సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వయస్సుకు తగని కంటెంట్ నుంచి పిల్లల భద్రత కోసం ఓటీటీ వేదికలపై గట్టి ఆంక్షలు విధించిన ప్రభుత్వం
డిజిటల్ మీడియాలో నైతిక విలువల కోసం ఐటీ రూల్స్, 2021 కింద తీసుకున్న చర్యలను ప్రముఖంగా పేర్కొన్న కేంద్రం
प्रविष्टि तिथि:
12 DEC 2025 4:42PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) వాక్ స్వేచ్ఛకు హామీ ఇచ్చింది. అదే సమయంలో, డిజిటల్ వేదికల్లో నకిలీ, అసత్య, తప్పుదారి పట్టించే సమాచారం వల్ల సమాజానికి కలుగుతున్న నష్టాలను ప్రభుత్వం కూడా గుర్తించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 (25 ఫిబ్రవరి, 2021) కింద ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) 2021 నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది.
ఈ నిబంధనలలోని మూడో భాగం ఆన్లైన్ క్యురేటెడ్ కంటెంట్ (ఓటీటీ వేదికలు) నిర్వాహకుల కోసం నైతిక నియమావళిని నిర్దేశిస్తుంది. ఈ నియమావళి ప్రకారం, అమలులో ఉన్న చట్టాల కింద నిషేధించిన ఏ కంటెంట్ను కూడా నిర్వాహకులు ప్రసారం చేయకూడదు.
ఈ నైతిక నియమావళి ప్రకారం, నిబంధనల షెడ్యూల్లోని సాధారణ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వాహకులు కంటెంట్ను వయస్సు ఆధారంగా ఐదు వర్గాలుగా విభజించాలి.
ఈ నైతిక నియమావళి ప్రకారం, పిల్లలు తమ వయసుకు తగని కంటెంట్ను చూడకుండా నియంత్రించేందుకు ఓటీటీ వేదికలు తగిన రక్షణ చర్యలను కూడా అమలు చేయాలి.
ఈ నిబంధనలు, ఇతర అంశాలతో పాటు, వార్తలు సమకాలీన అంశాల ఆధారిత కార్యక్రమాలను ప్రసారం చేసే వారు అనుసరించాల్సిన నైతిక ప్రమాణాలను కూడా అందిస్తాయి. దీని ప్రకారం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం, 1995 కింద నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్, ప్రెస్ కౌన్సిల్ చట్టం-1978 కింద ఉన్న పాత్రికేయ సంబంధ ప్రమాణాలను కూడా పాటించడం తప్పనిసరి.
ప్రోగ్రామ్ కోడ్, పాత్రికేయ సంబంధ నైతిక ప్రమాణాలు ఇతర అంశాలతో పాటు, తప్పుదారి పట్టించే అసత్యమైన లేదా అర్ధసత్యమైన సమాచారాన్ని ప్రసారం చేయరాదని నిర్వాహకులను నిర్దేశిస్తున్నాయి.
నైతిక నియమావళిని పాటించడానికి ఐటీ నిబంధనలు-2021 కింద మూడు అంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను క్రింద విధంగా ఏర్పాటు చేశారు:
ఏ. లెవల్-I: ప్రచురణకర్త
బీ. లెవల్ II: ప్రచురణకర్తల స్వీయ నియంత్రణ సంస్థ
సీ. లెవల్ –III: కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ
నిబంధనలలో సూచించిన లెవల్-I, లెవల్-II లలోని స్వీయ నియంత్రణ నిబంధనలు వాక్ స్వాతంత్ర్యం, పత్రికా భావ ప్రకటన స్వేచ్ఛ స్ఫూర్తిని పరిరక్షిస్తాయి.
అలాగే, ఐటీ నిబంధనలలోని రెండో భాగాన్ని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) నిర్వహిస్తుంది. యూ ట్యూబ్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాలు స్పష్టంగా నకిలీ, అవాస్తవ, తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధిస్తుంది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ వార్తలను గుర్తించడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (ఎఫ్సీయూ) ను నవంబర్, 2019 లో ఏర్పాటు చేశారు.
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలలో ఉన్న అధికార వర్గాల నుంచి వార్త ప్రామాణికతను ధ్రువీకరించిన తరువాత, ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తన సోషల్ మీడియా వేదికల్లో సరైన సమాచారాన్ని పోస్టు చేస్తుంది.
సమాచార సాంకేతిక చట్టం, 2000 లోని సెక్షన్ 69ఏ కింద, భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రత, భారతదేశ రక్షణ, ప్రభుత్వ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెబ్సైట్లు, సోషల్ మీడియా పోస్టులను బ్లాక్ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులను జారీ చేస్తుంది.
సృజనకర్తల ఆర్థికవ్యవస్థ
దేశంలో సృజనకర్తల (క్రియేటర్ ఎకానమీ) ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టారు. వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025, క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ (సీఐసీ), వేవ్స్ బజార్ వంటి కార్యక్రమాలు డిజిటల్ రంగంలో స్థానిక సాంస్కృతిక ప్రాతినిధ్యాన్ని పెంచడానికి దోహద పడ్డాయి.
క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ (సీఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభను సమీకరించింది. ఆవిష్కర్తలకు తమ ప్రాంతీయ నైపుణ్యాలను వృత్తిపరమైన డిజిటల్ కంటెంట్గా మార్చడానికి సహాయపడే విధంగా పరిశ్రమ అనుసంధానిత శిక్షణను అందించింది. వేవ్స్ 2025లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక సంగీత, జానపద కళల ప్రదర్శనలు అట్టడుగు స్థాయి కళాకారులకు అంతర్జాతీయ వేదికను అందించాయి. ఇది వారికి గుర్తింపును, జీవనోపాధిని మెరుగుపరచడానికి దోహదపడింది.
వేవ్స్ బజార్ ను కూడా ఒక జాతీయ మార్కెట్ప్లేస్గా ప్రారంభించారు. ఈ వేదిక భారతీయ ఆవిష్కర్తలు దేశంలోని ప్రాంతీయ వైవిధ్య ప్రత్యేకతలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, పంపిణీదారులతో నేరుగా భాగస్వామ్యం చేయడానికి దోహదపడింది.
వేవ్స్ ఓటీటీ ద్వారా ప్రసార భారతి (స్థానిక కంటెంట్ సృజనకర్తలకు మద్దతునిస్తోంది. ఇది ప్రామాణికమైన ప్రాంతీయ అంశాలను ప్రచురించడానికి, ప్రోత్సహించడానికి, తద్వారా ఆదాయం ఆర్జించడానికి ఏకీకృత డిజిటల్ వేదికను అందించింది.
రాజ్యసభలో ఈ రోజు డాక్టర్ కనిమొళి ఎన్.వి.ఎన్. సోము ప్రశ్నకు సమాధానంగా సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ వివరాలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2203359)
आगंतुक पटल : 3