ప్రధాన మంత్రి కార్యాలయం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
24 SEP 2023 3:31PM by PIB Hyderabad
నమస్కారం!
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులూ.. కేంద్ర కేబినెట్ సభ్యులూ.. సహాయ మంత్రులూ.. పార్లమెంటు సభ్యులూ.. శాసన సభ్యులూ.. ఇతర ప్రతినిధులూ.. నా కుటుంబ సభ్యులారా...
దేశంలో ఆధునిక రవాణా సదుపాయాలు భారీగా విస్తరిస్తున్నాయి. ఇది అపూర్వ ఘట్టం. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి శరవేగంగా, భారీస్థాయిలో జరుగుతోంది. నేటి భారత్ కోరుకునేది ఇదే. ఈ పురోగతినే యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలు, నిపుణులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగార్థులు అందరూ ఆకాంక్షిస్తున్నారు. నేడు ఒకేసారి 9 వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవమే దీనికి ఉదాహరణ. నేడు రాజస్థాన్, గుజరాత్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ సదుపాయం లభించింది. ఈ రోజు ప్రారంభించిన రైళ్లు మునుపటి వాటితో పోలిస్తే మరింత ఆధునికమైనవి, సౌకర్యవంతమైనవి. నవోత్తేజం, ఉత్సాహం, నవ భారత ఆకాంక్షలకు ఈ వందే భారత్ రైళ్లు ప్రతీక. వందే భారత్ పట్ల ఆదరణ నిరంతరం పెరుగుతుండడం అత్యంత ఆనందదాయకమైన విషయం. ఇప్పటివరకు ఈ రైళ్లలో కోటి పదకొండు లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణించారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
మిత్రులారా,
దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటివరకు 25 వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ఇప్పుడు ఈ నెట్వర్క్కు మరో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అదనంగా జోడిస్తున్నాం. వందే భారత్ దేశంలోని ప్రతి ప్రాంతాన్ని అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదు. వందే భారత్ ఎక్స్ప్రెస్ తన లక్ష్యాన్ని అద్భుతంగా నెరవేరుస్తుండడం సంతోషాన్నిస్తోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఈ రైళ్లు ఎంతో ముఖ్యమైనవిగా మారాయి. వేరే నగరంలో తమ పనిని కొన్ని గంటల్లోనే ముగించుకుని, అదే రోజు తిరిగి రావాలనుకునే ప్రజలకు ఈ రైళ్లు అత్యావశ్యకంగా మారాయి. పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలను కూడా వందే భారత్ రైళ్లు వేగవంతం చేశాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రతిచోటా పర్యాటకుల సంఖ్య పెరిగింది. పర్యాటకుల సంఖ్య పెరిగితే ఆ ప్రాంతాల్లోని వ్యాపారులు, దుకాణదారుల ఆదాయం పెరుగుతుంది. ఇది అక్కడ కొత్త ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది.
నా కుటుంబ సభ్యులారా,
నేడు భారత్లో కనిపిస్తున్న ఉత్సాహభరిత వాతావరణాన్నీ, స్వావలంబననూ కొన్ని దశాబ్దాలుగా మనం చూడలేదు. నేడు నవ భారత విజయాలను చూసి దేశంలోని ప్రతి పౌరుడు గర్విస్తున్నాడు. విజయవంతమైన చంద్రయాన్-3 మానవుడి అంచనాలను కొత్త శిఖరాలకు చేర్చింది. బలమైన సంకల్పముంటే.. అత్యంత సవాలుతో కూడిన లక్ష్యాలనైనా సాధించవచ్చనే విశ్వాసాన్ని ఆదిత్య-ఎల్1 ప్రారంభం మనకు అందించింది. విజయవంతమైన జీ20 శిఖరాగ్ర సదస్సు.. భారత ప్రజాస్వామ్యం, ప్రజలు, వైవిధ్యాల అపార శక్తిని ప్రపంచానికి చాటింది. భారత దౌత్య నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమవుతున్నాయి. మహిళల నేతృత్వంలో అభివృద్ధి అన్న మన దృక్పథం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందింది. ఈ దృక్పథంతోనే ‘నారీ శక్తి వందన్ అధినియం’ను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నారీ శక్తి వందన్ అధినియంను ప్రవేశపెట్టినప్పటి నుంచి.. మహిళల భాగస్వామ్యం, ప్రతి రంగంలో వారి పాత్ర పెరుగుతున్న తీరుపై చర్చలు జరుగుతున్నాయి. నేడు చాలా రైల్వే స్టేషన్లు పూర్తిగా మహిళా ఉద్యోగులే నిర్వహిస్తున్నారు. ఆ ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. నారీ శక్తి వందన్ అధీనియం నేపథ్యంలో దేశ మహిళలకు మరోసారి అభినందనలు.
