ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఎనిమిదో పోషణ మాసోత్సవానికీ, ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్’కూ ఈ నెల 17న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
మహిళలు, బాలల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా భారత్లో అత్యంత భారీ స్థాయి ప్రచార ఉద్యమానికి
కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖల సంయుక్త సారథ్యం
దేశం నలుమూలలా ఒక లక్ష కన్నా ఎక్కువ ఆరోగ్య శిబిరాల నిర్వహణ ప్రణాళిక...
అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోజువారీ ఆరోగ్య శిబిరాలు
మహిళల ఆరోగ్య సేవలకు ఢోకా లేకుండా చూడడానికి దేశమంతటా సమగ్ర ప్రచార ఉద్యమం..
రోగాల ముందస్తు గుర్తింపు, నివారణ ప్రధాన చర్యలు, ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ
సాధారణ వ్యాధులు, క్యాన్సర్, రక్తహీనత, క్షయ, సికిల్ సెల్ వ్యాధులతో పాటు
తల్లుల ఆరోగ్య పరిక్షల నిర్వహణకు ఏర్పాట్లు..
అవగాహనను పెంచేందుకు సమావేశాలు, సూచనలు, సదస్సులు
స్థాయి, అందుబాటు, ప్రజాసమీకరణే లక్ష్యంగా అనేక మంత్రిత్వ శాఖల సహకారంతో
ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య సమన్వయ సాధన
Posted On:
14 SEP 2025 4:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 17న ఎనిమిదో పోషణ మాసోత్సవాలతో పాటు ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్’ను ప్రారంభించనున్నారు. ఇది దేశవ్యాప్తంగా మహిళలు, కౌమారదశకు త్వరలో చేరుకొనే బాలికలతో పాటు పిల్లలకు కూడా ఆరోగ్య సంరక్షణ సేవలను, పోషణ సేవలను పటిష్ఠపరిచే దిశగా ఒక చరిత్రాత్మక ఘట్టానికి నాందీ ప్రస్తావన కాబోతోంది.
ఈ కార్యక్రమానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు మహిళా, శిశు అభివృద్ధి శాఖ కూడా సంయుక్త నాయకత్వాన్ని అందిస్తాయి. ఈ సంయుక్త సారథ్యం మహిళలు, బాలల ఆరోగ్యం, పోషణ విషయాలపై ఈ రెండు శాఖల ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతుంది. దేశం నలు మూలల ఆరోగ్య శిబిరాలతో పాటు ఆరోగ్య కేంద్రాల బాధ్యతను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాను తీసుకొని, రోగ నివారణ, ప్రోత్సాహకర, రోగాన్ని నయం చేయడం ప్రధానం అనే దృష్టితో అవసరమైన సేవలను సమకూర్చడానికి వెన్నుదన్నుగా నిలవనుంది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ తన వంతుగా పోషణ మాసోత్సవం సందర్భంగా అమలు పరిచే కార్యకలాపాలను ప్రచార ఉద్యమంతో ఏకీకృతం చేస్తుంది. మహిళలను, బాలికలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున పోషణ సంబంధిత సలహాలు, సూచనలను ఇవ్వడంతో పాటు కొన్ని జాగ్రత్తలను చెప్పే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. రక్తహీనతను అరికట్టడం, సంతులిత ఆహారాన్ని తీసుకోవాలని తెలియజేయడం, నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత వంటి అంశాలపై చైతన్యాన్ని పెంచే కార్యక్రమాలను ఈ రెండు మంత్రిత్వ శాఖలు కలిసికట్టుగా నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమాలతో మహిళలకు, పూర్వ కౌమార దశలో ఉన్న బాలికలకు తమ శారీరక స్వస్థత, పోషణ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం అవుతుంది.
ఆరోగ్యం, పోషణ, శరీర దారుఢ్యంతో పాటు ‘వికసిత్ భారత్’లక్ష్యాన్ని 2047 కల్లా సాధించాలన్న గౌరవ ప్రధానమంత్రి దృష్టికోణాన్ని ముందుకు తీసుకుపోవడమే ‘స్వస్థ్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ ఉద్దేశం. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ముమ్మర ప్రచార ఉద్యమంతో సమాజంలో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యాన్నిస్తూ రోగ నివారణ, రోగాన్ని నయం చేయడం ప్రధానమన్న దృష్టితో అవసరమైన ఆరోగ్య సేవలను అందజేస్తారు. సాధారణ వ్యాధులు, రక్తహీనత, క్షయలతో పాటు సికిల్ సెల్ వ్యాధి పరీక్షలను నిర్వహించడాన్ని, రోగాలను ముదరడానికన్నా ముందుగానే గుర్తించడం, చికిత్సలకు సంబంధించిన సేవలను ఈ ప్రచార ఉద్యమం పటిష్ఠపరుస్తుంది. అలాగే ప్రసవానికి పూర్వం గర్భవతుల సంరక్షణ, టీకాలు, పోషణ, అలాగే మహిళలు నెలసరి సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, జీవనశైలి, మానసిక స్వస్థత సంబంధిత అవగాహన కార్యకలాపాలు.. ఈ మార్గాల్లో తల్లుల, పిల్లల, కౌమార దశలో ఉన్న బాలికల స్వస్థత సంరక్షణకు కూడా పెద్దపీట వేస్తుంది. వీటికి తోడు, ఈ ప్రచార ఉద్యమం ఊబకాయం రాకుండా అడ్డుకోవడం, చక్కని పోషణలతో పాటు స్వచ్ఛంద రక్త దానం.. వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకొనేలా స్ఫూర్తిని నింపుతుంది.

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ జె.పి. నడ్డా సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో ఒక సందేశాన్ని రాశారు. అందులో ఆయన ‘దేశమంతటా మహిళలకు, బాలలకు ఆరోగ్యసంరక్షణ సేవలను బలపరచడంతో పాటు వారికి మరింత మెరుగైన సేవలను, నాణ్యమైన పోషణను అందించడమూ, వారిని చైతన్యపరచడమూ ఈ కార్యక్రమం ఉద్దేశాలు’ అని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించ తలపెట్టిన ఈ ప్రచార ఉద్యమంలో తప్పక పాలుపంచుకోవాల్సిందిగా ప్రయివేటు రంగంలోని అన్ని ఆసుపత్రులతో పాటు ఆరోగ్యసంరక్షణ రంగంలోని ఆసక్తిదారులందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా ప్రారంభోత్సవం, ఆరోగ్య శిబిరాలు
ఈ ప్రచార కార్యక్రమాన్ని దేశంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్సీలు), జిల్లా ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలన్నిటా ఈ నెల 17న మొదలుపెట్టి, వచ్చే నెల (అక్టోబరు) 2వ తేదీ వరకు నిర్వహిస్తారు.
ఒక లక్ష కన్నా ఎక్కువ సంఖ్యలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తారు. దేశంలోని మహిళలు, బాలలకు ఆరోగ్య సేవల సంబంధిత ప్రచార ఉద్యమాన్ని ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించడం ఇదే మొదటిసారి.
దేశమంతటా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలన్నిటిలోను రోజువారీ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు.
ఈ ప్రచార ఉద్యమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఆశాలు, ఏఎన్ఎంలు, ఆంగన్వాడీ కార్యకర్తలు, స్వయంసహాయ బృందాలు, పంచాయతీ రాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, మై భారత్ స్వయంసేవకులు, యువజన బృందాలు క్షేత్ర స్థాయిలో ప్రజా సమీకరణ నేతృత్వం వహిస్తారు.
ప్రధాన ఆరోగ్య సేవలు
మహిళా రోగుల వైద్యం, శిశు రోగుల వైద్యం, కన్ను, ఈఎన్టీ, దంత, చర్మ రోగాలు, మనోరోగుల చికిత్స సహా నిపుణుల సేవలను వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రయివేటు ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువస్తారు.
ఈ ప్రయత్నాలకు తోడు, ఎయిమ్స్, రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల ఆధీనంలోని ఆసుపత్రులు, ఈఎస్ఐసీ ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ కేంద్రాలతో పాటు జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థలు కూడా తమ వంతుగా కృషి చేస్తూ నిపుణుల సేవలను సమకూరుస్తాయి. మొత్తంమీద చివరి వ్యక్తికి కూడా నిరంతరాయంగా ఆరోగ్య సంరక్షణ లభించేటట్లు చూస్తారు. ఈ కార్యక్రమానికి సాయం చేస్తామంటూ అనేక ప్రయివేటు రంగంలోని ఆరోగ్య కేంద్రాలు ముందుకు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమ స్థాయి, నాణ్యం, లభ్యత విస్తరించగలదని భావిస్తున్నారు.
పదిహేను రోజుల పాటు కొనసాగించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కింద ప్రస్తావించిన సేవలను అందిస్తారు:
సాధారణ వ్యాధులు, వెల్నెస్ సంబంధిత సేవలు: బీపీ, రక్తంలో చక్కెర పాళ్లు, బీఎంఐ పరీక్షల సదుపాయాన్ని శిబిరాల్లో అందుబాటులోకి తీసుకువస్తారు. అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు ఊబకాయం బారిన పడిందీ లేనిదీ నిర్ధారణ చేస్తారు. రిస్కు అంచనాలు, సలహాలతో పాటు జీవనశైలిలో ఏమేం మార్పులు చేసుకొంటే మంచిదో తెలపడం, పోషణ, వ్యాయామ సలహాలు, ధూమపానంపై చైతన్యం తెస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల జాడలను ముందుగానే పసిగట్టడంతో పాటు రోగాలు మరీ ముదిరిపోకుండా చూసుకోవడంలో కూడా బాధితులకు తోడ్పాటును అందిస్తారు.
క్యాన్సర్ పరిక్షలు: నోటి పరీక్షలు, స్వీయ స్తన పరీక్ష, గర్భాశయ ద్వారానికి సంబంధించిన కేన్సర్ పరిక్షల వంటివి మహిళలకు ప్రయోజనం చేకూరుస్తాయి. మౌఖిక క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ల విషయంలో చైతన్యాన్ని పెంచే సదస్సులతో పాటు మామోగ్రఫీ, అంకాలజీ సంరక్షణకు స్పెషాలిటీ సేవలను కూడా అందుబాటులో ఉంచుతారు.
రక్తహీనత, పోషణ: మహిళలకు, కౌమార దశలోని బాలికలకు పెద్ద ఎత్తున హెచ్బీ పరీక్షలతో పాటు రక్తహీనత పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఐఎఫ్ఏ సప్లిమెంట్లు, క్రిమినాశక మాత్రలను అందజేస్తారు. పోషణ విషయాలపై కౌన్సెలింగు, సంతులిత ఆహారాన్ని తీసుకోవడం ఎలా?, ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసుకోవడం ఎలా?, అన్నప్రాశన కార్యక్రమాల నిర్వహణ తీరు వంటివి పోషణ పరమైన చైతన్యాన్ని పెంచుతాయి. నెలసరి వేళ తీసుకోవాల్సిన జాగ్రతలను అందించడం ద్వారా అమ్మాయిల్లో అవగాహనను పెంచుతారు. వీటికి అదనంగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆధ్వర్యంలో సరి అయిన ఆహారాన్నే తీసుకోండి (‘ఈట్ రైట్’) అనే కార్యక్రమంలో భాగంగా సురక్షిత, ఆరోగ్యప్రద, సమతుల్య ఆహార పద్ధతులను పాటించడాన్ని ప్రజలకు తెలియజేస్తారు.
క్షయ: బలహీన మహిళలకు టీబీ పరిక్ష, ఉమ్మి సేకరణ, సంచార ఎక్స్-రే యూనిట్లతో త్వరిత గతిన రోగనిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తెస్తారు. రోగులకు చికిత్సను అందించడానికి డాట్స్ కేంద్రాలతో వారిని కలుపుతారు. పోషణ, మనోసామాజిక సహాయాన్ని అందించడానికి స్వయంసేవకులను ‘నిక్షయ్ మిత్ర’లుగా రంగంలోకి దించుతారు.
సికిల్ సెల్ వ్యాధి: ఫలానా వర్గం వారికి సికిల్ సెల్ పరిక్ష, సికిల్ సెల్ కార్డుల పంపిణీ, కౌన్సెలింగ్ సేవల ద్వారా గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆనువంశిక కౌన్సెలింగు, రెఫరల్ మార్గాల్లో దీర్ఘకాలిక సంరక్షణ, వ్యాధి నిర్వహణ సేవలను అందిస్తారు.
మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ: హీమోగ్లోబిన్ పరీక్ష, రక్తపోటు (బీపీ) పర్యవేక్షణ, బరువు పరీక్ష, గర్భంలో పిండం వృద్ధి చెందుతున్న తీరును గమనిస్తుండడం సహా గర్భవతులకు కాన్పు కన్నా ముందు సమగ్ర సంరక్షణ సేవలను అందిస్తారు. మాతా శిశు సురక్ష (ఎంసీపీ) కార్డుల పంపిణీ, సురక్షిత గర్భావస్థ, సంస్థాగత ప్రసవం అంశాలపై కౌన్సెలింగు, చిన్నారుల ఎదుగుదల తీరును పర్యవేక్షించడం, శిశువులకు, చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని అందజేయాలి?, ఏయే టీకామందులు ఇప్పించాలి? వంటి అంశాల్లో అందజేసే సేవలు తల్లీబిడ్డల ఆరోగ్య ఫలితాలను మరింత మెరుగుపరుస్తాయి.
టీకాలు: బాలలతో పాటు కౌమార దశలోని బాలికలకు క్యాచ్-అప్ టీకామందును ఇప్పించడం సహా గర్భవతులకు టీడీ టీకామందును కూడా ఇప్పించడానికి ప్రాధాన్యాన్నిస్తారు.
చైతన్యాన్ని పెంచడంతో పాటు కౌన్సెలింగు ఇవ్వడం: నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత చర్యలను ప్రచారంలోకి తీసుకురావడానికీ, శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడానికీ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సెలింగ్ సదస్సులను ఏర్పాటు చేస్తారు. నూనె, చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలనీ, ఆరోగ్యాన్ని పెంచే ఆహారపదార్థాల వైపు మొగ్గు చూపాలంటూ స్వయంసహాయ బృందాలు, పంచాయతీ రాజ్ సంస్థల నాయకత్వంలో నిర్వహించే ప్రచార ఉద్యమాల్లో ప్రజలను ప్రోత్సహిస్తారు.
రక్తదానం: గాయపడ్డవారికి అందించాల్సిన సేవలు, శస్త్రచికిత్సలు, రక్త సంబంధిత అనారోగ్య చికిత్సను పటిష్ఠపరచడానికి దేశవ్యాప్తంగా రక్త దాన ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రక్తాన్ని దానమిచ్చేందుకు ముందుకు వచ్చే వారి పేర్లను ఎలక్ట్రానిక్ మాధ్యమంలోని ఈ-రక్తకోశ్ పోర్టల్ (https://eraktkosh.mohfw.gov.in) లో నమోదు చేసి, రక్త దాన సంబంధిత ప్రతిజ్ఞా కార్యక్రమాలను మైగవ్ (www.mygov.in) మాధ్యమం ద్వారా నిర్వహిస్తారు.
డిజిటల్ మాధ్యమం ద్వారా ఆరోగ్య సేవలు: లబ్ధిదారులను పీఎం-జేఏవై, ఆయుష్మాన్ వయ వందనతో పాటు ఏబీహెచ్ఏ పథకాల్లో చేర్చుకొంటారు. కార్డును సరిచూడడానికీ, ఫిర్యాదులను పరిష్కరించడానికీ ఆరోగ్య శిబిరాల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేస్తారు.
ఆయుష్ సేవలు: మహిళల్లోను, కుటుంబాల్లోను సమగ్ర ఆరోగ్య సేవలతో పాటు వెల్నెస్ సంబంధిత సేవలను ప్రోత్సహించడానికి యోగ, ఆయుర్వేద సూచనలు, సలహాలు సహా ఇతరత్రా ఆయుష్ సేవలను అందిస్తారు.
యువతను, పౌరులను సమీకరించడం: ప్రజల భాగస్వామ్యంతో ముందుకు పోయే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రచార ఉద్యమంలో మన దేశ యువతనీ, ప్రజలను కలుపుకొని వెళ్లేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకొంటారు. చైతన్యాన్ని పెంచేందుకు చేపట్టే ప్రచార కార్యక్రమాల్లోను, ఆరోగ్య పరిరక్షణ ప్రతిజ్ఞను స్వీకరించే కార్యక్రమాల్లోను, సాంస్కృతిక కార్యక్రమాల్లోను, ప్రజాసమీకరణ కార్యక్రమాల్లోను మైభారత్ స్వయంసేవకులు చురుకుగా పాల్గొంటారు. స్వచ్ఛంద రక్తదానంతో పాటు అవయవ దానం కోసం ప్రతిజ్ఞ చేయాల్సిందిగా పౌరులను మైగవ్ పోర్టల్ (www.mygov.in) ద్వారా ప్రోత్సహిస్తారు. క్షయ రోగులకు పోషణ, సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారి సంరక్షణ బాధ్యతలు తీసుకొనేందుకు ‘నిక్షయ్ మిత్ర’లుగా మారడానికి ఉద్దేశించిన ప్రత్యేక వేదిక ( www.mygov.in ) లో పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తారు. ఈ సమగ్ర సమాజ దృష్టికోణం ప్రచార ఉద్యమం వీలైనంత ఎక్కువ ప్రాంతాలకు చేరుకొని, ఆశిస్తున్న ప్రభావాన్ని కలగజేయడంలో తోడ్పడుతుందని భావిస్తున్నారు.
ఏకోన్ముఖ ప్రభుత్వ సేవలు
ఈ ప్రచార ఉద్యమానికి మహిళలు, బాలల అభివృద్ధి శాఖతో పాటు అనేక ఇతర మంత్రిత్వ శాఖలు కూడా అండదండగా నిలవనున్నాయి. స్వయంసహాయ బృందాలు, పంచాయతీ రాజ్ సంస్థల మాధ్యమం ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖలు మహిళలను సమీకరిస్తాయి. పాఠశాలలు, ఉన్నత విద్యబోధన సంస్థలతో సమన్వయాన్ని విద్య మంత్రిత్వ శాఖ ఏర్పరుస్తుంది. మైభారత్ కార్యకర్తలతో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ చేయి కలిపి ఆరోగ్యాన్ని కాపాడుకొనే విషయంలో చైతన్యాన్ని, అందుబాటునూ పెంచడంలో సాయపడుతుంది. దివ్యాంగజనులకు సంబంధించిన సహాయ కార్యకలాపాల విషయంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ (డీఈపీడబ్ల్యూడీ) మద్దతిస్తుంది. రక్షణ శాఖ, రైల్వేల మంత్రిత్వ శాఖ, కార్మిక, ఉపాధికల్పన శాఖ, ఆయుష్ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు తమ తమ ఆధీనంలోని వైద్య సంస్థల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తాయి.
***
(Release ID: 2167051)
Visitor Counter : 2