ప్రధాన మంత్రి కార్యాలయం
అండమాన్, నికోబార్ దీవుల్లో పరాక్రమ దివస్ సందర్భంగా పీఎం ప్రసంగం
प्रविष्टि तिथि:
23 JAN 2026 6:33PM by PIB Hyderabad
నమస్కారం,
అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె జోషి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ట్రస్ట్ ఛైర్మన్ బ్రిగేడియర్ ఆర్.ఎస్. చికారా, భారత స్వాతంత్ర్య సమరయోధులు, ఐఎన్ఏ అజరామరుడు లెఫ్టినెంట్ ఆర్.మాధవన్...
ఈ ప్రత్యేకమైన జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం. నేతాజీ పరాక్రమం, శౌర్యం నేటికీ మనకి స్ఫూర్తినివ్వటమే కాక, నేతాజీ పట్ల హృదయపూర్వక గౌరవాన్ని నింపుతోంది.
మిత్రులారా,
కొన్నేళ్లుగా పరాక్రమ దివస్ దేశ స్ఫూర్తిలో అంతర్భాగంగా మారింది. పరాక్రమ దివస్తో మొదలై వరుసగా జనవరి 25న ఓటర్ల దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం, జనవరి 29న బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం, జనవరి 30న పూజ్య బాపూజీ వర్ధంతి వరకు గణతంత్ర దినోత్సవం వంటి పండుగను జరుపుకోవటంలో నూతన సంప్రదాయం ఏర్పడటం యాదృచ్చికం. ఈ సందర్భంగా మీకు, దేశ ప్రజలందరికీ పరాక్రమ దివస్ శుభాకాంక్షలు.
సోదరీసోదరులారా,
పరాక్రమ దివస్ ప్రధాన వేడుకలు 2026వ సంవత్సరంలో అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతున్నాయి. అండమాన్, నికోబార్ చరిత్ర వీరత్వం, పరాక్రమం, త్యాగాలతో నిండినది. సెల్యులార్ జైలులో వీర సావర్కర్ వంటి లెక్కలేనంత మంది దేశభక్తుల గాథలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్తో ఈ ప్రాంతానికున్న అనుబంధం.. ఇక్కడ నిర్వహిస్తున్న పరాక్రమ దివస్ను మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. స్వేచ్ఛాకాంక్ష ఎప్పటికీ అంతం కాదనే నమ్మకానికి అండమాన్ చిహ్నం. ఎందరో విప్లవకారులు ఇక్కడ చిత్రహింసలకు గురయ్యారు. ఎందరో పోరాట యోధులు ప్రాణాలను అర్పించారు. ఆ ప్రాణత్యాగాలతో స్వాతంత్ర్య కాంక్ష ఆరిపోవటానికి బదులుగా, పోరాట స్ఫూర్తి మరింత బలపడింది. దీంతో స్వతంత్ర భారత తొలి సూర్యోదయానికి సాక్షిగా అండమాన్, నికోబార్ నిలిచింది. 1947 కన్నా ముందుగానే 30 డిసెంబర్ 1943న సముద్రపు అలల సాక్షిగా ఇక్కడ భారతదేశ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ మహత్తర ఘట్టానికి 2018లో 75 ఏళ్లు పూర్తయినప్పుడు డిసెంబర్ 30న అండమాన్లోని అదే ప్రాంతంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే భాగ్యం నాకు దక్కింది. ఆ సముద్ర తీరంలో జాతీయ గీతాలాపన మధ్య, బలమైన గాలులకు రెపరెపలాడుతున్న ఆ త్రివర్ణ పతాకం.. ఎందరో అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధుల కలలు నేడు నెరవేరాయని చాటి చెప్పినట్లు అనిపించింది.
సోదరీసోదరులారా,
స్వాతంత్య్రానంతరం అండమాన్, నికోబార్ దీవుల అద్భుతమైన చరిత్రను భద్రపరచాల్సింది. కానీ, అప్పుడు అధికారంలోకి వచ్చిన వారిలో అభద్రతా భావం ఉండేది. స్వాతంత్య్ర ఘనత కేవలం ఒక్క కుటుంబానికే దక్కాలని వారు కోరుకున్నారు. రాజకీయ స్వార్థం వల్ల దేశ చరిత్ర నిర్లక్ష్యానికి గురైంది! అండమాన్, నికోబార్ దీవులు బానిసత్వ చిహ్నంగానే మిగిలిపోయాయి! స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడి దీవులు బ్రిటిష్ అధికారుల పేర్లతోనే ఉన్నాయి. ఈ చారిత్రక అన్యాయానికి మనం ముగింపు పలికాం. అందువల్లే పోర్ట్ బ్లెయిర్ నేడు శ్రీ విజయ పురంగా మారింది. శ్రీ విజయ పురం అనే కొత్త పేరు, కొత్త గుర్తింపు నేతాజీ విజయాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఇతర దీవుల పేర్లను కూడా స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్, సుభాష్ ద్వీప్ అని మార్చాం. 2023 ఏట, భారత సైన్యంలోని సాహస వీరులు, పరమవీర చక్ర అవార్డు గ్రహీతలైన 21 మంది పేర్లను అండమాన్లోని 21 దీవులకు పెట్టాం. అండమాన్, నికోబార్లో బానిసత్వానికి చిహ్నాలుగా ఉన్న పేర్లు తుడిచిపెట్టుకుపోయి, స్వతంత్ర భారత నూతన నామాలు ప్రత్యేక గుర్తింపును చాటుకుంటున్నాయి.
మిత్రులారా,
భారత స్వాతంత్ర్య సంగ్రామ మహావీరుడిగానే కాక, స్వతంత్ర భారత స్వప్నాన్ని సాకారం చేసే గొప్ప దార్శనికుడిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిలిచారు. ఆధునికంగా కనిపించే, భారత ప్రాచీన జ్ఞానం కలిగిన ఆత్మతో కూడిన నవ భారతాన్ని ఆయన ఊహించారు. నేతాజీ దార్శనికతను నేటి తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన ప్రభుత్వం ఈ బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తుండటం సంతోషకరం. ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్మించిన మ్యూజియాన్ని నేతాజీకి అంకితమిచ్చాం. ఇండియా గేట్ వద్ద నేతాజీ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాం. రిపబ్లిక్ డే పరేడ్లో ఆజాద్ హింద్ ఫౌజ్ కృషిని దేశం సగర్వంగా స్మరించుకుంది. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ను ప్రారంభించాం. ఈ కార్యక్రమాలు నేతాజీ పట్ల గౌరవ ప్రకటనలు మాత్రమే కాదు.. యువతరానికి, భవిష్యత్తులో ఉత్తేజాన్ని నింపే వనరులు. మన ఆదర్శాల పట్ల గౌరవం, వాటి నుంచి పొందే స్ఫూర్తి.. అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పాన్ని శక్తితో, ఆత్మవిశ్వాసంతో నింపుతున్నాయి.
మిత్రులారా,
బలహీనమైన దేశం లక్ష్యాలను చేరుకోవటం కష్టం. అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎల్లప్పుడూ శక్తిమంతమైన దేశం కోసం కలలు కన్నారు. ఇవాళ 21వ శతాబ్దంలో భారత్ శక్తిమంతమైన, దృఢ నిశ్చయం గల దేశంగా గుర్తింపును చాటుకుంటోంది. భారతదేశానికి గాయం చేసినవారి ఇళ్లలో చొరబడి ఆపరేషన్ సింధూర్ ద్వారా వారిని మట్టుపెట్టటం మీరు చూశారు. నేటి భారతావనికి శక్తిని ఎలా పెంచుకోవాలో, ఎలా నిర్వహించాలో, ఎలా వినియోగించుకోవాలో కూడా తెలుసు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకనుగుణంగా, సమర్థవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు స్వావలంబన దిశగా రక్షణ రంగాన్ని సిద్ధం చేస్తున్నాం. ఆయుధాల కోసం గతంలో విదేశీ దిగుమతులపైనే భారత్ ఆధారపడేది. కానీ నేడు రూ.23 వేల కోట్లకు పైగా రక్షణ రంగ ఎగుమతులు జరుగుతున్నాయి. భారత్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణులు అనేక దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో సైన్యాన్ని ఆధునీకరించుకుంటున్నాం.
సోదరీసోదరులారా,
అభివృద్ధి చెందిన భారత్ సంకల్పం కోసం 140 కోట్ల మంది భారతీయులం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. స్వావలంబన ఉద్యమం, అభివృద్ధి చెందిన భారత్ మార్గాన్ని మరింత బలోపేతం చేస్తుంది. స్వదేశీ మంత్రం దీనికి శక్తినిస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం చేసే ప్రయాణంలో పరాక్రమ దివస్ స్ఫూర్తి మనకు నిరంతరం శక్తినిస్తుందని నమ్ముతున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
భారతమాతకు జై!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
***
(रिलीज़ आईडी: 2218349)
आगंतुक पटल : 6