మిత్రులారా,
ఆత్మవిశ్వాసంతో కూడిన ఈ వాతావరణం నడుమ.. ‘అమృత కాల’ భారత్ తన ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలపై ఏకకాలంలో పనిచేస్తోంది. మౌలిక సదుపాయాల ప్రణాళిక నుంచి దాని అమలు వరకు.. భాగస్వాములంతా సహకరిస్తున్నారు. ఇందుకోసం ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. దేశంలో రవాణా ఖర్చులను, మన ఎగుమతి వ్యయాన్ని తగ్గించడం కోసం ఓ కొత్త లాజిస్టిక్స్ విధానాన్ని రూపొందించాం. బహువిధ అనుసంధానంపై ప్రధానంగా దృష్టి సారించడం ద్వారా.. దేశంలో వివిధ విధాల రవాణా వ్యవస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తున్నాం. ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడంతోపాటు భారత పౌరుల విలువైన సమయాన్ని ఆదా చేయడం ఈ కార్యక్రమాలన్నింటి ప్రధాన లక్ష్యం. ఈ వందే భారత్ రైళ్లు ఆ భావనకు ప్రతిబింబం.
మిత్రులారా,
దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలకు అత్యంత నమ్మకమైన మైత్రి భారతీయ రైల్వేలతో ఉంది. మన దేశంలో ఒక రోజు రైలులో ప్రయాణించే వారి సంఖ్య అనేక దేశాల జనాభా కన్నా ఎక్కువ. దురదృష్టవశాత్తు గతంలో భారతీయ రైల్వేలను ఆధునికీకరించడంపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం భారత రైల్వేల్లో విప్లవాత్మక మార్పులకు కట్టుబడి ఉంది. ప్రభుత్వం రైల్వే బడ్జెటును మునుపెన్నడూ లేనంతగా పెంచింది. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ 2014తో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎక్కువ. రైలు మార్గాల డబ్లింగు, విద్యుదీకరణ, కొత్త రైళ్లను నడపడం, కొత్త మార్గాల నిర్మాణంలో వేగవంతమైన పురోగతిని చూస్తున్నాం.
మిత్రులారా,
భారతీయ రైల్వేల్లో.. ప్రయాణికులకు రైళ్లు కదిలే గృహాల వంటివైతే, మన రైల్వే స్టేషన్లు తాత్కాలిక గృహాల వంటివి. మీకూ, నాకూ ఇద్దరికీ తెలుసు.. వేలకొద్దీ మన రైల్వే స్టేషన్లలో వలస పాలన రోజుల నుంచి, స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా పెద్దగా మార్పులేమీ లేవు. అభివృద్ధి చెందిన దేశం తన రైల్వే స్టేషన్లను ఆధునికీకరించుకోవడం అత్యావశ్యకం. ఈ లక్ష్యంతోనే.. దేశంలో మొదటిసారిగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు దేశంలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం రికార్డు స్థాయిలో ఫుటోవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లను నిర్మిస్తున్నాం. కొన్ని రోజుల కిందటే దేశంలో 500కు పైగా ప్రధాన స్టేషన్ల పునరుద్ధరణ పని మొదలైంది. ‘అమృత కాలం’లో కొత్తగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్లు’గా పిలుస్తున్నాం. త్వరలోనే ఈ స్టేషన్లు నవభారత అస్తిత్వంగా మారుతాయి.
నా ప్రియ కుటుంబ సభ్యులారా,
ప్రతి రైల్వే స్టేషనుకూ ఒక వ్యవస్థాపన దినోత్సవముంటుంది. భారతీయ రైల్వే ఇప్పుడు రైల్వే స్టేషన్ల వ్యవస్థాపన దినోత్సవ నిర్వహణ మొదలుపెట్టడం సంతోషాన్నిస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరు, ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, పూణే సహా అనేక స్టేషన్ల వ్యవస్థాపన దినోత్సవాన్ని ఇటీవల భారతీయ రైల్వే నిర్వహించింది. కోయంబత్తూరు రైల్వే స్టేషన్ ప్రయాణికుల సేవలో 150 ఏళ్లు పూర్తిచేసుకుంది. సహజంగానే అక్కడి ప్రజలు ఈ విజయాన్ని చూసి గర్విస్తున్నారు. ప్రజల మధ్య మరింతగా అనుసంధానాన్ని పెంచేలా.. రైల్వే స్టేషన్ల వ్యవస్థాపక దినోత్సవ సంప్రదాయాన్ని విస్తరిస్తాం.
