మంత్రిమండలి
పూణే మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు కేబినెట్ ఆమోదం: వనాజ్ నుంచి చాందనీ చౌక్ వరకు (కారిడార్ 2ఏ), రాంవాడీ నుంచి వాఘోలీ/విఠల్వాడీ వరకు (కారిడార్ 2బీ).. ఇప్పుడున్న మొదటి దశ మెట్రో (వనాజ్ – రాంవాడీ)
Posted On:
25 JUN 2025 3:08PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పూణే మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు ఆమోదం తెలిపింది. మొదటి దశలోని వనాజ్-రాంవాడీ కారిడార్కు పొడిగింపుగా.. వనాజ్ నుంచి చాందనీ చౌక్ వరకు (కారిడార్ 2ఏ), రాంవాడీ నుంచి వాఘోలీ/విఠల్ వాడీ వరకు (కారిడార్ 2బీ) రెండో దశలో పనులు చేపడతారు. విస్తరించనున్న ఈ రెండు కారిడార్ల పొడవు 12.75 కి.మీ. వీటిలో 13 స్టేషన్లు వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలైన చాందనీ చౌక్, బావ్ధాన్, కొత్రూడ్, ఖరాడీ, వాఘోలీలను అనుసంధానించేలా రూపొందించారు. ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3626.24 కోట్లు. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం, ఇతర ద్వైపాక్షిక/బహుపాక్షిక సంస్థలు ఈ వ్యయాన్ని సమానంగా భరిస్తాయి. ఈ వ్యూహాత్మక ప్రతిపాదనను ప్రస్తుత కారిడార్–2కు విస్తరణగా చెప్పవచ్చు. సమగ్ర ప్రయాణ ప్రణాళిక (సీఎంపీ)కు అనుగుణంగా దీనిని రూపొందించారు. పూణేలో తూర్పు- పశ్చిమ ప్రాంతాల్లో ప్రజలకు ప్రయాణ సదుపాయాన్ని మెరుగుపరిచేలా చాందనీ చౌక్ నుంచి వాఘోలీ వరకు ఒకే మెట్రో కారిడార్ ఏర్పాటు ఈ ప్రణాళికలో భాగం.
ఈ విస్తరణలు కీలకమైన ఐటీ కూడళ్లు, వాణిజ్య ప్రాంతాలు, విద్యా సంస్థలు, నివాస ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది ప్రజా రవాణా వ్యవస్థ వాటాను, అందులో ప్రయాణికుల సంఖ్యను పెంచుతుంది. కొత్త కారిడార్లు జిల్లా కోర్టు ఇంటర్చేంజ్ స్టేషన్ వద్ద లైన్ -1 (నిగ్డీ-కాట్రాజ్), లైన్ -3 (హింజేవాడి-జిల్లా కోర్టు)తో అనుసంధానమవుతూ.. పట్టణ ప్రాంతాల్లో అంతరాయం లేకుండా వివిధ రకాల ప్రయాణానికి అవకాశం కల్పిస్తాయి.
దీర్ఘకాలిక రవాణా ప్రణాళిక కింద- ముంబయి, బెంగళూరు వంటి నగరాల నుంచి ఇంటర్సిటీ బస్సులు చాందనీ చౌక్ వద్దకు.. మరోవైపు అహల్యా నగర్, ఛత్రపతి శంభాజీ నగర్ నుంచి వచ్చే బస్సులు వాఘోలీ వద్దకు చేరుతాయి. ఇది పూణే మెట్రో సేవలను ప్రయాణికులను మరింత అందుబాటులోకి తెస్తుంది. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే పౌడ్ రోడ్డు, నగర్ రోడ్లలో రద్దీని తగ్గించడానికి కూడా ఈ కారిడార్ల పొడిగింపు దోహదపడుతుంది. సురక్షితమైన, వేగవంతమైన, పర్యావరణ అనుకూల ప్రయాణ అవకాశాలను అందిస్తుంది.
ఈ కారిడార్లు పూర్తయితే మొత్తం లైన్-2లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2027లో 0.96 లక్షలు, 2037లో 2.01 లక్షలు, 2047లో 2.87 లక్షలు, 2057లో 3.49 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (మహా-మెట్రో) అమలు చేస్తుంది. అన్ని సివిల్, ఎలక్ట్రో-మెకానికల్, సంబంధిత పనులను ఇది నిర్వహిస్తుంది. స్థలం కోసం సర్వే, విస్పష్టమైన డిజైన్ సంప్రదింపుల వంటి నిర్మాణ పూర్వ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఈ వ్యూహాత్మక విస్తరణ పూణే ఆర్థిక సామర్థ్యాన్ని చాటడంతోపాటు పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నగరంలో సుస్థిర, సమ్మిళిత అభివృద్ధికి విశేషంగా దోహదం చేస్తుంది.

***
(Release ID: 2139716)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Nepali
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam