ఆయుష్
యోగా సంగం కోసం రికార్డు సంఖ్యలో 4 లక్షలకు మించిన రిజిస్ట్రేషన్లు: చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్న కార్యక్రమం
1 లక్షకు పైగా ప్రాంతాల్లో ఉత్సవ నిర్వహణ తలపెట్టిన రాజస్థాన్ రాష్ట్రం మొదటిస్థానంలో
1 లక్షకు మించిన యోగా కార్యక్రమాలు, భారీ ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
Posted On:
18 JUN 2025 12:46PM by PIB Hyderabad
ఆరోగ్య సంక్షేమం కోసం సమష్టి ప్రయత్నానికి తార్కాణంగా నిలుస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై-2025)లో ప్రధాన కార్యక్రమం అయిన యోగా సంగమం కోసం రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయిలో 4 లక్షలను దాటాయి. సంప్రదాయ ఆరోగ్య సూత్రాల ద్వారా సమగ్ర ఆరోగ్య రక్షణ సాధన అనే లక్ష్యానికి భారత్ మార్గదర్శిగా నిలుస్తోందని ఈ సంఖ్య స్పష్టంగా తెలియజేస్తోంది. ఇంతవరకూ దేశంలో చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇంత అసాధారణ స్థాయిలో ప్రజల నిర్థారిత భాగస్వామ్యాన్ని పొందలేదన్నది గమనార్హం.
జూన్ 21న దేశవ్యాప్తంగా లక్షలాది ప్రదేశాలలో ఏకకాలంలో లయాత్మక యోగా ప్రదర్శన జరుగుతుంది – దేశ ఆరోగ్య సంక్షేమ ప్రయాణంలో ఇదొక గొప్ప మైలురాయిగా నిలువనుంది. దేశవ్యాప్త ఉద్యమంగా మారిన ఈ కార్యక్రమ అత్యంత విశిష్ట ప్రదర్శన విశాఖపట్నంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర)... ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్, 5 లక్షలకు పైగా యోగా ఔత్సాహికులు పాల్గొనే ఉమ్మడి యోగా ప్రోటోకాల్ (సీఐపీ) కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు.
2025 జూన్ 21న ఉదయం 6:30 నుండి 7:45 వరకు జరగనున్న యోగా సంగమం, ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సామూహిక యోగా కార్యక్రమాల్లో ఒకటిగా మారనుంది. లక్షలాది సంస్థలు, సంఘాలకు చెందిన వారు ఏకకాలంలో తమ యోగా చాపలను నేలపై పరిచి ఆసనాలు వేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.
1,38,033 సంస్థల నమోదుతో రాజస్థాన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూండగా, తరువాతి స్థానాల్లో నిలిచిన రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య:
ఆంధ్రప్రదేశ్: 1,38,033
ఉత్తరప్రదేశ్: 1,01,767
మధ్యప్రదేశ్: 26,159
గుజరాత్: 19,951
హిమాచల్ ప్రదేశ్: 12,000
'ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా' అన్న ఈ సంవత్సరం ఇతివృత్తానికి లభించిన విస్తృత ఆమోదాన్ని ఈ భారీ భాగస్వామ్యం ప్రతిబింబిస్తోంది. ప్రపంచ సుస్థిరత, వ్యక్తిగత శ్రేయస్సుతో యోగాను అనుసంధానించే సందేశమిది.
ఈ కార్యక్రమంలో చురుకుగా పాలుపంచుకోవాలన్న పిలుపునకు అటు ఐఐటీలు, ఐఐఎంల నుంచి క్షేత్రస్థాయిలోని ఎన్జీవోలు, దిగ్గజ కార్పొరేట్ సంస్థలు, వివిధ రంగాలకు చెందిన అనేక సంస్థలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమానికి యోగా సంగం అధికారిక పోర్టల్ (https://yoga.ayush.gov.in/yoga-sangam) అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది.
యోగా సంగంలో పాల్గొనే పద్ధతి:
· https://yoga.ayush.gov.in/yoga-sangam ను సందర్శించండి.
· మీ బృందం లేదా సంస్థ పేరును నమోదు చేయండి.
· గౌరవ ప్రధానమంత్రి ఉదయం 6:30 నుంచి 7:00 వరకూ చేసే ప్రసంగాన్ని లైవ్ స్ట్రీమ్ చేయండి. 7.00 నుంచి 7.45 వరకూ యోగా కార్యక్రమాన్ని నిర్వహించండి.
· అన్ని వివరాలతో కూడిన మీ ఈవెంట్ ను అప్లోడ్ చేయండి. అధికారిక ప్రశంసా పత్రాన్ని పొందండి.
4 లక్షలకు పైగా సంస్థల భాగస్వామ్యంతో ఉద్యమం పరిపుష్టమవుతోంది... ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ చరిత్రాత్మక క్షణాల్లో భాగం కావాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తోంది. చక్కని ఆరోగ్యం, శాంతి, మెరుగైన భవిష్యత్తుల కోసం యోగా అనే సాధనం ద్వారా మనం ఐక్యంగా అడుగులు వేద్దాం.
***
(Release ID: 2137253)