రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

చైనాలోని చింగ్‌డావ్‌లో ఎస్‌సీఓ రక్షణ శాఖ మంత్రుల సమావేశం... పాల్గొననున్న కేంద్ర రక్షణ మంత్రి


• ప్రపంచ శాంతి, భద్రతలపై భారత్ దృష్టికోణాన్ని వివరించనున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్...

ఎస్‌సీఓ సభ్యదేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, సంధానం వృద్ధి చెందేందుకు వీలుగా

ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఉమ్మడి ప్రయత్నాలు చేద్దామని పిలుపు ఇవ్వనున్న రక్షణ మంత్రి

• చైనా, రష్యాలు సహా సమావేశంలో పాల్గొనే దేశాల మంత్రులు కొందరితో
ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్న రక్షణ మంత్రి

Posted On: 24 JUN 2025 11:03AM by PIB Hyderabad

చైనాలోని చింగ్‌డావ్‌లో ఈ నెల 25, 26లలో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్య దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో భారత్ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. ఆయన మన దేశ ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహిస్తారు.

సమావేశం సందర్భంగా, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి-భద్రతలు, ఉగ్రవాదాన్ని నిరోధించే ప్రయత్నాలతో పాటు ఎస్‌సీఓ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య సహకారం సహా అనేక అంశాలపై రక్షణ మంత్రులు చర్చించవచ్చన్న సూచనలు ఉన్నాయి.

ఎస్‌సీఓ సిద్ధాంతాలతో పాటు ఆదేశాల పట్ల భారత్ తన నిబద్ధతను మన రక్షణ మంత్రి మరో సారి చాటిచెప్పడంతో పాటు, అంతర్జాతీయ శాంతి, భద్రతలను ఇప్పటి స్థాయిల కన్నా ఎక్కువగా పరిరక్షిస్తూ ఉండే విషయంలో మన దేశ దృష్టికోణాన్ని కూడా వివరిస్తారని భావిస్తున్నారు. ఎస్‌సీఓ సభ్యదేశాల్లో ఉగ్రవాదాన్నీ, తీవ్రవాదాన్నీ నిర్మూలించడానికి ఒకే విధమైన, సమష్టి ప్రయత్నాలు చేస్తూ ఉండాలని ఆయన పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఎస్‌సీఓ దేశాల మధ్య వాణిజ్యాన్నీ, ఆర్థిక సహకారాన్నీ, సంధానాన్నీ ఇప్పటి స్థాయిల కన్నా మరింత పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన స్పష్టం చేయవచ్చు. సమావేశం సందర్బంగా చైనా, రష్యా సహా, ఈ సమావేశంలో పాల్గొనే దేశాల్లో కొన్ని దేశాల రక్షణ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలను ఆయన నిర్వహించనున్నారు.

ఎస్‌సీఓ ప్రాంత పరిధిలో బహు పార్శ్విక వాదం, రాజకీయ, భద్రతాపరమైన, ఆర్థిక సంబంధాలతో పాటు సభ్యదేశాలన్నిటి ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందింప చేయడంలో ఎస్‌సీఓకు భారత్ ప్రత్యేక ప్రాధాన్యాన్ని కట్టబెడుతోంది. సభ్య దేశాలన్నింటి మధ్య సమానత్వం, అవగాహన, పరస్పర గౌరవం, ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోక పోవడం, దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం.. ఈ సిద్ధాంతాలు ప్రాతిపదికగా ఎస్‌సీఓ పనిచేస్తోంది.

ఎస్‌సీఓ ఒక అంతర్-ప్రభుత్వ సంస్థ. దీనిని 2001లో ఏర్పాటు చేశారు. భారత్ 2017లో పూర్తి కాలపు సభ్యదేశంగా మారి, వంతులవారీగా లభించే అధ్యక్ష పదవీబాధ్యతలను 2023లో చేపట్టింది. ఎస్‌సీఓ సభ్యదేశాల్లో కజక్‌స్థాన్, చైనా, కిర్గిజ్‌స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్‌లతో పాటు భారత్ కూడా ఒక సభ్యదేశంగా ఉంది. ‘షాంఘై స్ఫూర్తిని నిలబెట్టే మార్గంలో ఎస్‌సీఓ పయనం’.. ఈ ఇతివృత్తంలో భాగంగా 2025 సంవత్సరానికి అధ్యక్ష పదవీబాధ్యతలను చైనా చేపట్టింది. ‌


 

**‌‌*


(Release ID: 2139153)