సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా డిజిటల్ క్రియేటర్ల సాధికారతకు డీడీ న్యూస్లో 'క్రియేటర్స్ కార్నర్'ను ప్రారంభించిన ప్రసార భారతి
ప్రసార భారతిలో కీలక సంస్కరణల సంవత్సరంగా 2026: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
ఆరెంజ్ ఎకానమీపై ప్రధాని మోదీ దార్శనికతను ప్రతిబింబించే క్రియేటర్స్ కార్నర్: డాక్టర్ ఎల్.మురుగన్
క్రియేటర్ ఎకానమీలో విప్లవాత్మక మార్పుగా వేవ్స్..
కోటి మంది యువతకు సాధికారతతో పాటు రూ.5,000 కోట్ల ఆర్థిక కార్యకలాపాల సృష్టి: అశ్వినీ వైష్ణవ్
प्रविष्टि तिथि:
09 JAN 2026 4:14PM by PIB Hyderabad
డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి, ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా "క్రియేటర్స్ కార్నర్" పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రసార భారతి ఇవాళ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా డిజిటల్ క్రియేటర్లు రూపొందించిన కంటెంట్ను డీడీ న్యూస్ వేదిక ద్వారా ప్రదర్శిస్తారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 ఏళ్లుగా భారతదేశంలోని అన్ని రంగాల్లో సంస్కరణలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రసార భారతిలోనూ సంస్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు.
ప్రసార భారతిలో కీలక సంస్కరణల సంవత్సరంగా 2026 నిలుస్తుందని.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోనూ సమూల మార్పులు జరుగుతాయని కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ సంస్కరణల ద్వారా దూరదర్శన్, ఏఐఆర్ వంటి సంస్థలను పరిశ్రమల భాగస్వామ్యం, భవిష్యత్ తరం క్రియేటర్లు, సాంకేతికత ఆధారిత ప్రక్రియల దిశగా మళ్లించనున్నట్లు చెప్పారు. ఈ సంస్కరణల ప్రయాణంలో క్రియేటర్ కార్నర్ తొలి అడుగని తెలిపారు. గతేడాది ప్రారంభమైన వేవ్స్ గురించి ప్రస్తావిస్తూ, క్రియేటర్ ఏకానమీని బలోపేతం చేయటంలో ఇది కీలకపాత్ర పోషించిందని, కోటి మంది యువతను భాగస్వాములను చేస్తూ కొత్త ఉపాధి అవకాశాలను కల్పించిందని, దాదాపు రూ.5,000 కోట్ల ఆదాయాన్ని ఈ వ్యవస్థకు చేకూర్చిందని వెల్లడించారు.
ప్రధానమంత్రి దార్శనికత ఆరెంజ్ ఎకానమీకి అనుగుణంగా దేశంలోని కంటెంట్ క్రియేటర్ల సాధికారత కోసం దూరదర్శన్ ద్వారా క్రియేటర్స్ కార్నర్ ప్రారంభించటం కీలక ముందడుగని డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. విశాలమైన స్టూడియోల అవసరం లేకుండానే దేశంలోని పట్టణాలు, మారుమూల గ్రామాలకు చెందిన క్రియేటర్లు స్వతంత్రంగా కంటెంట్ను రూపొందించి, ఎడిట్ చేసి, షేర్ చేస్తూ జీవనోపాధిని కల్పించుకుంటున్న తీరును కొనియాడారు. అలాంటి ప్రతిభావంతులకు బలమైన జాతీయ, అంతర్జాతీయ వేదికను ఇప్పుడు దూరదర్శన్ కల్పిస్తుందని.. ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన దూరదర్శన్ బృందాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమం శక్తిమంతమైన, బాధ్యతాయుతమైన, సమగ్రమైన క్రియేటర్ వ్యవస్థను రూపొందించటంలో సహకరించనుందని ఎంఐబీ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు తెలిపారు. క్రియేటర్లను కేవలం నటులుగా కాక, పూర్తిస్థాయి కంటెంట్ రూపకర్తలుగా గుర్తించటమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. డీడీ న్యూస్లో ప్రారంభమయ్యే 'క్రియేటర్స్ కార్నర్' అన్ని దూరదర్శన్ ఛానెళ్లకూ విస్తరిస్తుందని, వివిధ భాషలు, ప్రాంతాలు, విభిన్న శైలికి చెందిన క్రియేటర్లకు జాతీయ స్థాయి వేదికను అందిస్తుందని తెలిపారు. ప్రత్యేక ప్రైమ్-టైమ్ స్లాట్ ద్వారా ప్రేక్షకులకు క్రియేటర్లు మరింతగా చేరువవుతారని, విభిన్న దృక్పథాలతో ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు ప్రేక్షకులను అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్రియేటర్స్ కార్నర్ గురించి
ప్రసార భారతి, వ్యక్తిగత కంటెంట్ క్రియేటర్ల మధ్య భాగస్వామ్యం ద్వారా నాణ్యమైన కంటెంట్ను ప్రోత్సహించి, దాని పరిధిని విస్తరించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
వార్తలు, వర్తమాన అంశాలు, సంస్కృతి, ప్రయాణం, వంటకాలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, ఆరోగ్యం, జీవనశైలి, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్ఫూర్తిదాయక కథలు, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, వినోదం వంటి ఎన్నో అంశాలపై కంటెంట్ను క్రియేటర్స్ కార్నర్ ప్రదర్శిస్తుంది.
ఈ కార్యక్రమం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ రాత్రి 7:00 గంటలకు డీడీ న్యూస్లో ప్రసారమవుతుంది. మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రతి ఎపిసోడ్లో వివిధ అంశాలకు సంబంధించి నాలుగు నుంచి ఆరు రీల్స్ లేదా వీడియోలను ప్రదర్శిస్తారు.
ఈ కార్యక్రమం పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యానికి నిదర్శనం. ఇది డిజిటల్ క్రియేటర్లకు ప్రతిభను చాటుకోవటానికి, ప్రసార భారతి, డీడీ న్యూస్ వంటి విశ్వసనీయ వేదికను, విస్తృతమైన ప్రజానీకాన్ని అందుబాటులోకి తెస్తుంది. యువతను ఆకట్టుకునే విధంగా వినూత్న, వైవిధ్యభరిత కంటెంట్ను రూపొందించటానికి ప్రసార భారతికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమంపై ఆసక్తి ఉన్న క్రియేటర్లు తమ కంటెంట్ను ddnews.creatorscorner[at]gmail[dot]com కు మెయిల్ చేయవచ్చు. లేదా +91-8130555806 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు .
***
(रिलीज़ आईडी: 2213070)
आगंतुक पटल : 11