గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
రూ.11 లక్షల కోట్లకు చేరుకున్న మహిళా స్వయంసహాయక బృందాల రుణ పంపిణీ గ్రామీణ ఆర్థిక సాధికారత కల్పనలో ఒక చరిత్రాత్మక ప్రగతి ప్రస్థానం
Posted On:
29 JUL 2025 2:28PM by PIB Hyderabad
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో ఇది ఒక సరికొత్త అధ్యాయం... సాంప్రదాయక ఆర్థిక సంస్థల నుంచి మహిళా స్వయంసహాయ బృందాలకు (ఎస్హెచ్జీస్) రూ.11 లక్షల కోట్ల కన్నా ఎక్కువ మొత్తంలో రుణాలను అందించారు.
ఈ చరిత్రాత్మక విజయం బ్యాంకులు కొండంత అండ ఇవ్వడం వల్ల సాధ్యపడింది. ఇది అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాల వారికి అందేట్లు చూడాలని, మహిళలకు సాధికారతను కల్పించడంతో పాటు కింది స్థాయుల్లో ఆర్థిక దృఢత్వ పునాదులను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ కట్టుబాటుకు అద్దం పడుతోంది.
పేద మహిళల భాగస్వామ్యంతో పటిష్ఠ సాముదాయక సంస్థలను నిర్వహించి ఆ మహిళల బతుకుదెరువుకు దన్నుగా నిలబడడం ద్వారా గ్రామాలను పేదరిక వలయం నుంచి బయటకు తేవాలన్నదే డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్ ముఖ్యోద్దేశం. ఈ స్వయంసహాయ బృందాలు పల్లెల్లో రుణ పంపిణీకి ప్రధాన మార్గాలుగా మారిపోయాయి. దీంతో అభివృద్ధి ప్రయోజనాలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవడంతో పాటు మహిళల నాయకత్వంలోని వాణిజ్య సంస్థలను పెంచి పోషించడానికి వీలవుతోంది. రుణాలను నిలకడైన రీతిలో అందజేస్తుండడం వల్ల పల్లె ప్రాంతాల మహిళల్లో కొత్త కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలనే ఉత్సాహం పెరుగుతోంది. వారు తమకంటూ ఆదాయాన్ని సంపాదించిపెట్టగల సంస్థలను ధైర్యంగా స్థాపించగలుగుతున్నారు.
అసంఖ్యాక మహిళలు నెలకొల్పిన సంస్థలు జీవనోపాధికి పట్టుగొమ్మలుగా మారిన ప్రక్రియ చిత్తశుద్ధి కలిగిన బ్యాంకింగ్ భాగస్వాములు కీలక భూమిక పోషించనిదే ఇంతటి విశేష విజయానికి నోచుకొనేదే కాదు. ఈ కీలక తోడ్పాటే ఎస్హెచ్జీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి, అనేక మంది ఉమ్మడిగా కన్న కలలను నెరవేర్చి, ఆర్థిక స్వావలంబన దిశగా వారు సాగిస్తున్న ప్రయాణాన్ని వేగవంతం చేసింది.
బ్యాంకింగ్ ప్రతినిధులుగా సేవలు అందిస్తున్న ఎస్హెచ్జీ మహిళా సభ్యులను ‘బ్యాంక్ సఖులు’ అని పిలుస్తున్నారు. ఈ విజయంలో బ్యాంక్ సఖులు సైతం ముఖ్య పాత్ర పోషించారు. వీరు అలుపెరుగక చేస్తున్న కృషి రుణ వితరణతో పాటు రుణాల తిరిగి చెల్లింపులో కూడా కీలకంగా మారుతూ, ఎస్హెచ్జీలకు బ్యాంకింగ్ సంస్థలకు మధ్య విశ్వసనీయ అనుబంధాన్ని పెంచుతోంది.
‘డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్’, ‘లఖ్పతి దీదీ స్కీమ్’ల వంటి కార్యక్రమాల రూపంలో స్వయంసహాయ బృందాల ఉద్యమం లక్షలాది మంది మహిళలకు సాధికారితను అందిస్తోంది. రూ.11 లక్షల కోట్ల స్థాయిలో రుణ పంపిణీ, పూచీకత్తు అక్కర లేకుండానే రుణాలివ్వడం, వడ్డీలో తగ్గింపు సదుపాయం, ఇంకా ఇతరత్రా ఆర్థిక సహాయం, రుణమొత్తాల తిరిగి చెల్లింపు 98 శాతాని కంటే ఎక్కువగా నమోదు కావడం.. ఇవి ఈ కార్యక్రమాలు గొప్పగా విజయవంతం అయ్యాయని సూచిస్తున్నాయి.
బ్యాంకులు, బ్యాంకు సఖుల ముఖ్య పాత్ర
బ్యాంకులు రుణాలను, ఆర్థిక సేవలను ప్రాధాన్య రంగ రుణాల విభాగం పరిధిలో అందజేశాయి. అంతేకాకుండా స్వయంసహాయ బృందాల సభ్యులకు రుణ లభ్యతను, ప్రక్రియలను కూడా బ్యాంకులు సులభతరం చేశాయని చెప్పుకోవచ్చు. మరో వైపు బ్యాంకింగ్ లావాదేవీల్లో, డాక్యుమెంట్లు- రుణ దరఖాస్తులను సిద్దం చేయడంలో సభ్యులకు బ్యాంకు సఖులు మార్గదర్శనం చేశారు. ఆర్థిక వ్యవహార జ్ఞానంతో పాటు బీమా, పింఛన్లు వంటి పథకాల పట్ల అవగాహనను పెంచారు. ఆధార్, మొబైల్ ఫోన్ నంబర్లను బ్యాంకు ఖాతాలకు లింక్ చేయడంలో సాయం చేశారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను లబ్ధిదారులు సరైన సమయానికి తిరిగి చెల్లించేటట్లుగా బ్యాంక్ సఖులు చూశారు.
ఈ విజయం గణాంకాలను మించిన ఘనకార్యమని చెప్పాలి. మహిళలపై నమ్మకాన్ని పెట్టుకొని, వారికి తగిన వనరులను ఇచ్చి, అవకాశాలను అందించినప్పుడు వారు తమ శక్తియుక్తులను తప్పక చాటిచెబుతారని సూచించే సందర్భం. ఇది మొత్తంమీద చూస్తే, మరింత మంది ప్రజలు వృద్ధిలోకి వచ్చేటట్లు, గ్రామీణ భారతావని దృఢంగా మారేటట్లు తోడ్పడనుంది.
***
(Release ID: 2149844)