ఉప రాష్ట్రపతి సచివాలయం
అయోధ్య రామజన్మభూమి ఉద్యమంపై పుస్తకాన్ని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి
భారతదేశ నాగరికత ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక క్షణానికి ప్రతీక అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం: ఉపరాష్ట్రపతి
కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చిన 2019 సుప్రీంకోర్టు తీర్పు: ఉపరాష్ట్రపతి
రామజన్మభూమి తీర్పు ద్వారా నిరూపితమైన ప్రజాస్వామ్య బలం: ఉపరాష్ట్రపతి
ఈ దేశం ఆత్మ, భారత్ ధర్మం శ్రీరాముడు: ఉపరాష్ట్రపతి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించిన రామ మందిరం: ఉపరాష్ట్రపతి
రామమందిర నిర్మాణాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రజా భాగస్వామ్యం, విరాళాలు: ఉపరాష్ట్రపతి
రామరాజ్యం అంటే అందరికీ న్యాయం, సమానత్వం: ఉపరాష్ట్రపతి
నాగరికత విలువలను కాపాడుకోవడానికి జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని పొందుపరుస్తున్న ఈ పుస్తకం: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
20 JAN 2026 6:59PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి శ్రీ సురేంద్ర కుమార్ పచౌరి రచించిన 'చాలీస్ ఆఫ్ అంబ్రోసియా: రామ్ జన్మభూమి – ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్' పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ నేడు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవనంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముని జన్మస్థలాన్ని తిరిగి పొందేందుకు జరిగిన శతాబ్దాల నాటి పోరాటాన్ని ఈ పుస్తకం చక్కగా పొందుపరిచిందన్నారు. చారిత్రక కథనాన్ని సమతుల్యత, సానుభూతి, పాండిత్యంతో కూడిన సంయమనంతో ఈ పుస్తకం ప్రదర్శించిందని పేర్కొన్నారు.
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం భారతదేశ నాగరికత ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక క్షణానికి ప్రతీక అన్న ఉపరాష్ట్రపతి.. ఈ సందర్భంగా విశ్వాసం, చరిత్ర, చట్టం, ప్రజాస్వామ్యం హుందాగా ఒకచోట కలిశాయని అన్నారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా వేల సంఖ్యలో ఆలయాలు నిర్మించినప్పటికీ శ్రీరాముని జన్మస్థలంలో నిర్మించిన ఆలయ విశిష్టతతో ఏదీ సమానం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీరాముడు ఈ దేశం ఆత్మ, భారత ధర్మానికి ప్రాణం అని శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ అన్నారు. ధర్మం ఎన్నటికీ ఓడిపోదని, సత్యమే ఎప్పుడూ జయిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. మహాత్మా గాంధీ కన్న 'రామరాజ్యం' కలను ప్రస్తావిస్తూ.. ఇది అందరికీ న్యాయం, సమానత్వం అందిస్తూ గౌరవానికి చిహ్నంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
శ్రీరాముని జన్మస్థలంలో మందిరాన్ని నిర్మించేందుకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ అవసరమవటం బాధాకరమన్న ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్.. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోని మరే ఇతర దేశంలోనైనా ఊహించలేమని అన్నారు. మొత్తం దేశం విశ్వాసం ఉన్నప్పటికీ సరైన చట్టపరమైన ప్రక్రియ, ఆధారాల తర్వాత మాత్రమే భూమి కేటాయింపు జరిగిందని.. ఇది భారత ప్రజాస్వామ్య బలాన్ని తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు. అందుకే భారత్ను సగర్వంగా 'ప్రజాస్వామ్యానికి మాత' అని పిలుస్తారని ఆయన అన్నారు.
2019 సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ ఇది కోట్లమంది భారతీయుల చిరకాల స్వప్నాలు, ఆకాంక్షలను నెరవేర్చిందని.. భారత చరిత్రలో ఒక మలుపుగా నిలిచిందని ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ అన్నారు. రామమందిర నిర్మాణం భారతీయుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించిందని ఆయన పేర్కొన్నారు.
