ప్రధాన మంత్రి కార్యాలయం
ఘనా అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
Posted On:
03 JUL 2025 1:15AM by PIB Hyderabad
ఘనా అధ్యక్షుడు డాక్టర్ జాన్ డ్రమానీ మహామాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. జూబ్లీ హౌస్కు చేరుకున్న ప్రధానికి అధ్యక్షుడు మహామా స్వాగతం పలికారు. గడచిన మూడు దశాబ్దాల్లో ఘనాలో అధికారికంగా ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి.
పరిమితమైన, ప్రతినిధి స్థాయిలో జరిగిన సమావేశాల్లో ఇద్దరు నాయకులు విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను సమగ్ర భాగస్వామ్యంగా మార్చేందుకు వారు అంగీకరించారు. భారత్, ఘనా దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంబంధాలను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, సామర్థ్య నిర్మాణం, డిజిటల్ టెక్నాలజీ, మౌలిక వసతులు, యూపీఐ, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు తదితర కీలకమైన రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. పెరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యం, ఘనాలో భారత్ పెట్టుబడులను వారు స్వాగతించారు. రక్షణ, భద్రతా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై నాయకులిద్దరూ చర్చించారు. అభివృద్ధి సహకార భాగస్వామ్యాన్ని ముఖ్యంగా భారత్ మద్దతు ఇస్తున్న మౌలిక వసతులు, సామర్థ్య నిర్మాణ ప్రాజెక్టులను మరింత బలోపేతం చేయడానికి వారు కట్టుబడి ఉన్నారు. ఆరోగ్యం, ఫార్మా, డిజిటల్ ప్రజా మౌలిక వసతులు, యూపీఐ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ ముందుకొచ్చింది. గ్లోబల్ సౌత్ ఆందోళనలను వినిపించడంలో భారత్ నిబద్దతను ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ విషయంలో ఘనా అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఘనాలో నివసిస్తున్న 15,000 మంది భారతీయులను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు అధ్యక్షుడు మహామాకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఐక్యరాజ్యసమితి సంస్కరణలతో సహా ఉమ్మడి ఆసక్తి ఉన్న అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించారు. పహల్గాం ఉగ్రదాడి సమయంలో మద్దతు, సంఘీభావం తెలియజేసిన అధ్యక్షుడు మహామాకు ప్రధాని ధన్యవాదాలు చెప్పారు. ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో సభ్యత్వం, కామన్వెల్త్ కార్యదర్శిగా ఘనా విదేశాంగ మంత్రి ఎన్నికవడంతో సహా అంతర్జాతీయంగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటున్న ఘనాకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్య విలువలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం, సుస్థిరాభివృద్ధి, ప్రపంచ శాంతి విషయంలో ఉమ్మడి లక్ష్యానికి కట్టుబడి ఉంటామని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు.
ప్రతనిధి స్థాయి చర్చల అనంతరం సంస్కృతి, ప్రామాణికాలు, ఆయుర్వేద-సంప్రదాయ ఔషధాలు, విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి సంయుక్త కమిషన్ వ్యవస్థకు సంబంధించిన నాలుగు ఎంవోయూలను పరస్పరం మార్చుకున్నారు. ప్రధానమంత్రి గౌరవార్ధం అధ్యక్షడు మహామా అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఆయన ఆతిథ్యానికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరికీ అనుకూలమైన సమయంలో భారత్ను సందర్శించాలని అధ్యక్షుడు మహామాను ప్రధాని ఆహ్వానించారు.
***
(Release ID: 2141726)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam