రాష్ట్రపతి సచివాలయం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
04 SEP 2025 6:08PM by PIB Hyderabad
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.
భారత రాష్ట్రపతి ఓ సందేశంలో ఇలా పేర్కొన్నారు.. ‘ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు గొప్ప విద్యావేత్త, తత్వవేత్త అయిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన యావత్ దేశానికి గొప్ప స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా ఆయనకు నేను ఘన నివాళులు అర్పిస్తున్నాను.
ఉపాధ్యాయులు మన సమాజానికి మార్గదర్శకులు, దేశ భవిష్యత్తుకు శిల్పులు. వారి జ్ఞానం, నైపుణ్యం, విలువల ద్వారా తరతరాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఉత్తమత, గొప్ప ఆవిష్కరణలను సాధించేందుకు స్ఫూర్తినిస్తారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు సాగుతున్న సమయంలో బాధ్యతాయుతమైన, జ్ఞానవంతమైన, నైపుణ్యం కలిగిన పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరింత ముఖ్యమైనది. 2020లో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయులకు సాధికారత కల్పించడానికి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంపొందించడం, విద్యార్థుల్లో సృజనాత్మకత, కరుణ, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు మనం కృషి చేద్దాం.
మరోసారి ఉపాధ్యాయ సమాజానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలిగే విద్యార్థులను తీర్చిదిద్దే మీ ప్రయత్నాలలో మీ విజయాన్ని కోరుకుంటున్నాను.
(Release ID: 2164305)
Visitor Counter : 2