హోం మంత్రిత్వ శాఖ
ముంబయిలో 'భారత నౌకా వాణిజ్య వారోత్సవం- 2025'ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
“ భద్రత, స్థిరత్వం, స్వావలంబన: ఈ మూడు ప్రధాన అంశాల ఆధారంగా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... నౌకా వాణిజ్య దార్శనికత”
“ప్రస్తుత సమయం భారతదేశ నౌకా వాణిజ్య రంగానిది..
ఇది గేట్వే ఆఫ్ ఇండియా ఇక గేట్వే ఆఫ్ ది వరల్డ్’’
“మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల నేడు
భారత్ ప్రపంచ నౌకా వాణిజ్య రంగంలో వర్థమాన శక్తిగా నిలుస్తోంది”
“సముద్రాల విషయంలో దేశానికి ఉన్న ధృడమైన స్థానం, ప్రభుత్వ స్థిరత్వం, నావికా సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ అభివృద్ధి, భద్రత, పర్యావరణ పరిరక్షణలో పురోగతిని పెంపొందిస్తూ
ఇండో-పసిఫిక్, గ్లోబల్ సౌత్ మధ్య వారధిగా వ్యవహరిస్తోన్న భారత్”
“2047 నాటికి నౌకా వాణిజ్య విషయంలో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యాన్ని సాధించటంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఇండియా మారిటైమ్ వీక్-2025”
“ప్రాకృతిక సమతుల్యతను కాపాడుతూ అభివృద్ధిని వేగవంతం చేసే
నౌకా వాణిజ్య భవిష్యత్ను తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్న భారత్”
“సముద్రాలపై ఆధారపడి జీవిస్తున్న చిన్న ద్వీప దేశాలు, గ్లోబల్ సౌత్ దేశాలను దృష్టిలో పెట్టుకొని హరిత, సుసంపన్న, సహకార సముద్ర వ్యవస్థను తయారు చేసే దార్శనికతతో ముందుకు సాగుతున్న భారత్”
“గత 11 సంవత్సరాలుగా భారత నౌకా వాణిజ్య రంగాన్ని జాతీయ సామర్థ్యం, ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ శ్రేయస్సుకు కేంద్రంగా మార్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ”
‘మహాసాగర్’గా (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్) మారిన ప్రధానమంత్రి మోదీ నౌకా వాణిజ్య విధానం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత్ ప్రభావానికి చిహ్నంగా ఉన్న మహాసాగర్
భారత్ను నౌకా వాణిజ్య రంగంలో ప్రపంచ నాయకత్వ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపిస్తున్న ‘సాగర్ నుంచి మహాసాగర్’గా మార్చాలనే ప్రధానమంత్రి మోదీ ఆలోచన
పెట్టుబడులను, పారిశ్రామికవేత్తలనూ ఆకర్షించనున్న నౌకా వాణిజ్య పరిధిలోని
23.7 లక్షల స్క్వేర్ కిలోమీటర్లున్న భారత ప్రత్యేక ఆర్థిక మండలి
Posted On:
27 OCT 2025 4:37PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ముంబయిలో భారత నౌకా వాణిజ్య వారోత్సవం (ఇండియా మారిటైమ్ వీక్ 2025)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్.. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత గేట్వే ఆఫ్ ఇండియాకు ముంబయి నిలయంగా ఉందని అన్నారు. ప్రస్తుత సమయం భారత్ నౌక వాణిజ్య రంగానిదేనన్న ఆయన.. ఇది గేట్వే ఆఫ్ ఇండియాను... గేట్వే ఆఫ్ ది వరల్డ్గా మారుస్తోందని వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంగా నౌకా వాణిజ్యం విషయంలో తీసుకొచ్చిన నిర్మాణాత్మక సంస్కరణల వల్ల భారత్ ఒక శక్తిమంతమైన కేంద్రంగా మారిందని, ప్రపంచ నౌకా వాణిజ్య రంగంలో దేశం పూర్తి సామర్థ్యంతో నిలబడుతోందన్న విషయాన్ని సముద్రాలకు సంబంధించిన సదస్సులు నిరూపించాయన్నారు.
11,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న తీరప్రాంతం వల్ల సముద్రాల విషయంలో దేశ సామర్థ్యం, వ్యూహాత్మక ప్రాబల్యం పట్ల స్పష్టత ఉందని అమిత్షా తెలిపారు. 13 తీరప్రాంత రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ జీడీపీలో దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 23.7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక కేంద్రం (ఈఈజెడ్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలనూ ఆకర్షిస్తోందని, ఆయా రాష్ట్రాలు- కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 80 కోట్ల మంది నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని (ఐఓఆర్) 38 దేశాలు ప్రపంచ ఎగుమతుల్లో సుమారు 12 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశం ద్వారా.. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు, నౌకా వాణిజ్యవేత్తలకూ భారత్కు ఉన్న అపార సామర్థ్యాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
నౌకా వాణిజ్యం విషయంలో దేశానికి ఉన్న ధృడమైన స్థానం, ప్రభుత్వపరంగా స్థిరత్వం, నావికా సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ అభివృద్ధి, భద్రత, పర్యావరణ పరిరక్షణలో ముందుకు సాగుతున్న భారత్.. ఇండో-పసిఫిక్, గ్లోబల్ సౌత్ మధ్య వారధిగా వ్యవహరిస్తోందని కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారు. సముద్రాల విషయంలో భారత్కు 5,000 సంవత్సరాల చరిత్ర ఉందన్న ఆయన.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ విషయంలో కొత్త చరిత్రను సృష్టించేందుకు దేశం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో 100కు పైగా దేశాలు ప్రతినిధులు పాల్గొనటం అనేది.. ప్రపంచ భాగస్వామ్యం, ప్రాంతీయ స్థిరత్వానికి భారత్ అవలంబిస్తున్న సముద్ర విధానం కేంద్ర బిందువుగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తోందని వివరించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నౌకా వాణిజ్య చర్చా వేదికగా భారత నౌకా వాణిజ్య వారోత్సవం అవతరించిందని కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ 2025 సమావేశం… 2047 నాటికి నౌకా వాణిజ్య రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందాలనే లక్ష్యాన్ని భారత్ సాధించేందుకు గణనీయంగా దోహదపడుతుందన్నారు. ఈ విడత సమావేశంలో 100కు పైగా దేశాల నుంచి 350 మందికి పైగా వక్తలు, 500కు పైగా కంపెనీలు, 1 లక్ష మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇది 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తుందన్నారు. భారత్ పోటీని మాత్రమే కాకుండా పరస్పర సహకారాన్ని నమ్ముతోందని హోంమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. పరస్పర సహకారం ద్వారా దేశంలోని సముద్ర పరిశ్రమను ప్రపంచ పరిశ్రమలతో అనుసంధానించేందుకు ఒక సమగ్ర రోడ్మ్యాప్ను తయారు చేసినట్లు తెలిపారు.
నౌకా వాణిజ్యం విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఉన్న దార్శనికత భద్రత, స్థిరత్వం, స్వావలంబన అనే మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉందని కేంద్ర హోం, సహకార మంత్రి పేర్కొన్నారు. నౌకా వాణిజ్యానికి సంబంధించిన దార్శనికత- 2030లో భాగంగా సాగరమాల, నీలి ఆర్థిక వ్యవస్థ, హరిత సముద్ర దార్శనికత వంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచ నౌకానిర్మాణ పరిశ్రమలో భారత్ను టాప్ ఐదు దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. కొత్త లోతైన భారీ పోర్టులను నిర్మిస్తున్నట్లు తెలియజేసిన ఆయన సంవత్సరానికి 10,000 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా లక్ష్యంతో ముందుగు సాగుతున్నట్లు వెల్లడించారు. నౌకాశ్రయాలకు సంబంధించిన రవాణా పూర్తిగా డిజిటలైజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్-మధ్య ప్రాచ్యం- ఐరోపా ఎకనామిక్ కారిడార్, తూర్పు సముద్ర వాణిజ్య కారిడార్, ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ వంటి అనుసంధాన ప్రాజెక్టుల్లో కూడా భారత్కు భాగస్వామ్యం ఉందన్నారు.
గత 11 సంవత్సరాలుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.. భారత నౌకా వాణిజ్య రంగాన్ని జాతీయ సామర్థ్యం, ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ శ్రేయస్సుకు కేంద్రంగా మార్చారన్న కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా.. ఈ మూడు లక్ష్యాలను సాధించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నేడు ప్రపంచ వాణిజ్యంలో మూడింట రెండు వంతులు ఇండో-పసిఫిక్ ద్వారానే జరుగుతోందని.. భారత వాణిజ్యంలో 90 శాతం వాటాను సముద్ర మార్గాలు కలిగి ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి మోదీ సముద్ర విధానం ‘మహాసాగర్’గా (మ్యూచువల్ అండో హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్) మారిందని.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత్ ప్రభావానికి ఇది ప్రతీక అని అన్నారు. ‘సాగర్’ను ‘మహాసాగర్’గా మార్చాలనే ప్రధానమంత్రి మోదీ దార్శనికత.. భారత్ను 2047 నాటికి నౌకా వాణిజ్య రంగంలో ప్రపంచ నాయకత్వ స్థాయికి వెళ్లేలా చేస్తుందన్నారు. దీనిని సాధించేందుకకు మోదీ ప్రభుత్వం బడ్జెట్ను 40 మిలియన్ డాలర్ల నుంచి 230 మిలియన్ డాలర్లకు తీసుకెళ్లిందని.. అంటే ఆరు రెట్లు పెంచిందని తెలిపారు.
సాగరమాల కింద మార్చి 2025 నాటికి పూర్తి చేసేందుకు 70 బిలియన్ డాలర్ల విలువైన 839 ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపిన కేంద్ర హోం మంత్రి.. వీటిలో 17 బిలియన్ డాలర్ల విలువైన 272 ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటికే పూర్తైందన్నారు. 5 బిలియన్ డాలర్ల గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతోందని.. ఇది సముద్రాల ద్వారా జరిగే ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ వాటాను గణనీయంగా పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. 200 మిలియన్ డాలర్ల వ్యయంతో కొచ్చిన్ ఓడరేవులో దేశంలోనే అతిపెద్ద డాక్ను నిర్మించే విషయంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గుజరాత్లో మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా భారత చట్టాలను కూడా సవరించినట్లు తెలిపారు. 2025లో పార్లమెంటు 117 సంవత్సరాల నాటి ఇండియన్ పోర్ట్స్ బిల్లును ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆయన.. ఇది సమకాలీన అవసరాలు, ప్రపంచ ధృకథాలకు అనుగుమంగా ఉందన్నారు. ప్రధాన ఓడరేవుల చట్టం- 2021 (మేజర్ పోర్ట్ అథారిటీస్ చట్టం) ద్వారా ఓడరేవులకు మరింత ఎక్కువ స్వయంప్రతిపత్తిని అందించేందుకు, వాటి సంస్థాగత వ్యవస్థను ఆధునికీకరించేందుకు మార్గాన్ని సుగమం చేసినట్లు పేర్కొన్నారు. జాతీయ జలమార్గాల చట్టం- 2016 కింద 106 కొత్త జలమార్గాలను ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
దేశ భద్రత, తీరప్రాంత- మత్స్యకారుల భద్రతను పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం నీలి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసిందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. గత దశాబ్దంలో ఓడరేవుల ద్వారా సరకు రవాణా 118 శాతం, కార్గో నిర్వహణ 150 శాతం పెరిగిందని తెలిపారు. ‘టీఏటీ’ని (టర్న్-అరౌండ్-టైమ్) తగ్గించామన్న ఆయన.. దీనిని ప్రపంచ ప్రమాణాల స్థాయికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. సముద్ర రంగంలో చక్రీయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు, నౌకా నిర్మాణాన్ని మరింత వృద్ధి చేసేందుకు విధాన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపిన ఆయన.. ప్రాకృతిక సమతుల్యతను కాపాడుకుంటూ అభివృద్ధిని వేగవంతం చేసే విధంగా సముద్రాల విషయంలో హరిత భవిష్యత్ను నిర్మించటమే భారత్ లక్ష్యమని అన్నారు. చిన్న ద్వీప దేశాలు, గ్లోబల్ సౌత్లోని అనేక దేశాలు జీవనోపాధి, మనుగడ కోసం సముద్రాలపై ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని దేశం మర్చిపోదన్న ఆయన.. ఆయా దేశాలకు వాతావరణ మార్పు అనేది అస్తిత్వ సమస్య అని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్.. హరిత, సుసంపన్నమైన, సహకార సముద్ర రంగాన్ని సృష్టించే దార్శనికతతో ముందుకెళ్తోందని తెలిపారు.
***
(Release ID: 2183142)
Visitor Counter : 7
Read this release in:
Odia
,
हिन्दी
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada