నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
భారతదేశ హరిత ఇంధన పరివర్తనను వేగవంతం చేసేందుకు పునరుత్పాదక విద్యుత్కు సంబంధించిన పరికరాలపై 5 శాతానికి తగ్గిన జీఎస్టీ
పీఎం సూర్య ఘర్- ముఫ్ట్ బిజిలీ యోజన కింద ఇంటి పైకప్పులపై ఏర్పాటు చేసుకునే
3 కిలోవాట్ల సౌర విద్యుత్ సదుపాయంపై రూ. 9,000 నుంచి రూ. 10,500 వరకు తగ్గనున్న వ్యయం
జీఎస్టీ తగ్గటంతో పీఎం కుసుమ్ కింద 10 లక్షల సౌర విద్యుత్ పంపులపై రైతులకు రూ.1,750 కోట్లు ఆదా
కట్ మాడ్యూల్, కాంపోనెంట్ ఖర్చులు 3 నుంచి 4 శాతం తగ్గటంతో
ప్రయోజనం పొందనున్న పునరుత్పాదక విద్యుత్ పరికరాల ఉత్పత్తి రంగం
పునరుత్పాదక విద్యుత్ రంగంలో రానున్న దశాబ్దంలో
5 నుంచి 7 లక్షల కొత్త హరిత ఉద్యోగాల సృష్టించనున్న జీఎస్టీ సంస్కరణలు
Posted On:
17 SEP 2025 12:14PM by PIB Hyderabad
త్వరలో అమల్లోకి రాబోతున్న జీఎస్టీ సంస్కరణలు పునరుత్పాదక ఇంధన రంగాన్ని భారీగా ప్రోత్సహించనున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని బలోపేతం చేసే విధంగా జీఎస్టీని ‘వాస్తవంగా మంచి, సరళమైన పన్ను’గా మార్చాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2025 సెప్టెంబర్ 3న జరిగిన 56వ సమావేశంలో జీఎస్టీ మండలి పలు సంస్కరణలను ఆమోదించింది.
పునరుత్పాదక శక్తి వాణిజ్య కార్యకలాపాలన్నింటికీ జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించటం వల్ల హరిత ఇంధన ప్రాజెక్టుల విషయంలో వ్యయం తగ్గనుంది. ఇది విద్యుత్తును మరింత అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చి.. గృహాలు, రైతులు, పరిశ్రమలు, ప్రాజెక్టులు చేపట్టే సంస్థలకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. గ్రిడ్లకు విద్యుత్ సరఫరా చేసే ప్రాజెక్టులను ఉదాహరణగా తీసుకుంటే.. వాటి మూలధన వ్యయం సాధారణంగా మెగావాట్కు రూ. 3.5 నుంచి 4 కోట్ల వరకు ఉంటుంది. జీఎస్టీ తగ్గటం వల్ల ఇప్పుడు ఒక్క మెగావాట్కు రూ. 20 నుంచి 25 లక్షల ఆదా అవుతుంది. 500 మెగావాట్ల స్థాయి సౌర విద్యుత్ కేంద్రం అయితే ఈ ఆదా రూ. 100 కోట్లకు వరకు ఉంటుంది. ఇది విద్యుత్ ఛార్జీల విషయంలో పోటీతత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
ఖర్చులు తగ్గి పెరగనున్న పోటీతత్వం
జీఎస్టీని తగ్గించటం వల్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. మొత్తం వ్యయాన్ని బట్టి యూనిట్ విద్యుత్తు ధర ఆధారపడి ఉంటుంది. తద్వారా విద్యుత్ సేకరణ విషయంలో పంపిణీ సంస్థలకు (డిస్కంలు) అయ్యే ఖర్చు తగ్గుతుందన్న అంచనా ఉంది. దీని వలన విద్యుత్ సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా వార్షికంగా రూ. 2,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకు ఆదా అవుతుంది. తక్కువ ధరల్లో స్వచ్ఛమైన విద్యుత్తును పొందడం ద్వారా తుది వినియోగదారులకు మేలు జరుగుతుంది. మొత్తంగా ఇది భారతదేశ విద్యుత్ రంగంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
గృహాలు, రైతులు, గ్రామీణ వర్గాలకు ప్రయోజనాలు
ఈ సంస్కరణ గృహాలకు సంబంధించిన పైకప్పు సౌర విద్యుత్ సౌకర్యాలను మరింత అందుబాటు ధరల్లోకి తీసుకురానుంది. సాధారణ 3 కిలోవాట్ సౌర విద్యుత్ వ్యవస్థపై ఇప్పుడు సుమారు రూ. 9,000 నుంచి రూ. 10,500 వ్యయం తగ్గుతుంది. ఇది సౌర విద్యుత్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవటంలో లక్షలాది కుటుంబాలకు సహాయపడనుంది. పీఎం సూర్య ఘర్- ముఫ్ట్ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్ స్థాపనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుంది.
పీఎం-కుసుమ్ పథకం ప్రకారం రైతులు కూడా జీఎస్టీ సంస్కరణల నుంచి గణనీయంగా ప్రయోజనం పొందుతారు. సుమారు రూ. 2.5 లక్షలు ఖరీదు చేసే 5 హెచ్పీ సౌర విద్యుత్ పంపు ఇప్పుడు దాదాపు రూ. 17,500 తక్కువ ధరకే లభిస్తుంది. 10 లక్షల సౌర విద్యుత్ పంపులను పరిగణనలోకి తీసుకుంటే రైతులు సమష్టిగా రూ. 1,750 కోట్లు ఆదా చేస్తారు. మొత్తంగా నీటిపారుదల మరింత అందుబాటు ధరల్లోకి వచ్చి సుస్థిరమైనదిగా మారనుంది.
మినీ-గ్రిడ్లు, జీవనోపాధి పొందే పనులు, సౌర విద్యుత్ ఆధారిత నీటి పంపులు వంటి వికేంద్రికృత కార్యకలాపాల ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాలు ప్రయోజనం పొందుతాయి. మునుపటితో పోల్చితే తక్కువ సమయంలోనే ఆదాయం రావటం, మెరుగైన రాబడి వల్ల పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, చిన్న వ్యాపారాలకు నమ్మదగిన హరిత ఇంధనం మరింత అందుబాటులో ఉండనుంది.
దేశీయ తయారీ, స్వావలంబనకు ప్రోత్సాహం
జీఎస్టీ తగ్గింపు వల్ల సౌర విద్యుత్ ఫలకాలతో పాటు విడి భాగాలపై ఖర్చులు 3 నుంచి 4 శాతం తగ్గుతాయి. ఇది భారతదేశంలో తయారైన పునరుత్పాదక ఇంధన పరికరాల పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుంది. దీనితో పాటు భారత్లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు మద్దతునిస్తుంది. 2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతున్నందున.. ఈ జీఎస్టీ సంస్కరణ దేశీయ తయారీలో కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ప్రతి గిగావాట్ సౌర విద్యుత్ తయారీ అనేది సుమారు 5,000 ఉద్యోగాలను సృష్టిస్తుందన్న అంచనాను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ సంస్కరణ రాబోయే దశాబ్దంలో 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలకు మద్దతునిస్తుంది. ఇది దేశంలో హరిత ఇంధనానికి సంబంధించిన వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
భారతదేశ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడం
జీఎస్టీ తగ్గింపు వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గటంతో పాటు పెట్టుబడిదారుల విశ్వాసం కూడా మెరుగుపడుతుంది. మరింత వేగంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు, ప్రాజెక్టును త్వరగా ప్రారంభించటానికి వీలు కల్పిస్తుంది. 2030 నాటికి దాదాపు 300 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనోత్పత్తి సామర్థ్యాన్ని అదనంగా సాధించాలని భారత్ భావిస్తున్నందున.. వ్యయం స్వల్పంగా 2 నుంచి 3 శాతం తగ్గినా, రూ. 1–1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ప్రతి గిగివాట్ సౌరశక్తి ఏటా 1.3 మిలియన్ టన్నుల కార్బన్ డై యాక్సైడ్ విడుదలను తగ్గిస్తుంది. జీఎస్టీ తగ్గింపు వల్ల సౌరశక్తి ఉద్పాదక సామర్థ్యం వేగంగా పెరగుతుంది. తద్వారా 2030 నాటికి సంవత్సరానికి అదనంగా 50 మిలియన్ టన్నుల నుంచి 70 మిలియన్ టన్నుల కార్బన్ డై యాక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చు.
ఈ జీఎస్టీ సంస్కరణ పునరుత్పాదక విద్యుత్ను మరింత తక్కువ ధరల్లోకి, అందుబాటులోకి తీసుకొస్తుంది. దీన్నిబట్టి చూస్తే.. ఈ సంస్కరణ పారిస్ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉంది. దీనితో పాటు 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యం సాధించాలన్న భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోన్న పోరాటంలో భారత్ను నాయకత్వ స్థాయిలో నిలబెడుతుంది.
కొత్త జీఎస్చీ రేట్లు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కీలక సంస్కరణ లక్షలాది మంది వినియోగదారులు, రైతులు, సంస్థలు, తయారీదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చుతుంది. దీనితో పాటుగా హరిత ఇంధన వృద్ధి, ఇంధన స్వాతంత్ర్యం అనే జంట లక్ష్యాలకు దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దిశగా కొనసాగుతోన్న ప్రయాణానికి స్వచ్ఛమైన, అందుబాటు ధరల్లో సుస్థిర విద్యుత్ పునాదిగా ఉండేలా చూసుకోవాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఇది తెలియజేస్తోంది.
***
(Release ID: 2167785)
Visitor Counter : 2