సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కోసం దేశంలో అత్యంత రద్దీగా ఉండే టెర్మినల్స్లో ఒకటైన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్ డీఎల్ఎస్)లో కొత్తగా నిర్మించిన యాత్రి సువిధా కేంద్రాన్ని కేంద్ర రైల్వే, సమాచార అండ్ ప్రసార, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ తనిఖీ చేశారు. దాదాపు 7,000 మంది ప్రయాణికులకు ఒకే సమయంలో వసతి కల్పించేలా, రైలు ఎక్కే ముందు సౌకర్యవంతగా ఉండేలా, రద్దీ లేకుండా రాకపోకలు సాగేలా ఈ కేంద్రాన్ని రూపొందించారు.
“రద్దీ విపరీతంగా పెరిగే పండగ సమయాల్లో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా యాత్రి సువిధా కేంద్రాన్ని నిర్మించారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఇలాంటి యాత్రి సువిధా కేంద్రాలను అభివృద్ధి చేయాలి” అని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించటానికి యాత్రి సువిధా కేంద్రాన్ని మూడు భాగాలుగా విభజించారు. 2,860 చ.మీ టికెట్లు కొనుగోలు చేసే ప్రాంతం, 1,150 చ.మీ. పోస్ట్ టికెటింగ్ ప్రాంతం, 1,218 చ.మీ ప్రీ టికెటింగ్ ప్రాంతం. ఈ విభజన వల్ల టెర్మినల్ ప్రధాన ద్వారం వద్ద రద్దీని తగ్గించి, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచవచ్చు.
ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ఉత్తర రైల్వే విభాగం ఈ కేంద్రాన్ని సమగ్రమైన, ఆధునిక సౌకర్యాలతో రూపొందించింది.
ప్రధాన సౌకర్యాలు:
టికెటింగ్: 22 ఆధునిక టికెట్ కౌంటర్లు, 25 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు(ఏటీవీఎంలు).
సామర్థ్యం, సౌకర్యం: 200 మంది ప్రయాణికులకు సీటింగ్ సామర్థ్యం, చల్లదనం కోసం 18 హైవాల్యూమ్ లో స్పీడ్ (హెచ్ వీఎల్ ఎస్) ఫ్యాన్ల ఏర్పాటు.
పారిశుద్ధ్యం, నీరు: 652 చ.మీ విస్తీర్ణంలో ప్రత్యేక టాయిలెట్ బ్లాక్ నిర్మాణంతో పాటు ఆర్ఓ ఆధారిత సురక్షిత తాగునీటి వ్యవస్థ.
సమాచారం, రక్షణ: 24 స్పీకర్లతో ప్రయాణికులకు ప్రకటన వ్యవస్థ, రైళ్ల సమాచారం తెలిపేందుకు 3 ఎల్ ఈడీ ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలు, 7 యూనిట్లలో అధునాతన అగ్నిమాపక వ్యవస్థ.
భద్రత: 18 సీసీటీవీ కెమెరాలు, 5 లగేజీ స్కానర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు (డీఎఫ్ఎండీ) వంటి అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు.
దీని నిర్మాణ సమయంలో ఉత్తర రైల్వే విభాగం అనేక సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. ఇప్పటికే ఉన్న ఏటీఎం కేంద్రాలు, ఢిల్లీ పోలీస్ క్యాబిన్, హోర్డింగుల వంటి వాటిని అవసరమైన మేరకు తొలగించటం, వాటి స్థానాలను మార్చటంతో పాటు నీటి పైపులైన్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఓఎఫ్ సీ కేబుల్స్ వంటి అత్యవసర సౌకర్యాలను రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం లేకుండా వేరే చోటుకు తరలించారు.
ముఖ్యమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి 1 (ఎఫ్ఓబీ 1)ను విస్తరించారు. దీనివల్ల ఎన్ డీఎల్ ఎస్ వద్ద రైలు దిగే ప్రయాణికులు నేరుగా మెట్రో స్టేషన్ కు వెళ్లేందుకు వీలుంటుంది. ఇది వివిధ రవాణా మార్గాల అనుసంధానతను మెరుగుపరిచి, ప్లాట్ ఫామ్ పై రద్దీని తగ్గిస్తుంది.
తనిఖీలో భాగంగా కేంద్రమంత్రి వెంట రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ శ్రీ సతీశ్ కుమార్, ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అశోక్ కుమార్ వర్మ, ఇతర సీనియర్ రైల్వే అధికారులున్నారు. ఈ నూతన నిర్మాణ ప్రణాళిక, అమలు గురించి మంత్రికి వివరించారు. కీలక సదుపాయాల ఆధునీకీకరణ, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పనకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ తనిఖీ స్పష్టం చేసింది.
***