యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
నవంబరులో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2025
రాజస్తాన్లో నిర్వహించనున్నట్లు ప్రకటించిన క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
పూర్ణిమ విశ్వవిద్యాలయం, రాజస్థాన్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా నిర్వహించనున్న అండర్-25 క్రీడల్లో 4,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని అంచనా.
Posted On:
25 JUN 2025 6:26PM by PIB Hyderabad
జైపూర్ వేదికగా నవంబరులో పూర్ణిమ విశ్వవిద్యాలయం, రాజస్థాన్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2025ను నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించారు. 2020 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఇవి అయిదో గేమ్స్.
ఈ బహుళ-క్రీడా పోటీల్లో 200కు పైగా విశ్వవిద్యాలయాల నుంచి 4,000ల కంటే ఎక్కువ మంది అథ్లెట్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. మునుపటి ఎడిషన్ల మాదిరిగానే, కేఐయూజీ-2025లోనూ కనీసం 20 క్రీడాంశాలు ఉండనున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహించిన కేఐయూజీ-2024 పోటీల్లో చండీగఢ్ విశ్వవిద్యాలయం టీమ్ ఛాంపియన్షిప్లను గెలుచుకుంది.
"ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రాజస్థాన్ వేదికగా 2025 నవంబరులో నిర్వహించనున్నట్లు ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మే నెలలో బీహార్ వేదికగా నిర్వహించిన అండర్-18 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తర్వాత ఈ క్రీడలను అండర్-25 అథ్లెట్ల కోసం నిర్వహించనున్నాం. దేశంలోని అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించడంలో భాగంగా, జాతీయస్థాయి వేదికను కోరుకునే అథ్లెట్లకు ఈ క్రీడలు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి" అని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
కేఐయూజీ-2024 అథ్లెటిక్స్ విభాగంలో ఎనిమిది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ స్థాయి రికార్డులు నమోదయ్యాయి. వాటిలో అయిదు రికార్డులు పురుషులే నమోదు చేశారు. “ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల విద్యార్థులు బహుళ-క్రీడా కార్యక్రమాల్లో ఆధిపత్యం కనబరుస్తున్నారు. రాజస్థాన్ వేదికగా అథ్లెట్లు అత్యుత్తమ ఆటతీరు కనబరిచే నాణ్యమైన ప్రదర్శనలను చూడాలని మేం ఆశిస్తున్నాం” అని డాక్టర్ మాండవీయ వ్యాఖ్యానించారు.
ఈశాన్య భారత్లో నిర్వహించిన కేఐయూజీ-2024 పోటీల్లో 240 స్వర్ణ, 240 రజత, 290 కాంస్య పతకాలు సహా మొత్తం 770 పతకాలను విజేతలకు ప్రదానం చేశారు. కేఐయూజీ-2024 టైటిల్ కోసం 20 క్రీడాంశాల్లో 200లకు పైగా విశ్వవిద్యాలయాల నుంచి 4500లకు పైగా విద్యార్థులు పోటీపడ్డారు.
ఈత విభాగంలో ఉత్కళ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రత్యాస రే నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలుపొంది అత్యంత విజయవంతమైన మహిళా అథ్లెట్గా నిలిచారు. జైన్ విశ్వవిద్యాలయానికి చెందిన జేవియర్ మైఖేల్ డిసౌజా నాలుగు స్వర్ణ పతకాలు గెలుచుకుని అత్యంత విజయవంతమైన పురుష అథ్లెట్గా నిలిచారు.
కేఐయూజీ-2024లో 20 స్వర్ణాలు, 14 రజతాలు, ఎనిమిది కాంస్యాలతో మొత్తం 42 పతకాలు సాధించిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ రెండో స్థానంలో.. అమృత్సర్లోని గురు నానక్ దేవ్ యూనివర్సిటీ 12 స్వర్ణాలు, 20 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తం 51 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి.
***
(Release ID: 2139713)