ప్రధాన మంత్రి కార్యాలయం
గౌహతిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని
ఏ రాష్ట్రానికైనా ఆధునిక విమానాశ్రయాలు, అధునాతన రవాణా మౌలిక సదుపాయాలు కొత్త అవకాశాలకు ద్వారాలుగా పనిచేస్తాయి: ప్రధాని
నేడు భారతదేశ అభివృద్ధికి సరికొత్త ద్వారంగా అస్సాం, ఈశాన్య భారతం ఎదుగుతున్నాయి: ప్రధాని
భారతదేశ భవిష్యత్తు వృద్ధికి ఈశాన్య ప్రాంతం నాయకత్వం వహిస్తుంది: ప్రధాని
प्रविष्टि तिथि:
20 DEC 2025 5:50PM by PIB Hyderabad
అస్సాంలో అనుసంధానత, ఆర్థిక విస్తరణ, ప్రపంచ స్థాయి గుర్తింపు దిశగా ఈ రోజు ఒక కీలక ఘట్టం నమోదైంది. గౌహతిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి ఈ రోజు ఒక పండుగ వంటిదని అన్నారు. పురోగతి అనే వెలుగు ప్రజలకు చేరువైనప్పుడు జీవితంలోని ప్రతి మార్గం కొత్త శిఖరాలను తాకడం ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. అస్సాం మట్టితో తనకున్న గాఢమైన అనుబంధం, ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు ముఖ్యంగా అస్సాం- ఈశాన్య ప్రాంత తల్లులు, సోదరీమణుల ఆత్మీయత తనకు స్ఫూర్తి నిస్తుందని.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం సామూహిక సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అస్సాం అభివృద్ధిలో ఈ రోజు మరో సరికొత్త అధ్యాయం నమోదైందని ఆయన పేర్కొన్నారు. భారతరత్న భూపెన్ హజారికా రాసిన పంక్తులను ఉటంకిస్తూ.. మహోన్నతమైన బ్రహ్మపుత్ర నదీ తీరాలు ప్రకాశిస్తాయని, చీకటి గోడలన్నీ బద్దలవుతాయని ఎందుకంటే ఇది దేశానికి ఉన్న దృఢ సంకల్పం, పవిత్ర ప్రతిజ్ఞ అని పేర్కొన్నారు.
భూపెన్ హజారికా పంక్తులు కేవలం ఒక పాట మాత్రమే కాదన్న ప్రధాని.. ఇవి అస్సాంను ప్రేమించే ప్రతి గొప్ప ఆత్మకు ఉన్న పవిత్ర సంకల్పమని, నేడు ఆ సంకల్పం నెరవేరుతోందని వ్యాఖ్యానించారు. బ్రహ్మపుత్ర నది మహోన్నత ప్రవాహం ఎన్నటికీ ఆగనట్లే కేంద్ర రాష్ట్రాల్లోని తమ ప్రభుత్వాల హయాంలో అస్సాం అభివృద్ధి ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం ఈ నిబద్ధతకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ కొత్త టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అస్సాంతో పాటు దేశ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు.
అస్సాం మొదటి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి గర్వకారణమైన గోపీనాథ్ బోర్డోలోయ్ విగ్రహాన్ని కొద్దిసేపటి క్రితమే ఆవిష్కరించే భాగ్యం కలిగిందని ప్రధానమంత్రి అన్నారు. అస్సాం అస్తిత్వం, భవిష్యత్తు, ప్రయోజనాల విషయంలో శ్రీ బోర్డోలోయ్ ఎన్నడూ రాజీ పడలేదన్న ప్రధాని.. ఆయన విగ్రహం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని, వారిలో అస్సాం పట్ల గాఢమైన గర్వాన్ని నింపుతుందని ప్రధానంగా చెప్పారు.
"ఏ రాష్ట్రానికైనా కొత్త అవకాశాలకు ఆధునిక విమానాశ్రయ, అధునాతన అనుసంధాన మౌలిక సదుపాయాలు ద్వారాలుగా పనిచేస్తాయి. ప్రజలలో పెరుగుతున్న విశ్వాసం, నమ్మకానికి ఇవి స్తంభాలుగా నిలుస్తాయి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అస్సాంలో నిర్మితమౌతున్న అద్భుతమైన రహదారులు, విమానాశ్రయాలను ప్రజలు చూసినప్పుడు అస్సాంకు నిజమైన న్యాయం జరగడం ప్రారంభమైందని స్వయంగా అంగీకరిస్తున్నారని ఆయన అన్నారు. మునుపటి ప్రభుత్వాల ఎజెండాలో అస్సాం, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి అనేది ఎన్నడూ లేదని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రభుత్వాలలోని నాయకులు "అస్సాం, ఈశాన్య ప్రాంతాలకు అసలు ఎవరు వెళ్తారు?" అని అనేవారన్న ప్రధాని.. ఈ ప్రాంతంలో ఆధునిక విమానాశ్రయాలు, రహదారులు, మెరుగైన రైల్వేల అవసరం ఏముందని ప్రశ్నించేవారని గుర్తు చేశారు. ఇటువంటి ఆలోచనా ధోరణే దశాబ్దాల తరబడి ఈ మొత్తం ప్రాంతాన్ని ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేయడానికి కారణమైందని ప్రధానమంత్రి చెప్పారు.