నా ప్రియ కుటుంబ సభ్యులారా,
‘అమృత కాలం’లో అచంచలమైన సంకల్పంతో ‘ఏక్ భారత్, శ్రేష్ఠతా భారత్’ దార్శనికతను భారత్ సాకారం చేసుకుంది. 2047లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లూ పూర్తయ్యే సమయానికి- ‘అభివృద్ధి చెందిన భారత్’ లక్ష్యాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. ప్రతి రాష్ట్రమూ, ప్రతి రాష్ట్రంలోని ప్రజలూ అభివృద్ధి సాధించడం అంతే కీలకం. గత ప్రభుత్వాల హయాంలో మంత్రివర్గం ఏర్పాటు సమయంలో.. రైల్వే మంత్రిత్వ శాఖ ఎవరికి వస్తుందనేది ఎక్కువగా చర్చనీయమయ్యేది. రైల్వే మంత్రి సొంత రాష్ట్రానికే ఎక్కువ రైళ్లు నడుస్తాయని భావించేవారు. అంతేకాకుండా కొత్త రైళ్ల ప్రకటనలు భారీగా వెలువడినప్పటికీ.. వాటిలో కొన్ని మాత్రమే పట్టాలెక్కేవి. ఈ స్వార్థపూరిత ఆలోచన రైల్వేలకు మాత్రమే కాకుండా.. దేశానికీ, ప్రజలకూ కూడా గణనీయమైన నష్టాన్ని కలిగించింది. అయితే ఇప్పుడు మాత్రం.. దేశంలో ఏ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టే సాహసం జరగడం లేదు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ లక్ష్యంతో మనం ముందుకెళ్లాలి.
నా ప్రియ కుటుంబ సభ్యులారా,
కష్టపడి పనిచేసే మన రైల్వే ఉద్యోగులకు కూడా ఈ రోజు నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక నగరం నుంచో లేదా సుదూర ప్రాంతం నుంచో ఎవరైనా ప్రయాణించిన సమయంలో, వారిని అడిగే మొదట ప్రశ్న.. వారి ప్రయాణం ఎలా జరిగింది అనే. ఆ వ్యక్తి తన ప్రయాణ అనుభవాన్ని వివరించడమే కాకుండా.. ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు మొత్తం ప్రయాణం గురించీ మాట్లాడుతారు. రైల్వే స్టేషన్లు ఎంత మారిపోయాయో, రైళ్లను ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో వివరిస్తారు. టీటీఈ ప్రవర్తన, కాగితానికి బదులుగా ఆయన టాబ్లెట్లను ఉపయోగిస్తున్న తీరు, భద్రతా ఏర్పాట్లు, ఆహార నాణ్యత సహా వివిధ అంశాల్లో తన అనుభవాలను వారు ప్రస్తావిస్తారు. అందువల్ల వినియోగదారులకు మంచి ప్రయాణ అనుభవాన్ని అందించేలా నిరంతర సానుభూతి, అంకితభావాలను కొనసాగించడం ప్రతి రైల్వే ఉద్యోగికి అత్యావశ్యకం. ఈ మధ్య ఇలాంటి సానుకూల స్పందనను వినడం చాలా సంతోషాన్నిస్తోంది. ‘‘ఇది చాలా బాగుంది, చాలా బాగుంది’’ అని ప్రజలు అంటుండడం చాలా ఆనందాన్నిస్తోంది. అంకితభావంతో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు.
నా ప్రియ కుటుంబ సభ్యులారా,
భారత రైల్వేలు స్వచ్ఛతలో కొత్త ప్రమాణాలను నిర్దేశించాయి. ప్రతి పౌరుడు దీనిని గుర్తించాడు. గతంతో పోలిస్తే మన స్టేషన్లు, రైళ్లు ఇప్పుడు చాలా శుభ్రంగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు.. గాంధీ జయంతి ఎంతో దూరంలో లేదు. స్వచ్ఛత పట్ల గాంధీజీ నిబద్ధత కూడా మనందరికీ తెలుసు. స్వచ్ఛత కోసం చేసే ప్రతి పనీ గాంధీజీకి నిజమైన నివాళి. ఈ స్ఫూర్తితో అక్టోబరు 1న ఉదయం 10 గంటలకు స్వచ్ఛతపై ఓ గొప్ప కార్యక్రమం జరగబోతోంది. ప్రజల నేతృత్వంలోనే దేశవ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తున్నాం. ఈ స్వచ్ఛతా ప్రచారంలో మీరు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అక్టోబరు 1న ఉదయం 10 గంటలను మీ క్యాలెండర్లలో మార్క్ చేసుకోండి. గాంధీ జయంతి రోజున ఖాదీ, స్థానిక ఉత్పత్తులను కొనడంపై ప్రతి పౌరుడు దృష్టి పెట్టాలి. అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 31 సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి. ఒక విధంగా చెప్పాలంటే, జాగరూకతతో వ్యవహరిస్తూ.. ఈ నెల మొత్తం ఖాదీ, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేద్దాం. స్థానిక ఉత్పత్తుల వినియోగం కోసం మనం మరింతగా గళం విప్పాలి.
మిత్రులారా,
భారతీయ రైల్వేలో, సమాజంలో అన్ని స్థాయిల్లో జరుగుతున్న మార్పులు ‘అభివృద్ధి చెందిన భారత్’ దిశగా కీలక ముందడుగుగా నిలుస్తాయన్న విశ్వాసం నాకుంది. కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా మరోసారి దేశ ప్రజలకు నా శుభాకాంక్షలు.
ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి ఇంచుమించు అనువాదం. మూల ప్రసంగం హిందీలో ఉంది.
***
(रिलीज़ आईडी: 2200278)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam