రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వేల్లో భారీగా ఉద్యోగాలు: మొదటి త్రైమాసికంలో 9,000 మందికి ఉద్యోగాలు
2025-26 ఆర్థిక సంవత్సరంలో 50,000 ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రణాళిక
2024 నుంచి 1.08 లక్షల ఖాళీల ప్రకటన.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 50,000 నియామకాలు
పరీక్షలు సజావుగా జరిగేలా చూసేందుకు అభ్యర్థుల గుర్తింపు కోసం ఆధార్...
ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసం చేసే అవకాశాన్ని తొలగించేందుకు జామర్లను వినియోగిస్తోన్న రైల్వే శాఖ
Posted On:
09 JUL 2025 8:33PM by PIB Hyderabad
55197 ఖాళీలతో కూడిన ఏడు వేర్వేరు నోటిఫికేషన్ల కోసం నవంబర్ 2024 నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ఆర్బీ)... 1.86 కోట్లకు పైగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ఇది వీలు కల్పిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇప్పటికే 9000 కంటే ఎక్కువ నియామక పత్రాలను ఆర్ఆర్బీలు జారీ చేశాయి.
ఆర్ఆర్బీ పరీక్షల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించడం అనేది ప్రణాళిక, సమన్వయంతో కూడుకున్న పెద్ద పని. అభ్యర్థుల నివాస స్థలాలకు దగ్గరగా పరీక్షా కేంద్రాలను కేటాయించాలని, ఈ విషయంలో మహిళ, దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్ఆర్బీలు ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయానికి అనుగుణంగా పూర్తి పారదర్శకత, ఎవరికి అన్యాయం జరగకుండా పరీక్ష నిర్వహించేందుకు మరిన్ని పరీక్షా కేంద్రాలను, మానవ వనరులను సమకూర్చుకోవటం అవసరమవుతుంది.
ఆర్ఆర్బీలు ప్రచురించిన వార్షిక క్యాలెండర్ ప్రకారం 2024 నుంచి 1,08,324 ఖాళీలకు సంబంధించి పన్నెండు నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ అయ్యాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో అదనంగా 50,000 కంటే ఎక్కువ నియామకాలను ఆర్ఆర్బీలు చేపట్టనున్నాయి.
పరీక్షల నిష్పాక్షికతను పెంచేందుకు అభ్యర్థులను గుర్తించేందుకు ఆధార్ ఈ-కేవైసీని మొదటిసారిగా ఉపయోగించారు. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులున్న పరీక్షలో ఇది 95 శాతం కంటే ఎక్కువ విజయవంతమైంది. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసం చేసే అవకాశాన్ని తొలగించడానికి అన్ని పరీక్షా కేంద్రాలలో 100 శాతం జామర్లను ఇప్పుడు ఆర్ఆర్బీలు వినియోగిస్తున్నాయి.
***
(Release ID: 2143624)