ఆరు నుంచి ఏడు దశాబ్దాల కాలంలో ప్రతిపక్షాలు చేసిన తప్పులను తన నాయకత్వంలో ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నట్లు గుర్తు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష నాయకులు ఈశాన్య ప్రాంతాన్ని సందర్శించినా సందర్శించకపోయినా తాను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా సొంత ప్రజల మధ్య ఉన్నాననే అనుభూతి కలుగుతుందని ప్పేర్కొన్నారు. అస్సాం అభివృద్ధి అనేది తనకు కేవలం ఒక అవసరం మాత్రమే కాదని అదొక బాధ్యత, జవాబుదారీతనం అని ఆయన చెప్పారు. గత పదకొండు ఏళ్లలో అస్సాం, ఈశాన్య ప్రాంతాల కోసం లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించినట్లు తెలిపారు. అస్సాం మరింత పురోగమిస్తోందన్న ఆయన ఈ విషయంలో రాష్ట్రం కొత్త మైలురాళ్లను సృష్టిస్తోందని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అస్సాం నిలవటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 50 లక్షలకు పైగా స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్లను అమర్చి అస్సాం రికార్డు సృష్టించిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో లంచాలు లేదా సిఫార్సులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందడం అసాధ్యంగా ఉండేదన్న ఆయన నేడు అటువంటి పద్ధతులు లేకుండా వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో అస్సాం సంస్కృతిని ప్రతి వేదికపై ప్రచారం చేస్తున్నట్లు ప్రధాని వివరించారు. 2023 ఏప్రిల్ 13న గౌహతి స్టేడియంలో 11,000 కంటే ఎక్కువ మంది కళాకారులు కలిసి బిహు నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన చారిత్రాత్మక ఘట్టాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి కొత్త రికార్డులను సృష్టించడం ద్వారా అస్సాం వేగంగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
ఈ కొత్త టెర్మినల్ భవనంతో గౌహతి, అస్సాంల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందన్న ప్రధానమంత్రి.. దీని ద్వారా ఏటా 1.25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రయాణించవచ్చని ప్రధానంగా పేర్కొన్నారు. ఇది అస్సాంను సందర్శించే పర్యాటకుల సంఖ్యను పెంచడమే కాకుండా మా కామాఖ్య దేవిని భక్తులు దర్శించుకోవటాన్ని మరింత సులభతరం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కొత్త విమానాశ్రయ టెర్మినల్లోకి అడుగు పెట్టినప్పుడు "సాంస్కృతిక వారసత్వంతో కూడిన అభివృద్ధి" అనే మంత్రానికి ఉన్న నిజమైన అర్థం స్పష్టంగా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అస్సాం ప్రకృతి, సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని రూపొందించినట్లు తెలియజేసిన ఆయన లోపల పచ్చదనంతో కూడిన ఒక ఇండోర్ ఫారెస్ట్ను తలపించేలా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. ప్రతి ప్రయాణికుడు ప్రశాంతతతో పాటు సౌకర్యవంతమైన అనుభూతిని పొందేలా ఈ డిజైన్ ప్రకృతితో మమేకమై ఉందని ఆయన అన్నారు. నిర్మాణంలో వెదురు వినియోగానికి ఉన్న ప్రత్యేకతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అస్సాం జీవితంలో వెదురు ఒక అంతర్భాగమని.. అది బలం- అందం రెండింటికీ చిహ్నమని పేర్కొన్నారు. 2017లో తమ ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. అటవీయేతర ప్రాంతాలలో పెరిగే వెదురును చట్టబద్ధంగా ‘చెట్టు’గా కాకుండా ‘గడ్డి’గా వర్గీకరించేలా భారత అటవీ చట్టం-1927ను సవరించినట్లు తెలిపారు. ఇదే నేడు అద్భుత నిర్మాణమైన ఈ కొత్త టెర్మినల్ రూపకల్పనకు దారితీసిందని ఆయన అన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ఒక అత్యంత ముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తోందన్న ప్రధాని.. ఇది పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని, అనుసంధానత విషయంలో పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగిస్తుందని, స్థానిక ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరుకోవడానికి మార్గాలను తెరుస్తుందని అన్నారు. కొత్త అవకాశాలు రానున్నందున దీని ద్వారా యువతకు అతిపెద్ద భరోసా లభిస్తుందని చెప్పారు. "నేడు అస్సాం అపరిమితమైన అవకాశాల విమానంలో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది" అని ప్రధాని వ్యాఖ్యానించారు.
