ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసిలోని బీహెచ్యూలో జరిగిన సంసద్ సంస్కృత ప్రతియోగిత బహుమతి ప్రదాన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
23 FEB 2024 2:21PM by PIB Hyderabad
నమ: పార్వతీ పతయే... హర హర మహాదేవ్!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్, కాశీ విద్వత్ పరిషత్ అధ్యక్షుడు ఆచార్య వశిష్ఠ త్రిపాఠి, కాశీ విశ్వనాథ న్యాస పరిషత్ అధ్యక్షుడు ఆచార్య నాగేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, విశిష్ట విద్యావేత్తలు, పోటీల్లో పాల్గొన్నవారు, సోదరీసోదరులారా,
కుటుంబ సభ్యులందరికీ నమస్కారం! ఈ పవిత్ర మహామాన ప్రాంగణంలో, విద్యావేత్తలు ముఖ్యంగా యువ పండితుల మధ్య ఉంటే.. జ్ఞాన నదిలో మునిగి తేలిన అనుభూతి కలుగుతోంది. కాలానికి అతీతమైన ప్రదేశంగా, పురాతనమైన నగరంగా పరిగణించే కాశీ గుర్తింపును మన నవ యువత బాధ్యతాయుతంగా బలోపేతం చేస్తోంది. ఇది హృదయాన్ని సంతృప్తి, గర్వంతో నింపడమే కాకుండా.. ఈ ‘అమృత కాలం’లో ఈ దేశానికి యువత నాయకత్వం వహించగలదే నమ్మకాన్ని ఇచ్చింది. జ్ఞానానికి రాజధాని కాశీయే. నేడు, ఈ కాశీ సామర్థ్యం, సారం మరోసారి శుద్ధి అవుతోంది. ఇది యావత్ భారత్ గర్వించదగిన అంశం. కాశీ సంసద్ సంస్కృత ప్రతియోగిత, కాశీ సంసద్ జ్ఞాన ప్రతియోగిత, కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగిత పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేసే అవకాశం నాకు లభించింది. విజేతల కృషిని, ప్రతిభను అభినందిస్తున్నాను. వారి కుటుంబాలకు, మార్గదర్శకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయానికి కొన్ని అడుగుల దూరంలో నిలిచిన వారికి, పోరాడి నాలుగో స్థానం దక్కించుకున్న వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కాశీ జ్ఞాన సంస్కృతిలో భాగమవడం, ఈ పోటీల్లో పాల్గొనడం మీకు గర్వకారణం. మీలో ఎవరూ ఓడిపోలేదు. ఎవరూ వెనకబడిపోలేదు. ఈ పోటీల్లో పాల్గొని మీరు ఎంతో నేర్చుకున్నారు.. ఎన్నో అడుగులు ముందుకు వేశారు. కాబట్టి ఈ పోటీల్లో పాల్గొన్నవారందరూ అభినందనలకు అర్హులే.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టు, కాశీ విద్వత్ పరిషత్, ఇతర పండితులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాశీ పార్లమెంట్ సభ్యునిగా నా లక్ష్యాన్ని చేరుకోవడంలో మీరు కీలకమైన పాత్రను పోషించారు, గణనీయమైన సహకారాన్ని అందించారు. గత పదేళ్లలో కాశీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే రెండు పుస్తకాలను ఈ రోజు ఆవిష్కరించాం. గడచిన పదేళ్లలో ప్రతి దశలోనూ కాశీ సాధించిన ప్రగతితో పాటుగా.. దాని సంస్కృతి సారాంశాన్ని ఈ కాఫీ టేబుల్ పుస్తకాలు వివరిస్తాయి. వీటికి అదనంగా.. కాశీలో నిర్వహించిన అన్ని సంసద్ పోటీలకు సంబంధించిన చిన్న పుస్తకాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాశీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
స్నేహితులారా,
మనమంతా కేవలం పావులమని, ఈ కాశీలో కార్యాలన్నీ చేస్తున్నది పరమ శివుడు, ఆయన భక్తులు మాత్రమే అని మీకు తెలుసు. శివుని కరుణ ప్రసరించిన ప్రదేశం దానికదే అభివృద్ధి చెందుతుంది. ఈ క్షణం శివుడు పరమానందభరితుడై ఉన్నాడు. అందుకే, ఆయన ఆశీస్సులతో గత పదేళ్లుగా కాశీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కాశీ కుటుంబ సభ్యుల కోసం ప్రారంభించుకుంటున్నాం. శివరాత్రి, ఏకాదశి పర్వదినాల కంటే ముందే.. అభివృద్ధి ఉత్సవాన్ని కాశీలో నిర్వహించుకుంటున్నాం. ఇక్కడికి రావడానికంటే ముందే కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగిత గ్యాలరీని వీక్షించాను. గత పదేళ్లుగా గంగా అభివృద్ధితో పాటుగా.. ఈ నగరంలో ఎంత వేగంగా మారిందో మీరు వీక్షించారు. నేను నిజం చెబుతున్నానో లేదో మీరే చెప్పండి. నేను చెబుతున్నది అక్షర సత్యం. మార్పు వచ్చింది. సంతృప్తి కలిగింది. చిన్నారులు పాత కాశీని చూసి ఉండకపోవచ్చు.. కాశీ ఎప్పుడూ ఇలాగే ఉండేదేమో అని వారు అనుకుంటారు. ఇదే నా కాశీ శక్తి, ఇది కాశీ ప్రజల గౌరవం, ఇది పరమ శివుని అనుగ్రహం. భగవంతుడు ఏదైనా పని చేయాలనుకుంటే.. ఆయన్ను ఎవరు ఆపగలుగుతారు? బెనారస్లో ఏదైనా మంచి జరిగిన ప్రతి సందర్భంలోనూ.. ప్రజలు తమ చేతులను పైకెత్తి ‘‘నమ: పార్వతీ పతయే హర హర మహాదేవ్!’’ అంటారు.
స్నేహితులారా,
మన విశ్వాసానికి సంబంధించిన పుణ్యక్షేత్రంగా మాత్రమే కాశీ పరిమితం కాలేదు.. ఇది భారత నిత్య చైతన్యాన్ని మేల్కొల్పిన కేంద్రం. ఒకప్పుడు భారత అభివృద్ధి గాథ ప్రపంచానికి ప్రతిధ్వనించింది. దాని వెనుక భారత ఆర్థిక సామర్థ్యం మాత్రమే కాకుండా.. సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక సంపద కూడా ఉంది. కాశీలాంటి పుణ్యక్షేత్రాలు, విశ్వనాథ్ ధామం లాంటి గుడులు దేశ ప్రగతికి యజ్ఞ వాటికలుగా ఉండేవి. ఇక్కడ ధ్యానంతో పాటుగా తాత్విక చర్చలు కూడా జరిగేవి. ఇక్కడ సంవాదాలతో పాటు పరిశోధన కూడా జరిగేవి. అలాగే.. సంస్కృతి మూలాలు, సాహిత్య, సంగీత ప్రవాహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి, భారత్లో ఏ కొత్త ఆలోచనలు ఉద్భవించినా.. ఏ సరికొత్త శాస్త్రాలు పుట్టుకొచ్చినా.. అవి ఏదైనా సాంస్కృతిక కేంద్రంతో సంబంధాన్ని కలిగి ఉండేవి. దీనికి ఉదాహరణగా మన ముందు కాశీ ఉంది. శివుని నగరమైన కాశీ.. బుద్ధుడి బోధనల భూమిగానూ పరిఢవిల్లింది. జైన తీర్థంకరుల జన్మభూమి అయిన కాశీలోనే ఆది శంకరాచార్యులకు జ్ఞానం సిద్ధించింది. విజ్ఞానం, పరిశోధన, ప్రశాంతత కోసం దేశవ్యాప్తంగా ఉన్న వారు మాత్రమే కాకుండా.. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు కాశీకి వస్తారు. ప్రతి ప్రాంతానికి, ప్రతి భాషకు, ప్రతి మాండలీకానికి, ప్రతి సంప్రదాయానికి చెందిన ప్రజలు ఈ నగరానికి వచ్చి స్థిరపడతారు. ఇలాంటి వైవిధ్యం ఉన్న చోటే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. కొత్త ఆలోచనలు ఎక్కడ వికసిస్తాయో అక్కడ అభివృద్ధికి అవకాశాలు సైతం పెరుగుతాయి.
కాబట్టి, సోదరీసోదరులారా,
విశ్వనాథ్ ధామ్ ప్రారంభం సందర్భంగా నేను ఏం చెప్పానో ఓసారి గుర్తు తెచ్చుకోండి. ‘‘భారత్కు విశ్వనాథ్ ధామ్ నిర్ణయాత్మక దిశను అందిస్తుంది, ఇది ఉజ్వలమైన భవిష్యత్తు వైపు భారత్ను నడిపిస్తుంది’’ అని చెప్పాను. అది ఈ రోజు మనకు కనిపించకపోవచ్చు. కానీ నిర్ణయాత్మక భవిష్యత్తు దిశగా భారత్ను నడిపించేలా జాతీయ పాత్రను పోషించడానికి విశ్వనాథ్ ధామ్ తన దివ్యమైన రూపంలో పునరాగమనం చేస్తోంది. విశ్వనాథ ధామ్ ప్రాంగణంలో దేశం నలుమూల నుంచి వచ్చిన పండితుల సమావేశాలు జరుగుతున్నాయి. న్యాస శాస్త్ర ప్రసంగ సంప్రదాయాన్ని కూడా విశ్వనాథ ఆలయం పునరుద్ధరిస్తోంది. శాస్త్రీయ సంగీతంతో పాటు.. పండితుల చర్చలు కాశీలో ప్రతిధ్వనిస్తున్నాయి. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మేధావుల మధ్య ఆలోచనలు పంచుకునే సంస్కృతి కూడా పెరుగుతుంది. ఇది ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షించడంతో పాటు.. కొత్త ఆలోచనలను సృష్టిస్తుంది. కాశీ సంసద్ సంస్కృత ప్రతియోగిత, కాశీ సంసద్ జ్ఞాన ప్రతియోగిత కూడా ఈ ప్రయత్నంలో భాగమే.
ఉపకారవేతనాలతో సహా పుస్తకాలు, వస్త్రాలు, ఇతర అవసరమైన వనరులను వేల మంది సంస్కృత అభ్యాసకులకు అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు సైతం తోడ్పాటు అందిస్తున్నాం. ఇది మాత్రమే కాదు.. తమిళ సంగమం, గంగా పుష్కరాల ద్వారా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ తరహా కార్యక్రమాల్లో విశ్వనాథ ధామ్ భాగంగా ఉంది. ఈ నమ్మకమే కేంద్రంగా ఆదీవాసీ సాంస్కృతిక ఉత్సవం ద్వారా సామాజిక సమ్మిళిత్వమనే సంకల్పం బలోపేతం అవుతోంది. ఆధునిక శాస్త్రీయ దృక్పథానికి అనుగుణంగా పురాతన విజ్ఞానంపై కాశీ పండితులు, విద్వత్ పరిషత్ నూతన పరిశోధన చేస్తున్నాయి. త్వరలో నగరంలో అనేక చోట్ల ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలోఉచిత భోజనం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నాకు తెలిసింది. అన్నపూర్ణ మాత నగరంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా గుడి బాధ్యత తీసుకుంటోంది. విశ్వాసానికి, సామాజిక, జాతీయ సంకల్పాలకు శక్తికేంద్రంగా కాశీ ఎలా విలసిల్లుతుందో.. అదే తరహాలో నవ భారత్కు సైతం సరికొత్త స్ఫూర్తిగా ఈ క్షేత్రం నిలుస్తోంది. ఇక్కడి నుంచి ఉత్తీర్ణులై వెళ్లే యువత భారతీయ విజ్ఞానానికి, సంప్రదాయానికి, సంస్కృతికి ఈ ప్రపంచంలో పతాకధారులుగా మారతారని నేను విశ్వసిస్తున్నాను. అంతర్జాతీయ సంక్షేమం అనే సంకల్పానికి బాబా విశ్వనాథుని భూమి సాక్ష్యంగా నిలుస్తోంది.
