058 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
ఒడిశా: ఒడిశా రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.838 కోట్ల నుంచి 2026–27లో రూ.10,928 కోట్లకు చేరి 13 రెట్లు పెరిగింది. ఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.90,659 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
పంజాబ్: పంజాబ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.225 కోట్ల నుంచి 2026–27లో రూ.5,673 కోట్లకు చేరి ఏకంగా 25 రెట్లు పెరిగింది. ఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.26,382 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
రాజస్థాన్: రాజస్థాన్ రైల్వే మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.682 కోట్ల నుంచి 2026–27లో రూ.10,228 కోట్లకు చేరి 15 రెట్లు పెరిగింది. ఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.56,863 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
తమిళనాడు: తమిళనాడు రైల్వే మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.879 కోట్ల నుంచి 2026–27లో రూ.7,611 కోట్లకు చేరి తొమ్మిది రెట్లు పెరిగింది. ఈ గణనీయమైన పెట్టుబడి మొత్తం రూ.35,701 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
తెలంగాణ: తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.886 కోట్లు (ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ) నుంచి 2026–27లో రూ.5,454 కోట్లకు చేరి ఆరు రెట్లు పెరిగింది. ఈ కీలక పెట్టుబడి మొత్తం రూ.47,984 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో చరిత్రాత్మక పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.1,109 కోట్ల నుంచి 2026–27లో రూ.20,012 కోట్లకు చేరి 18 రెట్లు పెరిగింది. ఈ భారీ పెట్టుబడి మొత్తం రూ.92,056 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.187 కోట్ల నుంచి 2026–27లో రూ.4,769 కోట్లకు చేరి ఏకంగా 26 రెట్లు పెరిగింది. ఈ పెట్టుబడి మొత్తం రూ.39,491 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చింది.
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రైల్వే మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.4,380 కోట్ల నుంచి 2026–27లో రూ.14,205 కోట్లకు చేరడం ద్వారా మూడు రెట్లు పెరిగింది. ఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.92,974 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.
***
(రిలీజ్ ఐడి: 2223113)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9