చరిత్ర రాయడం అత్యంత క్లిష్టమైన సాహిత్య ప్రక్రియలలో ఒకటన్న ఉపరాష్ట్రపతి.. దీనికి భావోద్వేగ సమతుల్యత, సత్యం పట్ల నిబద్ధత అవసరమని అభిప్రాయపడ్డారు. ఎటువంటి సంచలనం లేదా వక్రీకరణలు లేకుండా రామజన్మభూమి ఉద్యమ సారాంశాన్ని రచయిత శ్రీ పచౌరి విజయవంతంగా చెప్పారని ఆయన కొనియాడారు.
చారిత్రక ఆధారాల నమోదులో ఉన్న లోపాలు న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేయడానికి దారితీశాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ చారిత్రక ఉద్యమానికి సంబంధించిన ఆధునిక దశను ఈ పుస్తకం పొందుపరచటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా జాతీయ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి చేసిన త్యాగాలు, పోరాటాల గురించి భవిష్యత్తు తరాలకు అవగాహన ఉంటుందని ఆయన అన్నారు. పుస్తకంలో ఉటంకించిన ఏఎస్ఐ నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ.. అక్కడ అంతకుముందే ఒక నిర్మాణం ఉందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడంలో ఈ పురావస్తు ఆధారాలు ఎంత కీలకంగా మారాయో ఉపరాష్ట్రపతి వివరించారు.
తీర్పు వెలువడిన తర్వాత ప్రజల స్పందన అద్భుతంగా ఉందన్న ఉపరాష్ట్రపతి.. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త విరాళాల సేకరణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి రామమందిర నిర్మాణం కోసం రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ నిధులు సేకరించడాన్ని ఆయన గుర్తు చేశారు. 1990లలో తన తల్లి 'శిలా పూజ'లో పాల్గొన్న వ్యక్తిగత జ్ఞాపకాలను కూడా ఆయన పంచుకున్నారు.
ఈ పవిత్ర స్థల పునరుద్ధరణను భారత పరిపక్వ ప్రజాస్వామ్యం, సాంస్కృతిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచేలా చేసిన ఘనత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వానికే దక్కుతుందని శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 2025 నవంబర్ 25న శ్రీ రామజన్మభూమి మందిరంలో జరిగిన చారిత్రక ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. యావత్ దేశం వీక్షించిన అత్యంత భావోద్వేగపూరితమైన క్షణంగా దీనిని ఆయన అభివర్ణించారు.
శ్రీరాముని విశ్వజనీన ఆకర్షణ గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి.. రామునిపై ఉన్న విశ్వాసం భౌగోళిక సరిహద్దులకు అతీతమైనదని.. ఇది అయోధ్య - రామేశ్వరంలోనే కాకుండా ఫిజీ, కాంబోడియాలోని అంగ్కోర్ వాట్ వంటి ప్రదేశాలలో కూడా కనిపిస్తోందని అన్నారు.
నిజమైన గొప్పతనం రాజ్యాలను ఏలడంలో కాదనీ, సద్గుణంతో ప్రజల హృదయాలను గెలుచుకోవడంలోనే ఉంటుందన్న విషయాన్ని శ్రీరాముని జీవితం, ఆదర్శాలు మానవాళికి నేర్పుతున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ శాశ్వతమైన ఆదర్శాలను ప్రతీ ఒక్కరు సొంత జీవితాల్లో అనుసరించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
చేసిన కృషికి గాను శ్రీ సురేంద్ర కుమార్ పచౌరిని శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ అభినందించారు. ఈ పుస్తకం విస్తృతంగా పాఠకులకు చేరువవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ చైర్మన్, ప్రధానమంత్రి మ్యూజియం - లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ నృపేంద్ర మిశ్రా… భారత మాజీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ వినోద్ రాయ్.. యూపీఎస్సీ మాజీ చైర్మన్ శ్రీ దీపక్ గుప్త.. భారత ఉపరాష్ట్రపతి కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే.. హర్ ఆనంద్ పబ్లికేషన్స్ ప్రతినిధి శ్రీ ఆశిష్ గోసైన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2216737)
आगंतुक पटल : 6