సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
మువ్వన్నెల జెండా ప్రచార ఉద్యమంలో పేర్లు నమోదు చేసుకున్న 5 లక్షల మందికి పైగా యువత: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
• ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార ఉద్యమం 4వ సంచికను ప్రకటించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
Posted On:
11 AUG 2025 6:46PM by PIB Hyderabad
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా మూడు రంగుల జెండా) ప్రచార ఉద్యమం 4వ సంచికను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సగర్వంగా ప్రకటించింది. భారత జాతీయ జెండా ‘తిరంగా’ను (త్రివర్ణ పతాకం) ఇంటింటా ఎగరేయడంతో పాటు ఈ భావనను మది నిండా నింపుకొనేటట్లు పౌరులకు స్ఫూర్తిని కలగజేయడం ఈ ప్రచార ఉద్యమం ఉద్దేశం.
ఈ సంవత్సరం మనం ‘తిరంగా ప్రచార ఉద్యమం’ నాలుగో సంచికను ఉత్సవ స్థాయిలో జరుపుకోబోతున్నాం. దీని కోసం స్వచ్ఛంద సేవకులుగా నమోదు చేసుకున్న యువత సంఖ్య 5 లక్షలు దాటిందని కేంద్ర సాంస్కృతిక మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ యువతీయువకులలనూ, ప్రజలనూ మూడు రంగుల జాతీయ జెండా ప్రచార ఉద్యమంలో పాల్గొనేలా ప్రేరణను అందించనున్నారని ఆయన అన్నారు.
శ్రీ షెకావత్ ఈ రోజు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ, ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా త్రివర్ణ పతాక) ఒక్క ప్రచార ఉద్యమ స్థాయికే పరిమితం కాదు.. అంతకు మించి ఇది ఒక భావోద్వేగభరిత ఉద్యమం. 140 కోట్ల భారతీయులను మన జాతీయ జెండా లోని నిత్యశోభాయమానమైన మూడు రంగులతో మేళవిస్తుందన్నారు. దీని లక్ష్యం దేశభక్తి భావనను పాదుగొల్పడం, పౌరులలో సంతోషం ఉప్పొంగేటట్లు చేయడంతో పాటు మన స్వాతంత్ర్యం, మన ప్రజాస్వామ్యాల సజీవ ప్రతీకగా నిలుస్తున్న మువ్వన్నెల జెండా ప్రాధాన్యాన్ని విస్తృత స్థాయిలో చాటిచెప్పడమని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ తిరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చి ప్రచార ఉద్యమం సమగ్ర వివరణను కళ్లకు కట్టారు. హోం శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిజిత్ సిన్హా, జల శక్తి శాఖ ఆర్థిక సలహాదారు శ్రీ సమీర్ కుమార్ తమ తమ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కేంద్ర సాయుధ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) అధికారులు కూడా పాల్గొన్నారు.
జాతీయ జెండాకు, పౌరులకు మధ్య సంబంధాన్ని లాంఛనప్రాయం, సంస్థాగత సంబంధం స్థాయుల నుంచి ఒక ప్రగాఢ వ్యక్తిగత అనుబంధం స్థాయికి పెంపొందించాలనే ఉద్దేశంతో ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార ఉద్యమాన్ని రూపొందించారు. ఇది దేశంలో ప్రతి ఒక్కరూ సంతోషంతో, గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ స్వాతంత్ర్యాన్ని పండుగ చేసుకోవాలంటూ పౌరులను ఉత్తేజితులను చేస్తోంది.
ఈ కార్యక్రమానికి విశేష ప్రతీకాత్మక విలువ కూడా ఉంది. మువ్వన్నెల జెండాను ఇంటి వద్ద ఎగరేయడం అంటే అది ఒక వ్యక్తిగత అనుబంధాన్ని చాటడంతో పాటు, దేశ నిర్మాణానికి మన వంతు పాటుపడతామన్న నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఒక ప్రతీక. ఇది మన దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన త్యాగమూర్తులను గుర్తుకు తెచ్చుకోవడానికీ, ఏకత, అఖండత, ప్రగతి.. ఈ విలువల్ని నిలబెడతామన్న ప్రతిజ్ఞకు కూడా ఒక సంకేతంగా నిలుస్తోంది.
ఈ ప్రచార ఉద్యమానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోడల్ మినిస్ట్రీగా వ్యవహరిస్తోంది. ఈ ప్రచార ఉద్యమంలో పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొనేటట్లు చూడడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలతో పాటు సాధారణ ప్రజానీకంతో ఈ శాఖ సన్నిహిత సమన్వయాన్ని నెలకొల్పుకొని పనిచేస్తోంది. పౌరులు జాతీయ జెండాను వారి ఇళ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎగరేయాలనీ, ఈ వేడుకల ఫోటోలను, కథనాలను ‘హర్ ఘర్ తిరంగా’ (#HarGharTiranga)కు ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పొందుపరచాలనీ వారికి మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.
గత మూడేళ్లుగా ప్రజలు సమధికోత్సాహంతో పాల్గొంటుండడంతో, ‘హర్ ఘర్ తిరంగా’ ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఇది స్వాతంత్ర్య దినోత్సవాన్ని చైతన్యం ఉప్పొంగే, దేశమంతటా భిన్నత్వంలో ఏకత్వాన్ని పండుగ చేసుకొనే ఘడియలుగా మలచింది. ఈ ఏడాది సంచిక మన జాతీయ స్ఫూర్తిని, హర్షాన్ని పునరుద్ఘాటిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరింత సమాచారం కోసం... click here
(Release ID: 2155422)