యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మై భారత్ పోర్టల్‌తో వాట్సాప్ చాట్‌బాట్ సంధానాన్ని ప్రారంభించిన యువజన వ్యవహారాల శాఖ...


యువత భాగస్వామ్యాన్ని, అనుభవాన్ని పెంచడం ముఖ్యోద్దేశం

Posted On: 27 JUN 2025 11:09AM by PIB Hyderabad

మై భారత్ పోర్టల్‌ ( https://mybharat.gov.in )తో వాట్సాప్ సంధానాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది మన దేశ యువతకు డిజిటల్ సంధానాన్ని ఇప్పటి కంటే మరింత పెంచడంతో పాటు, వారికి వివిధ సేవల అందుబాటును సులభతరం చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఓ ప్రగతిశీల నిర్ణయం.

వాట్సాప్ చాట్‌బాట్ ప్రస్తుతం పనిచేయడం మొదలుపెట్టింది. దీనిని నేరుగా వాట్సాప్ మాధ్యమం ద్వారా (నెంబరు 7289001515) కూడా అందుకోవచ్చు.  దీంతో యూజర్లు మరింత సౌలభ్యంతో కూడిన, వాస్తవ కాల ప్రాతిపదిక కలిగిన, యూజర్-ఫ్రెండ్లీ సరళిలో ఈ వేదికతో సంప్రదింపులు జరపొచ్చు. అంతేకాదు, మై భారత్‌లో నమోదు అయి ఉన్న యూజర్లందరి కోసం ప్రధాన ఫీచర్లను కొన్నింటిని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో వారికి అనుభవపూర్వక శిక్షణ పొందే కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవలో పాల్గొనే అవకాశాలు, సీవీని రూపొందించుకోవడం, సలహాలు పొందడం, సంస్థలో చేరడం గాని లేదా సంస్థను ఏర్పాటు చేయడం గాని, ఏవైనా అంశాలను రిపోర్టు చేయడం.. వీటితో పాటు మైభారత్ సేవను అందుకోవడానికి అనుమతి లభిస్తుంది.  

వాట్సాప్ చాట్‌బాట్‌లో కార్యక్రమాన్ని ఆరంభించడానికి ముందుగా 7289001515 నెంబరుకు ‘హాయ్’ అనే సందేశాన్ని పంపించాలి. ఓటీపీ ద్వారా ఎవరు లాగిన్ అయిందీ గుర్తిస్తారు. అప్పుడు చాట్ మొదలుపెట్టొచ్చు.

త్వరలో జారీ చేసే ప్రకటనల్లో అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేయనున్నారు.  ఉదాహరణకు, ఇన్-యాప్ నమోదులు, డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం ఉండే   నోటిఫికేషన్లు, విషయాలను గుర్తు చేసే సందేశాలు, తదుపరి చర్యల సందేశాలు, ప్రొఫైల్, ఇంకా అప్పగించిన పనిని పూర్తి చేయడం.. ఇలాంటివి. లావాదేవీలకు సంబంధించిన సేవలకు తోడు, ఆటోమేటెడ్ రిమైండర్లను , సర్టిఫికెట్లను పంపించడానికి, ఇతరత్రా డాక్యుమెంట్లను పంచుకోవడానికి, నియమ పాలన విషయంలో అప్రమత్తం చేసే సందేశాల కోసం చాట్‌బాట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది యువతకు విషయాలను తెలియజేస్తూ, వారిని క్రియాశీల భాగస్వాములను చేయడానికి ప్రచార ఉద్యమ సామగ్రిని, కార్యక్రమ ముఖ్యాంశాలను, ప్రభుత్వ పథకాల గురించిన అత్యంత తాజా సమాచారాన్ని, అత్యుత్తమ అభ్యాసాలను అందించడంతో పాటు టూల్ కిట్స్‌తో వివరణలు అందిస్తూ ఉంటుంది.
 
యువజనులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు:

     • వాట్సాప్ ద్వారా మై భారత్ సేవలను అందుకొనేందుకు మార్గం సుగమం అవుతుంది.
     • వేగవంతమైన ఆన్‌బోర్డింగ్ సదుపాయం, కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, దరఖాస్తు ఏ స్థితిలో ఉందీ తెలుసుకొనే వీలు.
     • తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకుంటూ ఉండవచ్చు, విషయాన్ని మళ్లీ ఓసారి గుర్తు చేసే సందేశాలు అందుకోవచ్చు.
     • సమస్యను తేలికగా దృష్టికి తీసుకువెళ్లవచ్చు, పరిష్కారాన్ని పొందవచ్చు.
     • అవకాశాలు, పథకాలు, ఉత్తమ పద్ధతులను తెలుసుకుంటూ ఉండొచ్చు.
     • జాతీయ కార్యక్రమాలతో జతపడటానికి పరిచితమైన, మొబైల్-ఫస్ట్ ఇంటర్‌ఫేస్ అందుబాటులో ఉంటుంది.
     • యువతకు సాధికారతను కల్పించాలన్న మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ సంధానం బలపరుస్తుంది. దీనిలో భాగంగా  సార్వజనిక సేవలను వారు ఎక్కువ సార్లు ఉపయోగించే డిజిటల్ వేదికలతో సంధానిస్తారు. ఫలితంగా వారు సంధానం కావడం, భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో పాటు విషయాలు తెలుసుకుంటూ ఉండడం సులభతరంగా మారతాయి.

మై భారత్ (MY Bharat) ఒక సాంకేతిక వేదిక. యువజన వ్యవహారాల విభాగం (డీఓవైఓ) దీనికి రూపకల్పన చేయగా, కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) అభివృద్ధిపరిచింది. వ్యవస్థలో దేశ యువ శక్తి  భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయడానికి ఒక సంస్థాగత ప్రక్రియను ఏర్పరచే ఉద్దేశంతో ఈ పోర్టల్‌ను తీసుకువచ్చారు. భారతీయ నాగరికతలో కీలకంగా ఉన్న ‘సేవాభావం’, ‘కర్తవ్య బోధ’ సిద్ధాంతాల్ని యువతలో అలవరచి వారికి సాధికారతను కల్పించడం ఈ పోర్టల్ ప్రధానోద్దేశం. ఇది వివిధ స్వచ్ఛంద, జ్ఞానార్జన కార్యకలాపాల్లో పాలుపంచుకోవడానికి, నిపుణుల నుంచి సూచనలు-సలహాలను పొందడానికి, యువత ప్రొఫైల్‌తో పాటు సీవీని సిద్ధం చేసుకోవడానికి, తోటి యువజనులతో సంధానం కావడానికి, ఇతరత్రా సామర్థ్యాలను పెంచుకొనే కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలను అందిస్తుంది.‌

 

**‌*


(Release ID: 2140127)