నేడు భారతదేశం పట్ల ప్రపంచ దృక్పథం మారిందన్న ప్రధానమంత్రి.. దేశం పోషిస్తోన్న పాత్ర కూడా రూపాంతరం చెందిందని అన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం 11 ఏళ్లలోనే ఇది ఎలా సాధ్యమైందని ప్రశ్నించిన ఆయన.. ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ఇందులో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశం అనే సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతూ 2047 కోసం భారత్ సిద్ధమవుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ భారీ అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం భాగస్వామ్యమని ఆయన ఉద్ఘాటించారు. ప్రభుత్వం వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపిన ఆయన ప్రతి రాష్ట్రం కలిసి పురోగమించేలా, అభివృద్ధి చెందిన భారత్ అనే మిషన్లో పాలుపంచుకునేలా చూస్తోందని ఆయన పేర్కొన్నారు. అస్సాం, ఈశాన్య ప్రాంతాలు ఈ మిషన్కు నాయకత్వం వహిస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈశాన్య ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపిన ఆయన.. నేడు అస్సాం భారతదేశపు 'తూర్పు ముఖద్వారం'గా ఎదుగుతోందని చెప్పారు. భారత్ను ఆసియాన్ దేశాలతో అనుసంధానించే వంతెన పాత్రను అస్సాం పోషిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రారంభం మరింత పురోగమిస్తుందని, అనేక రంగాలలో అస్సాం అభివృద్ధి చెందిన భారత్కు ఇంజిన్గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
"అస్సాంతో పాటు ఈశాన్య ప్రాంతమంతా దేశాభివృద్ధికి నూతన ముఖద్వారంగా మారుతున్నాయి" అని శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బహుళ-రవాణా అనుసంధాన దార్శనికత ఈ ప్రాంత పరిస్థితిని, దిశను మార్చివేసిందని ఆయన అన్నారు. అస్సాంలో కొత్త వంతెనల నిర్మాణం, కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటు, ప్రతి అభివృద్ధి ప్రాజెక్టు సాగుతున్న వేగం దేశపు కలలను సాకారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన వంతెనలు అస్సాంకు అనుసంధాన విషయంలో కొత్త బలాన్ని, విశ్వాసాన్ని ఇచ్చాయని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్రానంతరం ఆరు-ఏడు దశాబ్దాల్లో ఇక్కడ కేవలం మూడు ప్రధాన వంతెనలు మాత్రమే నిర్మించగా... గత దశాబ్ద కాలంలోనే నాలుగు కొత్త భారీ వంతెనలు పూర్తి చేయడంతో పాటు అనేక చరిత్రాత్మక ప్రాజెక్టులూ రూపుదిద్దుకుంటున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. బోగిబీల్, ధోలా-సాదియా వంటి పొడవైన వంతెనలు అస్సాంను వ్యూహాత్మకంగా మరింత బలోపేతం చేశాయన్నారు. రైల్వే అనుసంధానంలోనూ విప్లవాత్మక మార్పు వచ్చిందని, బోగిబీల్ వంతెన అస్సాంకు, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య దూరాన్ని తగ్గించిందని శ్రీ మోదీ తెలిపారు. గౌహతి నుంచి న్యూ జల్పైగురికి నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించిందని ఆయన తెలిపారు. జలమార్గాల అభివృద్ధితోనూ అస్సాం లబ్ధి పొందుతోందని, సరుకు రవాణా 140 శాతం పెరిగిందన్నారు. బ్రహ్మపుత్ర కేవలం నది మాత్రమే కాదని, ఆర్థిక శక్తి ప్రవాహమని నిరూపితమైందని శ్రీ మోదీ వివరించారు. పాండులో మొదటి నౌకా మరమ్మతు కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నారనీ, వారణాసి నుంచి దిబ్రూగఢ్ వరకు గంగా విలాస్ క్రూయిజ్ పట్ల నెలకొన్న ఉత్సాహం ఈశాన్య ప్రాంతాన్ని ప్రపంచ క్రూయిజ్ పర్యాటక పటంలో సమున్నత స్థానంలో నిలిపిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
అస్సాంతో పాటు యావత్ ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేసిన గత ప్రభుత్వాలను విమర్శిస్తూ... దీనివల్ల దేశ భద్రత, ఐక్యత, సమగ్రత విషయంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని శ్రీ మోదీ అన్నారు. ప్రతిపక్షాల పాలనలో దశాబ్దాల పాటు హింస ప్రబలిందని, అయితే గత 10-11 సంవత్సరాలుగా దానిని అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు ఈశాన్యంలో హింస, రక్తపాతం రాజ్యమేలిన చోటుకి... ఈ రోజు 4జీ, 5జీ సాంకేతికత ద్వారా డిజిటల్ కనెక్టివిటీ వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు హింసతో ప్రభావితమైన ప్రాంతాలుగా పరిగణించిన జిల్లాలు ఇప్పుడు ఆకాంక్షిత జిల్లాలుగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతాలే పారిశ్రామిక కారిడార్లుగా మారతాయని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈశాన్య ప్రాంతం పట్ల ఒక కొత్త విశ్వాసం ఏర్పడిందని, దానిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
అస్సాం, ఈశాన్య ప్రాంతం అభివృద్ధిలో విజయం సాధించడానికి కారణం... ప్రభుత్వం ఈ ప్రాంత గుర్తింపును, సంస్కృతిని పరిరక్షించడమేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఈ గుర్తింపును తుడిచిపెట్టడానికి కుట్ర పన్నాయనీ, ఈ కుట్రలు కేవలం కొన్ని సంవత్సరాలకే పరిమితం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ దుశ్చర్యకు మూలాలు స్వాతంత్య్రానికి పూర్వమే ఉన్నాయన్నారు. అప్పట్లో ముస్లిం లీగ్, బ్రిటిష్ ప్రభుత్వం భారత విభజనకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలో అస్సాంను అవిభక్త బెంగాల్లో... అంటే తూర్పు పాకిస్తాన్లో భాగం చేసేందుకు ప్రణాళిక చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కుట్రలో కాంగ్రెస్ పార్టీ భాగం కానున్న సమయంలో శ్రీ బర్దోలోయ్ తన సొంత పార్టీకి వ్యతిరేకంగా నిలబడి, అస్సాం గుర్తింపును నాశనం చేసే ఈ కుట్రను వ్యతిరేకించారని తెలిపారు. అస్సాంను దేశం నుంచి వేరు కాకుండా ఆయన కాపాడారని శ్రీ మోదీ గుర్తు చేశారు. తమ పార్టీ ప్రతి దేశభక్తుడిని గౌరవించడంలో పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బర్దోలోయ్ గారికి భారతరత్న పురస్కారం ప్రదానం చేసినట్లు శ్రీ మోదీ తెలిపారు.
స్వాతంత్య్రానికి ముందు శ్రీ బర్దోలోయ్ గారు అస్సాంను కాపాడారనీ, అయితే స్వాతంత్య్రానంతర కాలంలో మొదటి పాలక వర్గం ఆ తర్వాత మరోసారి అస్సాం వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభించిందని ప్రధానమంత్రి విమర్శించారు. బెంగాల్, అస్సాంలలో చొరబాటుదారులకు స్వేచ్ఛను కల్పించడం ద్వారా మతపరమైన సంతృప్తితో ఓటు బ్యాంకును విస్తరించుకోవడానికి వారు కుట్ర పన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత జనాభా పూర్తిగా మారిపోయిందనీ... ఈ చొరబాటుదారులు అడవులు, ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆయన తెలిపారు. ఫలితంగా అస్సాం రాష్ట్ర భద్రత, గుర్తింపు ప్రమాదంలో పడిందని ప్రధానమంత్రి వివరించారు.
