ఆయుష్
ద్రవ్య పోర్టల్ మొదటి ఫేజ్ లో 100 ఆయుష్ ఔషధాల జాబితా
ద్రవ్య పోర్టల్ కేవలం డిజిటల్ పత్రాల కేంద్రమే కాదు... భారత విజ్ఞాన సంప్రదాయానికి ప్రతిరూపం:
కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్
ఆయుష్ ఔషధాలపై పురాతన, ఆధునిక పరిశోధనలను డిజిటైజ్ చేసి ఏకం చేయటానికి, విభిన్న రంగాల ఆవిష్కరణలను ప్రోత్సహించటానికి ఏఐ పోర్టల్ ను రూపొందించిన సీసీఆర్ఏఎస్
प्रविष्टि तिथि:
09 OCT 2025 11:49AM by PIB Hyderabad
ద్రవ్య పోర్టల్ మొదటి దశలో 100 కీలక ఔషధాల జాబితాను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జాబితాకు సంబంధించిన కచ్చితత్వాన్ని, ప్రామాణికతను నిర్ధారించేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా నిరంతరం డేటాను నవీకరిస్తారు.
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఫర్ వర్సటైల్ యార్డ్ స్టిక్ ఆఫ్ ఆయుష్ (ద్రవ్య) కార్యక్రమం, ఒక వినూత్న ఆన్ లైన్ విజ్ఞాన నిధి.
ద్రవ్య పోర్టల్ ఏఐతో మాత్రమే కాక, ఆయుష్ గ్రిడ్, ఔషధ పదార్థాలు, ఔషధ విధానానికి సంబంధించి ఇతర కార్యక్రమాలతోనూ అనుసంధానం అవుతుంది. క్యూఆర్ కోడ్ అనుసంధానంతో దేశవ్యాప్తంగా ఉన్న ఔషధ మొక్కల ఉద్యానవనాలు, ఔషధ నిల్వ కేంద్రాల్లో ప్రామాణిక సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది.
సంప్రదాయ వైద్యంలో ఆధారాలతో అనుసంధానం, డిజిటల్ పరివర్తనకు తొలి అంచెగా... గోవాలో జరిగిన 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 23న కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్, కేంద్ర విద్యుత్, నూతన అండ్ పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద ఎస్సో నాయక్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ ఔషధాలకు సంబంధించి ప్రామాణికమైన, పరిశోధనాధారిత సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించుకోవాలనే మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతను ఈ కార్యక్రమం తెలియజేస్తుంది.
సమగ్రమైన, అందరికీ అందుబాటులో ఉండే సమాచార కేంద్రం ద్రవ్య పోర్టల్. ఇది శాస్త్రీయ ఆయుర్వేద కేంద్రాలు, ప్రామాణిక ఆన్ లైన్ పరిశోధనా వేదికల నుంచి డేటాని తీసుకుని ఎప్పటికప్పుడు నవీకరిస్తుంది. స్పష్టమైన వినియోగదారు ఇంటర్ఫేస్తో రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా ఆయుష్ వ్యవస్థల్లో ఉపయోగించే ఔషధాల కోసం అన్వేషించేందుకు, ఆయుర్వేద ఫార్మకోథెరపోటిక్స్, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, ఫార్మసీ, ఫార్మకాలజీ, భద్రతా సమాచారానికి సంబంధించిన వివరణాత్మక ప్రొఫైళ్లను పొందవచ్చు.
"ద్రవ్య పోర్టల్ కేవలం డిజిటల్ పత్రాల కేంద్రమే కాదు. భారత విజ్ఞాన సంప్రదాయానికి ప్రతిరూపం. సంప్రదాయ జ్ఞానాన్ని అత్యాధునిక సాంకేతికతో అనుసంధానించటమే కాక, ప్రపంచ సహకారం, ఆవిష్కరణకు.. ఆయుర్వేదం, ఇతర ఆయుష్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాం" అని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ అన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా మాట్లాడుతూ.. "ఆయుష్ జ్ఞానాన్ని శాస్త్రీయంగా, ప్రపంచమంతటా అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేది ద్రవ్య. ఈ వేదిక పాత ఆయుర్వేద గ్రంథాల్లోని సమాచారాన్ని కొత్త పరిశోధనలతో కలిపి నేటి తరానికి తెలియజేస్తుంది. శాస్త్రవేత్తలకే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు, నూతన ఆవిష్కరణలు చేసేవారికి నమ్మదగిన, సాంకేతికతో కూడిన గొప్ప వనరుగా ఇది ఉపయోగపడుతుంది” అని అన్నారు.
"పరిశోధకులు, వైద్యులు, విద్యార్థులకు ఈ వేదిక కీలకమవుతుంది. విభిన్న విభాగాల పరిశోధనలను ఇది సులభతరం చేస్తుంది. ఔషధ ప్రమాణాల ఏకీకరణ, ఆయుష్ ఔషధ ఆధారాల ధ్రువీకరణను మెరుగుపరుస్తుంది” అని సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబినారాయణ్ ఆచార్య తెలిపారు.
సులువుగా మార్పులు చేసుకోగలిగే డిజైన్, ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని తీసుకునే సామర్థ్యం ద్రవ్యకు ఉంది. పాత వైద్య విధానాలను ఆధునిక సైన్స్ పరిజ్ఞానంతో కలిపేందుకు వేసిన గొప్ప ముందడుగు ఇది. దీని ద్వారా సరైన ఆయుష్ సమాచారం అందరికీ సులువుగా అందుబాటులో ఉండటమే కాక, అన్వేషించుకునేలా, ప్రపంచంలో అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 2176848)
आगंतुक पटल : 39