సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఏఐ ఆధారిత బహుభాషా పరిష్కారాల అన్వేషణలో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు
‘వేవ్ఎక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్’ కింద ‘భాషాసేతు’ పోటీ గడువు 2025 జూలై 30 వరకు పొడిగింపు
సార్వజనీన... స్వదేశీ డిజిటల్ పరిపాలన కోసం ప్రత్యక్ష భాషానువాద పరిష్కారాలను వేగిరపరచడమే ఈ ప్రభుత్వ కార్యక్రమ లక్ష్యం
Posted On:
22 JUL 2025 6:59PM by PIB Hyderabad
డిజిటల్ పరిపాలన విధానాల్లో భారత్ ముందంజ వేస్తున్నకొద్దీ, పౌరుల మాతృభాషలో ప్రత్యక్ష సమాచార ఆదానప్రదానం అత్యంత కీలకం. ఇది మరింత భారీ స్థాయిలో, సత్వరం విస్తరించేలా భాషా వ్యత్యాసాల తగ్గింపు, సమగ్ర-చివరి అంచెదాకా సమాచార ప్రదానం కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పరిష్కారాల అన్వేషణ అవశ్యం.
దేశంలో భాషా వైవిధ్యం దిశగా ‘ఏఐ’ సామర్థ్యం సద్వినియోగానికి వీలుగా ‘వేవ్ఎక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్’ కింద 'భాషా సేతు' పోటీలో భాగంగా నమూనా పరిష్కార ఎంట్రీల సమర్పణకు గడువును సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ 2025 జూలై 30దాకా పొడిగించింది.
“భాషా సేతు రియల్-టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్” ఇతివృత్తంగా అంకుర సంస్థల స్థాయిలో ఈ పోటీ ఉంటుంది. ఇందులో భాగంగా ఏవైనా 12 భారతీయ భాషలలో ప్రత్యక్ష అనువాదం, లిప్యంతరీకరణ, గళ స్థానికీకరణ లక్ష్యంగా ‘ఏఐ ఆధారిత ఉపకరణాల రూపకల్పన నమూనాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ పోటీలో వర్ధమాన అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు తమ నమూనాలను మరింత మెరుగుపరిచేందుకు అనువుగా గడువు పొడిగింపు ద్వారా తగిన సమయమిచ్చింది.
భాషా సేతు ఛాలెంజ్
భాషా సేతు ఛాలెంజ్ 2025 జూన్ 30న ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా ఆరంభ దశలోని అంకుర సంస్థలు, సాంకేతికతల రూపకర్తలలో ఆసక్తి గణనీయ స్థాయిలో పెరిగింది. ఈ పోటీ సార్వజనీన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమేగాక ఓపెన్ సోర్స్ లేదా స్వల్ప వ్యయంతో లభించే ‘ఏఐ’ సాంకేతికతల వినియోగానికి చేయూతనిస్తుంది. అదే సమయంలో అందుబాటు, సౌలభ్యం చేయగల స్వీయ నమూనాలను కూడా స్వాగతిస్తారు.
ఆసక్తిగల పోటీదారులు వేవ్ఎక్స్ అధికార పోర్టల్ https://wavex.wavesbazaar.com ద్వారా తమ నమూనాలతో నమోదు చేసుకోవచ్చు.
వేవ్ఎక్స్ గురించి
‘వేవ్ఎక్స్’ అన్నది ‘వేవ్స్’ కార్యక్రమం కింద సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక అంకుర సంస్థల సంవర్ధక వేదిక (స్టార్టప్ యాక్సిలరేటర్). మీడియా, వినోదం, భాషా సాంకేతికతలలో ఆవిష్కరణల పెంపు దీని లక్ష్యం. ముంబయిలో నిర్వహించిన ‘వేవ్స్-2025’లో భాగంగా పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలు, సాంకేతిక అగ్రగామి సంస్థల ప్రతినిధుల సమక్షంలో 30కి పైగా అంకుర సంస్థలు తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఆ తర్వాత కూడా ‘హ్యాకథాన్, మెంటార్షిప్, నేషనల్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్’ తదితరాల ద్వారా తదుపరి తరం ఆవిష్కర్తలకు ‘వేవ్ఎక్స్’ సాధికారత కల్పిస్తూనే ఉంది.
ప్రస్తుతం ‘వేవ్ఎక్స్’ కింద భాషా సేతు (ఏఐ ఆధారిత భాషానువాదం), ‘కళా సేతు’ (ఏఐ ఆధారిత సారాంశ సృష్టి) పేరిట రెండురకాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ రెండింటిలో పాల్గొనే ఔత్సాహికుల కోసం పోటీ గడువును 2025 జూలై 30గా నిర్ణయించారు.
***
(Release ID: 2147083)