సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కమిటీ సిఫార్సుల ఆధారంగా సవరించిన ప్రకటన ధరలతో ప్రింట్ మీడియాకు ప్రభుత్వ మద్దతు
పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను తగ్గించేందుకు, డిజిటల్ యుగంలో వార్తాపత్రికలు పోటీ పడటానికి సహాయపడేలా ఈ కొత్త ధరల నిర్ణయం
నాడు పోస్టు చేయడమైనది:
10 DEC 2025 3:43PM by PIB Hyderabad
ప్రింట్ మీడియా కోసం ప్రకటన ధరల్లో సవరణలను పరిశీలించి సిఫార్సు చేసేందుకు నవంబర్ 11, 2023న ప్రభుత్వం 9వ రేట్ స్ట్రక్చర్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ భారతీయ వార్తపత్రికల సంఘం (ఐఎన్ఎస్), దేశవ్యాప్త చిన్న పత్రికల సంఘం (ఏఐఎస్ఎన్ఐ), చిన్న, మధ్యతరహా, భారీ పత్రికల సంఘం (ఎస్ఎమ్ బీఎన్ఎస్)తోపాటు వివిధ భారీ, మధ్య , చిన్న ప్రచురణల ప్రతినిధులతో సహా విస్తృత స్థాయి భాగస్వాములతో సంప్రదింపులు చేసింది.
ప్రింట్ మీడియా కార్యకలాపాలను ప్రభావితం చేసే బహుళ వ్యయ పారామితులను కమిటీ అంచనా వేసింది. వీటిలో న్యూస్ప్రింట్ ధర పెరుగుదల, ద్రవ్యోల్బణ ధోరణులు, ప్రాసెసింగ్, ఉత్పత్తి ఖర్చులు, ఉద్యోగుల వేతన బాధ్యతలు, దిగుమతి చేసుకున్న కాగితం ధరలు, ఇతర సంబంధిత ముడిసరుకులు ఉన్నాయి.
ఈ అంచనాల ఆధారంగా కమిటీ ఏకగ్రీవ సిఫార్సులను సమర్పించగా.. వాటిని ప్రభుత్వం ఆమోదించింది.
రంగుల ప్రకటనలకు అందించే ప్రీమియం ధరలు, ప్రాధాన్యతా స్థానం వంటి అంశాలకు సంబంధించిన కమిటీ సూచనలను ప్రభుత్వం అంగీకరించింది.
పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, డిజిటల్ ప్లాట్ఫారమ్ల నుంచి ప్రింట్ మీడియాకు పెరుగుతున్న పోటీకి తగిన విధంగా ప్రకటన ధరల సవరణలు ఉన్నాయి.
ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలను కొనసాగించడానికి, స్థానిక వార్తా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది. ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ప్రింట్ మీడియా సంస్థలకు మంచి కంటెంట్ రూపొందించడంలో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించవచ్చు.
వైవిధ్యభరితమైన మీడియా రంగంలో ప్రింట్ మీడియా ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రభుత్వం తన సమాచారాన్ని, కమ్యూనికేషన్ను పౌరులకు మరింత సమర్థవంతంగా చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఎల్. మురుగన్ లోక్సభలో నేడు ప్రకటించారు. శ్రీ సురేష్ కుమార్ షెట్కర్, శ్రీ విజయకుమార్,శ్రీ మాణిక్కం ఠాగూర్ బి. అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వివరాలను తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2201699)
సందర్శకుల సూచీ సంఖ్య : : 34