అస్సాం వనరులను అక్రమ, దేశ వ్యతిరేక ఆక్రమణదారుల నుంచి విముక్తి చేయడానికి శ్రీ హిమంత బిస్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం శ్రద్ధగా పనిచేస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అస్సాం వనరుల ప్రయోజనాలు ఆ రాష్ట్ర ప్రజలకే దక్కేలా చూసేందుకు ప్రతి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. చొరబాట్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని, అక్రమ చొరబాటుదారులను తొలగించడానికి వారిని గుర్తించే ప్రక్రియలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
చొరబాటుదారులను తొలగించడం గురించి సుప్రీంకోర్టు మాట్లాడినప్పటికీ... ప్రతిపక్షాలు, వారి కూటమి బహిరంగంగా దేశ వ్యతిరేక ఎజెండాలను స్వీకరించాయని ప్రధానమంత్రి విమర్శించారు. ఈ పార్టీలు చొరబాటుదారులకు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నాయని, వారికి అనుకూలంగా ఆ పార్టీల న్యాయవాదులు కోర్టులో వాదిస్తున్నారని ఆయన వివరించారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికమైన ఎన్నికల నిర్వహణకు వీలుగా ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్న సమయంలో, ఈ సమూహాలు దానినీ వ్యతిరేకిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వ్యక్తులు అస్సామీ సోదరీసోదరుల ప్రయోజనాలను కాపాడరు... ఇతరులు అస్సాం ప్రజల భూమిని, అడవులను ఆక్రమించుకోవడానికి సహకరిస్తారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వారి దేశ వ్యతిరేక మనస్తత్వం మునుపటి కాలంలోని హింస, అశాంతిని తిరిగి సృష్టించగలదని ఆయన హెచ్చరించారు. అందువల్ల అస్సాం ప్రజలు ఐక్యంగా ఉండటానికి.. అస్సాం అభివృద్ధిని పట్టాలు తప్పకుండా నిరోధించడానికి... ప్రతిపక్షాల కుట్రలను ఓడించడం కొనసాగించడానికి... అస్సాం ప్రజలంతా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని ఆయన ఉద్ఘాటించారు.
‘ఈ రోజు ప్రపంచం ఆశగా భారత్ వైపు చూస్తోంది. భారత భవిష్యత్తు కోసం నూతన సూర్యోదయం ఈశాన్య ప్రాంతం నుంచే ప్రారంభం కానుంది’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దీని కోసం, అస్సాం అభివృద్ధిని అగ్రస్థానంలో ఉంచి, ఉమ్మడి కలలను సాకారం చేసుకోవడానికి సామూహిక ప్రయత్నాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉమ్మడి ప్రయత్నాలు అస్సాంను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లి, అభివృద్ధి చెందిన భారత్ ఆశయాన్ని నెరవేరుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా అస్సాం ప్రజలకు మరోసారి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వ శర్మ, కేంద్ర మంత్రులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ కె రామ్మోహన్ నాయుడు, శ్రీ మురళీధర్ మోహోల్, శ్రీ పబిత్రా మార్గెరిటా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
దాదాపు 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అధునాతన పద్ధతులతో నిర్మించిన గువాహటిలోని లోకప్రియ గోపీనాథ్ బార్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవనం, రన్వే, ఎయిర్ఫీల్డ్ వ్యవస్థలు, ఏప్రాన్లు, టాక్సీవేల మద్దతుతో సంవత్సరానికి 1.3 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అనువుగా ఈ నిర్మాణాలను రూపొందించారు.
దేశంలో మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ టెర్మినల్ అయిన ఈ విమానాశ్రయాన్ని అస్సాం జీవవైవిధ్యం, సాంస్కృతిక వారసత్వం స్ఫూర్తిగా "వెదురు ఆర్కిడ్ల" ఇతివృత్తంతో రూపొందించారు. ఈ టెర్మినల్ నిర్మాణంలో స్థానికంగా లభించే దాదాపు 140 మెట్రిక్ టన్నుల ఈశాన్య ప్రాంత వెదురును ఉపయోగించారు. వీటిలో కాజిరంగాను తలపించే పచ్చని ప్రకృతి దృశ్యాలు, జాపి మోటిఫ్లు, ఐకానిక్ ఖడ్గమృగం చిహ్నం, కోపౌ పువ్వును ప్రతిబింబించే 57 ఆర్కిడ్-ప్రేరిత స్తంభాలు ఉన్నాయి. దాదాపు లక్ష దేశీయ జాతుల మొక్కలను కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన "స్కై ఫారెస్ట్" ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఒక అద్భుతమైన అడవిలో తిరుగుతున్న అనుభవాన్ని అందిస్తుంది.
ఈ టెర్మినల్ ప్రయాణికుల సౌలభ్యం, డిజిటల్ ఆవిష్కరణల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. వేగవంతమైన, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకుండా సంభావ్య ముప్పును కనిపెట్టే భద్రతా స్క్రీనింగ్ కోసం పూర్తి-శరీర స్కానర్లు, డిజియాత్ర-అనుమతి గల కాంటాక్ట్లెస్ ప్రయాణం, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్, ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్, ఏఐ-ఆధారిత విమానాశ్రయ కార్యకలాపాల వంటి అద్భుత సదుపాయాలు సజావైన, సురక్షితమైన, సమర్థమైన ప్రయాణ అనుభవాలను నిర్ధారిస్తాయి.
***
(रिलीज़ आईडी: 2207232)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam