ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని అహ్మదాబాద్లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
Posted On:
25 AUG 2025 10:35PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ఎంతటి అద్భుత వాతావరణాన్ని ఈ రోజు మీరంతా సృష్టించారు!
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు, ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారు, కేంద్ర కేబినెట్లో సహచరుడు సి.ఆర్. పాటిల్ గారు, గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులు, అహ్మదాబాద్ మేయర్ ప్రతిభ గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, అహ్మదాబాద్ సోదరీ సోదరులారా!
ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారు. నేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని! నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!
మిత్రులారా,
ప్రస్తుతం గణేశోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అద్భుతమైన కోలాహలం నెలకొంది. గుజరాత్ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు గణపతి బప్పా ఆశీస్సులతో నేడు శుభప్రదంగా ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మీకు అంకితం చేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఈ అభివృద్ధి పనుల సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఈ వర్షాకాలంలో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకదాని వెనుక ఒకటిగా మేఘ విస్ఫోట ఘటనలను చూస్తున్నాం. అలాంటి విధ్వంసకర దృశ్యాలను టీవీలో చూసినప్పుడు మనం స్థిమితపడడం కూడా కష్టమవుతుంది. బాధిత కుటుంబాలన్నింటికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రకృతి ఉగ్రత మానవాళి మొత్తానికి, యావత్ప్రపంచానికి, మన దేశానికి సవాలుగా మారింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమైంది.
మిత్రులారా,
ఈ గుజరాత్ నేల ఇద్దరు మోహనులకు నిలయం. ఒకరు సుదర్శన చక్రధారి మోహనుడు, మన ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు. మరొకరు చరఖాధారి మోహనుడు... సబర్మతీ మహర్షి, పూజ్య బాపూజీ. వారిద్దరూ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ భారత్ నేడు మరింత బలంగా ఎదుగుతుతోంది. దేశాన్ని, సమాజాన్ని ఎలా రక్షించుకోవాలో సుదర్శన చక్రధారి మోహనుడు మనకు నేర్పాడు. పాతాళంలో ఉన్నా శత్రువును వేటాడి శిక్షించే సుదర్శన చక్రాన్ని న్యాయానికీ భద్రతకూ కవచంగా ఆయన నిలిపాడు. అదే స్ఫూర్తి నేడు భారత్ నిర్ణయాల్లో ప్రతిబింబిస్తోంది. భారత్తోపాటు ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తోంది. మన గుజరాత్, అహ్మదాబాద్ గతంలో ఎన్నో గడ్డు రోజులను ఎదుర్కొన్నాయి. పతంగుల పోటీల్లో అల్లరిమూకలు ప్రాణాలను బలిగొన్న సమయాలు, ప్రజలు కర్ఫ్యూలో బతకాల్సి వచ్చిన రోజులు, పండుగ పూట ఈ అహ్మదాబాద్ నేల రక్తంతో తడిసిన సందర్భాలు... ఇలా ఎన్నో ఘటనలను మనం చూశాం. ఈ దురాక్రమణదారులు మన రక్తాన్ని చిందించారు. కానీ, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ నేడు ఉగ్రవాదులు, ఉగ్రవాద సూత్రధారులు ఎక్కడ దాక్కున్నా మేం వదిలిపెట్టడం లేదు. పహల్గామ్ ఘటనకు భారత్ ఎలా బదులిచ్చిందో ప్రపంచమంతా చూసింది. కేవలం 22 నిమిషాల్లోనే అంతా తుడిచిపెట్టుకుపోయింది. లోపలికి చొచ్చుకెళ్లి బలంగా దెబ్బతీయడం, వందల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించడం ద్వారా.. ఉగ్రవాద నాడీ కేంద్రంపై మేం దాడిచేశాం. మన సాయుధ దళాల శౌర్యానికి, సుదర్శన చక్రధారి మోహనుడి భారత ‘ఇచ్ఛాశక్తి’కి ఆపరేషన్ సిందూర్ ప్రతీకగా నిలిచింది.
మిత్రులారా,
చరఖాధారి మోహనుడైన మన పూజ్య బాపూజీ ‘స్వదేశీ’ ద్వారా భారత శ్రేయస్సుకు బాటలు వేశారు. ఇక్కడే సబర్మతీ ఆశ్రమం ఉంది. బాపూజీ పేరుతో దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ ఆయన ఆశయాలను తుంగలో తొక్కిందనడానికి ఈ ఆశ్రమమే సాక్షి. బాపూజీ మంత్రప్రదంగా భావించిన ‘స్వదేశీ’తో వారు చేసిందేమిటి? కొన్నేళ్లుగా గాంధీ పేరుతో రాజకీయాలు నడుపుతున్నవారు. స్వచ్ఛత గురించిగానీ, స్వదేశీ గురించిగానీ ఒక్క మాటైనా మాట్లాడడాన్ని మీరుచూసి ఉండరు. వారి దూరదృష్టి ఏమయిందో దేశానికి అర్థం కావడం లేదు. అరవై నుంచి అరవై అయిదేళ్లపాటు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్... అధికారంలో ఉన్నప్పుడు దిగుమతుల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తూ కుంభకోణాలకు పాల్పడేందుకు వీలుగా, భారత్ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసింది. కానీ నేడు మన దేశం ‘ఆత్మనిర్భరత’ను ‘వికసిత భారత్’ నిర్మాణానికి పునాదిగా మలచుకుంది. మన రైతులు, మన మత్స్యకారులు, మన పశుపోషకులు, మన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బలంతో.. అభివృద్ధి పథంలో, స్వావలంబన మార్గంలో భారత్ వేగంగా పురోగమిస్తోంది. గుజరాత్లో ఎంతమంది పశుపోషకులున్నారో చూడండి.. పాడి పరిశ్రమ ఎంత బలంగా ఉందో చూడండి..! కొన్ని గంటల కిందటే ఫిజీ ప్రధానమంత్రిని నేను కలిశాను. తమ పాడి పరిశ్రమ రంగాన్ని, సహకార ఉద్యమాన్ని మనలాగే అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నట్టు ఎంతో గౌరవంతో, శ్రద్ధాసక్తులతో ఆయన చెప్పారు. మిత్రులారా, మన పాడి పరిశ్రమను బలోపేతం చేసింది మన పశుపోషకులే. అందులోనూ మన అక్కాచెల్లెళ్లు ఎనలేని కృషి చేశారు. మన అక్కాచెల్లెళ్లు అంకితభావంతో పాడి పరిశ్రమను బలంగా, స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దారు. నేడు దీన్ని ప్రపంచమంతా కీర్తిస్తోంది.
కానీ మిత్రులారా,
స్వీయ ఆర్థిక ప్రయోజనాలే కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు నడుస్తున్న తీరును మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఎజెండాను అమలు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఈ అహ్మదాబాద్ గడ్డ నుంచి- నా ఔత్సాహిక చిన్న వ్యాపారవేత్తలకు, దుకాణదారు సోదరీసోదరులకు, రైతు సోదరులకు, పశుపోషకులైన అన్నాతమ్ముళ్లూ అక్కాచెల్లెళ్లకూ నేను చెబుతున్నాను... గాంధీ నడయాడిన ఈ నేల నుంచి- చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులు, పశుపోషకులకు చెబుతున్నాను... మీలో ప్రతి ఒక్కరికీ పదే పదే నేను హామీ ఇస్తున్నాను: మోదీకి మీ ప్రయోజనాలే అత్యున్నతం. చిరు వ్యాపారులు, రైతులు, పశువుల పెంపకందారులకు హాని కలిగించే ఎలాంటి చర్యలనైనా నా ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించబోదు. ఎంత తీవ్రమయినా ఒత్తిడినైనా తట్టుకుని నిలిచేలా మన సామర్థ్యాన్ని, బలాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటాం.
మిత్రులారా,
నేడు ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’కు గుజరాత్ గొప్పగా ఊతమిస్తోంది. దీని వెనుక రెండు దశాబ్దాల కృషి ఉంది. దాదాపు ప్రతిరోజూ ఇక్కడ కర్ఫ్యూ విధించిన రోజులను నేటి యువతరం చూడలేదు. వర్తక వ్యాపారాలు చేయడానికి కష్టతరమైన పరిస్థితి ఉండేది. అశాంతి వాతావరణం నెలకొని ఉండేది. కానీ నేడు భారత్లో అత్యంత సురక్షిత నగరాల్లో అహ్మదాబాద్ ఒకటి. మీ అందరి కృషి వల్లే ఇది సాధ్యమైంది.
మిత్రులారా,
గుజరాత్లో ఏర్పడిన శాంతి భద్రతల వాతావరణం అన్ని విధాలా మనకు సానుకూల ఫలితాలనిస్తోంది. నేడు గుజరాత్ గడ్డపై అన్ని రకాల పరిశ్రమలూ విస్తరిస్తున్నాయి. మన గుజరాత్ తయారీ కేంద్రంగా నిలుస్తుండడాన్ని చూసి యావత్రాష్ట్రమూ గర్విస్తోంది. మీరంతా, ముఖ్యంగా ఇక్కడున్న అన్నాతమ్ముళ్లూ అక్కాచెల్లెళ్లూ తప్పక తెలుసుకోవాలి. ప్రత్యేక గుజరాత్ కోసం ‘మహా గుజరాత్ ఉద్యమం’ ఉద్యమం జరుగుతున్న సమయంలో చాలా మంది మమ్మల్నిలా అడిగారు – ‘‘మీరు ప్రత్యేక గుజరాత్ను ఎందుకు కోరుకుంటున్నారు? ఆకలితో నలిగిపోతారు. ఏముంది మీకు – ఖనిజాలూ లేవు, జీవనదులూ లేవు. పదేళ్లలో ఏడు సంవత్సరాలు కరువుతోనే గడుస్తాయి. గనుల్లేవు, పరిశ్రమల్లేవు, వ్యవసాయం కూడా పెద్దగా లేదు. ఓ వైపు రాన్, మరోపక్క పాకిస్థాన్ ఉన్నాయి. ఏం చేస్తారు మీరు?’’ అని అడిగేవారు. ‘‘ఉప్పు తప్ప మీ దగ్గర ఇంకేమీ లేదు’’ అంటూ వారు ఎగతాళి చేశారు. కానీ, సొంత కాళ్ళ మీద నిలబడాల్సిన గొప్ప బాధ్యత గుజరాత్పై పడినప్పుడు ఇక్కడి ప్రజలు వెనుకడుగు వేయలేదు. ఒకప్పుడు గుజరాత్లో ఏముందని అడిగిన వారికి నేడు స్పష్టంగా కనిపిస్తోంది – ఒక్క వజ్రాల గని కూడా ఇక్కడ లేకపోయుండొచ్చు. కానీ, ప్రపంచంలోని ప్రతీ పది వజ్రాల్లో తొమ్మిదింటి ప్రాసెసింగ్, శుద్ధి గుజరాత్లోనే జరుగుతోంది.
మిత్రులారా,
కొన్ని నెలల కిందట నేను దాహోద్కు వచ్చాను. అక్కడి రైల్వే ఫ్యాక్టరీలో శక్తిమంతమైన ఎలక్ట్రిక్ రైలింజిన్లు తయారవుతున్నాయి. నేడు గుజరాత్లో తయారైన మెట్రో కోచ్లు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. ఇవే కాకుండా, మోటార్ సైకిళ్ళయినా, కార్లయినా... వాటిని చాలా పెద్ద సంఖ్యలో గుజరాత్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలోని, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు ఇక్కడ కర్మాగారాలను నెలకొల్పుతున్నాయి. గుజరాత్ అప్పటికే విమానాలకు చెందిన వివిధ భాగాలను తయారుచేసి ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు వడోదరలో రవాణా విమానాల తయారీ కూడా మొదలైంది. గుజరాత్లోనే విమానాలు తయారవుతున్నాయి. ఇది మనకు గర్వకారణం కాదా? ఇప్పుడు గుజరాత్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కూడా ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. రేపు 26వ తేదీన నేను హన్సల్పూర్కు వెళ్తున్నాను. అక్కడ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించిన ఓ పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. నేడు సెమీకండక్టర్లు లేకుండా ఆధునిక ఎలక్ట్రిక్ పరికరాలేవీ తయారు చేయలేము. గుజరాత్ ఇప్పుడు సెమీకండక్టర్ రంగంలోనూ గొప్ప పేరు తెచ్చుకోబోతున్నది. జౌళి, రత్నాలు, ఆభరణాలు ఇప్పటికే గుజరాత్కు విశేష గుర్తింపును తెచ్చాయి. ఔషధాలు, వ్యాక్సిన్ల విషయానికొస్తే.. భారత్ నుంచి జరుగుతున్న మొత్తం ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లో మూడోవంతు వాటా గుజరాత్దే.
మిత్రులారా,
సౌర, పవన, అణు ఇంధన రంగాల్లో భారత్ నేడు వేగంగా ముందుకు సాగుతోంది. ఈ పురోగతికి గుజరాత్ విశేష సహకారాన్ని అందిస్తోంది. ఇప్పుడే, విమానాశ్రయం నుంచి వస్తుండగా ఓ గొప్ప రోడ్ షో నిర్వహించారు - నిజంగా అద్భుతంగా ఉంది! మీరంతా అద్భుతాలు చేశారు. రోడ్షో అద్భుతంగా ఉంది. ప్రజలంతా ఇళ్ల పైకప్పులపైనా, బాల్కనీల్లోనూ నిలబడి ఉన్నారు. సహజంగానే నేను వారందరినీ గౌరవంగా పలకరిస్తూ వస్తున్నాను. అయితే పరిసరాలను గమనిస్తుండగా చాలా ఇళ్ల పైకప్పులపై సోలార్ రూఫ్టాప్ విద్యుత్ ప్లాంట్లు కనిపించాయి. పర్యావరణ హిత ఇంధనం, పెట్రోకెమికల్స్లోనూ గుజరాత్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. దేశ పెట్రోకెమికల్ అవసరాలను తీర్చడంలో గుజరాత్ విశేష పాత్ర పోషిస్తోంది. మన ప్లాస్టిక్ పరిశ్రమ, సింథటిక్ ఫైబర్, ఎరువులు, ఔషధాలు, పెయింట్ పరిశ్రమ, సౌందర్య సాధనాలు - ఇవన్నీ ఎక్కువగా పెట్రోకెమికల్ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి. గుజరాత్లో పాత పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు ప్రజలు ఎప్పుడూ దుఃఖంతోనే ఉన్న రోజులు నాకింకా గుర్తున్నాయి. 30 ఏళ్ల కిందటి పరిస్థితి గుర్తున్నవారికి ప్రజలు ఎందుకంతలా బాధలు పడ్డారో తెలుసు: ‘‘మిల్లులు మూతపడ్డాయి, మిల్లులు మూతపడ్డాయి, మిల్లులు మూతపడ్డాయి’’... రోజూ అదే కథ. ఏ నాయకుడు వచ్చినా జర్నలిస్టులు ఒకే ఒక ప్రశ్న అడిగేవారు - “మిల్లులు మూతపడ్డాయి. దాని గురించి మీరేం చేస్తారు?”. అప్పట్లో అది కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. కానీ నేడు.. మిల్లుల సైరన్లు మోగకపోవచ్చు. కానీ గుజరాత్లోని మూలమూలనా అభివృద్ధి పతాకం సమున్నతంగా ఎగురుతోంది. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. ఈ చర్యలన్నీ ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఫలితంగా, గుజరాత్ యువతకు ఎప్పటికప్పుడు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
స్నేహితులారా,
పరిశ్రమ, వ్యవసాయం లేదా పర్యాటకం ఏదైనా అయినా అద్భుతమైన అనుసంధానం చాలా ముఖ్యం. గత 20, 25 సంవత్సరాల్లో గుజరాత్లో అనుసంధానం పూర్తిగా మారిపోయింది. నేడు కూడా అనేక రోడ్డు, రైలు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించాను. సర్దార్ పటేల్ రింగ్ రోడ్డు ఇప్పుడు మరింత విస్తరణ జరగుతోంది. ఇది ఆరు లైన్ల రోడ్డుగా మారబోతోంది. ఈ రహదారి విస్తరణతో నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గనుంది. అలాగే విరంగాం–ఖుడద్–రాంపురా రహదారి విస్తరణతో రైతులకు, పరిశ్రమలకు మరింత లాభం చేకూరనుంది. ఈ కొత్త అండర్పాసులు, రైల్వే ఓవర్బ్రిడ్జీలు నగర అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
స్నేహితులారా,
ఒకప్పటి కాలంలో పాత ఎర్ర బస్సులు మాత్రమే నడిచేవి. ఎక్కడికైనా వెళ్లాలంటే ‘ఎర్ర బస్సులో’నే వెళ్లాలని ప్రజలు చెప్పేవారు. కానీ నేడు రోజులు మారాయి. బీఆర్ టీఎస్ ‘జనమార్గ్’, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కొత్త రవాణా సౌకర్యాలను అందిస్తున్నాయి. మెట్రో రైలు కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇది అహ్మదాబాద్ ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుంది.
స్నేహితులారా,
గుజరాత్లో ప్రతి నగరం చుట్టూ పెద్ద పరిశ్రమల కారిడార్ ఉంది. కానీ 10 సంవత్సరాల కింద వరకు, పోర్టులు, పరిశ్రమల సమూహాల మధ్య మెరుగైన రైలు అనుసంధానం లేదు. మీరు నన్ను 2014లో ఢిల్లీకి పంపిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించేందుకు నేను పని ప్రారంభించాను. గత 11 సంవత్సరాల్లో గుజరాత్లో దాదాపు 3,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ లు వేశారు. గుజరాత్లో మొత్తం రైల్వే వ్యవస్థ 100 శాతం విద్యుదీకరణగా మారింది. నేడు గుజరాత్ లో ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టులు రైతులు, పరిశ్రమలు, యాత్రికులకు మరింత సౌలభ్యాన్ని అందించనున్నాయి.
స్నేహితులారా,
నగరాల్లో నివసించే పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించేందుకు ఏర్పడిన రామపీర్ నో టెక్రో, రామపీర్ టిలా, ఇది రామాపీర్ నో టేక్రో, రామాపీర్ దీనికి ప్రత్యక్ష పూజ్య బాపు ఎప్పుడూ పేదల గౌరవాన్ని ప్రాధాన్యతగా చూశారు. నేడు సబర్మతి ఆశ్రమ ప్రవేశద్వారంలో పేదల కోసం నిర్మించిన కొత్త ఇళ్లతో ఆయన కల నెరవేరుతోంది. 1,500 పక్కా ఇళ్లు ఇవ్వడం అనేక కొత్త కలలకు పునాది వేసినట్టే. ఈ నవరాత్రి, దీపావళికి ఈ ఇళ్లలో నివసించే ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించనున్నది. పూజ్య బాపునకు నిజమైన నివాళిగా సబర్మతి ఆశ్రమ పునర్నిర్మాణం కూడా జరుగుతోంది. మన దేశానికి స్ఫూర్తిగా నిలిచిన సర్దార్ పటేల్ ‘ఐక్యతా విగ్రహం’, పూర్తి చేసిన సమయంలోనే నేను సబర్మతి ఆశ్రమ పనిని కూడా ప్రారంభించాలని అనుకున్నాను. కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం మాకు మద్దతు ఇవ్వలేదు. బహుశా వారు గాంధీజీకి కూడా గౌరవం ఇవ్వకపోయి ఉండొచ్చు. అందువల్ల ఆ పనిని నేను ముందుకు తీసుకెళ్లలేకపోయాను. కానీ మీరు నన్ను ఢిల్లీకి పంపిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘ఐక్యతా విగ్రహం’ దేశానికీ, ప్రపంచానికీ ప్రేరణ కేంద్రంగా మారినట్లే.. సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ పూర్తయిన తర్వాత.. ఈ ఆశ్రమం కూడా ప్రపంచ శాంతి కోసం గొప్ప స్ఫూర్తిని అందించబోతున్నది. స్నేహితులారా, ఈ మాటలు గుర్తుంచుకోండి.
స్నేహితులారా,
మన కార్మిక కుటుంబాలకు మెరుగైన జీవితం ఇవ్వడం మా లక్ష్యం. అందుకే చాలా సంవత్సరాల కిందట గుజరాత్లోని మురికివాడల్లో నివసించే వారి కోసం మేం పక్కా నివాస సముదాయాలను నిర్మించేందుకు ముందడుగు వేశాం. గత కొన్ని సంవత్సరాల్లో గుజరాత్లో అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అక్కడ మురికివాడల స్థానంలో ఇళ్లు నిర్మితమయ్యాయి. అలాగే ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది.
స్నేహితులారా,
ఎవరూ పట్టించుకోని వారిని కూడా నేను గౌరవిస్తాను. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత, నగరంలోని పేదల జీవితాన్ని సులభతరం చేయడం కూడా మా ప్రాధాన్యతని ఈ ఏడాది ఎర్రకోట నుంచి నేను చెప్పాను. గతంలో వీధి వ్యాపారులను ఎవరూ పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వారి కోసం పీఎం స్వనిధి యోజన ప్రారంభించింది. నేడు ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల వీధి వ్యాపారులు బ్యాంకుల నుంచి రుణాలు పొందగలుగుతున్నారు. ఇక గుజరాత్లో లక్షల మందికి లాభం చేకూర్చింది.
స్నేహితులారా,
గత 11 సంవత్సరాల్లో, 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడటం ప్రపంచానికి ఒక అద్భుతం. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు రావడాన్ని ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలూ చర్చిస్తున్నాయి.
స్నేహితులారా,
ఒక పేదవాడు పేదరికం నుంచి బయటపడినప్పుడు అతను మధ్యతరగతి రూపంలో కొత్తశక్తిగా ఎదుగుతాడు. నేడు ఈ మధ్య తరగతి, మన సంప్రదాయ మధ్యతరగతి, ఇద్దరూ కలిసి దేశానికి గొప్ప శక్తిగా మారుతున్నారు. వారిని శక్తిమంతంగా చేయడమే మా నిరంతర లక్ష్యం. బడ్జెట్టులో ఆదాయపు పన్ను మినహాయింపు 12 లక్షల రూపాయల వరకు పొడిగించడం అహ్మదాబాద్ సహోదరులకి ఒక మంచి వార్త. అయితే ఇది ఎలా సాధ్యమైందన్నది ప్రతిపక్షాలకు బోధపడటంలేదు.
స్నేహితులారా,
మా ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలను తీసుకురాబోతోంది. సిద్దంగా ఉండండి. ఈ దీపావళికి మీకు పెద్ద బహుమతి సిద్ధమవుతోంది. జీఎస్టీ సంస్కరణ వల్ల చిన్న వ్యాపారులకు లాభం కలగడమే కాకుండా అనేక వస్తువులపై పన్ను కూడా తగ్గనుంది. వ్యాపార వర్గం, కుటుంబాలు ఎవరైనా ఈ దీపావళికి... అందరికీ డబుల్ బోనస్ ఆనందం లభించబోతుంది.
స్నేహితులారా,
ఇప్పుడే నేను పీఎం సూర్య ఘర్ పథకం గురించి మాట్లాడుతున్నాను. పీఎమ్ సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా, మేం విద్యుత్తు బిల్లుల భారాన్ని పూర్తిగా తొలగిస్తున్నాం. ఈ పథకం ద్వారా కేవలం గుజరాత్లోనే దాదాపు ఆరు లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. గుజరాత్ లోని ఈ కుటుంబాలకు ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలకుపైగా అందించింది. ఫలితంగా ప్రతి నెలా వాళ్లు విద్యుత్తు బిల్లులపై అధిక మొత్తాన్ని ఆదా చేస్తున్నారు.
స్నేహితులారా,
అహ్మదాబాద్ నగరం నేడు కలల, సంకల్పాల నగరంగా మారుతోంది. కానీ ఒకప్పుడు ప్రజలు అహ్మదాబాద్ను ‘గర్దాబాద్’ అని ఎగతాళి చేసేవారు. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, దుమ్మూ ధూళీ కనిపించేంది. అది నగరానికి దురదృష్టంగా మారింది. కానీ నేడు శుభ్రత విషయంలో దేశంలోనే అహ్మదాబాద్ మంచి పేరు తెచ్చుకుంటోంది. ఇది అహ్మదాబాద్ ప్రజల సహకారంతోనే సాధ్యమైంది.
మిత్రులారా,
ఈ పరిశుభ్రత.. ఈ 'స్వచ్ఛత' ప్రచారం కేవలం ఒక రోజు కోసం కాదు. ఇది ప్రతీ తరం తర్వాతి తరం కోసం ప్రతిరోజూ చేయాల్సిన పని. పరిశుభ్రతను అలవాటుగా చేసుకున్నప్పుడే మనం ఆశించిన ఫలితాలను సాధించగలం.
మిత్రులారా,
మన సబర్మతి నది ఇంతకుముందు ఎలా ఉండేది? అది ఎండిపోయిన కాలువలా ఉండేది.. అందులో సర్కస్లు జరిగేవి.. పిల్లలు అక్కడ క్రికెట్ ఆడేవారు. ఈ పరిస్థితిని మార్చాలని అహ్మదాబాద్ ప్రజలు సంకల్పించారు. ఇప్పుడు సబర్మతి నదీ తీరం ఈ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
మిత్రులారా,
కంకారియా సరస్సులోని నీరు పిచ్చి మొక్కలతో నిండిపోయి పచ్చగా.. దుర్వాసనతో ఉండేది. దీంతో ఆ పరిసరాల్లో నడవడం కూడా కష్టంగా ఉండేది. ఈ ప్రాంతమంతా అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో ఎవరూ అటువైపు వెళ్లడానికి సాహసించేవారు కాదు. అయితే నేడు ఈ సరస్సు అత్యుత్తమ వినోద ప్రదేశంగా మారింది. సరస్సులో బోటింగ్, కిడ్స్ సిటీ పిల్లలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతున్నాయి. ఇవన్నీ మారుతున్న అహ్మదాబాద్ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నగరానికి తలమానికంగా మారిన కంకారియా కార్నివాల్ ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెస్తోంది.
మిత్రులారా,
అహ్మదాబాద్ నేడు గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. అహ్మదాబాద్ యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందింది. నగరంలోని పాతకాలపు ద్వారాలు.. సబర్మతి ఆశ్రమం.. ఇక్కడి వారసత్వ ప్రదేశాలతో మన నగరం నేడు ప్రపంచ పటంలో ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. ప్రస్తుతం కొత్త, ఆధునిక రూపాల్లో పర్యాటకం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో మనం పర్యాటకం గురించి మాట్లాడేటప్పుడు అహ్మదాబాద్, గుజరాత్ల ప్రస్తావన దసాడా కార్యాలయ రికార్డుల్లో కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో పర్యటనల విషయం వస్తే గుజరాత్ ప్రజలు "అబూకి వెళ్దాం" అనేవారు. దక్షిణ గుజరాత్ ప్రజలు డయ్యూ-డామన్లకు వెళ్లేవారు. అదే మన ప్రపంచంగా ఉండేది. ఆధ్యాత్మికతకు మొగ్గు చూపే పర్యాటకులు సోమనాథ్, ద్వారక, అంబాజీ వంటి నాలుగైదు ప్రదేశాలకు మాత్రమే వెళ్లేవారు. కానీ నేడు గుజరాత్ పర్యాటకానికి ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. రాన్ ఆఫ్ కచ్లోని వైట్ రాన్ను చూడటానికి ప్రపంచం అత్యంత ఉత్సాహం చూపుతోంది. ప్రజలు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడాలనుకుంటున్నారు.. వారు బెట్ ద్వారక వద్ద వంతెనను చూడటానికి వస్తున్నారు.. వంతెన దాటడం కోసం వాహనాల నుంచి దిగి మరీ దానిపై నడుస్తూ ఆనందిస్తున్నారు. మిత్రులారా.. మీరు ఒక సంకల్పం తీసుకుంటే ఫలితాలు తప్పకుండా వస్తాయి. నేడు అహ్మదాబాద్ కచేరీల ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. కొన్ని నెలల కిందట ఇక్కడ జరిగిన కోల్డ్ప్లే కచేరీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. లక్ష మంది కూర్చునే సామర్థ్యం గల అహ్మదాబాద్ స్టేడియం కూడా ప్రధాన ఆకర్షణగా ఉంది. అహ్మదాబాద్ గొప్ప కచేరీలతో పాటు ప్రధాన క్రీడా కార్యక్రమాలను కూడా నిర్వహించగలదని ఇది చాటుతోంది.
మిత్రులారా,
నేను మొదట పండుగల గురించి మాట్లాడాను. ఇది పండుగల కాలం - నవరాత్రి, విజయదశమి, ధంతేరాస్, దీపావళి వంటి పండుగలన్నీ వస్తున్నాయి. ఇవి మన సంస్కృతికి సంబంధించిన పండుగలు. అయితే వాటిని ' స్వయం సమృద్ధి' పండుగలుగా మార్చాలి. నేను మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.. పూజ్య బాపూజీ భూమి నుంచి దేశపౌరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం మన జీవితాల్లో ఒక మంత్రాన్ని స్వీకరించాలి. మనం ఏది కొన్నా అది భారత్లో తయారైనదై ఉండాలి. అది స్వదేశీ వస్తువై ఉండాలి. గృహాలంకరణ కోసం మీరు మన దేశంలో తయారైన వస్తువులే కొనాలి. మిత్రులారా.. బహుమతుల కోసం కూడా మన దేశంలో తయారు చేసిన వాటినే ఎంచుకోండి. నేను ముఖ్యంగా దుకాణదారులకు, వ్యాపారులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గొప్ప సహకారం అందించవచ్చు. దీనికోసం మీరు విదేశీ వస్తువులను అమ్మకూడదని గట్టిగా నిర్ణయించుకోండి. మీ దుకాణాల ఎదుట "ఇక్కడ స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్ముతారు" అని గర్వంగా ఒక బోర్డును ఉంచండి. మన ఈ చిన్న ప్రయత్నంతో ఈ పండుగలు భారత శ్రేయస్సు కోసం గొప్ప వేడుకలుగా మారుతాయి.
మిత్రులారా,
మొదట్లో చాలాసార్లు ప్రజలు నిరాశ చెంది ఉండవచ్చు. నేను మొదటిసారి రివర్ఫ్రంట్ గురించి మాట్లాడినప్పుడు అందరూ దానిని ఎగతాళి చేయడం నాకు ఇంకా గుర్తుంది. మరి “రివర్ఫ్రంట్ వచ్చిందా లేదా?” నేను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి విలేకరుల సమావేశంలో ప్రకటించినప్పుడు అందరూ “ఎన్నికలు వస్తున్నాయి, అందుకే మోదీజీ దీనిని ప్రస్తావిస్తున్నారు” అని వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించామా లేదా? నేడు ప్రపంచమంతా దానిని ఆశ్చర్యంగా చూస్తోందా లేదా? నేను కచ్లోని రాన్ ఉత్సవ్ గురించి మాట్లాడినప్పుడూ.. “కచ్కు ఎవరు వెళతారు? రాన్కు ఎవరు వెళతారు?” అని అందరూ అడిగారు. కానీ నేడు అక్కడ ప్రజలు బారులు తీరారు. ఆరు నెలల ముందుగానే అక్కడికి వెళ్లడం కోసం ప్రయాణాలు బుక్ చేసుకుంటున్నారు. ఇది జరిగిందా లేదా? గుజరాత్లో ఒక విమాన తయారీ కర్మాగారం ఏర్పాటవుతుందని ఎవరైనా ఊహించారా? నేను మొదటిసారి గిఫ్ట్ సిటీ గురించి వివరించినప్పుడు అది అసాధ్యమని అందరూ వాదించారు. అలాంటి భవనాలు ఎలా నిర్మించవచ్చని అడిగారు. కానీ ఇప్పుడు గిఫ్ట్ సిటీ దేశానికే తలమానికంగా ఉంది. ఈ దేశ సామర్థ్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలనే నేను ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను. మీరు మీ సంకల్పాన్ని గౌరవిస్తే.. దాని కోసం అంకితభావంతో కృషి చేస్తూ ఉంటే భారత ప్రజలు మీ సంకల్పాన్ని ఎప్పటికీ విఫలం కానివ్వరు. దాని కోసం వారు తమ చెమటనూ, రక్తాన్ని ధారపోస్తారు. గతంలో అనేక ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత కూడా శత్రువును భారత్ ఏమీ చేయలేదనే నమ్మకం ఉండేది. కానీ భారత్ మెరుపు దాడులు చేసి వారి లాంచింగ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది. వైమానిక దాడులతో ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలను నాశనం చేసింది. ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఉగ్రమూలాలపై దాడి చేసింది. చంద్రయాన్ ద్వారా ఇంతకుముందు ఎవరూ వెళ్లని చంద్రుని దక్షిణధృవంలోని శివశక్తి పాయింట్ వద్ద దిగి మన త్రివర్ణ పతాకాన్ని భారత్ ఎగురవేసింది. శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఇప్పుడు గగన్యాన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. మన సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి కృషి జరుగుతోంది. మిత్రులారా.. మన విశ్వాసంతో, అంకితభావంతో, దేవుని స్వరూపమైన ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో తప్పక విజయం లభిస్తుందని ఈ ప్రతీ సంఘటన రుజువు చేస్తుంది. అదే విశ్వాసంతో మన దేశం స్వయంసమృద్ధి సాధించగలదని నేను చెబుతున్నాను. దేశంలోని ప్రతి పౌరుడు "స్థానిక స్వరం" కోసం ప్రచారకర్తగా ఉండి.. ప్రతి పౌరుడూ స్వదేశీ మంత్రం ఆచరిస్తూ ఉంటే.. మనం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇంకెప్పుడూ ఉండదు.
మిత్రులారా,
గతంలో ప్రపంచంలో ఎక్కడో తయారు చేసిన టీకాలు మన దేశానికి చేరుకోవడానికి 30-40 సంవత్సరాలు పట్టేది. అందుకే కోవిడ్ సమయంలో ఏమి జరుగుతుందోనని ప్రజలంతా సందేహించారు. అయితే మన దేశం బలంగా నిర్ణయించుకుంది. అందుకే సొంతంగా టీకాను తయారుచేసి 140 కోట్ల మంది పౌరులకు విజయవంతంగా అందించింది. ఇదే మన దేశపు బలం. ఆ బలంపై నమ్మకంతో గుజరాత్లోని నా తోటి మిత్రులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకు నేర్పిన పాఠాలు, మీరు నాకు నేర్పిన విధానాలు, మీరు నాలో నింపిన శక్తి, ఉత్సాహంతో.. 2047 నాటికి అంటే భారత్ 100 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి మన దేశం 'వికసిత్ భారత్' గా మారుతుందని కచ్చితంగా చెబుతున్నాను.
మిత్రులారా,
'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడం కోసం స్వదేశీ (దేశీయ స్వయంసమృద్ధి) ఒక ముఖ్యమైన రహదారి. మరో ముఖ్యమైన రహదారి ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధ భారత్). వస్తువులను రూపొందించి.. తయారు చేసి.. ఉత్పత్తి చేసే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. మీ నాణ్యతను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండండి. మీ ఖర్చులను తగ్గించుకుంటూ ఉండండి. మీరే చూస్తారు.. భారత ప్రజలు ఇకమీదట ఎప్పుడూ బయటి నుంచి ఏమీ కొనే అవసరం ఉండదు. మనం ఈ స్ఫూర్తిని మేల్కొల్పి ప్రపంచం ఎదుట ఉదాహరణగా నిలవాలి. మిత్రులారా.. సంక్షోభం ఎదురైనప్పుడు నమ్మకంగా, దృఢంగా నిలబడి అనుకున్న ఫలితాలను సాధించే దేశాలు చాలానే ఉన్నాయి. మనకు కూడా ఇది ఒక మంచి అవకాశం. మన సంకల్పాన్ని నెరవేర్చుకునే శక్తితో మనం ముందుకు సాగాలి. గుజరాత్ ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇచ్చినట్లే.. యావత్ దేశమూ నాకు మద్దతునిస్తోంది. మన దేశం కచ్చితంగా 'వికసిత్ భారత్' గా మారుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ విలువైన అభివృద్ధి కానుకలను అందుకున్న సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు! గుజరాత్ మరింత గొప్ప పురోగతి సాధించాలి.. సరికొత్త శిఖరాలను చేరుకోవాలి.. గుజరాత్ బలం దాని చర్యల వల్లే నిరూపితమవుతుంది. మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరంతా పూర్తి బలంతో నాతో పాటు ఇలా చెప్పండి:
భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై!
ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి గుజరాతీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(Release ID: 2160924)