రైల్వే మంత్రిత్వ శాఖ
జూలై 1 నుంచి ఆధార్ ధ్రువీకరణతోనే ఐఆర్సీటీసీ, యాప్ ద్వారా తత్కాల్ టికెట్లు
* ఏసీ, నాన్-ఏసీ తరగతులకు మొదటి 30 నిమిషాలూ ఏజంట్ బుకింగ్ ఉండదు
* ఆన్ లైన్, పీఆర్ఎస్ కౌంటర్ల ద్వారా తత్కాల్ కు జూలై 15 నుంచీ ఓటీపీ ధ్రువీకరణ
Posted On:
11 JUN 2025 4:27PM by PIB Hyderabad
తత్కాల్ టికెట్ల అందుబాటును నిష్పాక్షికంగా, పారదర్శకంగా తీర్చిదిద్దాలన్న, వాస్తవ ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశాలతో తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే కీలక మార్పులు చేసింది. ప్రయాణికుడి ప్రమాణీకరణ ప్రక్రియను పక్కగా తీర్చిదిద్దడంతో పాటుగా ఈ పథకాన్ని దుర్వినియోగపరచడాన్ని తగ్గించడం ఈ మార్పుల ధ్యేయం.
కొత్త నిబంధనలు ఈ కింది విధంగా ఉన్నాయి:
1. ఆన్లైన్లో చేసుకొనే తత్కాల్ టిక్కెట్లకు ‘ఆధార్’ ప్రమాణీకరణ:
రాబోయే నెల (2025 జులై)లో 1వ తేదీ మొదలు... ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే తత్కాల్ టికెట్లు ఆధార్ ప్రమాణికరణను పూర్తి చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
దీనికి అదనంగా, 2025 జులై 15 మొదలు, ఆన్లైన్ మాధ్యమంలో తత్కాల్ పద్ధతిలో పొందే టిక్కెట్లకు ‘ఆధార్’ ప్రాతిపదికన ఓటీపీ ప్రమాణికరణ తప్పనిసరి అయిపోతుంది.
2. పీఆర్ఎస్ కౌంటర్ల వద్ద, ఏజెంట్ల వద్ద కంప్యూటర్ -ఆధారిత ఓటీపీ ప్రమాణీకరణ:
అధీకృత ఏజెంట్ల ద్వారానూ, కంప్యూటర్ల ఆధారిత ప్రయాణికుల రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)లోనూ టిక్కెట్లను తీసుకునే సమయంలో మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీని వినియోగదారు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నిబంధన కూడా వచ్చే నెల (2025 జులై) 15 నుంచి అమలులోకి రానుంది.
3. ఆథరైజ్డ్ ఏజెంట్లకు బుకింగ్ కాలానికి సంబంధించిన పరిమితులు:
బుకింగ్ మొదలైన మొదటి 30 నిమిషాలపాటు తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి భారతీయ రైల్వేల అధికృత టికెటింగ్ ఏజెంట్లను అనుమతించరు.
ఏసీ తరగతులకు, ఈ పరిమితి ఉదయం 10:00 గంటల నుంచి 10:30 వరకు వర్తిస్తే, నాన్-ఏసీ తరగతులకు ఈ పరిమితి ఉదయం 11:00 గంటల నుంచి 11:30 వరకు వర్తిస్తుంది.
తత్కాల్ టిక్కెట్ల విషయంలో పారదర్శకతను పెంచడంతో పాటు పథకం ప్రయోజనాలు సిసలైన అంతిమ వినియోగదారులకు అందేటట్లు చూడడానికి ఈ మార్పులను అమలుచేస్తున్నారు.
సిస్టమ్లో అవసరమైన మేరకు మార్పులు చేయాల్సిందిగా అన్ని ప్రాంతీయ రైల్వేలకు, సంబంధిత విభాగాలకు తదనుగుణంగా సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా సీఆర్ఐఎస్కు, ఐఆర్సీటీసీకి ఆదేశాలు ఇచ్చారు.
ఈ మార్పులను ప్రయాణికులు గమనించడంతో పాటు, అసౌకర్యానికి గురి కాకుండా ఉండేందుకు వారి ఐఆర్సీటీసీ యూజర్ ప్రొఫైల్స్ను ఆధార్తో లింక్ చేసుకోవాల్సిందిగా కూడా రైల్వే మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
***
(Release ID: 2135852)