హోం మంత్రిత్వ శాఖ
జమ్మూలో వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించి, ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించిన కేంద్ర హోంశాఖ, సహకార మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ అమిత్ షా
జమ్మూలోని చక్ మంగూ గ్రామంలో వరద బాధితులను కలుసుకుని, తావీ వంతెన, శివ మందిరం, వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన కేంద్రమంత్రి
కేంద్రమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం, తాజా పరిస్థితిపై సమీక్ష
ఇటీవల జరిగిన ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రీ అమిత్ షా సంతాపం
జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి తక్షణ సాయాన్ని,
ఆర్థిక సహాయాన్ని, సాంకేతిక మద్దతును అందించి, ప్రజల భద్రత, పునరావాసం, పునర్నిర్మాణానికి కృషి చేస్తోంది: శ్రీ అమిత్ షా
డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు ఆధారంగా మేఘ విస్ఫోటనాలకు గల కారణాలను గుర్తించేందుకు వాతావరణ శాఖ, ఎన్ఎమ్డీఏలు అధ్యయనం చేయాలని సూచన.
నష్టాన్ని అంచనా వేసి, అవసరమైన సహాయాన్ని అందించనున్న
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్వే బృందాలు
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, అన్ని సంస్థల సమన్వయం, కృషితో జరగబోయే భారీ నష్టాన్ని నివారించగలిగాం. అనేకమంది ప్రాణాలను రక్షించగలిగాం. అయితే వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది: కేంద్ర హోం మంత్రి
గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై విమర్శన
Posted On:
01 SEP 2025 5:28PM by PIB Hyderabad
జమ్మూలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పరిశీలించారు. ప్రకృతి విపత్తు కారణంగా జరిగిన నష్టాన్ని ఆయన సమీక్షించారు. జమ్మూ జిల్లా మంగు చక్ గ్రామంలో వరద ప్రభావితులైన ప్రజలను కేంద్రమంత్రి కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిక్రమ్ చౌక్ వద్దనున్న తావి బ్రిడ్జ్, శివాలయం, వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.
జమ్మూలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, కేంద్రం, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇటీవల ఘటనల్లో జరిగిన ప్రాణనష్టంపై కేంద్ర హోం మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితో మాట్లాడారనీ, ఈ క్లిష్ట సమయంలో సహాయం అందించేందుకు కేంద్రం అన్ని చర్యలూ చేపట్టిందని శ్రీ అమిత్ షా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం, అన్ని సంస్థలూ కలసి సమన్వయంతో పనిచేసి, జరగబోయే నష్టాన్ని గణనీయంగా తగ్గించామనీ, అనేక ప్రాణాలను రక్షించగలిగామనీ ఆయన పేర్కొన్నారు.
అన్ని ముందస్తు హెచ్చరిక యాప్లపై విశ్లేషణ చేయడం, వాటి ఖచ్చితత్వం, గ్రామీణ స్థాయిలో అవి ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకోవడం అవసరమని శ్రీ అమిత్ షా అన్నారు. కీలకమైన విశ్లేషణతో మన వ్యవస్థలను మెరుగుపరచడం వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చని ఆయన సూచించారు. జీఎల్ఓఎఫ్ (గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్) ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై కూడా సమగ్ర సమీక్ష అవసరమని పేర్కొన్నారు.

మేఘ విస్ఫోటనాలకు దారి తీసే ధోరణులు, మేఘాల్లో తేమ శాతం మధ్య సంబంధాన్ని విశ్లేషించేందుకు వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కారణాలను గుర్తించి ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సమాచార విశ్లేషణ, కృత్రిమ మేధను ఉయోగించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ దిశగాచర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన అదనపు రేషన్ను భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సమకూర్చాలని కూడా ఆయన సూచించారు. పరిస్థితిని 10 రోజుల్లోగా అంచనా వేసి, ఆ తర్వాత సాధారణ రేషన్ పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అధునాతన సర్వే బృందాలు నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహయాన్ని అందిస్తాయని శ్రీ అమిత్ షా తెలిపారు.. కేంద్ర హోం కార్యదర్శితో పాటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సంబంధిత విభాగాల సమావేశం 1, 2 రోజుల్లో జరుగుతుందని తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వం నుంచి వచ్చిన బృందాలు నష్టాన్ని అంచనా వేసేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి ఆదేశించారు. ఆరోగ్య, జలవనరుల శాఖలు నీటి సరఫరా, ఆరోగ్య సేవలపై ముందస్తుగా దృష్టి సారించాలన్నారు. సైన్యం, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, వైమానిక దళం నుంచి వైద్య విభాగాలు కూడా సాయాన్ని అందించాలని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ సాధారణంగానే ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రాంతం కావడంతో కేంద్ర వాటాగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి కోసం రూ. 209 కోట్ల మొత్తాన్ని ఈ ప్రాంతానికి కేటాయించామని, వీటి ద్వారానే సహాయ చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత విపత్తు నిర్వహణ సంస్థ సకాలంలో హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రాణనష్టం గణనీయంగా తగ్గిందని కేంద్ర హోం మంత్రి అన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, భద్రతా బలగాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విపత్తు ప్రతిస్పందన దళం ఇతర ప్రతిస్పందన బృందాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయని, హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ మోహరింపునకు సంబంధించి ముందుగానే అందరికి సమాచారం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రజల ఆస్తులు దెబ్బతిన్నాయని, నష్టపోయిన ఇళ్లకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి కింద చేయాల్సిన సహాయాన్ని అంచనా వేసి, వీలైనంత త్వరగా చెల్లిస్తామని శ్రీ అమిత్ షా వెల్లడించారు. అనేక రోడ్లు దెబ్బతినగా.. వాటి మరమ్మత్తు, పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. చాలా రహదారులపై వాహన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని, అవసరమైన చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో 80 శాతానికి పైగా విద్యుత్ సరఫరాని పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని, ఆరోగ్య సేవలు సజావుగా కొనసాగుతున్నాయన్నారు. అత్యంత కీలక విభాగాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నప్పటికీ, వాటి తాత్కాలిక పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. జరిగిన నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోందని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ క్లిష్ట సమయంలో స్పందించడంతోపాటు, అన్ని సంస్థలూ చేస్తున్న ప్రయత్నాలను కేంద్రమంత్రి ప్రశంసించారు. సహాయక చర్యలను జమ్మూ ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించిందని చెప్పారు. ముందు జాగ్రత్తగా 5000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 17 బృందాలు, 23 ఆర్మీ బృందాలు, భారత వైమానిక దళం, యూటీడీఆర్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు ఇప్పటికీ సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలకు సహాయం అందిస్తున్నాయని తెలిపారు. సహాయ శిబిరాల్లో జమ్మూ ప్రభుత్వం ఆరోగ్య సేవలు, ఆహార ఏర్పాట్లు చేసిందని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని కేంద్ర హోం మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా నిలుస్తుందని శ్రీ అమిత్ షా పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా నిలిచి వారి తక్షణ ఉపశమనం, ఆర్థిక సహాయం, సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. బాధిత ప్రజల భద్రత, సంక్షేమానికి భరోసా ఇవ్వడంతోపాటు పునరుద్ధరణ, పునర్నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
***
(Release ID: 2162925)
Visitor Counter : 2
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada