వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్, బ్రిటన్ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)
చారిత్రక ఒప్పందం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో- ఆర్థిక భాగస్వామ్యం, కొత్త ఆర్ధికావకాశాల శకాన్ని ముందుకు తీసుకువెడుతూ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్, బ్రిటన్
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసిన భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, బ్రిటన్ వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి జోనాథన్ రెనోల్డ్స్; కార్యక్రమానికి హాజరైన విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, బ్రిటన్ ఆర్థిక మంత్రి శ్రీమతి రాచెల్ రీవ్స్
టెక్స్ టైల్స్, తోలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, బొమ్మలతో సహా విస్తృత కార్మిక ప్రయోజన రంగాలకు ఎగుమతి అవకాశాలను పెంచనున్న ఒప్పందం; పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు, చేతివృత్తులు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు, ఎంఎస్ఎమ్ఈలకు సాధికారత
99% టారిఫ్ లైన్లపై సుంకం లేకుండా దాదాపు 100% వాణిజ్య విలువ మేరకు
భారతీయ వస్తువులకు అసాధారణ రీతిలో మార్కెట్ లభ్యత
విశ్వసనీయ సేవల కట్టుబాట్లు - తొలిసారి బ్రిటన్ నుంచి ఐటీ/ఐటీఈఎస్, ఆర్థిక, వృత్తిపరమైన సేవలు, బిజినెస్ కన్సల్టింగ్, విద్య, టెల
Posted On:
24 JUL 2025 5:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, భారత్, బ్రిటన్ దేశాలు ఈ రోజు సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) పై సంతకాలు చేసి, రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు వేశాయి. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, బ్రిటన్ వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి, శ్రీ జోనాథన్ రేనాల్డ్స్ ఇరు దేశాల ప్రధానమంత్రుల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భాగస్వామి కావడం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంలో భాగస్వామ్య నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలో వరుసగా నాలుగో, ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా, భారత్, బ్రిటన్ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అంతర్జాతీయంగా ఆర్థిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. 2025 మే 6న విజయవంతంగా జరిగిన చర్చల ఫలితంగా రెండు దేశాల మధ్య ఈరోజు ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 56 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని 2030 నాటికి రెట్టింపు చేయాలనేది ఉమ్మడి లక్ష్యం.
సీఈటీఏ ఒప్పందం భారతదేశం నుంచి బ్రిటన్ కు జరిగే ఎగుమతులలో 99% వరకు సుంకం లేని లభ్యతను కల్పిస్తుంది, ఇది దాదాపు మొత్తం వాణిజ్య విలువను కవర్ చేస్తుంది. ఇది వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు, పాదరక్షలు, క్రీడా వస్తువులు, బొమ్మలు, రత్నాలు, ఆభరణాలు వంటి కార్మిక ఆధారిత పరిశ్రమలకు, అలాగే ఇంజనీరింగ్ వస్తువులు, ఆటో విడిభాగాలు, సేంద్రీయ రసాయనాలు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త అవకాశాలను తెరవనుంది.
భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా ఉన్న సేవల రంగానికి ఈ ఒప్పందం ద్వారా విస్తృత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఆర్థిక, న్యాయ సేవలు, వృత్తిపరమైన, విద్యారంగ సేవలు, డిజిటల్ ట్రేడ్ వంటి రంగాలకు మరింత మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. బ్రిటన్ లో వివిధ సేవల రంగాల్లో భారత కంపెనీల ద్వారా నియమితులయ్యే నిపుణులు, అలాగే కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేసే ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్లు, షెఫ్స్, యోగా టీచర్లు, సంగీతకారులు వంటి నిపుణులకు ఈ ఒప్పందం ద్వారా లాభపడతారు. వీరికి వీసా ప్రక్రియలను, ప్రవేశ మార్గాలను సరళతరం చేస్తారు. తద్వారా బ్రిటన్ లో భారతీయ ప్రతిభకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
ఈ చారిత్రక ఒప్పందాన్ని సాధించడంలో కీలకమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, అచంచలమైన నిబద్ధతకు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“ఈ సీఈటీఏ ఒప్పందం రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇది ప్రతిష్ఠాత్మకమైన, సమతుల్యమైన వ్యవస్థ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఒప్పందం 99% భారతీయ ఎగుమతులకు సుంకాలను తొలగిస్తుంది. ఇది దాదాపు 100% వాణిజ్య విలువను అందిస్తుంది. ఇందులో శ్రమాధారిత రంగాలు ముఖ్యమైనవి. ఇవి ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి బలం చేకూరుస్తాయి. ఇది 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే మౌలికమైన దిశను అందిస్తుంది. ఈ ఒప్పందంలో వస్తువులు, సేవల రంగాల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన కట్టుబాట్లు ఉన్నాయి. ఇవి అనేక రంగాలకు వర్తిస్తాయి. అంతేకాకుండా, కాంట్రాక్ట్ సేవలందించే వారు, వ్యాపార సందర్శకులు, స్వతంత్ర నిపుణులకు ప్రవేశాన్ని సులభతరం చేసి, భారతీయ నిపుణుల చలన సౌలభ్యాన్ని పెంచుతుంది. వినూత్నమైన డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ద్వారా భారతీయ కార్మికులు, వారి యజమానులు మూడు సంవత్సరాల పాటు బ్రిటన్ సోషల్ సెక్యూరిటీకి ఎలాంటి చెల్లింపుల్నీ చేయాల్సిన పని ఉండదు. ఇది భారతీయ కంపెనీల పోటీతత్వాన్ని పెంచుతూ, ఉద్యోగుల ఆదాయాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సమగ్ర అభివృద్ధికి ప్రేరణగా పనిచేస్తుంది. ఇది రైతులు, కళాకారులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు లాభాలు అందిస్తూ, భారతదేశ ప్రధాన ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది” అని శ్రీ గోయల్ అన్నారు.
భారతదేశం డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్పై కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, భారతీయ నిపుణులు వారి యజమానులు బ్రిటన్ లో మూడు సంవత్సరాల పాటు సోషల్ సెక్యూరిటీ చెల్లింపుల నుంచి మినహాయింపును పొందుతారు. ఇది భారతీయ ప్రతిభ వ్యయ పోటీతత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వాణిజ్యాన్ని మరింత సమ్మిళితంగా మార్చేలా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. మహిళా, యువ పారిశ్రామికవేత్తలు, రైతులు, మత్స్యకారులు, స్టార్టప్లు ఎంఎస్ఎంఈలు ఆవిష్కరణను ప్రోత్సహించే, సుస్థిర ఆచరణలకు మద్దతిచ్చే, సుంకాలతో సంబంధం లేని అడ్డంకులను తగ్గించే నిబంధనల ద్వారా అంతర్జాతీయ విలువ వ్యవస్థలతో అనుసంధానం కానున్నారు.
సీఈటీఏ ఒప్పందం వల్ల రాబోయే సంవత్సరాలలో వాణిజ్య స్థాయి గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ, ఎగుమతులు విస్తరిస్తూ, భారత్, బ్రిటన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
***
(Release ID: 2148129)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Kannada
,
Malayalam