స్నేహితులారా,
మన విజ్ఞానం, శాస్త్రం, ఆధ్యాత్మికత వివిధ భాషల ద్వారా సుసంపన్నమయ్యాయి. అందులో సంస్కృతం అగ్రస్థానంలో ఉంది. భారత్ ఒక ఆలోచన అయితే.. సంస్కృతం దాని ప్రాథమిక వ్యక్తీకరణ. భారత్ ఒక యాత్ర అయితే.. సంస్కృతం దాని చరిత్రలో తొలి అధ్యాయం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్, దానికి మూలం సంస్కృతం. అందుకే, ‘‘భారతస్య ప్రతిష్ఠే దవే సంస్కృతం సంస్కృతి స్థతా’’ అంటే భారత ప్రతిష్ఠలో సంస్కృతం గణనీయమైన పాత్ర పోషిస్తుందని ఇక్కడ చెబుతుంటారు. మన దేశంలో ఒకప్పుడు శాస్త్రీయ పరిశోధన భాషగా సంస్కృతం ఉండేది. అలాగే శాస్త్రీయ విజ్ఞాన భాష కూడా సంస్కృతమే. ఖగోళశాస్త్రంలో సూర్య సిద్ధాంతమైనా.. ఆర్యభట్ట, లీలావతి గణితమైనా.. చరకుడు, సుశ్రుతుడి వైద్య శాస్త్రమైనా లేదా బృహత్ సంహిత అయినా.. అన్నీ సంస్కృతంలోనే లిఖితమయ్యాయి. వీటితో పాటుగా.. సంగీతం, కళలు సైతం ఈ భాష నుంచే పుట్టుకొచ్చాయి. ఈ రూపాల ద్వారానే భారత్కు గుర్తింపు వచ్చింది. కాశీలో సంస్కృతంలో వల్లించే వేదాలనే కంచిలోనూ మనం వింటాం. ఇవే వేల ఏళ్లుగా దేశాన్ని ఐక్యంగా ఉంచిన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’కు శాశ్వతమైన స్వరాలుగా భాసిల్లుతున్నాయి.
స్నేహితులారా,
ప్రస్తుతం, విరాసత్ (వారసత్వం), వికాస్ (అభివృద్ధి)కి నమూనాగా కాశీ నిలుస్తోంది. సంప్రదాయాలు, ఆధ్యాత్మికత చుట్టూ.. ఆధునికత ఎలా విస్తరిస్తుందో ఈ ప్రపంచం చూస్తోంది. నూతన ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్ఠించిన అనంతరం అయోధ్య కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా బుద్ధునికి సంబంధించిన ప్రదేశాల్లో ఆధునిక మౌలికవసతులు, సౌకర్యాల అభివృద్ధి జరుగుతోంది. ఖుషీనగర్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లబ్ధి పొందుతోంది. ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు ప్రస్తుతం దేశంలో నిర్మాణంలో ఉన్నాయి. ఇదే విశ్వాసంతో దేశాభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా.. విజయంలో కొత్త ప్రామాణికాలను నిర్దేశిస్తుంది. ఇది మోదీ ఇచ్చే గ్యారంటీ. మోదీ హామీ అంటే కచ్చితంగా నెరవేరుతుందనే గ్యారంటీ అని మీకు తెలుసు. పార్లమెంట్ సభ్యుడిగా నా కోసం.. ఇంకా మీ కోసం కూడా ఓ పనిని వెంట తీసుకువచ్చాను. మీరు అది చేస్తారా? నేను ఎన్నో పనులు మీకు అప్పచెప్పాను.. ఇక్కడి ప్రజలు వాటిని అద్భుతంగా స్వీకరించారు. ప్రతి అంశంతోనూ వారు అనుసంధానమై.. కొత్త తరంలో చైతన్యాన్ని నింపుతున్నారు. ఈ పోటీలు సాధారణమైనవి కాదు. నా లక్ష్యం ‘సబ్కా ప్రయాస్’ (సమష్టి కృషి) ప్రయోగాన్ని విజయవంతం చేయడం. రానున్న రోజుల్లో ప్రతి పర్యాటక ప్రదేశంలో ఏం జరుగుతుందో అందరూ చూడాలని నేను భావిస్తున్నాను. ప్రజలు పోస్టు కార్డులు ముద్రిస్తారు. వాటిపై ఓ ప్రత్యేకమైన ఫొటో ఉంటుంది. దాని వెనక ఏదైనా రాయడానికి వీలుగా ఖాళీగా ఉంటుంది. ఛాయాచిత్ర పోటీలకు వచ్చిన కాశీ ఫొటోలకు ఓటింగ్ పెట్టాలి. ప్రజలు ఓటు వేసిన టాప్ 10 ఫోటోలను పోస్టుకార్డులుగా ముద్రించి టూరిస్టులకు విక్రయించాలి. అలాగే ఈ పోటీలు ప్రతి ఏటా జరగాలి. ప్రతి సారీ 10 కొత్త ఫొటోలు వస్తాయి. అయితే అది ఓటింగ్ ద్వారా మాత్రమే జరగాలి. ఉత్తమ ఫొటోలను ఎంపిక చేయడానికి కాశీ ప్రజలు ఓటు వేయాలి. ఈ ఫొటోల కోసం మనం ఆన్లైన్ పోటీలు నిర్వహించవచ్చా? మనం చేయగలమా? సరే చేద్దాం.
రెండో పని - కొంత మంది తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఫొటోలు తీసి ఈ ఫొటోగ్రఫీ పోటీల్లో పాల్గొని ఉంటారు. నిర్దేశించిన పరిమాణంలో ఉన్న పేపర్లో వివిధ ప్రదేశాల వద్ద స్కెచ్చులు గీసే పోటీలను మనం నిర్వహిద్దాం. ఉత్తమ స్కెచ్చులకు బహుమతులు కూడా ఉంటాయి. తర్వాత ఈ స్కెచ్చుల్లో ఉత్తమమైన పదింటిని పోస్టుకార్డులుగా ఎంపిక చేయాలి. దీన్ని మనం చేద్దామా? స్వరం ఎందుకు తగ్గింది?.. సరే!
మూడో పని - కాశీ క్షేత్రానికి లక్షల మంది ప్రజలు వస్తుంటారు.. కాబట్టి.. గైడ్ల అవసరం చాలా ఉంది. తమకు ఎవరైనా ఇక్కడి విశేషాల గురించి వివరిస్తే బాగుంటుందని వారు ఎదురు చూస్తుంటారు. ఇక్కడికి వచ్చే యాత్రికుల హృదయం, మనస్సుల్లో కాశీ పూర్తిగా నిండిపోవాలి. దీనికి ఇక్కడి విశేషాల గురించి అద్భుతంగా వివరించే గైడ్ల అవసరం ఉంది. అందుకే ఉత్తమ గైడ్ల కోసం పోటీ అవసరమని చెబుతున్నాను. ఈ పోటీల్లో అందరూ పాల్గొనవచ్చు. ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి బహుమతి, సర్టిఫికెట్లు దక్కుతాయి. గైడ్గా పనిచేయడం భవిష్యత్తులో ఓ జీవనోపాధిగా మారొచ్చు, కొత్త రంగం అభివృద్ధి చెందుతుంది. మీరు అలా చేస్తారా? మీరు దీనిని తిరస్కరించడం లేదు. స్నేహితులారా, మీరు ఈ పరీక్షలో పాల్గొనాలని భావించడం లేదా? అయితే, మన ఎంపీ (పార్లమెంట్ సభ్యుడు) పిల్లల చదువుపై దృష్టి సారించకుండా.. వాళ్లకి వేరే పనులు అప్పచెబుతున్నారని మీ ఉపాధ్యాయులు అంటారు. మనలోనే ఎంత నైపుణ్యాభివృద్ధి జరుగుతుందో మీరే చూడండి. అది జరగాలి. ప్రతిభ వృద్ధి చెెందడానికి అవసరమైన ప్రతి అవకాశం ఇవ్వాలి. భగవంతుడు అందరికీ అన్ని రకాల సామర్థ్యాలు ఇచ్చాడు. కొందరు వాటిని పెంపొందించుకుంటారు. మరికొందరు వాటిని తమలోనే దాచేసుకుంటారు.
కాశీ సుందరీకరణ చెందుతోంది. వంతెనలు, రోడ్లు, భవనాలు నిర్మాణమవుతున్నాయి. చేయిీచేయీ కలిపి లక్ష్యాన్ని సాధించేలా ప్రతి వ్యక్తిని, ప్రతి మెదడును సేవకుడిగా, స్నేహితుడిగా నేను తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్కరూ తమ మనసును శుద్ధి చేసుకోవాలి. సేవకుడిగా పనిచేయాలి. గెలుపొందిన వారికి హృదయపూర్వక అభినందనలు. మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆలస్యమవుతోంది. కానీ ఇక్కడ, ఈ కార్యక్రమంలో మరి కాసేపు మీతో సమయం గడపాలనిపిస్తోంది. చాలా మంది నాతో ఫొటోలు తీసుకోవాలని ప్రయత్నించడం నేను చూశాను. నాకూ ఓ కోరిక ఉంది.. అది మీతో కలసి ఫొటో తీసుకోవడం. మీరు నాకు సాయం చేస్తారా? నేను చెప్పింది మీరు చేయాలి సరేనా? నేను ఇక్కడి నుంచి వెళ్లే వరకు మీరెవరూ నిల్చోకూడదు. నేను కిందకు వచ్చి ప్రతి బ్లాకులోనూ నిలబడతాను. కెమెరాలు ఉన్నవారు వేదికపైకి రండి. ఈ ఫోటోలను నా వెంట తీసుకెళ్తాను, మరి, మీకు? దీనికో పరిష్కారం నేను చెబుతాను. మీ మొబైల్ ఫోన్లో నమో యాప్కి వెళ్లండి. నమో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫొటో విభాగం ఉంటుంది. ఒక సెల్ఫీ తీసుకొని అందులో అప్లోడ్ చేయండి, బటన్ ప్రెస్ చేయండి.. మీరెక్కడ ఉన్నా.. నాతో మీరు దిగిన ఈ ఫోటోలన్నీ ఏఐ ద్వారా మీకు అందుతాయి. మన కాశీలో సంస్కృతమే కాదు.. సైన్సు కూడా ఉంది. మీరందరూ నాకు సాయం చేస్తారు కదా. మీరందరూ కూర్చోండి. ఎవ్వరూ నిల్చోకూడదు. మీరు కూర్చొని తల పైకెత్తండి.. అందరి ఫొటో వస్తుంది. నా కెమెరా నవ్వుతున్న వారి ఫొటోలను మాత్రమే తీస్తుంది.
హర హర మహాదేవ్!
ఇప్పడు నేను కిందకు వస్తున్నాను. ఇక్కడ ఉన్న వారు ఇక్కడే కూర్చుంటారు. మీరు అక్కడ కూర్చోండి. కెమెరాలు ఉన్నవారు స్టేజి మీదకు రండి.
సూచన: ఇది ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(Release ID: 2169366)
Visitor Counter : 8
Read this release in:
Punjabi
,
English
,
Kannada
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam